21, మార్చి 2011, సోమవారం

కనుమరుగవుతున్న పల్లె జీవనం...

మారిపోయిన పల్లె జీవనం... కనుమరుగవుతున్న ఆ ఆత్మీయ జీవితం..ఎదుగుతున్న దేశంలో.... విదేశీ సంపద ఇబ్బడి ముబ్బడిగా వచ్చి వాలుతుంటే అందినంత అందుకోవాలనే ఆత్రంతో నగరానికిపరుగులు పెడుతున్న మన పల్లె వాసులు..నేను కేరింతలు కొట్టిన ఆ చెరువు గట్ట్లు..ఇప్పుడు అంబరాన్ని తాకే కాంక్రీటు ప్లాట్లు.నేను ఎక్కిన ఆ తియ్యటి జామ చెట్టు..నేను కోసిన ఆ అల్ల నేరేడు కొమ్మఇప్పుడు ఆ కాంక్రీటు గోడల మధ్య నీర్జీవంగా వేలాడే ఉయ్యాల దిమ్మ.సాయం సంధ్యల్లో ఆరుబయట కూర్చున్నప్పుడురివ్వున ఎగురుతూ తీతువు పిట్ట చేసే సరాగాలుఇప్పుడు పాశ్చ్యాత్య సంస్కృతి తో వెలిసినబార్లో మనుషులు చేసే వికారాలు.యాంత్రిక జీవనంలో తాత్కాలికంగా..తార్కికంగా...తాంత్రికంగామాట్లాడే మనుషుల మధ్యకు వెళుతున్న ఓ పల్లె జీవులారామీరే మన సంస్కృతీ సౌరభాలకు ప్రతీకలు.మీరే నిష్కల్మషమైన మనసుకు దర్పణాలు.

రాష్ట్రం కొత్తగా సాధించింది ఏమీటి?

నాయకుల సంఖ్యకీ, కుర్చీల సంఖ్యకీ మధ్య సమన్వయం కుదర్చడం కోసం, ఏనాడో మరుగున పడిన మండలిని వెలికి తీసి పదవుల పందేరం మొదలు పెట్టారు. ఈ మండలి పుణ్యమా అని రాష్ట్రం కొత్తగా సాధించింది ఏమీ కనిపించక పోయినా, ఐదేళ్లకోసారి జరగాల్సిన ఎన్నికలని అడపాదడపా జరిపేసుకోడానికి బోల్డంత సాయం చేస్తోంది. దీంతో ఎన్నికలనేవి మరింత బహుళార్ధ సాధకంగా మారిపోయాయి. ఓ ఎన్నికల నోటిఫికేషన్ రావడం ఆలస్యం. సంబంధిత ప్రాంతంలో ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులూ మొదలు పెట్టక్కర్లేదు. ఈ మొదలు పెట్టకపోవడం అన్నది ఏ పద్దు కింద జరుగుతున్నప్పటికీ, ప్రజలు సహృదయంతో 'మోడల్ కోడ్' ఖాతాలో వేసేసుకుంటారు. అధికారులు, ఉద్యోగులకి కొంచం ఆటవిడుపు.ఆశావహులతో పార్టీ ఆఫీసులన్నీ కళకళలాడిపోతాయా? ఏ పుట్టలో ఏ పాముందో అనే భావంతో టిక్కెట్ ఆశించే వాళ్ళు పార్టీ ఆఫీసులో అందరితోనూ సత్సంభాదాలు నెరపుతారా? తమ నాయకుడికి టిక్కెట్ వచ్చేవరకూ, ఒకవేళ వస్తే ఎన్నికలయ్యే వరకూ అనుచరగణానికి అక్షరాలా పండుగేనా? స్వతహాగా కొంత, టీవీ చానళ్ళ పుణ్యమా అని మరికొంత వోటర్లు తెలివి మీరారు కాబట్టి, వాళ్లకి రావాల్సింది వాళ్ళు పోటీలో ఉన్న అందరినుంచీ నిక్కచ్చిగా రాబట్టుకుంటారా? ఇవన్నీ పైకి కనిపించే ప్రయోజనాలు. ఇంకా పెరిగే మద్యం అమ్మకాలు, ఒక్కసారిగా డబ్బు చెలామణి లోకి రావడంతో పెరిగే మార్కెట్ లావాదేవీలు... ఇలా ఒకటేమిటి? వెతికే కొద్దీ ప్రయోజనాలు కనిపిస్తూనే ఉంటాయి.

అసలు నన్నడిగితే, నల్లడబ్బు వెలికి తియ్యడం కోసం రకరకాల స్కీములు ఆలోచించడం, సభల్లో చర్చలు జరిపి సమయం వృధా చేయడం పూర్తిగా అనవసరం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలని ఐదేళ్లకోసారి కాక, ఏడాదికోసారిగా మారిస్తే దాచిన డబ్బంతా చెలామణి లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే, నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా, ఏ వ్యాపారాలు చేసే వాళ్లైనా చివరికి చేరేది రాజకీయాల్లోకే కదా. ఒకసారి వచ్చేసాక, ఐదేళ్ళ వరకూ డబ్బు సంపాదించడమే తప్ప, ఖర్చు చేద్దామన్నా చేసే అవుట్లెట్ ఉండడం లేదిక్కడ. దీంతో, డబ్బు మురిగిపోయి విదేశీ బ్యాంకులవైపు పరిగెత్తుతున్నారు మన నాయకులు. అదే, ఏడాదికోసారి ఎన్నికలైతే, ఎప్పటికప్పుడు లెక్క, జమ తేలిపోతూ ఉంటుంది. అందరికీ సమన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఓ ప్రభుత్వం పాతబడే లోగానే మరో కొత్త ప్రభుత్వం వచ్చేస్తుంది కాబట్టి, ఎవరికీ 'అసలు ప్రభుత్వం ఉందా?' లాంటి సందేహాలు కలగవు. ఆలోచించాల్సిన విషయమే కదూ?