9, నవంబర్ 2011, బుధవారం

మానవ జన్మ దుర్లభమని అర్ధము

ఈ సృష్టి ఒక్క సమయము అను మహా కాల ప్రవాహమునకు పోల్చి చూచినచో మానవ జీవితము ఒక్క నిమిషము మాత్రమే అగును. అనగా 100 సంవత్సరములు బ్రతికిన వాడు ఒక్క నిమిషము బ్రతికిన కీటకముతో సమానము. 50 సంవత్సరముల వయస్సులో పోయినవాడు అర నిమిషము బ్రతికినవాడు. 25 సంవత్సరముల వయస్సులో పోయినవాడు పావు నిమిషము బ్రతికినవాడు. మనము చూచు చుండగనే మన కంటి ఎదుట ఒక కీటకము ఒక నిమిష కాలము బ్రతికినది. మరియొక కీటకము పావు నిమిషమే బ్రతికినది. మొదటి కీటకము ఎట్టి వేదనయు లేక మరణించినది. రెండవ కీటకము పావు నిమిషము బ్రతికి చివరిలో ఒక క్షణకాలము హింసను అనుభవించి మరణించినది. మొదటి కీటకము నిమిషము బ్రతికినను ఎట్టి హింసయు లేక మరణించినను మరణానంతరము కోట్ల సంవత్సరములు హింసకు గురియైనది. రెండవ కీటకము పావు నిమిషమే బ్రతికినను ఒక క్షణకాలము హింసననుభవించినను, మరణానంతరము కోట్ల సంవత్సరములు ఆనందముతో తేలియాడినది. ఈ రెండు కీటకములలో ఏ కీటకమును గురించి నీవు దుఃఖించవలెను? మొదటి కీటకము గురించియే "అయ్యో! పాపము" అనవలెను. రెండవ కీటకమును గురించి కాదు. కావున 32 సంవత్సరములు మాత్రమే బ్రతికి చిట్ట చివరిలో 4 రోజులు భగందర వ్యాధితో బాధపడి మరణించి, తరువాత సృష్టి ఉన్నంతకాలము శివ సాయుజ్యమును పొందిన ఆది శంకరుల యొక్క అల్పాయుర్ధాయమును గురించికాని, ఆయన అనుభవించిన రోగబాధను కాని చింతించి సానుభూతి చూపనవసరము లేదు. మరియొకడు కాకి వలె నూరేండ్లు జీవించి పెద్ద వైద్యాలయములో మరణించి తరువాత సృష్టి ఉన్నంతకాలము నరకమున పడినాడు. ఈ రెండవ వాని గురించియే ఏడ్చి సానుభూతి చూపవలెను. భగవంతుని దృష్టిలో మొదటివాడు 100 క్షణములు, జీవించినాడు. రెండవ వాడు 32 క్షణములే జీవించినాడు. ఈ క్షణకాలములో ఒకనికి ఓరిగినది లేదు మరియొకడు నష్టపడినది లేదు. ఈ క్షణకాలము తరువాత జీవుడు పొందు నిత్య శాశ్వత ఫలమును గురించిన ప్రయత్నము చేసుకొనుట ఎంతో వివేకమైయున్నది. ఈ క్షణకాల సుఖములలోపడి ఈ క్షణకాలము మాత్రమే ఉండు పతి, పుత్ర, ధన, దారా బంధముల వ్యామోహములలోపడి నిత్య ఫలమును నాశము చేసుకున్నవాడు ఎంతో అవివేకి. ఈ అవివేకమునకు కారణము కాలము యొక్క జ్ఞానము లేకపోవుటయే కావున కాలజ్ఞానము గల యోగి శాశ్వత ఆనందమును సంపాదించు కొనుటకై ఈ క్షణకాలమును సాధనతో సద్వినియోగము చేసుకొనును. కావున ఈ జీవుడు మరణమును గురించి కాని, మరణవేదనను గురించికాని, ఈ క్షణ జీవితకాలములో జరుగు కష్టనష్టముల గురించి కాని ఆలోచింప పనిలేదు. ఒకరి జీవితము బాగున్నది. నా జీవితము బాగా లేదని చింతింప పనిలేదు. అట్లే ఒకడు అల్పాయుర్దాయుడు, మరియొకడు పూర్ణాయుర్దాయుడని పలుక పనిలేదు. ఇవి యన్నియును ఒక్క క్షణకాలము లోని బేధములే. మరణానంతరము పొందు ఫలము అనంత కాలము ఉండునది. అట్టి నిత్య ఫలమును గురించి భగవంతుని ప్రార్ధించవలయునే కాని, అసత్యములు క్షణికములైన వాటిని గురించి, వారిని గురించి పరమాత్మను అర్ధింపనేల? అంతే కాదు ఈ ఒక్క క్షణకాలము ముగియగనే నీ శరీరము కూడ నశించి పంచభూతములలో కలసిపోవుచున్నది. అట్టి క్షణికమైన నీ శరీరము యొక్క రోగబాధలను గురించి భగవంతుని యాచింపనేల? నీవు అడగ తలచుకున్నచో మరణానంతరము సిద్ధించు ఆ నిత్య ఫలమును గురించియే అర్ధించవలెను. కావున కాలజ్ఞానము తెలిసిన వారు ఎంతో వివేకముతో ఈ క్షణకాల జీవితములో చేసిన సాధన ద్వారా శాశ్వతమైన బ్రహ్మ సాయుజ్యమను అమృతఫలమును పొందుచున్నారు. ఇదియే నిజమైన కాలజ్ఞానము. అంతే కాని భవిష్యత్కాలములో జరగబోవు లౌకిక విషయముల గురించి తెలుసుకొనుట కానేకాదు.

ఇప్పుడున్న లౌకిక విషయములే నిన్ను సర్వనాశనము చేయుటకు చాలును. నిన్ను ఒక్క క్షణకాలములో భస్మము చేయుగల హాలాహల విషము నీ చేతిలో ఉండగా, అది చాలక ఇరుగుపొరుగు వారి ముచ్చట్లు, టి.వి, సినిమాలు, నవలలు, కధలు ఇంకనూ భవిష్యత్పురాణము, కాలజ్ఞానము అను కుండలు కుండలు విషము కొరకు పరుగిడు చున్నావు. నీ యొక్క అవివేకమును చూచి పరమాత్మ కన్నీరు కార్చుచున్నాడు. అట్టి నీవు అల్పాయుష్కులైన శంకరుల గురించి ఆయన పడిన నాలుగు రోజుల బాధను గురించి "అయ్యో పాపము " అనుచున్నావు. కాని నిత్య నరకములో పడిన నీ వెనుకటి తరముల వారి గురించియు, మరియు నీ గురించియు, మరియు నీ యొక్క రాబోవు తరముల గురించియు "అయ్యో! పాపము" అని పరమాత్మ కోటిసార్లు పలుకుచున్నాడు. క్రీస్తు మహాత్ముడు 34 సంవత్సరములు బ్రతికినాడు. నాలుగు గంటలు హింసను అనుభవించినాడు. ఆయన శిలువను మోసుకొని పోవుచుండగా చూచు చున్నవారు ఆయనకు వచ్చిన కష్టమును చూచి సానుభూతితో ఏడ్చినారు. లక్ష కొరడా దెబ్బలు తినబోవు వాడు నాలుగు కొరడా దెబ్బలు తినువాని చూచి ఏడ్చినట్లున్నది. వెంటనే ఆ మహాత్ముడు ఆగి వారి వైపు చూచి "మీరు నా కోసము ఏడవ వద్దు. మీ కొరకును మీ పిల్లల కొరకును ఏడవండి" అని చెప్పి ముందుకు సాగినాడు. కావున ఈ క్షణ జీవిత కాలములో క్షణికములగు ఐహికముల కొరకు గాని, ఆయురారోగ్యముల కొరకు గాని, మృత్యువును గురించి కాని చింతించు మూర్ఖుడు మరియొకడు ఉండడు. క్షణకాలములోని బాధలను అవివేకముతో చింతించుచున్నాడే తప్ప, తర్వాత వచ్చు శాశ్వత బాధల గురించి తెలుసుకొనుట లేదు. క్రైస్తవ మతము ప్రకారముగా జీవునకు మరల మానవ జన్మ ముగియగనే తుది తీర్పు ఉండును. ముక్తులు శాశ్వతముగ పరమాత్మ వద్దకు చేరుదురు. బద్ధులు శాశ్వతముగ నరకమున పడుదురు. హిందుమత సిద్ధాంతము కూడా ఇదే చెప్పుచున్నది. "జంతూనాం నర జన్మ దుర్లభమిదమ్" అని హిందూమత సంప్రదాయము చెప్పుచున్నది. అనగా మానవ జన్మ దుర్లభమని అర్ధము. ఎడారిలో మంచినీరు దుర్లభమనగా అర్ధమేమి? ఎడారిలో మంచి నీరు లభించదు అనియే గదా. కావున ఇదం నరజన్మ= ఈ మనుష్య జన్మ, జంతూనాం = జంతువులకు, దుర్లభం = మరల లభించదు. కావున ఏ మతము చెప్పినను, సత్యము సత్యమే. అమెరికాలో దొరికినను, ఇండియాలో దొరికినను వజ్రము వజ్రమే. గులక రాయి గులకరాయే. ఐతే ఇచ్చట మరియొక సత్యమున్నది. ఈ సత్యము ముందు చెప్పిన సత్యమునకు విరుద్ధము కాదు. అది ఏమనగా పరమాత్మ వద్దకు చేరిన ముక్త జీవులు మానవులను ఉద్ధరించుటకు, పరమాత్మతో పాటు మానవ జన్మలను పొందుదురు. అంతే కాని నిత్య నరకమున పడిన బద్ధ జీవులకు మరల మనుష్య జన్మలేదు

ఆ యాదవులు సామాన్య జీవులు

శ్రీ కృష్ణ భగవానుని ఒక్క స్వరూపమే భగవద్గీత. కృష్ణుడు అనగా ఆకర్షించు వాడు అని అర్ధము. ఆయన యొక్క అంత: స్వరూపమే నారాయణుడు. నారాయణుడు అనగా జ్ఞానమునకు ఆధారమైన వాడు అని అర్ధము. కావున ఆయన యొక్క నిజమైన ఆకర్షణ ఆయన ఎత్తిన భగవద్గీత మూలమునే యున్నది. ఆయన గోకులములో పుట్టి పామరులకు సైతము వ్రజ భాషలో ఎంతో విలువ గల జ్ఞానవాక్యములను చెప్పుచుండెడివాడు. ఆయన చెప్పిన వాక్యములే గీతలో శ్లోకములుగా వచ్చినవి. కృష్ణుడు ఎల్లప్పుడును తక్కువ వాక్యములనే పలుకు చుండెడివాడు. అయితే గోకులమున పుట్టిన గోపికలు పూర్వజన్మమున బ్రహ్మర్షులు కావున ఆయన చెప్పు తత్త్వ వాక్యములకు ఎంతో ఆకర్షించబడి స్వామి వద్దకు వచ్చెడివారు. గోపికలకు ఉన్న శ్రద్ధ మిగిలిన యాదవులకు అంతగా ఉండెడిదికాదు. ఏలననగా ఆ యాదవులు సామాన్య జీవులు. కృష్ణుడు ఎప్పుడును హృదయాంతరముల స్పందిపజేయు మధురాతి మధుర గీతములను పాడుచు వాటిని మురళితో వాయించెడివాడు. ఆ గీతము లన్నియును పరమాత్మనే లక్ష్యముగా చేసుకొని సత్యమైన భక్తిని బోధించెడి అమృతధారలుగా ఉండెడివి. ఆ గీతములన్నియును భగవత్ ప్రేమతో నిండియుండుట వలన వాటిని విని స్వామితో వంత పాడుచు గోపికలు మైమరచెడివారు. ఆ భక్తి గీతములతో గోపికల బ్రహ్మానంద సముద్రమున మునిగిపోయెడివారు. ఇదియే బృందావనములోని రాసకేళి. రాసకేళి అనగా ఒక దివ్యమైన మధురాతి మధురమైన భజన. కాని నేడు రాసకేళి గురించి అవి ఏవో సినిమా జ్యూయట్ సాంగ్లని అపార్ధము చేసుకొనుచున్నారు. అక్కడ ఉన్న కృష్ణుడు సాక్షాత్ పరమాత్మ. ఆ గోపికలు యుగ యుగములు తపస్సు గావించిన బ్రహ్మర్షులు. అదియే వారి చివరి జన్మ. కృష్ణుడు ఆనాడు తాను వచించిన జ్ఞాన వాక్యములనే పాటల రూపములలో రాసకేళిలో పాడెడివాడు. అదియే జ్ఞానము మరియు ప్రేమ అను భగవంతుని రెండు కల్యాణ గుణముల కలయిక. ఆ గోపికలు మహా పండితులైన ఋషులు. వారు జ్ఞానమును కఠినములైన వాక్య శాస్త్రముల ద్వారా అప్పటి వరకు చర్చించి వచ్చినవారు. వారు అప్పటి వరకు జ్ఞానమును వాక్యములలో మరియు శ్లోకములలో చర్చించెడివారు. ఆ వాక్యములే యజుర్వేదములు. శ్లోకములే ఋగ్వేదము. అదే జ్ఞానము మధురమైన గీతముల ద్వార ఉన్నపుడు సామవేదమగును. అందుకే కృష్ణుడు "వేదానాం సామవేదోస్మి" అన్నాడు. ఆయనకు జ్ఞానము మధురమైన ప్రేమయు చాల ఇష్టముగ నుండును. కురుక్షేత్రములో ఆయన అర్జునునకు వినిపించినవి కూడా పాటలే. కావుననే దానిని భగవద్గీత అన్నారు. భగవద్గీత అనగా భగవంతునిచే పాడబడిన గీతలు లేక పాటలు అని అర్ధము. ఈ పాటలను ప్రతి దినము బృందావనము నందు గోపికలకు వినిపించినాడు. ఈ పాటలనే యమునా తటమున తమాల (గానుగ) వృక్షశాఖపై ఆశీనుడై ఏకాంతముగా మురళితో పాడెడివాడు. కావున ఆయన యొక్క వేణుగీత గాని రాసకేళిలో పాడిన పాటలు గాని భగవద్గీతా శ్లోకములే. భగవద్గీత రజోగుణముతో కూడిన అహంకారముతో నున్న క్షత్రియుడైన అర్జునుడికి చెప్పబడినవి. అర్జనుడు కూడ పూర్వజన్మమున నరుడు అను ఋషియే. కాని క్షత్రియ కులమున పురుషునిగా పుట్టినాడు. పార్ధునికి కుల అహంకారము, లింగాహంకారము ఉన్నది. అంతే కాదు తాను మహా వీరుడన్న అహంకారము కూడ ఉన్నది. కావున పార్ధునికి చెప్పిన భగవద్గీతలో కొంచము కాఠిన్యము ఎక్కువగా కనిపించుచు మిరపకాయ బజ్జీ వలె ఉన్నది. కాని గోపికలు స్త్రీ జన్మనెత్తి గొల్లలను శూద్ర కులమున పుట్టి లింగాహంకారము కులాహంకారము లేక సంపూర్ణ శరణాగతి చేసినారు వారు. కావున గోపికలకు చెప్పిన జ్ఞానగీతలు పంచదార రసగుల్లాల వలెనున్నవి. ఆ గీతల యొక్క నామధేయమే రాసకేళి. రాసము అనగా మధుర ప్రేమ రసముతో నిండిన సముద్రము. కేళి అనగా దాని యందు ఈదులాడుచూ స్నానము చేయుట. ఆ సమయము స్వామి ఆపాదమస్తకము మధుర ప్రేమ స్వరూపమున ఉండెడివాడు.

ఆ స్వరూపము గురించియే "మధురాతి పతియే అఖిలం మధురం". సాత్వికులైన బ్రహ్మర్షుల యొక్క జ్ఞానముతో కూడిన గోపికల మధుర ప్రేమ వాతావరణమే బృందావనము. జీవుని యొక్క గుణముల బట్టియే వాతావరణము మరియు స్వామి స్వరూపము కూడ ఉండును. పార్ధుని యొక్క గుణముల బట్టియే కురుక్షేత్ర వాతావరణమున గీతను చెప్పవలసి వచ్చినది. రజోగుణము అహంకారమయమైన యుద్ధ వాతావరణమున స్వామి కూడ పాంచ జన్య శంఖమును పూరించుచు రణోత్సాహముతో వరావృశముతో పరుష స్వభావముగానున్నారు. గుణమును బట్టియే మనస్సు మరియు వాతావరణము మరియు దానికి అనుగుణముగా వాక్కు ఉండును. మరి ఆనాటి రాసకేళి గ్రంధమును వ్యాసుడు ఏల గ్రంధస్ధముగావించలేదు. అది ద్వాపరయుగాంతము. అతి స్వల్పకాలములోనే కలియుగము రాబోవుచున్నది. ఆ రాసకేళి గీతముల శ్రవణము చేయు అర్హత గల జీవులు లేరు. అందరును రజోగుణముతో అర్జునుని తాత ముత్తాతల వంటి జీవులు ఉన్నారు. కావున ఈ జీవులకు యోగ్యమైనది పార్ధునికి చెప్పిన ఈ భగవద్గీతయే. ముందు భగవద్గీత యను ఉట్టికి ఎక్కినచో తరువాత మాట రాసకేళి యను స్వర్గమునకు ఎక్కుట. మరియు అయోగ్యులగు ఈ జీవులు ఆ రాసకేళి గీతలను అపార్ధము చేసుకొనెదరు. విమర్శంతురు. అర్జునుడే విమర్శంచినాడు కృష్ణపరమాత్మను. గయోపాఖ్యాన సందర్భమున "సతులయే మార్చి గొల్లభామల మరుగుట కాదు" అన్నాడు. ఆ రాసకేళి గీతములను అర్జునుడు వినలేదు. పరమ భక్తుడగు నారాయణుని వెంట నీడ వలెనున్న నరుడు అనబడు ఋషియగు అర్జునుడే తన ఉపాధి అగు క్షత్రియ వీర పురుషజన్మ ప్రభావము చేత ఇట్లు పలికినపుడు ఇక మిగిలిన శిశుపాల దుర్యోధన జరాసంధాది రాజుల సంగతి చెప్పనేల? ఆనాడు రాసకేళి గీతములలో చెప్పిన అనేకానేక అద్భుత జ్ఞాన రహస్యములను కరుణామయుడగు స్వామి ఈనాడు జ్ఞాన సరస్వతి ద్వారా జీవులకు అందించుచున్నాడు. ఇవి అన్నియును వేదములలో కలవు. కావున ఆ వేదములు ఖిలమై పోయినవి. "అనంతావై వేదా హః" అనగా వేదములకు అంతము లేదు. భరద్వాజుడను ముని 300 సంవత్సరములు వేదములను చదివినాడు. ఆయనకు స్వామి సాక్షాత్కరించి మూడు మహా పర్వతములను చూపినాడు. ఒక్కొక్క పర్వతము నుండి ఒక్కొక్క పిడికిలి మట్టి తీయమన్నాడు. స్వామి ఇట్లు చెప్పినాడు. ఓ భరద్వాజ! నీవు చదివిన వేదము ఈ మూడు పిడికిళ్ళ మట్టి మాత్రమే ఇంకనూ చదవవలసిన వేదము ఆ మహా పర్వతములు అన్నాడు. ఈ కధ వేదము నందే కలదు. "భరద్వాజో హవైః" అను మంత్ర పాఠమున కలదు. భరద్వాజుడు 300 సంవత్సరములలో చదివిన వేదములలో ఒక సంవత్సరము మాత్రమే చదివిన వేదము మనకు ఈనాడు మిగిలియున్నది. మిగిలిన 299 సంవత్సరముల వేదము ధారణ చేయలేక మరచిపోయినారు. దీనిని "ఖిల వేదము" అందురు. ఖిలము అనగా అంతరించినది అని అర్ధము. కావున స్వామి యొక్క జ్ఞానము అనంతమైనది. గోపికల రూపములో ఋషులు ఎందుకు అంతగా ఆకర్షించబడినారు. స్వామి గీతలలో చెప్పెడి జ్ఞానము వారు అధ్యయనము చేసెడి వేదములలోఉండెడిది కాదు. అది అంతవరకు శ్రవణము చేయని విజ్ఞానము. కావున వారికి ఎంతో శ్రద్ధ ఉండెడిది. ఆ శ్రద్ధయే కృష్ణునిపై ఏర్పడిన ఆకర్షణ. ఆ శ్రద్ధ ముందు అన్నపానీయములు కాని, నిద్ర కాని, అత్తమామలు కాని, పతిపుత్రులు కాని, గృహ, పశు, క్షేత్ర బంధములు కాని నిలువలేక పోయినవి. కావున రాసకేళి అనగా మహా పవిత్రమైన వేదాధ్యయనము. అది ఈశ్వర జీవుల గురు శిష్యులు కావుననే భాగవతము ఏడు దినములలో మోక్షమునీయ గల మహా పవిత్ర గ్రంధమైనది.

కృష్ణుడు ధర్మమును సైతము అతిక్రమించి రుక్మిణిని వివాహమాడెను

లోకములో కష్టములకు కుంగరాదు. సుఖములకు పొంగరాదు. సుఖములు పైకి లేచిన తరంగాలు కష్టములు క్రిందకు వచ్చిన తరంగములు. తరంగముల యొక్క బరువును తీసుకున్నపుడు ప్రతి తరంగమునకు శృంగము, ద్రోణి రెండు వుండును. శృంగమే సుఖము. ద్రోణియే కష్టము. ఒకదాని వెనుక రెండవది ఉండును. కాలచక్రము తిరుగుచుండగా చక్రములోని క్రింది అరలు పైకి, పై అరలు క్రిందికి వచ్చుచుండును. కావున కష్టము గానీ, సుఖము గానీ నిత్యము ఉండదు. అవి ఎండ నీడల వంటివి. నిరంతరము ఎండలో ఉండలేము. ఎండలో కష్టపడి పనిచేసి నేడకు వచ్చిన వాడు ఎంతో సుఖమును పొందును. అలానే కష్టములను అనుభవించిన తరువాత సుఖమును అనుభవించినచో, ఆ సుఖము ఎంతో రుచిగా యుండును. ఈ కష్టసుఝములు మనస్సులోకి ప్రవేశించరాదు. నీటి అలలో పడవ ఊగుచున్ననూ, ఆ పడవలో ఊయలలో ఊగు వినోదము పొందుచూ ప్రయాణించ వచ్చును. కానీ పడవకు చిల్లిపడి ఆనీరు పడవ లోనికి వచ్చినచో పడవ మునిగిపోవును. అట్లే కష్ట సుఖములు మనస్సులోనికి ప్రవేశించరాదు. కష్టములు వచ్చినపుడు కఠినముగను, సుఖములు వచ్చినపుడు సున్నితముగను ఉండవలెను. "వజ్రాదపి కఠోరణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణాం చేతాంసి కోహిని జ్ఞాతు మర్హతి" అని భవభూతి వర్ణించినాడు. "నప్రహృ ష్వేత్ ప్రియం ప్రాస్యా నోద్విజేత్ పాప్య్రాచా అప్రియం" కష్ట సుఖములకు కుంగక, పొంగక ఉన్నవాడే స్ధిత ప్రజ్ఞుడు అని గీత చెప్పుచున్నది. పొంగుట, కుంగుట వలన మన నుండి శక్తి విపరీతముగా ఖర్చు అగుచున్నది. శక్తి ప్రవర్ధమైన వాడు ఇహము నందును ఏమియూ సాధించలేడు. మరియు శక్తిహీనుడు సాధన చేయలేక పరమును కూడ కోల్పోవును. అట్టివాడు ఇహపరములందు చెడి ఉభయ భ్రష్టుత్వము చెందును. సీతాపహరణము జరిగిన తరువాత రాముడు దారుణముగా విలపించు చున్నాడు. ఆదిశేషుని అవతారము కావున లక్ష్మణుడు రామునితో "అన్నయ్యా! ముందు ఏడ్చుట మానుకొనుము. ఏడ్చినందు వలన సీత కనపడదు. మరియు ఏడుపు వలనన శక్తి నశించి, సీతను వెదుకుటకు కావలసిన శక్తి లేకపోవుట వలన సీత ఎన్నటికినీ లభించదు. యోగము అను శబ్ధము "యుజ్" అను ధాతువు నుండి వచ్చినది. "యుజ్" ఏకీకరణ అని అర్ధము. అనగా అన్నింటిని కలుపుట అని యోగ శబ్ధమునకు అర్ధము. ఒక నీటి గొట్టము ఉన్నది. దానికి చిల్లులు పడి నీరు ధారలుగా బయిటకు కారుపోవుచున్నవి. అట్లే మన శక్తి అనేక లౌకిక చింతల ఉద్రేకములలో వ్యర్ధముగా బయిటకు చిందిపోవు నీటిధారలను అన్నింటినీ కలిపి గొట్టములో ఒకధారగా ప్రవహింపచేయుట ఉపయోగము. కావున లౌకికములకు చిన్నాభిన్నము చెంది పోవుచున్న ఈ శక్తిధారలను కలిపి ఒకేధారగా చేయుట యోగము.

యుద్ధములో భేరులు మ్రోగుచూ, శంఖములు మ్రోగుచుండ, అందరనను ఎంతో ఉద్రేకముతో నుండగా శ్రీ కృష్ణుడు శాంతసముద్రునిగా మందహాముతో రధమును నడుపుచున్నాడు. ఆయన జీవితములో ఎప్పుడునూ ఉద్రేకము చెందలేదు. కావుననే ఆయనలో శక్తి అంతయు ఆశీభూతమై లీనమై యున్నది. ఆయన విశ్వరూపమును ప్రదర్శించినపుడు బయిటకు వచ్చిన వేల సూర్యుల కాంతి ఆశక్తియే. అయితే ఈ సృష్టిలో ఈ ఉద్రేకము అను దానిని ఏల సృష్టించినాడు? ఆయన సృష్టిలో ప్రతి వస్తువు మంగళకరమే! కావున ఉద్రేకము కూడా ఒక మంచి పనికే సృష్టించబడి యున్నది. ఆ మంచి పనని ఏమనగా భగవంతుని విషయములో ఉద్రేకము చెందవలయును అని భావము. భగవంతుని కొరకు తపించి ఉద్రేకము పొందుటయే తపస్సు. ఇట్లు భగవంతుని విషయములో సద్వినియోగము చేసినచో ఈ సృష్టిలో చెడు అనేది లేదు. చెడు గుణములు కూడ భగవంతుని వైపునకు త్రిప్పినచో అగ్గిలో పడిన పిచ్చిముళ్ళ కట్టెలు కూడ, నుదుట ధరించు పవిత్రభస్మముగా మారునట్లు, ఆ గుణములు పవిత్రమే అగుచున్నవి. గోపికలు తమలో ఉన్న కామము అను గుణము పరమాత్మ వైపుకు త్రిప్పినారు. ఆ కామమే మోక్షమార్గమై వారిని గోలోకమునకు చేర్చినది. భగవంతుని పరముచేయక భగవంతుని వ్యతిరేకముగా జీవుల పరము చేసినపుడు సర్గుణములు కూడా బురదలో పడిన పంచదార వలె వ్యర్ధము అగుచున్నవి. ఎవరి ఉప్పు తిన్నామో వారికి కృతజ్ఞతగా వుండుట సద్గుణము. భీష్ముడు ఈ సద్గుణమును కౌరవుల పరము చేసినాడు. కౌరవుల ఉప్పు తిన్నందున వారివైపు యుద్ధము చేయుట ధర్మమని, ఆ సద్గుణమును జీవుల పరము చేసి పరమాత్మపై బాణములను విసరినాడు. దాని ఫలమే అంపశయ్య పైబడి జీవన మరణమగు మరణ వేదన పడినాడు. ఈ లోకముననే ప్రత్యక్ష నరకమును అనుభవించినాడు. కావున భగవంతుని వియోగము దుఃఖములో ఉద్రేకము చెందినపుడు అచ్చట శక్తి ఖర్చు అగుట సార్ధకమే కాని వ్యర్ధము కాదు. రుక్మిణి కృష్ణుని కొరకు ఎంతో తపనపడి, పెండ్లి రోజు క్షణక్షణము ఉద్రేకమును చెందినది. అదియే మహా తపస్సుగా మారి, కృష్ణుడు ధర్మమును సైతము అతిక్రమించి రుక్మిణిని వివాహమాడెను. రుక్మిణిని శిశుపాలునికి ఇచ్చుటకు నిశ్చయ తాంబూలములు ఇచ్చుకొనుటయు జరిగినది. మను శ్రుతి యొక్క వాచాదత్త అను శ్లోకము ఆధారముగా నిశ్చయ తాంబూలము జరిగిన కన్యకు పెండ్లి అయినట్లే. బ్రాహ్మణుడు రుక్మిణి వ్రాసిన ప్రణయ పత్రము తెచ్చిన తరువాత, కృష్ణుడు కొంతసేపు తర్జన భర్జన పడినాడు. కానీ ఆమె క్షణ క్షణము పడిన ఉద్రేకము చూచి ధర్మమును సైతము అతిక్రమించి కుండిన నగరమునకు వెడలినాడు. కావున లోక చింతలలో ఉద్రేకము విడనాడవలెనే తప్ప, భగవంతుని విషయములో కాదు. పిల్లపెండ్లికి ధనము దాచమని చెప్పినామే తప్ప, పెండ్లినాడు కూడ ధనమును తీయని ఎడల ఆ ధనము దొంగల పాలో, రాజు పాలో అగును. కావున భగవంతుని విషయములో కూడ ఉద్రేకము పొందక శాంతిగా ఉన్నచో వాడు దాచిన శక్తి మృత్యువు పాలగును. మరణానంతరము శరీరము పంచభూతముల పాలగుచున్నది. వాని శరీరములో దాచబడిన శక్తి అంతయు అగ్నిపాలగును. కావున యోగము అనగా లోకమునకు సంబంధించిన ఉద్రేకములలో శక్తిని ఖర్చుకానీయక దాచి, భగవద్భక్తిలో ఖర్చు చేయుట అనగా శక్తి దుర్వినియోగము అరికట్టి సద్వినియోగము చేయుటయే యోగము.

ఎల్లో మీడియా ఏడుపు అనే జె గ్యాంగు

ఏ ఆరోపణలు వచ్చినా
ఎల్లో మీడియా ఏడుపు అనే జె గ్యాంగు
ఇప్పుడు తీస్తా అంటూ సిక్కిం లో తీస్తున్న పవరు గురించి
వ్రాసిన అస్సాం ట్రిబూన్ ఆన్ లైన్ ని కూడా
ఎల్లో మీడియా అంటుందేమో మరి.