20, మార్చి 2011, ఆదివారం

పిచ్చి వాడి చేతికి రాయి దొరికింద‌న్న మాట‌.

టీవీ నైన్ లో మ‌ళ్లీ తిరుమ‌ల‌పై సంవాదం అంటూ స్టోరీ ప్ర‌సారం అయింది. కొంత విష‌యం కొత్త‌ది అయినా, మొత్తం మ్యాట‌ర్ పాత‌దే. తిరుమ‌ల కొండ మీద బోలెడంత అవినీతి జ‌రిగిపోతోంది. అప‌చారం జ‌రిగిపోతోంది. దేవుడి స‌న్నిధి లో జ‌రిగేదంతా త‌ప్పుల త‌డ‌కే. ఒక్క టీవీ నైన్ అనే కాదు, చాలా చానెళ్లు ఈ మ‌ధ్య కాలంలో ఈ రూట్ లో తెగ ప్ర‌చారం చేస్తున్నాయి. ఎందుకు ఇలా జ‌రుగుతోంది. నిజంగానే తిరుమ‌లలో ప‌రిస్థితి అంత దిగ‌జారిపోయిందా.. తిరుమ‌ల వైభ‌వాన్ని దిగ‌జార్చే ప‌నులు ఎందుకు జ‌రుగుతున్నాయి.
దీని వెనుక ఒక లాజిక్కు ఉంది. దీన్ని టీవీ భాష‌లో రేటింగ్ అంటారు. న్యూస్ పేప‌ర్లు, మ్యాగ‌జైన్ల‌ను ఎంత మంది చదువుతున్నారు అనేది తెలుసుకోవాలంటే స‌ర్క్యులేషన్ చూస్తాం. ఎన్ని కాపీలు ప్ర‌చురిస్తున్నారు, ఎన్ని కాపీలు అమ్ముడుపోతున్నాయో చూస్తాం. దాన్ని బ‌ట్టి ఏ ప‌త్రిక కు పాపులారిటీ ఉంది, ఏది టాప్ పేప‌ర్ అన్న‌ది చూస్తారు. దీని ఆధారంగా ఎడ్వ‌ర్ట‌యిజ్ మెంట్ లు ఇస్తారు. టీవీ ఛానెళ్లు వ‌చ్చే స‌రికి రేటింగ్ ఆధారంగా అడ్వ‌ర్ట‌యిజ్ మెంట్లు ఇస్తారు. ఈ రేటింగ్ అన్న‌ది - ప్ర‌తీ అర‌గంట నిడివి లోనూ ఏ ఛానెల్ ఎంత మంది చూస్తున్నారు అనేది లెక్క గ‌డ‌తారు. ఈ దిక్కుమాలిన లెక్క ప్ర‌కారం తిరుమ‌ల మీద వార్త‌లు ప్ర‌సారం చేసిన ప్ర‌తీసారి రేటింగ్ లు వ‌స్తున్నాయ‌న్న సంగ‌తి ఛానెళ్ల‌కు అర్థం అయింది. అంటే పిచ్చి వాడి చేతికి రాయి దొరికింద‌న్న మాట‌.
తిరుమ‌ల వేంక‌టేశ్వ‌ర స్వామిని కానీ, గుడిని కానీ తెర మీద చూపితే చాలు జ‌నం బాగా చూస్తారు. మంచిగా స్వామి వైభ‌వాన్ని , స్వామి మ‌హిమ‌ల్ని చూపించ‌వచ్చు. కానీ, మ‌న మెదడంతా భ్ర‌ష్టు ప‌డితే త‌ప్ప టీవీ ఛానెళ్ల లో హెడ్‌ల స్థాయికి ఎద‌గ‌రు. అందుచేత పుచ్చిపోయిన మెద‌డుతో ఆలోచించే ఈ హెడ్‌లు తిరుమ‌లను కూడా అదే దృష్టి తో చూస్తారు. అందుకే తిరుమ‌ల మీద ప‌దే ప‌దే నెగ‌టివ్ స్టోరీలు చేసి ప్ర‌సారం చేస్తుంటారు. ఎటూ రేటింగ్ వ‌స్తుంది కాబ‌ట్టి మేనేజిమెంట్ లు కూడా అదే ప‌ని గా ప్రోత్స‌హిస్తుంటాయి. ఏ చిన్న పొర‌పాటు దొర్లినా, తప్పిదం చోటు చేసుకొన్నా.. ఆకాశం విరిగి నేల మీద ప‌డిపోతుంది అన్న రేంజ్‌లో ప్ర‌చారం చేస్తుంటారు.
అంత‌మాత్రాన తిరుమ‌ల అంతా స‌వ్యంగా ఉంది, బ్ర‌హ్మాండంగా ఉంది అని చెప్ప‌లేం. కానీ, అంత‌క‌న్నా అవినీతి లో, ఘోరమైన వ్య‌వ‌స్థ‌లో కూరుకొని పోయిన వ్య‌వ‌స్థ లు చాలా ఉన్నాయి. ముమైత్ ఖాన్ అయిట‌మ్ సాంగ్ పెడితే జ‌నం చూస్తార‌ని తెలిస్తే చాలు.. ప్రొడ్యూస‌ర్లంతా గుడ్డ‌లిప్పే డాన్స్ లు ఎందుకు పెట్టిస్తారో ఇది కూడా అంతే. తిరుమ‌ల మీద ఎంత నెగ‌టివ్ చేస్తే, అంత రేటింగ్ అన్న మాట‌. దీనికి తోడు, వీటి మీద చ‌ర్చ‌ల్లో పాల్గొనేందుకు కొంద‌రు ఆస్థాన పండితులు కూడా హైద‌రాబాద్ లో సిద్దంగా ఉంటారు. వీరికి తోడు జ‌న విజ్ఞాన వేదిక వంటి హేతువాద సంస్థ‌లు ఉండ‌నే ఉన్నాయి. భార‌తీయ సంస్కృతి మీద దాడి చేయటం మాత్ర‌మే ఏకైక ల‌క్ష్యంగా ప‌ని చేసే ఈ సంస్థ ల ప్ర‌తినిధుల‌కు భ‌లే ప్ర‌చారం కూడా దొరుకుతుంది.మ‌మ్మ‌ల్ని క్ష‌మించు వెంక‌న్నా.

కామెంట్‌లు లేవు: