31, మే 2011, మంగళవారం

వీళ్ళను తెలబాన్లు అంటే తప్పేంటి

ఉస్మానియా విద్యార్థుల ముసుగుల్లో ఉన్మాదులు
ఊరకుక్కల్లా ఊగిపోతూ
దాష్టీకాలు చేస్తే దానిని ఉద్యమం అనాలి.

తిరగబడి ఎదురు దాడి చేస్తే
ఉద్యమ కారులపైన దౌర్జన్యం అని ఖండించాలి.

అదే ఉన్మాదులు
ఇచ్చే పాలకుల దగ్గర పిల్లుల్లా ఉంటే
ఉలుకూ పలుకూ లేని ఉన్మాదుల నాయకుడిని
ఉద్యమ నాయకుడు అని ఒప్పుకోవాలి.

ప్రజాస్వామ్యంలో పక్క పార్టీలను అణచడానికి
ఆచరిస్తున్న పెడ ధోరణులకు
ఉద్యమం అని పేరెట్టుకొని
పెట్రేగి పోతున్న వీళ్ళను తెలబాన్లు అంటే తప్పేంటి.

రాజకీయాల కోసం మామ కోపాన్ని దిగమింగుకొన్నాడు.

అల్లుడా మజాకా
చూసి అలా తానూ అవ్వాలనో ఏమిటో
చిరంజీవికే అల్లుడై
అల్లుడా మజాకా చూపిస్తే
రాజకీయాల కోసం మామ కోపాన్ని
దిగమింగుకొన్నాడు.

ఎందుకోసమైతే తను సహించాడో
అదే రానప్పుడు
అసలు రూపం చూపాడు అల్లుడికి.

పాపం సుప్రీం కోర్టు కూడా సుప్రీం హీరో అల్లుడికి
బైలు నిరాకరించింది.

విశ్వసనీయతకు మారు పేరైన కుక్కలు.

రాజా గారు జనాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చి
తమకు ఇచ్చే లోపుల పోయాడని
రోశయ్య నుండి కిరణ్ వరకు ఇస్తారేమో నని
చూసి విసిగి అలిగి
అరిచే ఓపిక కూడా లేక
జనాలను కరుస్తూ తమ నిరసన తెలుపుతున్నాయి
విశ్వసనీయతకు మారు పేరైన కుక్కలు.

విశ్వసనీయతకు మారు పేరైన
ఆయనే ఉంటే ఆరోగ్య శ్రీ కార్డు వచ్చి
రేబిస్ రాకుండా టీకాలు వేయించుకొని ఉండేవేమో.

కనీసం ఉండవల్లి లాంటి వాళ్ళు కూడా
జరుగుతున్నా అన్యాయం పై
ఉలుకూ పలుకూ లేకపోయే సరికి
పౌరుషం వచ్చిందేమో.

దానితో పాటు పొద్దున్న
తాము అరవడం కన్నా ముందే
తమ బాషను రాజకీయ నాయకులు
యదేక్షగా టీ వీ లైవ్ షో లలో వాడేసుకొంటూ
తిట్టుకోడానికి తమతో కంపేర్ చేసుకొంటున్నారని
కంపరమెత్తి కక్ష గట్టాయా అన్నట్టుగా
అన్నిప్రాంతాల్లో ఏ పార్టీ కూడా చొచ్చుకు పోలేక
విఫలమౌతున్న సమయానా
ఇవి మాత్రం సందు సందు కూ సందడి చేస్తూ
అన్ని ప్రాంతాల్లోనూ తమ ప్రతాపం చూపిస్తున్నాయి.

ఏడుపు తుడిచే పని ప్రస్తుతానికి ఆపినా..

కొత్తగా కట్టిన అసెంబ్లీ
అమ్మకానికి పెడుతున్నారంటగా
మా మహా నేత తనయుడు యువనేత
దక్షిణాదిలో ప్రతి రాష్ట్రంలో
ఓ కోట ఉండేలా చూసుకొంటున్నాడు
మీదే కొనేస్తాడు
కానీ మీరు కొంచం సమయం ఇవ్వాలి
ఏడుపు తుడిచే పని ప్రస్తుతానికి ఆపినా
కన్నెర్ర చేసే కార్యక్రమం ఒకటి పెట్టుకొన్నారు
అదైన వెంటనే
దేవుడు దగ్గర ప్లీనరీ ఒకటి పెట్టుకొన్నారు
దానితో చిరంజీవి తరువాత
సునామీ సృష్టించేది తామే అని
నిరూపించుకొనే పనిలో
నిమిషం తీరిక లేకున్నారు.

రాజ్యం నేతకు ఆటలో అరటిపండు స్థానం ఇచ్చారు.

అధికారం ఇవ్వండి అని సునామీ సృష్టిస్తే
ఎగబడి వచ్చి చూసి ఎన్నో ఆశలు కల్పించిన జనాలు
రాజ్యం నేతకు ఆటలో అరటిపండు స్థానం ఇచ్చారు.

ఆ తరువాత పక్కలో బల్లెంలా తయారైన మీడియా
ప్రతిసారీ ప్రతి విషయం లో
రేటింగుల కోసం అరటి పండును చేసారు.

గౌరవ నిమజ్జనానికి
జనపద్ దగ్గర పడిగాపులు కాస్తూ
ఏదన్న విదిలిస్తారు అని ఎదురు చూస్తుంటే
ఎం ఎల్ సీ ఎంగిలి మెతుకులు కూడా విదల్చక
ఆటలో అరటిపండు స్థానానికి
భంగం వాటిల్లకుండా
వాటేసుకొంటామని వంచిస్తున్నారు.

28, మే 2011, శనివారం

విసిగించకండి: చంద్రబాబు పనితీరుపై హరికృష్ణ గరం గరం

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ శనివారం మహానాడులో సీతయ్య అవతారమెత్తారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై పార్టీ నాయకుల మద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మనోవేదనను పార్టీ నాయకుల వద్ద వెళ్లబోసుకున్నారు. మహానాడులో మాట్లాడాలని పార్టీ నాయకులు కె. ఎర్రంనాయుడు, యనమల రామకృష్ణుడు చేసిన విజ్ఞప్తిని ఆయన తోసిపుచ్చారు. తాను మాట్లాడలేనని, తనను విసిగించవద్దని ఆయన వారితో అన్నారు. తాను మాట్లాడకపోవడానికి కారణాలు తర్వాత చెప్తానని ఆయన అన్నారు.

చంద్రబాబు నాయుడు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఎవరి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. చంద్రబాబు ఏకపక్ష ధోరణి వల్ల పార్టీ నష్టపోతోందని ఆయన అన్నారు. తాను వారసత్వ పోరు గురించి మాట్లాడడం లేదని, పార్టీని రక్షించుకోవాలన్నదే తన ఉద్దేశమని ఆయన అన్నారు. కరీంనగర్ రణభేరీని ఎప్పుడో నిర్వహించాలని తాను సూచించినా పట్టించుకోలేదని ఆయన అన్నారు. పులివెందులలో వైయస్ విజయమ్మపై పోటీకి దిగకూడదని, జగన్‌పై పోరాటం చేయాలని చెప్పానని, తన మాటలను పట్టించుకోలేదని ఆయన అన్నారు.

మీడియా ప్రతినిధులతో మాట్లాడడానికి కూడా హరికృష్ణ నిరాకరించారు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వల్ల తాను మాట్లాడలేనని ఆయన అన్నారు. తాను మాట్లాడకపోవడానికి కారణాలు తర్వాత చెప్తానని ఆయన అన్నారు. మహానాడులో ఆయన ముభావంగానే ఉన్నారు. మొదటి రోజు కూడా మహానాడు నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. మహానాడు వేదికపై హరికృష్ణ ఫొటో కనిపించలేదు

చంద్రబాబుపై జూ ఎన్టీఆర్ వైరం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై పోరు సాగించడానికే సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. తన తండ్రి నందమూరి హరికృష్ణతో కలిసి ఆయన చంద్రబాబుపై యుద్ధం చేయడానికే సిద్ధపడ్డారని అనిపిస్తోంది. ఆయన మహానాడుకు దూరంగా ఉండడం, నందమూరి హరికృష్ణ మహానాడులో ప్రసంగించకుండా నిరసన వ్యక్తం చేయడం అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. మహానాడుకు రావాలని చంద్రబాబు చేసిన విజ్ఞప్తిని కూడా జూనియర్ ఎన్టీఆర్ తిరస్కరించారు. సినిమా షూటింగుల్లో బిజీగా ఉండడం వల్లనే మహానాడుకు వెళ్లడం లేదని జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన మాటలు నమ్మేట్లుగా లేవు. హైదరాబాదులోని ఉన్న ఆయన మహానాడుకు వెళ్లాలంటే పెద్ద సమయం వెచ్చించాల్సిన అవసరం లేదు. మర్యాదపూర్వకంగానైనా అలా ఇలా రావచ్చు. ఓ పది నిమిషాల పాటు మాట్లాడి పోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్‌కు ఆ మాత్రం సమయం కూడా లేదంటే విశ్వసించే పరిస్థితి లేదు.

ఇకపోతే, హరికృష్ణ మహానాడులో వ్యవహరించిన తీరు కూడా చంద్రబాబుతో విభేదాలు కొనసాగుతున్నాయని చెప్పడానికి తగిన బలాన్ని చేకూరుస్తున్నది. మహానాడులో ప్రసంగించాలని కోరిన పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడిని ఆయన కసురుకున్నారు. తాను మాట్లాడబోనని తెగేసి చెప్పారు. పైగా, తర్వాత అన్ని విషయాలు మాట్లాడుతానని కూడా చెప్పారు. ఎన్టీఆర్ జయంతి రోజున పార్టీలో విభేదాలను బయటపెట్టడం ఇష్టం లేకనే ఆయన మాట్లాడలేదని అంటున్నారు. శుక్రవారం మధ్యలోనే మహానాడు నుంచి ఆయన వెళ్లిపోయారు. శనివారం స్పష్టంగా నాయకుల వద్ద తన అభిమతాన్ని బయటపెట్టారు. బాలకృష్ణ మాత్రం చంద్రబాబుకు మద్దతుగా నిలబడేట్లే ఉన్నారు. మహానాడు ప్రసంగంలో ఆయన చంద్రబాబును ప్రశంసించారు.

చంద్రబాబు ఆలోచన ఎలా ఉందనేది తెలియడం లేదు. హరికృష్ణను చంద్రబాబు పట్టించుకోవడం లేదా, కావాలనే పట్టించుకోనట్లు నటిస్తున్నారా అనేది తెలియడం లేదు. అయితే, మహానాడులో మాట్లాడాలని యనమల రామకృష్ణుడిని చంద్రబాబే అడిగించారని తెలుస్తోంది. హరికృష్ణ తీరు పట్ల చంద్రబాబుకు నచ్చడం లేదని కూడా చెబుతున్నారు. మహానాడు నుంచి హరికృష్ణ శనివారం నాడు కూడా మధ్యలోనే వెళ్లిపోయారు. తన వారసుడిగా నారా లోకేష్‌ను తేవాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలే తండ్రీకొడుకులు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లకు నచ్చడం లేదని చెబుతున్నారు. ఏమైనా, ప్రస్తుతం తెలుగుదేశంలో వారసత్వ పోరు బద్దలవడానికి సిద్ధంగా ఉన్నట్లే కనిపిస్తోంది.

బాబు స్వర్గీయ ఎన్టీఆర్ వారసుడేనా?

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు వారసత్వాన్ని కొనసాగిస్తున్నారా అనేది అనుమానమే. ఆయన ఎన్టీ రామారావు పేరును వాడుకున్నప్పటికీ వారసత్వాన్ని మాత్రం కొనసాగించడం లేదని అందరూ చెప్పే మాటే. ఎన్టీ రామారావు బొమ్మ వేరేవారి సొంతం కాకుండా జాగ్రత్త పడుతూ నారా వారసత్వాన్ని స్థాపించడమే చంద్రబాబు లక్ష్యమని చెబుతున్నారు. తన కుమారుడు నారా లోకేష్‌కు తన వారసత్వాన్ని అందించాలనేది ఆయన ప్రయత్నంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ జయంతి సందర్బంగా పార్టీ మహానాడు జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ఆనవాయితీని మాత్రం చంద్రబాబు తప్పకుండా పాటిస్తున్నారు.

ఎన్టీ రామారావుకున్న తెగువ, సూటిదనం చంద్రబాబుకు లేవు. పైగా, తన చేతిలోకి వచ్చిన తర్వాత పార్టీ స్వరూప స్వభావాలనే మార్చేశారు. ఇతరులు చెప్పే మాటను వినే అలవాటు ఎన్టీఆర్‌కు ఉంది. ఎవరైనా చెప్తే ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తే దాన్ని ఆచరణలో పెట్టేవారు. కాంగ్రెసుకు బద్ద వ్యతిరేకిగా వ్యవహరించారు. అందువల్ల ఆయన మొండివాడిగా కూడా ముద్ర పడ్డారు. ప్రజల మేలు తప్ప మరోటి ఆయనకు తట్టేది కాదు. పైగా, ప్రజలకు మేలు జరుగుతుందంటే నిబంధనలను కూడా పక్కన పెట్టేవారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవారు. పార్టీపరంగా తీసుకున్న నిర్ణయానికి నష్టమైనా, కష్టమైనా కట్టుబడి ఉండేవారు.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని సంక్షేమ దిశ నుంచి అభివృద్ధి దిశకు, అదీ పెట్టుబడీదారి దిశకు మళ్లించారు. చంద్రబాబు సంక్షేమ పథకాలకు కోత పెట్టారు. వ్యవసాయం దండుగ వంటి మాటలు మాట్లాడారు. ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ స్థానికేతరులకు అన్యాయం జరిగిందనే విషయం బయటకు వచ్చినప్పుడు దాన్ని సరిదిద్దడానికి 610 జీవోను విడుదల చేశారు. కానీ దాన్ని చంద్రబాబు అమలు చేయలేకపోయారు. అంతేకాదు, రాజకీయ ప్రయోజనం కోసం తీసుకున్న తెలంగాణ అనుకూల వైఖరికి ఇప్పుడు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం ఎన్టీఆర్ ఉన్నప్పటి తెలుగుదేశం కాదనేది అందరికీ తెలిసిన విషయమే.

26, మే 2011, గురువారం

లేదంటే ఒకప్పటి వెలిగిన దేశంగా చరిత్రలో మిగిలిపోతుంది.

నరసింహా రావు గారి నాన్చుడు దారిలో
నారా వారు ఇంకా [ఈ కాలం లో కూడా] ప్రయాణిస్తూ
ప్రభుత్వ పగ్గాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు.

కానీ గ్రామ గ్రామానికీ విస్తరించి ఉన్న పార్టీ శాఖ
ఇదే విషయంలో విసిగిపోతోంది.

వయసుమళ్ళిన వాళ్ళు వాహ్యాళికి వచ్చినట్టు
వచ్చి ఇంకా పార్టీ వ్యవహారాలూ నడుపుతుంటే
అవకాశం రాని యువత అంగలారుస్తూ
తక్షణమే పేరొచ్చే పెడదారులను వెతుక్కొంటున్నారు.

రైతు సమస్యలు అవినీతి సమస్యలపై అధినేత అరుస్తున్నా
వాహ్యాళికి వచ్చినట్టు ప్రవర్తిస్తున్న
పండిన వృద్ద ఝంభూకాల జంజాటాన్ని
ఎంత తొందరగా వదులుకొని
జనంలో మమేకమయ్యే మనుషులకు
మేధావులకు పార్టీ పనులు అప్పజేబుతారో
అప్పుడే తెలుగు దేశం దశ తిరుగుతుంది.

లేదంటే ఒకప్పటి వెలిగిన దేశంగా
చరిత్రలో మిగిలిపోతుంది.

కుటుంబంలో ఎవరు జైలుకు పోతే వాళ్ళే సి ఎం అయిపోతారు

కనిమొళక్కో

కరుణ కూతురుగా ఉన్నా

కాస్తా దూరంగానే ఉంటివి

రాక రాక రాజకీయాలకు వస్తివి

రాజ్య సభకు వెళ్తివి

కుటుంబ గొడవల్లో కళైంజర్ ఛానెల్ పెడితివి

రాజాతో చేరి చేసిన రచ్చ

రచ్చ రచ్చ అయ్యి

అది కాస్తా 2 జీ అయ్యి

బైలు దొరక్క

జైలు పాలవుతున్నావు

అయినా మీ కుటుంబంలో

ఎవరు జైలుకు పోతే వాళ్ళే సి ఎం అయిపోతారు

బాధపడకు.

ఎప్పడూ ‘ఓదార్పు’ పేరుతొ ఏడుపేనా అనే సందేహం వద్దు

ఈ సీరియల్ లో
కథా నాయకుడు
కన్నీళ్లు తుడిచే నెపంతో వస్తాడు.
ఆ పాత్రను స్వయంగా కథా నాయకుడే
ఆవిధంగా మలుచుకొన్నాడు.
మధ్య మధ్య లో దీక్షల ఎపిసోడ్స్ తో అలరిస్తున్నా
అడపా దడపా ఎన్నికలంటూ డబ్బులు ఎదజల్లే
ఎపిసోడ్స్ తో ప్రత్యేక టెలి ఫిల్ములు చేస్తున్నా
ఈ సీరియల్ మాత్రం
తనకు ఖశ్చితంగా
కుర్చీ తెచ్చిపెడుతుందని నమ్మినందువల్లా
కథానాయకుడు ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లతో
ఏడిపించడానికి
రెండో సంవత్సరానికి దగ్గరవుతున్నా
రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తున్నాడు
ఎప్పడూ ‘ఓదార్పు’ పేరుతొ ఏడుపేనా అనే
సందేహం వద్దు
ఏడిపించబోయే ఇంటికి వెళ్లక ముందు
డబ్బులు కొడుతూ
బాణా సంచా కాలుస్తూ
బహు సందడి తో
హాస్యాన్ని కూడా పండిస్తారు.
లైవ్ సీరియల్ కాబట్టి
షూటింగ్ వచ్చిన వాళ్ళందరికీ
కవరేజి గ్యారెంటీ తో
గమ్మత్తు కలగజేస్తారు.
వీలయితే షూటింగ్ కు వెళ్ళండి
లేదంటే 24 గంటల లైవ్
టీ వీ ల లో వస్తుందని మరచిపోకండి.

తోడు పంపిస్తారని భయమా?

యువనేత తనకు మాత్రమే
రైతు సమస్యలపై పేటెంటు ఉన్నట్టు
మిగిలిన వారు ఎవరు ఏమి చేసినా
కనీసం ప్రస్తావించినా
కిందా మీదా పడి
తనను కాపీ కొడుతున్నారని
మొసలి కన్నీరనీ మొత్తుకొంటున్నాడు
ఇన్నాళ్ళూ సభ్యుడై ఉండీ
భత్యాలు తీసుకొంటూ
సభ్యత కోసమైనా
పార్లమెంటులో ఒక్క సారైనా ప్రస్తావించాడా?
ఇక్కడ మాట్టాడి కుర్చీ కొట్టేద్దామనే బదులు
అక్కడ ప్రస్తావిస్తే ప్రసారం చేసే
సొంత మీడియా ఉండదనా లేక
హసన్ అలీ లేక మధు కోడాకు చేసిన సత్కారం చేసి
2 జీ రాజా కు తోడు పంపిస్తారని భయమా?

ఓదార్పు అంటూ ఏడిపించడానికి వెళతారు.

సొంతంగా పార్టీ పరంగా గెలిచిన
ఎం ఎల్ ఏ ఒక్కరే.

మిగిలినవి అన్నీ కప్పదాట్లే.
అవి కూడా పాతికకు మించి లేదు.

పాలకులు తలుచుకొంటే
కప్ప దాట్లను సభకే రానివ్వకుండా చెయ్యొచ్చు.

ఇన్నీ తెలిసి పాలకులను పడగొట్టేస్తాం అని
పదే పదే చెప్పడం ఎందుకో ?

సిన్సియారిటీ చూస్తుంటే చిరంజీవి గుర్తుకు వస్తున్నాడు
ఏ పిలుపు వచ్చి డిల్లీకి వెళ్ళినా పోలవరం అంటాడు
తరువాత పత్తా ఉండడు.

సేం డిటో అలానే రైతు సమస్యలు అని ఓ టెంట్ వేస్తారు
కానీ ఓ సొంత పార్టీ ఎం పీ గా
విత్త మంత్రులను నిద్రలేపే వినతి పత్రం ఇవ్వలేరు.

టెంటు అవుతూనే
కుర్చీ సుమన్ అవతారం ఎత్తి
ఓదార్పు అంటూ ఏడిపించడానికి వెళతారు.

వెళ్ళిన చోట్లల్లా
ట్రాఫిక్ లేని జంక్షన్లు వెదికి
విగ్రహాన్ని పెడుతూ
యువ నేత మహా నేత విగ్రహావిస్కరణ అని
తన మీడియా లో రోజులో ఎప్పుడు చూసినా
తప్పించుకోకుండా బాధుతారు.

కుర్చీ తన బాబు సొత్తు అనే బాధ ఎక్కువగా ఉండేట్టు ఉంది
కూల్చేదేదో కూల్చేసి ఆ భారం దింపుకొంటే బావున్ను.

నేనే ఎలికవ్వాలని అనుకొంటే ఎలా కుదురుతుంది.

తానూ ఓ ఏలిక అవ్వాలని
ఓ ఎలుక
తన కుటుంబం మొత్తంతో
ఇంట్లో చిందర వందర చేస్తుంది
అందరూ చూసే లోపల
తన కుటుంబం మొత్తాన్ని
కలుగులో ఉంచుకొంటుంది
చిందర వంద చేస్తున్న భాగాన్ని
తన ఏలుబడికి వదిలేయమని
తతిమా ఎలుకలేవీ అలా సెయ్యకుండా
ఏదన్నా ప్రయత్నించినా
కలుగు దాటి బయటకు వచ్చి
ఇంట్లో ఇంకో మూల చప్పుడు చేసినా
ఎలికవ్వాలని కలలుగనే ఎలుక
చప్పుడు చేసే ఎలుకల కలుగుల ముందర
టమోటో పిండేసి గుడ్ల పెంకులు పెట్టేసి
నా నా రభస చేస్తోంది
అన్ని ఎలుకలూ ఒక్కటై
చెత్త జేస్తే కదా ఈ ఇంట్లో ఉండలేమని
సామాన్లు సర్దుకు పోయేది అక్కడ ఉన్నోళ్ళు.
నచ్చినప్పుడు కలుగు బయట వచ్చి
చిందర వందర చేసి
మిగిలినప్పుడు కలుగులోకి వెళ్లి పోయి కాలాక్షేపం చేస్తూ
నేనే ఎలికవ్వాలని అనుకొంటే
ఎలా కుదురుతుంది.

అరిచే కుక్క కరవదు

అని అందరికీ ఓ నమ్మకం
ఒక వేళ కరిస్తే బొడ్డు చుట్టూ
పద్నాలుగు సూదులు పొడి పించుకోవాలనే
మరో నమ్మకం
ఆ నమ్మకాలన్నీ విడిచి పెట్టండి.
అట్టని నేను జన విజ్ఞాన వేదిక కార్యకర్తను కాను,
ఆంధ్రాలో రోజుకొక్కరైనా కుక్క కరిచి చస్తున్నారు
పద్నాలుగు బదులు వచ్చిన ఒక్క సూది కూడా
ఆంధ్రాలో దొరకదు
అలా తయారయ్యింది మన ఆస్పత్రుల పరిస్థితులు.

మనకు ఉచితంగా వచ్చే ఆరోగ్య శ్రీ లు కావాలి కానీ
కుక్క కరిచి పోతే ఏమి అని అనుకొనే రోజులు వచ్చేసాయి.

అమెరికా వాళ్ళకు ఈ విషయం తెలియనట్టు ఉంది
లేదంటే ఈ పాటికి ఆంధ్రాకు వెళ్లి కుక్క కరిచి చావకండి
అని అందరూ కాండ్రించి ఉమ్మేట్టు
తమ పౌరులకు హెచ్చరికలు చేసి ఉండేది.

అందరివాడికి అమాత్య పదవి అందని ద్రాక్షేనా?

అన్నను ఆదర్శంగా తీసుకొని
అబ్దుల్ కలాం పిలుపందుకొని
ముఖ్యమంత్రి పదవికి కోసం పార్టీ పెట్టి
సామాజిక న్యాయాన్ని మంది మదిలో చొప్పించలేక
రెంటికీ చెడ్డ రేవడి అయి
గౌరవ నిష్క్రమణకోసం చూస్తుంటే
కేంద్ర మంత్రి ఇంటికి రాంగానే
తనకో కేంద్ర అమాత్య పదవి వస్తుందేమోనని ఆశపడి
పెట్టే బేడాతో సహా పార్టీని చేతిలో పెట్టడానికి ఒప్పుకొని
చేతి కోసం ఓట్లడిగి
తనూ రాహుల్ గాంధీ లాంటి వాడేనని నిరూపించుకొని
ఒగరుస్తూ ఓపిగ్గా హస్తిన ప్రయాణాలు చేసి
హస్త రేఖలు చూసుకొని మురిసిపోతూ
ప్రజల మధ్య ఉండాలను కొంటున్నానని
సముద్రం (చేతి పార్టీని సముద్రం పార్టీ గా వర్ణిస్తారు రాజకీయ విశ్లేషకులు)
ఒడ్డున నిలుచుకొని కేకేసి చెప్పి
ఇంటికొచ్చి అలక పాన్పు ఎక్కేసాడు
మరో సారి ప్రయాణం కట్టమని హస్తిన నుండి పిలుపొచ్చింది
అమాత్య పదవి కోసం అడిగి మళ్ళీ భంగపడుతాడో ఏమిటో?

ఇక్కడ భంగపడతాడు అని ఖశ్చితంగా ఎందుకు చెబుతున్నాను అంటే
ఈయనకు పదవిచ్చి ఖాళీ అయ్యే తిరుపతి లో
పరపతి నిలుపుకొనే ధైర్యం సముద్రానికి లేదు కాబట్టి
అదీ స్థానిక ఎన్నికల ముందు అసలు ఆ ఊసే ఊహకు కూడా రానివ్వరు.
అందుకే అందరివాడికి అమాత్య పదవి అందని ద్రాక్షే అవుతుంది
కాదు అమాత్యాడు అవ్వాలని మొండిఘటం అయితే రాష్ట్రం లో ఇస్తారు.

గోనె పట్టలు కూడా రైతులకు ఇవ్వలేని ఘోర ప్రభుత్వంలో
ముఖ్యమంత్రి పదవికి కోసం పార్టీ పెట్టి
రాష్ట్ర మంత్రులలో ఓ బోడి లింగ మవ్వడానికి
మనః సాక్షి అంగీకరిస్తుందా అన్నది ఓ ప్రశ్న?

జూ ఎన్టీఆర్‌కు చంద్రబాబు చెక్?

తన కుమారుడు నారా లోకేష్‌కు అడ్డం పడాలని చూస్తున్న తన మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్‌కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెక్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ పూర్తి కాలం రాజకీయాలపై దృష్టి పెట్టలేని స్థితిని గమనించి ఆయన నారా లోకేష్‌ను పార్టీలోకి దింపుతున్నట్లు చెబుతున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మంత్రి గల్లా అరుణ పాగా వేశారు. ఒకప్పుడు చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరి గల్లా అరుణ చేతుల్లోకి పోవడాన్ని దృష్టిలో ఉంచుకుని మళ్లీ తాను పాగా వేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇందులో భాగంగా తన కుమారుడు నారా లోకేష్‌ను అక్కడి నుంచి రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నారు. దీనివల్లనే చంద్రగిరి నియోజకవర్గం పార్టీ నేతలు నారా లోకేష్‌ను ఇంచార్జీగా నియమించాలని పట్టుపడుతున్నారు.

కాగా, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అతను సినిమాలను తగ్గించుకోవడానికి కనీసం పదేళ్లయినా పడుతోంది. ఈ పదేళ్ల లోపు అతను పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదు. నందమూరి హరికృష్ణ ముందుకు వచ్చి పార్టీ నాయకత్వం చేపట్టే స్థితి కూడా లేదు. హరికృష్ణకు తగిన సమర్థత కూడా లేదు. పార్టీ నాయకులు అందుకు అంగీకరించే అవకాశం లేదు. ఇప్పుడిప్పుడే సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వచ్చే సాహసం జూనియర్ ఎన్టీఆర్ చేస్తాడని అనుకోలేం. అందువల్ల నారా లోకేష్‌ను అడ్డుకుని జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించే అవకాశాలు లేవు. వచ్చే పదేళ్ల కాలంలో, అంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల వైపు దృష్టి సారించాలని అనుకునే సరికి నారా లోకేష్ నాయకుడిగా స్థిరపడిపోతారు. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఏ విధమైన ఆటంకాలు ఉండవని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ, బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాలని అనుకుంటే మాత్రం కాస్తా తేడా రావచ్చు. కానీ, లోకేష్‌ను అల్లుడిగా చేసుకున్న బాలకృష్ణ అందుకు సాహసించకపోవచ్చు. ఇప్పటికే, చంద్రబాబు, బాలకృష్ణల మధ్య ఒక అవగాహన కుదిరినట్లు చెబుతున్నారు. మొత్తం మీద, కుమారుడు నారా లోకేష్‌కు చంద్రబాబు లైన్ క్లియర్ చేసి పెట్టారు. పార్టీ ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కూడా నారా లోకేష్‌ను సమర్థించేవారే. అంటే చంద్రబాబు మాటకు కట్టుబడి ఉండేవారే. నామా నాగేశ్వర రావువంటి నాయకులు నారా లోకేష్‌కే మద్దతు తెలుపుతారు

25, మే 2011, బుధవారం

కాంగ్రెసులో రెడ్డి వర్సెస్ కాపు

ఇన్నాళ్లూ రెడ్డి ఆధిపత్యం ఉన్న కాంగ్రెసు పార్టీ క్రమంగా తన దిశ మార్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కాసు బ్రహ్మానందరెడ్డి హయాం నుండి నిన్నటి వైయస్ రాజశేఖరరెడ్డి హయాం వరకు రాష్ట్ర కాంగ్రెసులో రెడ్డిలకే ప్రాధాన్యం ఉండేది. కాంగ్రెసులో రెడ్డిలకే అధిక ప్రాధాన్యత ఉన్నప్పటికీ వైయస్ హయాంలో రెడ్ల ప్రాధాన్యత మరింత పెరిగిందనే వారూ ఉన్నారు. అయితే వైయస్ఆర్ మరణానంతరం ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ విడిచి కొత్త పార్టీ పెట్టడం, ఆయన వైపు పలువురు నేతలు చూస్తుండటంతో కాంగ్రెసు ఇప్పుడు రెడ్డిని కాదని కాపుల వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇన్నాళ్లూ కాంగ్రెసుకు అండగా ఉన్న రెడ్లు జగన్ పార్టీ పెట్టడం కారణంగా వారు ఆయన వైపు చూస్తుండటంతో తమకంటూ ఓ సామాజికవర్గం ఓట్లు ఉండాలనే ఉద్దేశ్యంలో భాగంగానే కాంగ్రెసు పార్టీ రాష్ట్రంలో అతిపెద్ద సామాజికవర్గంలో ఒకటి అయిన కాపులను దరి చేర్చుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ వ్యూహంతోనే ప్రజారాజ్యం పార్టీని పార్టీలో విలీనం చేసే దిశలో చిరంజీవిని ఒప్పించి సఫలం చెందిందని తెలుస్తోంది.

కాంగ్రెసు కార్యకర్తల్లో ఎక్కువ కాపులే ఉన్నప్పటికీ ప్రాధాన్యత మాత్రం రెడ్డిలకే ఇప్పటి వరకు ఉంది. రెడ్లంతా ఇప్పుడు జగన్ వైపు చూస్తున్న నేపథ్యంలో కాపులకు పార్టీలో కీలక పదవులు అప్పగించడం ద్వారా వారిని మరింత దరి చేర్చుకునే వ్యూహంతో పార్టీ ముందుకు వెళుతోంది. రెడ్లు దూరం కావడం ద్వారా 2014లో ఏర్పడే లోటును కాపుల ద్వారా పూడ్చుకునే ఉద్దేశ్యంతోనే చిరును దరి చేర్చుకున్నట్లు తెలుస్తోంది. చిరును తమ వైపు తిప్పుకోవడం ద్వారా చిరు అభిమానులతో పాటు, కాపు వర్గాన్ని దమ వైపు తిప్పుకోవచ్చునని కాంగ్రెసు భావిస్తోంది. సామాజికంగా, ఆర్థికంగా రెడ్డిలదే ముందంజ. కాపులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రెడ్ల ప్రాధాన్యం తగ్గించి లాభం పొందాలను అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా రెడ్లకే ప్రాధాన్యత ఉంది. కిరణ్ కేబినట్లో 15 శాఖలు రెడ్డి సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయి. అయితే కిరణ్ పనితీరుపై అధిష్టానం తీవ్ర అసంతృప్తిగా ఉన్నది. కాబట్టి క్రమంగా రెడ్లకు ప్రాధాన్యత తగ్గించి కాపులను అందలం ఎక్కించాలనే వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికిప్పుడు చిరంజీవికి సిడబ్ల్యుసిలో స్థానం కేటాయించడం ద్వారా పార్టీ రెడ్లతో పాటు కాపులకు మంచి ప్రాధాన్యం ఇస్తుందనే ధోరణి కల్పించాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు మంత్రి బొత్స సత్యనారాయణకు పిసిసి పదవిని కట్టబెడతారని, వట్టి వసంతకుమార్, కన్న లక్ష్మీనారాయణలకు కూడా ప్రాధాన్యం ఉన్న పోస్టులను ఇస్తారనే వార్తల వెనుక కూడా కాపులను మరింత దగ్గరకు చేర్చుకోవాలనే ఉద్దేశ్యమే అని తెలుస్తోంది. టిడిపికి బిసి, కమ్మ, జగన్‌కు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఉన్నట్లు ఇక ముందు ముందు కాంగ్రెసుకు కాపు సామాజిక వర్గం దగ్గరవుతుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

24, మే 2011, మంగళవారం

జూనియర్ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఇంచార్జీ??

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్‌కు సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కౌంటర్ ప్రారంభమైంది. పార్టీ మహానాడుకు ముందే తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు ముదురుతోంది. తెలంగాణలో సీనియర్ శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి వ్యవహారం రగులుతున్న సమయంలోనే వారసత్వ పోరు కొత్త రూపు ధరించడం విశేషం. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి నారా లోకేష్‌ను ఇంచార్జీగా ప్రకటించాలని కోరుతూ తీర్మానం చేయాలని నిర్ణయించుకున్న సమయంలోనే కృష్ణా జిల్లా రాజకీయాలు దానికి కౌంటర్‌గా ప్రారంభమయ్యాయి.

కృష్ణా జిల్లాలోని ఏదో ఒక శాసనసభా నియోజక వర్గం ఇంచార్జీగా జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రకటించాలని కోరుతూ జిల్లా నాయకత్వం తీర్మానం చేయడానికి సిద్ధపడుతోంది. మంగళవారం మధ్యాహ్నం బందరులో కృష్ణా జిల్లా పార్టీ సమావేశం జరుగుతోంది. ఇందులో మహానాడులో ప్రతిపాదించే తీర్మానాలపై చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్‌ను ఏదో ఒక నియోజకవర్గం ఇంచార్జీగా నియమించాలనే తీర్మానం పురుడు పోసుకుంటుందని అంటున్నారు. తాత స్వర్గీయ ఎన్టీఆర్ సొంత జిల్లా కృష్ణా నుంచి జూనియర్ ఎన్టీఆర్ తన రాజకీయ ప్రవేశం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ ఇంచార్జీగా వ్యవహరించడానికి అనువైన నియోజకవర్గాన్ని కూడా పార్టీ నాయకులు గుర్తించనున్నారు.

తన కుమారుడు లోకేష్‌ను చంద్రగిరి నియోజక వర్గం ఇంచార్జీగా నియమించాలనే చిత్తూరు జిల్లా పార్టీ నాయకుల ఒత్తిడిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. పార్టీని బలోపేతం చేయాల్సిన తరుణంలో వారసత్వ పోరు రగలడం చంద్రబాబుకు కాస్తా ఇబ్బందిగానే ఉందని చెబుతున్నారు. తెలంగాణకు సంబంధించి నాగం జనార్దన్ రెడ్డి వ్యవహారం తలనొప్పిగా పరిణమించింది. ఇదే సమయంలో వారసత్వ పోరు కొత్త మార్గంలో తలకు చుట్టుకుంటుండడం చంద్రబాబు అసహనానికి కారణమని అంటున్నారు.

చంద్రబాబు వ్యూహం కూడా తిరగబడేట్లే ఉంది.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాజకీయాల్లో చాణక్యుడని, అతని వ్యూహం ముందు అందరూ చిత్తు కావాల్సిందేనని ఇప్పటి వరకు ఓ నమ్మకం ఉంటూ వచ్చింది. అంతేకాకుండా, ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత కష్టమైనా, నష్టమైనా తెలుగుదేశం పార్టీ భరిస్తుందనే విశ్వాసం ప్రజల్లో ఉండేది. ప్రత్యర్థులనే కాదు, పార్టీ వ్యతిరేకులను తన వ్యూహాలతో దారికి తెచ్చుకునే నేర్పు చంద్రబాబుకు ఉందని అనుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులవుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీపై, పార్టీ నాయకులపై చంద్రబాబు పట్టు కోల్పోయినట్లు కనిపిస్తున్నారు. తాను అనుసరించిన వ్యూహమే తన కొంప ముంచేలా ఉంది. తన దారిలో నడవని నేతలను కట్టడి చేయడానికి పార్టీలో వారికి వ్యతిరేకంగా మరో గ్రూపు తయారు చేసే చంద్రబాబు వ్యూహం బెడిసి కొడుతోంది.

మహబూబ్‌నగర్ జిల్లా నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి విషయంలో చంద్రబాబు అనుసరించిన వ్యూహం పూర్తిగా బెడిసికొట్టినట్లే కనిపిస్తోంది. పార్టీ వైఖరిని నాగం జనార్దన్ రెడ్డి తూర్పారపడుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారా, ఆ నిర్ణయాన్ని సమీక్షించి వెనక్కి తీసుకుంటారా తేల్చాలని ఆయన పట్టుబడుతున్నారు. నాగం జనార్దన్ రెడ్డి పట్టులో అర్థం ఉంది. తెలంగాణ ప్రజల ముందు చంద్రబాబును నాగం జనార్దన్ రెడ్డి ద్రోహిగా నిలబెడుతున్నారు. ఇతర పార్టీల నాయకులు ఇప్పటికే కావాల్సినంత చంద్రబాబు వైఖరిని తప్పు పడుతూ వచ్చారు. దీంతో తెలంగాణ ప్రాంతంలో ప్రజలు చంద్రబాబును నమ్మడానికి వీలు లేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డే ముందుకు రావడంతో ఆయన పప్పులు ఉడికేట్లు లేవు. చంద్రబాబు అనుకూల తెలంగాణ ప్రాంత నాయకత్వం దుమ్ము దులిపేందుకు కూడా ఆయన వెనకాడడం లేదు.

ఇకపోతే, వారసత్వ పోరు నానాటికీ రాజకుంటోంది. తన కుమారుడు నారా లోకేష్‌ను తెర మీదికి తేవాలనే చంద్రబాబు వ్యూహం కూడా తిరగబడేట్లే ఉంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి పార్టీ ఇంచార్జీగా నారా లోకేష్ పేరును ప్రకటించాలని ఆ ప్రాంత నాయకులు పట్టుబట్టడం కూడా చంద్రబాబుకు తలనొప్పిగానే పరిణమించింది. నారా లోకేష్‌ను అడ్డుకోవడానికి నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు తమ అస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు. కృష్ణా జిల్లాలో దాని ప్రకంపనలు కనిపిస్తున్నాయి. వల్లభనేని వంశీని దారికి తెచ్చామని అనుకున్నా అది రగులుతూనే ఉన్నది.

తాజాగా, పార్టీ సీనియర్ నాయకుడు బుచ్చయ్య చౌదరి పార్టీ నుంచి తప్పుకోవడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. బుచ్చయ్య చౌదరి పార్టీ నాయకత్వ తీరు పట్ల, అంటే చంద్రబాబు తీరు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే విషయం మాత్రం నిర్ధారణ అయింది. నాగం జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంత నాయకులను చంద్రబాబు ఉసిగొల్పినా అది ఫలితం ఇచ్చే సూచనలు కనిపించడం లేదు. సీమాంధ్ర సీనియర్ నాయకులు పార్టీ వ్యవహారాల పట్ల పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద, చంద్రబాబు కోలుకోలేని స్థితిలోకి జారుకుంటున్నారని మాత్రం అనిపిస్తోంది.

నారా లోకేష్ వర్సెస్ వైయస్ జగన్

రాష్ట్ర రాజకీయాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్సెస్ నారా లోకేష్‌గా మార్చేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. అందుకుగాను ఈ నెల 28వ తేదీన జరిగే మహానాడులో తీర్మానం చేసి తన కుమారుడు నారా లోకేష్‌ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెస్తున్నారు. తాను ఇప్పుడే పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చంద్రబాబు అనుకోవడం లేదు. కానీ వచ్చే ఎన్నికల నాటికి లోకేష్‌ను జగన్‌కు దీటుగా నిలబెట్టి పార్టీ విజయానికి వాడుకోవాలని ఆయన చూస్తున్నట్లు అనుకోవచ్చు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు కాబట్టి ఆ కోరిక మేరకే నారా లోకేష్ రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పడానికి తగిన రంగాన్ని చంద్రబాబు సిద్ధం చేశారు.

వైయస్ జగన్ కాంగ్రెసుకే కాకుండా నారా చంద్రబాబునాయుడికి కూడా బలమైన సవాల్ విసురుతున్నారు. చెప్పాలంటే, ఆయన ఎక్కువగా చంద్రబాబునాయుడినే లక్ష్యంగా చేసుకుని వాగ్బాణాలు ఎక్కుపెడుతున్నారు. చంద్రబాబు కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారని పదే పదే ఆరోపించడం ద్వారా తెలుగుదేశం అస్తిత్వాన్ని, మూలాలను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తోడు, ఏ మాత్రం వ్యవధి ఇవ్వకుండా వైయస్ జగన్ కార్యక్రమం మీద కార్యక్రమం తీసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు. కడప ఉప ఎన్నికల్లో ఆయన కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ఉప ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు సమస్యలపై గుంటూరులో దీక్ష చేపట్టారు. మంగళవారం నుంచి విజయవాడ జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు. తెరిపి లేకుండా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి వెళ్లడానికి వైయస్ జగన్‌కు వయస్సు సహకరిస్తోంది.

జగన్‌కు దీటుగా ముందుకు సాగడానికి చంద్రబాబుకు వయస్సు అడ్డుపడుతోంది. అంత విస్తృతంగా పర్యటించడం చంద్రబాబు వల్ల కాదనేది తెలిసిపోతూనే ఉన్నది. ఈ స్థితిలో నారా లోకేష్‌ను రంగం మీదికి తెచ్చి, జగన్‌తో పోటీ పడేలా చేయాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. చంద్రబాబు తన స్థానాన్ని పదిలం చేసుకుని, తిరిగి అధికారం చేపట్టడానికి నారా లోకేష్ ఓ అస్త్రంగా పనికి వస్తారని భావిస్తున్నారు. నారా లోకేష్ తనను దింపడానికి ప్రయత్నం చేసే అవకాశాలు లేవు కాబట్టి మరింత కాలం తాను నాయకత్వం నెరపడానికి, ఎన్నికల్లో గెలిస్తే ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి అవకాశం ఉంటుందని చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెసు పార్టీ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉందని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. తమిళనాడులో మాదిరిగా ఆంధ్రప్రదేశ్ కూడా రెండు ప్రాంతీయ పార్టీల ప్రాబల్యానికి అలవాలంగా మారుతుందని అంటున్నారు. ఈ స్థితిలో తమిళనాడులో కరుణానిధికి స్టాలిన్ పనికి వచ్చినట్లుగా రాష్ట్రంలో నారా లోకేష్ తనకు పనికి వస్తారని చంద్రబాబు అనుకుంటున్నట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ జోరును తట్టుకోవడం నారా లోకేష్ వల్లనే అవుతుందని అనుకుంటున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు నారా లోకేష్ వర్సెస్ వైయస్ జగన్‌గా మారే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

జూ. ఎన్టీఆర్ ఏం చేస్తారు?

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్ అధికారిక రాజకీయ రంగ ప్రవేశానికి మార్గం సుగమం చేశారు. తన రాజకీయ వారసత్వాన్ని నారా లోకేష్‌కు అప్పగించడానికి రంగం సిద్ధం చేశారు. నేరుగా రాష్ట్ర స్థాయి నాయకత్వంలోకి తేకుండా క్రమంగా అక్కడికి చేరుకునేలా ఆయన పక్కా ప్రణాళికను రచించి అమలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పార్టీ ఇంచార్జీగా నియమించడం ద్వారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించడానికి వీలు కల్పిస్తున్నారు. చంద్రగిరి మండల నాయకులు తీర్మానం చేసి పార్టీ మహానాడుకు పంపితే దాన్ని ఆమోదించేందుకు రంగం సిద్ధమైంది.

చంద్రగిరి నియోజకవర్గం నుంచి గతంలో చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు పోటీ చేశారు. ఆ తర్వాత సినీ నటి రోజా పోటీ చేశారు. తన స్వస్థలం చంద్రగిరి నియోజకవర్గం బాధ్యతలను చంద్రబాబు ఇప్పుడు తన కుమారుడు లోకేష్ చేతిలో పెడుతున్నారు. చంద్రగిరి నుంచి శాసనసభకు ఎన్నికయ్యేలా చూసి రాష్ట్ర రాజకీయాల్లో లోకేష్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించే విధంగా ప్రణాళిక అమలవుతోందని తెలిసి పోతూనే ఉన్నది. నారా లోకేష్‌ను ఎదుర్కోవడానికి సిద్ధపడిన స్వర్గీయ ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ వ్యూహం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో తన తండ్రి హరికృష్ణ సహకారం పొందుతున్న సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఏం చేయబోతారనే చర్చ జరుగుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ 2019 ఎన్నికలను లక్ష్యం చేసుకుని ముందుకు రావాలని అనుకుంటున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అందుకుగాను ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో కలిసి పని చేయడం ద్వారా 2014లో చంద్రబాబు గెలవకుండా చూడాలని అనుకుంటున్నట్లు కూడా చెబుతున్నారు. అయితే, వైయస్ జగన్‌తో పాటు నారా లోకేష్ లక్ష్యం కూడా 2014 ఎన్నికలే అవుతున్నాయి. అయితే, 2014లోనే చంద్రబాబు తప్పుకుని నారా లోకేష్‌కు పగ్గాలు అప్పజెప్తారని చెప్పలేం. దాదాపు పదేళ్ల పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి, తగిన అనుభవం సంపాదించుకునే వరకు చంద్రబాబు మాత్రమే నాయకత్వం వహిస్తారు. కింది స్థాయి నుంచి ప్రజల ఆమోదంతో, పార్టీ కార్యకర్తలో ఆమోదంతో లోకేష్ వచ్చారని చెప్పడానికి తగిన ప్రాతిపదికను కూడా చంద్రబాబు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏమైనా, జూనియర్ ఎన్టీఆర్‌కు ఇది పరీక్షా కాలమే.

పలువురు చెవులు కొరుక్కుంటున్నారు.

తెలుగుదేశం పార్టీలో ఇటు నారా, అటు నందమూరి కుటుంబాల మధ్య వారసత్వ పోరు జరుగుతున్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ కుమార్‌కు పార్టీలో మరింత ప్రాధాన్యత కల్పించే దిశలో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా బాబు సొంత జిల్లా చిత్తురు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గ బాధ్యతలను నారా లోకేష్ కుమార్‌కు అప్పగించేందుకు పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు సొంత జిల్లా నారావారిపల్లె కూడా చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉంది.

అయితే చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెసు హవా కూడా ఉంది. అక్కడ పులివెందులలా ఏకపక్షంగా లేదు. దీంతో అక్కడి టిడిపి చంద్రగిరి నియోజకవర్గానికి లోకేష్‌ను ఇంఛార్జ్‌గా నియమిస్తే పార్టీ బాగా బలపడుతుందని అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. పార్టీ అధినేత దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీని మరింత బలోపేతం చేయడానికి లోకేష్‌ను చంద్రగిరి నియోజకవర్గానికి ఇంఛార్జిగా నియమించాలనే తీర్మానాన్ని మంగళవారం జిల్లా పార్టీ సమావేశంలో ప్రవేశ పెట్టనున్నారని తెలుస్తోంది. అలా అయితే అది జిల్లా సమావేశంలో వీజీగానే ఆమోదం పొందుతుంది.

ఎలాగూ తనయుడి రాజకీయ ప్రవేశానికి తహతహలాడుతున్న చంద్రబాబు కూడా దానిని ఆమోదించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అంతేకాదు ఈ తీర్మానాన్ని త్వరలో జరిగే మహానాడులో ప్రవేశ పెట్టి ఆమోదించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయంట.
అయితే లోకేష్ కుమార్ కోసం జిల్లా పార్టీ నేతలు తీర్మానం ప్రవేశ పెట్టాల్సిందిగా చంద్రబాబు ఆదేశించారని కూడా పలువురు చెవులు కొరుక్కుంటున్నారు.

22, మే 2011, ఆదివారం

కాంగ్రెసు వైపు వైయస్ జగన్?

వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి కాంగ్రెసులోకి రప్పించేందుకు కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీకి అత్యంత ప్రధాన రాష్ట్రంగా పేరుపడ్డ ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెసు పార్టీ దెబ్బ తినకూడదంటే జగన్‌ను దరి చేర్చుకోక తప్పదని ఆజాద్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. జగన్‌తోనే రాష్ట్రంలో పార్టీ మరింత బలపడుతుందని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆజాద్ పార్టీని నడిపించే నాయకుడు ఎవరు కూడా లేరవి నిశ్చయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఆయన పలువురు ముఖ్య నేతలతో కూడా భేటీ అయ్యారు. ఎవరి వలన పార్టీ బలపడుతుంది అనే విషయంపై రాష్ట్ర నేతలను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అందరి ఆలోచనలతో న్యూడిల్లీ వెళ్లిన ఆజాద్ జగన్‌ను పార్టీలోకి అహ్వానించడం అనే కొత్త వాదనను అధిష్టానం ముందు ఉంచినట్లుగా సమాచారం.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ బలహీనపడ్డారని, ఆయన పార్టీని సరిగా నడపలేక పోతున్నారనే భావనకు ఆజాద్ వచ్చారని, మంత్రులు, ఎమ్మెల్యేల ఫిర్యాదు కూడా ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేయడంతో ఆయన సిఎంపై మరింత అసంతృప్తితో వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఆజాద్ రాక కారణంగా రాష్ట్రంలో కొత్త సమీకరణాలు వచ్చే అవకాశం లేక పోలేదని, పెను మార్పులు జరిగే అవకాశమున్నదని కాంగ్రెసు నేతలు భావిస్తున్నారంట. కడప జిల్లాలో జగన్‌కు గట్టిపోటీ కూడా ఎవరూ ఇవ్వక పోవడాన్ని కూడా ఆయన తీవ్రంగా పరిగణించినట్లుగా తెలుస్తోంది. జగన్‌ను అడ్డుకోవడంలో అందరూ విఫలమవడంతో జగనే ఆజాద్‌కు సమాధానంగా కనిపిస్తున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో మహారాష్ట్రలో శరద్ పవార్, పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వెళ్లి సొంత పార్టీలు పెట్టి కాంగ్రెసును పూర్తిగా దెబ్బ తీసిన వైనాన్ని అధిష్టానానికి ఆజాద్ గుర్తు చేసినట్టుగా తెలుస్తోంది.

అయితే జగన్ పార్టీలోకి రావడానికి ఆసక్తి కనబర్చకున్నా కనీసం జగన్ పార్టీతో అవగాహన కుదుర్చుకోవాలని ఆజాద్ మదిలో ఉన్నదని తెలుస్తోంది. అయితే సెంటిమెంట్ కారణంగా ఇప్పటికిప్పుడు జగన్ ప్రభావం ఏమేరకు ఉంటుందో చెప్పడం కష్టం కాబట్టి 2014 వరకు చూసి అప్పటి ఎన్నికలలో జగన్ ప్రభావం ఏ మేరకు ఉంటుందో గమనించి జగన్‌ను పార్టీలోకి తిరిగి రప్పించడము ఆయన కాదంటే కలిసి వెళ్లడమా అనే నిర్ణయానికి వచ్చే అవకాశాలను ఆజాద్ యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటి నుండే వ్యూహం రచిస్తున్నట్లుగా సమాచారం. కేంద్రంలో కాంగ్రెసు బలపడాలంటే 2014 ఎన్నికలలో జగన్ మద్దతు తప్పనిసరి అని ఆజాద్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచంద్రారావు కూడా తెరపైకి వస్తారనే వాదనలు కూడా ఆజాద్ వచ్చి వెళ్లిన తర్వాత వినిపిస్తుండటం విశేషం. అయితే ఆయన ఇతర పార్టీలతో కలిసి కాంగ్రెసును దెబ్బతీయాలనుకుంటే జగన్‌ను అణగదొక్కడం అనే అంశంపై కూడా దృష్టి సారిస్తున్నట్లుగా తెలుస్తోంది. జగన్ తన లక్ష్యం అయిన ముఖ్యమంత్రి అయినా కాకున్నా కాంగ్రెసును దెబ్బతీయడం మాత్రం ఖాయం కాబట్టి ఆజాద్ అన్ని కోణాలలో దృష్టి సారిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప్రీచర్లకు చేదు అనుభవమే ఎదురైంది

బైబిల్ లెక్కల ప్రకారం.. మే 21, 2011 (శనివారం)న ఈ ప్రపంచం అంతరించిపోతుందని అమెరికాలో డప్పుకొట్టి మరీ ప్రచారం చేసిన కొందరు ప్రీచర్లకు చేదు అనుభవమే ఎదురైంది. కాలిఫోర్నియాకు చెందిన క్రైస్తవ మత ప్రచార రేడియో అయిన "ఫ్యామిలీ రేడియో" అధ్యక్షుడు హరోల్డ్ క్యాంపింగ్ తెలిపిన దాని ప్రకారం.. మే 21, 2011న అమెరికాలో స్థానిక సమయం ప్రకారం, శనివారం సాయంత్రం సరిగ్గా ఆరు గంటలకు పెను భూకంపం సంభవించి ఈ ప్రపంచం అంతరించి పోతుందని విశ్లేషించి శనివారాన్ని ‘జడ్జిమెంట్ డే’ అని అభివర్ణిస్తూ భారీ ప్లకార్డులు, బ్యానర్లతో న్యూయార్క్ మొత్తం ప్రచారం సాగించారు. కానీ ఆయన చెప్పినట్లుగా ఏమీ జరగలేదు. అంతా ప్రశాంతంగానే ఉంది.

‘బైబిల్ ప్రకారం 4990 సంవత్సరంలో జలప్రళయం సంభవించినప్పుడు తాను ఈ భూగోళాన్ని ఏడు రోజుల్లో నాశనం చేస్తానని ప్రభువు చెప్పాడు. అలాగే ఏడురోజుల్లో ఆయన దాన్ని నాశనం చేస్తాడు’ అని హరోల్డ్ వాదించారు. ఇంకా ఏసు ప్రభువుకు ఒక్క ఒక రోజు వెయ్యి సంవత్సరాలతో సమానమని, దీని ప్రకారం.. అంటే 4990 సంవత్సరాలు, వెయ్యేళ్లకు ఒక రోజు చొప్పున 7001 సంవత్సరాలు మొత్తం కలిపితే 2011 సంవత్సరం. అలాగే అప్పటి క్యాలెండర్ ప్రకారం ప్రళయం సంభవించిన రెండో నెల 17వ రోజు, ఇప్పుడు మే 21, 2011వ తేదీ ఒకటే కావడాన్ని బట్టి చూస్తే ఆ ప్రళయం శనివారమే జరుగుతుందని హరోల్డ్ పేర్కొన్నారు.

గత 1994లో కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. 1994లో ఓ రోజు సరిగ్గా 6 గంటలకు భూమి అంతరించి పోతుందని, ఇది తొలుత న్యూజిలాండ్ నుంచి ప్రారంభమవుతుందని ప్రచారం జరిగింది. అయితే ఆ రోజు 6 గంటల సమయం వచ్చి వెళ్లపోయింది. భూకంపం కానీ దానికి సంబంధించిన ఆనవాళ్లు కానీ ఎక్కడా కనిపించలేదు. కేవలం మీడియా అటెన్షన్ తప్ప. కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారాలను అస్సలు నమ్మకండి. ప్రజలను రక్షించాల్సిన దేవుడే ప్రపంచాన్ని అంతం చేస్తాననడం ఎంత వరకూ సమర్థనీయమైనదో సదరు ప్రచారకులే తెలుసుకోవాలి. కాబట్టి ఏం జరిగినా అంత మన మంచికే అనుకుంటూ ప్రజలందరూ ముందుకు సాగిపోతూ, ఇలాంటి మూఢ నమ్మకాలకు ఇకనైనా ఫుల్‌స్టాప్ పెట్టక తప్పదు.

21, మే 2011, శనివారం

అమెరికన్లకు వింత భయం

అమెరికన్లకు వింత భయం పట్టుకుంది. యుగాంతం గురించి ఎన్నో కథనాలు, మరెన్నో ఆసక్తికర విషయాలు పుకార్లుగా షికార్లు చేస్తున్న ఇటీవలి కాలంలో అమెరికాలో మరో ఆసక్తి కోణం వెలుగులోకి వచ్చింది. కొందరు 2012లో యుగాంతం సంభవిస్తుందని చెబుతుంటే కొందరు అమెరికన్లు మాత్రం ఈ రోజే (మే 21, 2011 శనివారం) యుగాంతం సంభవిస్తుందని ప్రచారం చేస్తున్నారు.

క్రిస్టియన్ మతస్థుల పరమ పవిత్ర గ్రంధమైన బైబిల్ ప్రకారం... శనివారం అంటే మే 21న ప్రపంచం అంతమై పోతుందని హెచ్చరిస్తూ అమెరికాలోని న్యూయార్క్‌లో కొంతమంది కరపత్రాలు, బ్రోచర్లు, పుస్తకాలు మరియు పోస్టర్లతో నగరంలోని కూడలి ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా పెను భూకంపం సంభవించి ప్రపంచం అంతమైపోతుందని హెచ్చరిస్తూ న్యూయార్క్ సిటీ సబ్‌వేలో అడ్వర్టయిజ్‌మెంట్లు సైతం వెలిసాయి. అక్కడి ప్రజలు మే 21ని ‘జడ్జిమెంట్ డే’గా పేర్కొంటున్నారు.

మరి బైబిల్ ప్రకారం మే 21, 2011 రోజునే ఈ ప్రళయం ఎలా సంభవిస్తుందని చెప్పగలరు..? ఇందుకు సమాధానం కాలిఫోర్నియాకు చెందిన క్రైస్తవ మత ప్రచార రేడియో అయిన ఫ్యామిలీ రేడియో అధ్యక్షుడు హరోల్డ్ క్యాంపింగ్ వద్ద ఉంది ఆయన లెక్కలు వేసి విశ్లేషించిన దాని ప్రకారం.. ఈ ప్రళయం శనివారమే జరుగుతుందని బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు. ‘బైబిల్ ప్రకారం 4990 సంవత్సరంలో జలప్రళయం సంభవించినప్పుడు తాను ఈ భూగోళాన్ని ఏడు రోజుల్లో నాశనం చేస్తానని ప్రభువు చెప్పాడు. అలాగే ఏడురోజుల్లో ఆయన దాన్ని నాశనం చేస్తాడు’ అని హరోల్డ్ వాదిస్తున్నారు.

అంతేకాకుండా.. ఏసు ప్రభువు తనకు ఒక్క ఒక రోజు వెయ్యి సంవత్సరాలతో సమానమని చెప్పినట్లు హరోల్డ్ అంటున్నారు, దీని ప్రకారం.. అంటే 4990 సంవత్సరాలు, వెయ్యేళ్లకు ఒక రోజు చొప్పున 7001 సంవత్సరాలు మొత్తం కలిపితే 2011 సంవత్సరం. కాబట్టి ఈ రోజునే ప్రళయం సంభవిస్తుందని హరోల్డ్ లెక్కలు కట్టారు. ఇంకా అప్పటి క్యాలెండర్ ప్రకారం ప్రళయం సంభవించిన రెండో నెల 17వ రోజు, ఇప్పుడు మే 21, 2011వ తేదీ ఒకటే కావడాన్ని బట్టి చూస్తే ఆ ప్రళయం శనివారమే జరుగుతుందని హరోల్డ్ అంటున్నారు. అయితే ఇప్పటికే ఇలాంటి ప్రకటనలు చాలానే వచ్చాయి. ఏది జరిగినా భగవంతునిపై భారం వేసి మన జీవన ప్రయాణం కొనసాగించక తప్పదు మరి. అంతా మంచే జరగాలని, అందరూ హాయిగా ఉండాలని కోరుకుందాం.

నాగం జనార్దన్ రెడ్డి కార్నర్

తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల్లో నాగం జనార్దన్ రెడ్డి ఒంటరి అయినట్లే కనిపిస్తున్నారు. నాగం జనార్దన్ రెడ్డి విధానాలకు వ్యతిరేకంగా శుక్రవారం తెలుగుదేశం తెలంగాణ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయాలు జరిగాయి. తెలంగాణ కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై శుక్రవారం ఈ సమావేశం జరిగింది. సమావేశంలో శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావుకు, నాగం జనార్దన్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. దీంతో నాగం జనార్దన్ రెడ్డి సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. ఎర్రబెల్లి దయాకర్ రావు నాయకత్వంలో టిడిపి తెలంగాణ సమన్వయ కమిటీ ఏర్పాటుతో నాగం జనార్దన్ రెడ్డికి చెక్ పెట్టాలన్న వ్యూహం ఈ సమావేశంతోనే అమలు కావడం ప్రారంభమైందని చెప్పవచ్చు.

శుక్రవారం జరిగిన తెలంగాణ విస్తృత స్థాయి సమావేశానికి నాగం జనార్దన్ రెడ్డి హాజరు కాగా, హరీశ్వర్ రెడ్డి గైర్హాజరయ్యారు. పరిగిలో శనివారం జరిగే తెలంగాణ నగారా సభ ఏర్పాట్లలో ఉండడం వల్లనే ఆయన రాలేకోపయారని చెబుతున్నారు. పరిగి సభకు వెళ్లాలా, వద్దా అనే విషయంపై సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణలో చేయాలని తలపెట్టిన నగారా సభలకు కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు వర్గం బ్రేకులు వేసే కార్యక్రమానికి సిద్ధపడింది. ఈ నెల 25వ తేదీన కరీంనగర్ జిల్లాలో నగారాను నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది.

ఇక ముందు తెలంగాణ నగారా సభలు పార్టీ జెండాలతోనే జరపాలని కూడా నిర్ణయించింది. తెలంగాణకు అనుకూలంగా కేంద్ర హోం మంత్రి చిదంబరానికి లేఖ ఇస్తేనే పార్టీ జెండా పెట్టాలని నాగం జనార్దన్ రెడ్డి పెట్టిన మెలికను ఆయన వ్యతిరేకవర్గం తిప్పికొట్టింది. ఈ నెల 23వ తేదీన నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట నుంచి తలపెట్టిన పాదయాత్ర కూడా సందిగ్ధంలో పడింది. ఈ కార్యక్రమాన్ని భువనగిరి శానససభ్యురాలు ఉమా మాధవ రెడ్డి అభ్యంతరం చెప్పారు. పార్టీలో పదవులు అనుభవించినప్పుడు అవన్నీ గుర్తుకు రాలేదా అని ఎర్రబెల్లి దయాకర రావు నాగం జనార్దన్ రెడ్డిని ప్రశ్నించారు. తాను ఒక్కడినే లేనని, తన వెంట చాలా మంది ఉన్నారని నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.

వెనక్కి తగ్గడానికి నాగం జనార్దన్ రెడ్డి సిద్ధంగా లేరు.

తెలంగాణపై తన పోరాటంలో వెనక్కి తగ్గడానికి తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి సిద్ధంగా లేరు. తాను తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి గానీ పార్టీకి వ్యతిరేకం కాదంటూనే చంద్రబాబు వైఖరిని తప్పు పట్టారు. చంద్రబాబు అనుకూల తెలంగాణ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ తెలంగాణ విస్తృత స్థాయి సమావేశం నుంచి మధ్యలో బయటకు వచ్చిన నాగం జనార్దన్ రెడ్డి శనివారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీ జెండా లేకుండానే తాను సభలు నిర్వహిస్తానని ఆయన చెప్పారు. రేపు శనివారం పరిగి తెలంగాణ నగారా సభ కూడా పార్టీ జెండా లేకుండానే జరుగుతుందని, ఈ సభకు అందర్నీ ఆహ్వానిస్తానని ఆయన చెప్పారు. రేపటి సమావేశానికి అందరూ వస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సమావేశంలో పార్టీ జెండా లొల్లే తప్ప తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు ఎలా తీసుకుని వెళ్లాలనే ఆలోచన చేయలేదని, అటువంటి సమావేశంలో తాను ఎలా కూర్చుంటానని ఆయన అన్నారు. సమావేశం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో జరిగింది కాబట్టి చాలా మంది మాట్లాడడానికి భయపడుతున్నారని ఆయన అన్నారు. తాను నిర్వహించిన నాగర్ కర్నూలు సభ ప్రకంపనలు సృష్టించిందని, ఉద్యమాన్ని ఉధృతం చేయడానికే సమావేశం నిర్వహించానని ఆయన అన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రజల సమీకరణకు పార్టీ జెండా పెడితే ఎలా వస్తారని ఆయన అన్నారు. తెలంగాణ కోసం చేపట్టే ఉద్యమంలో పార్టీ జెండా పెడితే అన్ని పార్టీలవాళ్లు రారని ఆయన అన్నారు.

కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు కూడా పార్టీ జెండా పెట్టడం లేదని, ఎర్రబెల్లి దయాకర రావు వరంగల్ జిల్లాలో ఎలా పాల్గొంటున్నారని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ సాధించుకోగలుగుతామని ఆయన చెప్పారు. కాలం చెల్లిన ప్రణబ్ కమిటీకి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చామంటే ఎవరు నమ్ముతారని ఆయన అడిగారు. తాము కలిసినప్పుడు చంద్రబాబు నుంచి తెలంగాణకు అనుకూలంగా లేఖ కావాలని కేంద్ర హోం మంత్రి చిదంబరం సంకేతాలిచ్చారని ఆయన చెప్పారు. తెలంగాణపై తమ నాయకులు స్పష్టత లేదని ఆయన అన్నారు.

20, మే 2011, శుక్రవారం

జగన్‌ వ్యాపార సామ్రాజ్య రహస్యము ఇదేనా??

జగన్‌దీ అం '' బాణీ ''యే!
కంపెనీలపై కంపెనీల ఏర్పాటు
వేల కోట్లు టర్నోవర్ చేసే అనామక కంపెనీలు
లెక్కచూపని నిధులతో వ్యాపార సామ్రాజ్య నిర్మాణం
దశాబ్దాల కిందటే రిలయన్స్ అనుసరించిన మార్గం
యువనేత చేతుల్లో కొత్త పుంతలు తొక్కుతున్న వైనం
ఒక ప్రధాన కంపెనీ. దాని చుట్టూ వందల సంఖ్యలో అనామక కంపెనీలు. ఒక కంపెనీలో మరో కంపెనీ పెట్టుబడి.. రెండు కంపెనీల మధ్య పరస్పర పెట్టుబడులు.. ఈక్విటీల జారీ.. రుణాలు ఇచ్చి పుచ్చుకోవడాలు.. అల్లిబిల్లిగా అల్లుకుపోయిన బ్రహ్మజెముడు పొదల వంటి ఒక సంక్లిష్ట వ్యవస్థ! వేల రూపాయల పెట్టుబడితో ఏర్పాటైన అనామక కంపెనీల చేతుల మీదుగా కోట్ల రూపాయల లావాదేవీలు. ఈ అనామక కంపెనీల వెనక ఎవరున్నారో చాలా సందర్భాల్లో ఎవరికీ తెలియదు. ఏమిటిదంతా...? ఇది వ్యాపార సామ్రాజ్య విశేషం కాదు. లెక్క చూపని నిధులతో వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించే వ్యూహం.

చట్టం కన్నుగప్పి నల్లధనాన్ని చలామణి చేసే విధానం. ప్రమోటర్ల అక్రమ ప్రయోజనాలను కాపాడే అకౌంటింగ్ మార్గం. యువనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలోని వ్యాపారాల్లో సహజత్వాన్ని సంతరించుకున్న ఈ కత్తిలాంటి వ్యూహానికి ఆద్యుడు రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ. బడా కార్పొరేట్ సంస్థల్లో అనేకం ఏదో ఒక దశలో ఈ వ్యూహాన్ని అనుసరించినా.. నేడు జగన్మోహన్‌రెడ్డి చేతుల్లో ఈ వ్యూహం కొత్త పుంతలు తొక్కుతోంది.

హైదరాబాద్, మే 17 : హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ సమీపంలో అరడజను ప్లాట్లను సొంతం చేసుకుని, నూరు కోట్లతో మహారాజ ప్రాసాదాన్ని నిర్మిస్తున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ ప్లాట్లను సొంతం చేసుకోవడానికి అనుసరించిన వ్యూహంపై 'ఆంధ్రజ్యోతి'లో మంగళవారం వెలువడిన కథనం సంచలనం సృష్టించింది. నిజానికిది, జగన్ కనిపెట్టిన విద్య కాదు.

ఆస్తుల కొనుగోలుకు, సంపద సృష్టికి, సృష్టించిన సంపదను మళ్లించడానికి కంపెనీలపై కంపెనీలు పెట్టే పద్ధతిని పతాక స్థాయికి తీసుకువెళ్లిన తొలి ఘనత ఈ దేశంలో రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీకి దక్కుతుంది. రిలయన్స్ వ్యాపార ప్రస్థానంలో అల్లిబిల్లిగా అల్లుకుపోయిన ఈ చిల్లర కంపెనీల పాత్ర చాలా పెద్దది. ఈ కంపెనీలను ఉపయోగించి ఆ రోజుల్లోనే విదేశీ నిధులను తెప్పించిన వైనం... ఇటీవలి కాలంలో పన్నుల ఎగవేతకు పుట్టగొడుగు కంపెనీలనుఅడ్డు పెట్టుకుంటున్న తీరు ఆశ్చర్యచకితులను చేస్తాయి.

నేడు మారిషస్.. నాడు ఐజల్ ఆఫ్ మాన్
ఇప్పుడు మారిషస్‌లాగా.. అప్పట్లో బ్రిటిష్ దీవి ఐజల్ ఆఫ్ మాన్ పన్నుల ఎగవేతదారులకు, రాజమార్గంలో భారత్‌కు నిధులను తరలించే వారికి స్వర్గధామంగా ఉండేది. ఐజల్ ఆఫ్ మాన్ కేంద్రంగా వెలసిన డజన్ల సంఖ్యలోని కంపెనీలు అప్పట్లో రిలయన్స్‌లోకి కోట్లాది రూపాయలను గుప్పించాయి. ఈ కంపెనీల పేర్లు చిత్రంగా ఉండటం, ఈ కంపెనీల ప్రమోటర్లు ఎవరో తెలియకపోవడం వర్తమాన దృశ్యాన్ని జ్ఞాపకం చేస్తాయి.

రిలయన్స్ షేర్లలో దాదాపు పాతిక కోట్ల రూపాయల మేర ఇన్వెస్ట్ చేసిన ఆ కంపెనీల పేర్లు క్రొకడైల్ ఇన్వెస్ట్‌మెంట్, ఐయోటా ఇన్వెస్ట్‌మెంట్, ఫియాస్కో ఇన్వెస్ట్‌మెంట్... కాగా, ఈ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీల ప్రమోటర్లందరి పేరు చివరన 'షా' అన్న తోక ఉంది. ఎన్ఆర్ఐలు అని చెప్పడం తప్ప వీరెవరో ఎవరికీ తెలియదు. ఈ కంపెనీలన్నింటికీ మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకు రిలయన్స్ షేర్లను అంబానీలు విక్రయించారు. ఈ షేర్ల విక్రయం ద్వారా సమీకరించిన సొమ్ముతోపాటు బ్యాంకుల నుంచి కూడా భారీ మొత్తాన్ని అంబానీలు సమీకరించారు.

ఇందుకు కూడా మళ్లీ పుట్టగొడుగు కంపెనీల వ్యూహాన్నే అనుసరించారు. యాభై వరకు కంపెనీలను ఏర్పాటు చేసి, వాటికి రిలయన్స్ కన్వర్టెబుల్ డిబెంచర్లను జారీ చేశారు. డిబెంచర్ల కొనుగోలుకు అప్పులిచ్చేందుకు బ్యాంకులను రంగంలోకి దించారు. పోటాపోటీగా అప్పట్లో బ్యాంకులు ఈ రుణ మేళాలో పాల్గొన్నాయి. ఈ రకంగా సమీకరించిన సొమ్మును ఉపయోగించి స్టాక్ మార్కెట్‌ను ధీరూభాయ్ ఆడుకున్నారు. ఈ ఉదంతం మరింత ఆసక్తికరం.

కోల్‌కతా బ్రోకర్లకు చావుదెబ్బ
రిలయన్స్ యాత్ర 1958లో రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ పేరుతో ప్రారంభమైంది. ట్రేడింగ్ కంపెనీగా ప్రారంభమై ఉత్పత్తుల్లోకి అడుగుపెట్టిన ఈ సంస్థ 1977లో పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఈ షేరులో ట్రేడింగ్ జోరుగా సాగేది. బుల్స్, బేర్స్ మధ్య పోటాపోటీగా క్రయవిక్రయాలు జరిగేవి. ఈ ట్రేడింగ్ నుంచి లాభపడేందుకు రిలయన్స్ ప్రమోటర్లు పుట్టించిన కంపెనీలు ప్రయత్నిస్తుంటే.. వాటిని దెబ్బతీసేందుకు ప్రత్యర్థి సంస్థలు ప్రయత్నించేవి. 1982లో రిలయన్స్ రైట్స్ ఇష్యూ జారీ చేసింది.

రిలయన్స్ షేర్లలో లిక్విడిటీ పెరగడాన్ని అదనుగా తీసుకుని షేరు ధరను చితక్కొట్టేందుకు కొందరు బేర్ ఆపరేటర్లు రంగంలోకి దిగారు. ోల్‌కతాకు చెందిన కొందరు స్టాక్ బ్రోకర్లు (బేర్ ఆపరేటర్లు) జట్టుకట్టి ఎడాపెడా షార్ట్ సెల్లింగ్‌కు దిగారు. ప్రత్యర్థుల ఎత్తును చిత్తు చేసేందుకు ధీరూభాయ్ అంబానీ తన బినామీ కంపెనీలు, అనుకూలురైన బ్రోకర్ల (బుల్ ఆపరేటర్లు)తో అంతకంటే ఉధృతంగా షేర్లను కొనిపించారు. షార్ట్ సేల్ చేసిన ఆపరేటర్లు ఊహించినట్టు షేరు ధర ఏ మాత్రం పడిపోలేదు.

పైగా డెలివరీ ఇవ్వాల్సిన సమయం వచ్చేసరికి మార్కెట్‌లో షేర్లు దొరకని పరిస్థితి. రిలయన్స్ ఫ్రెండ్స్‌గా ప్రచారంలోకి వచ్చిన బ్రోకర్లు, షార్ట్ సేల్ చేసిన ఆపరేటర్లను షేర్లు డెలివరీ ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేసే సరికి సంక్షోభం మొదలైంది. కొందామంటే మార్కెట్‌లో షేర్లు లేవు. ఒక్కో షేరుకు 35 రూపాయల పెనాల్టీ ఇవ్వాలని అంబానీ అనుకూల బ్రోకర్లు డిమాండ్ చేశారు. ఈ సంక్షోభం బీఎస్ఈని కుదిపేసింది. ఎక్స్చేంజ్ మూడు రోజులపాటు మూతపడింది. బీఎస్ఈ మధ్యవర్తిత్వం వహించి షేరుకు 2 రూపాయల పెనాల్టీని నిర్ణయించింది. షేర్ల డెలివరీకి కొంత గడువు ఇప్పించింది.

ఈ పరిణామాలతో రిలయన్స్ షేరు ధర భారీగా పెరిగింది. చేతులు కాలిన కోల్‌కతా బ్రోకర్లకు అంబానీయే కావల్సిన షేర్లను విక్రయించి కోట్లలో లాభాన్ని మూటగట్టుకున్నారని చెబుతారు. ఈ క్రీడలో బేర్ ఆపరేటర్లను దెబ్బతీసేందుకు ధీరూభాయ్ వెదజల్లిన సొమ్ము ఐజల్ ఆఫ్ మాన్ నుంచి, బ్యాంకుల రుణమేళా నుంచి వచ్చిపడ్డవే. స్టాక్ మార్కెట్‌లో కేవలం రిలయన్స్ షేర్లలోనే ట్రేడింగ్ చేసేందుకు వందల సంఖ్యలో కంపెనీలను అంబానీలు సృష్టించారు. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర వివాదాన్నే సృష్టించింది. తర్వాత పునర్ వ్యవస్థీకరణ చేపట్టారు. ఇప్పటికీ రిలయన్స్ ఇరు గ్రూప్‌లకు సంబంధించి డజన్ల సంఖ్యలోనే చిన్నా చితక హోల్డింగ్ కంపెనీలు ఉన్నాయి.

పన్ను ఎగవేత కోసం..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఏడాది, రెండేళ్ల క్రితం పెద్ద సంఖ్యలో లిమిటెడ్ లయబులిటీ పార్టనర్‌షిప్స్ (ఎల్ఎల్‌పీ)లను ఏర్పాటు చేశాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లోని తన వాటాలను డజన్ల సంఖ్యలో ఏర్పాటు చేసిన ఈ ఎల్ఎల్‌పీలకు బదిలీ చేశాడు. ఈ సంస్థల చేతుల్లో ఉన్న రిలయన్స్ షేర్ల విలువ అక్షరాలా లక్ష కోట్ల రూపాయలు. దీనివల్ల ఏమిటీ లాభం. సాధారణ కంపెనీలకు లభించే పన్ను నిబంధనలు ఈ ఎల్ఎల్‌పీలకు వర్తించవు. మ్యాట్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ కూడా ఎల్ఎల్‌పీలకు వర్తించదు.

సర్‌చార్జ్ ఉండదు. అందువల్ల పన్నులను తప్పించుకునేందుకు తెలివిగా ముకేశ్ తన షేర్లను ఈ కంపెనీలకు బదలాయించారని అంటారు. రిలయన్స్ మాత్రమే కాకుండా ఇంకా అనేక కార్పొరేట్ సంస్థలు ఇదే బాటపట్టడంతో గత బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ ఎల్ఎల్‌పీలపై 18.5 శాతం ప్రత్యామ్నాయ కనీస పన్ను విధిస్తున్నట్టు ప్రకటించారు. 2012-13 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ దెబ్బకు ఇప్పుడు కార్పొరేట్లు మరో కొత్తదారి కోసం వెతుక్కుంటున్నాయి.

వ్యాపారాల్లో విజయాలకు అనుకూలమైన పాలసీల కోసం, ప్రత్యర్థులను దెబ్బతీయడం కోసం రాజకీయ నాయకులను కనుసన్నల్లో తిప్పుకొన్న ఘనత రిలయన్స్ ప్రమోటర్లది. ఇప్పుడు వ్యాపారంలోనూ, రాజకీయంలోనూ తానే స్వయంగా చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్న ఘనత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిది. రాజకీయాల్లో ఆయన అనుకున్న లక్ష్యాలను సాధిస్తే వ్యాపారంలో, లక్షల కోట్ల రూపాయల అంబానీల సామ్రాజ్యం కూడా ఆయన ముందు చిన్నబోవడం ఖాయం.

షార్ట్ సెల్లింగ్ అంటే...
చేతుల్లో షేర్లు లేకపోయినా వాటిని అమ్మే వెసులుబాటు. ప్రస్తుతం వంద రూపాయల స్థాయిలో ఉన్న షేరు 50 రూపాయలకు పడిపోతుందని గట్టిగా తెలిస్తే, వెంటనే వంద రూపాయల రేటుకు వాటిని అమ్మేయడం, యాభై రూపాయలకు పడిపోయిన తర్వాత కొని అప్పుడు డెలివరీ ఇవ్వడం షార్ట్ సెల్లర్స్ చేసే పని. వీరిని ఎదురుదెబ్బ తీసేందుకు పొంచుకుని ఉండే బుల్ ఆపరేటర్లు షార్ట్ సేల్ చేసిన షేర్లన్నింటినీ కొనేస్తారు. గడువు తేదీన షేర్ల డెలివరీ ఇవ్వమని డిమాండ్ చేస్తారు. ఊహించినట్టుగా షేర్ల ధర పతనం కాకుండా ధర పెరిగితే మాత్రం బేర్ ఆపరేటర్లు చావుదెబ్బతిన్నట్టే. ఎక్కువ ధర పెట్టి షేర్లను కొనాల్సిందే.

పవిత్రంగా భావించే తిరుమల కొండపై విద్యార్థులు లైంగిక వేధింపులు

ప్రజలు పవిత్రంగా భావించే తిరుమల కొండపై గల ధర్మగిరి వేద పాఠశాల ప్రస్తుతం సెక్స్ కుంభకోణంతో అట్టుడికిడి పోతోంది. వేద పాఠశాలలో సెక్స్‌పరమైన ఆరాచాకాలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. అధికారులు కూడా దాన్ని అంగీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించి ముగ్గురిపై పోలీసులు కేసు పెట్టారు. అవినాష్ శర్మ, మహేష్ కన్నన్, చక్రవర్తిలపై కేసు నమోదైంది. నవీన్, నాగేంద్ర అనే విద్యార్థులు 15 రోజుల కింద అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అంటున్నారు. వేదపాఠశాలలోని కొందరు విద్యార్థులు అధ్యాపకుల సహకారంతో విచ్చలవిడి చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి.. కొందరు విద్యార్థులు సెల్ ఫోన్లలో సెక్స్ దృశ్యాలను చూడటం అలవాటుగా పెట్టుకున్నారు. జూనియర్లకు కూడా ఆ దృశ్యాలు చూపిస్తారు. అంతటితో ఆగకుండా 'ప్రాక్టికల్స్' కూడా మొదలుపెట్టారు. వేద పాఠశాలలో చేరే పేద, జూనియర్ విద్యార్థులను ఎంచుకుంటారు. వారిని లైంగికంగా వేధించడం నిత్యకృత్యకంగా మార్చారు.

మొదట బలవంతపు అత్యాచారాలకు పాల్పడి స్వలింగ సంపర్కాన్ని అలవాటు చేస్తారు. కొందరిని మగ వ్యభిచారులుగా మార్చినట్లు కూడా తెలుస్తోంది. తిరుమల జీయర్ మఠంలోని ఓ ఏకాంగి తరచూ వేద పాఠశాలకు వచ్చి పిల్లలకు డబ్బులిచ్చి స్వలింగ సంపర్కం చేసుకుపోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ధర్మగిరిలో 60 మంది అధ్యాపకులు పని చేస్తున్నారు. నిర్దేశిత డ్యూటీ ప్రకారం అధ్యాపకులు రాత్రిళ్లు పాఠశాలలోనే బస చేయాలి. కానీ చేయరు. ఇక సీనియర్ విద్యార్థులే సూపర్‌వైజర్లు. దీంతో జూనియర్లపై లైంగిక వేధింపులు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ ఘోరాలను ప్రశ్నించడానికి ప్రయత్నించినా, ఫిర్యాదు చేయాలనే ఆలోచన వచ్చినా సీనియర్లు రెచ్చిపోతారు. వారి ట్రంకు పెట్టెల్ని కాళ్లతో తుక్కు చేసి, కాంపౌండ్ బయట పడేస్తారు. కొత్త విద్యార్థులపై వీరే తప్పుడు ఫిర్యాదులు చేయిస్తారు. ఈ దారుణాలు భరించలేక పది సంవత్సరాల్లో వందలాది మంది కోర్సును మధ్యలోనే వదిలి వెళ్లిపోయారని అంటున్నారు. అధ్యాపకులను పాఠశాల నిర్వాహకులు నిలదీస్తే సహాయ నిరాకరణకు దిగుతారని వార్తలు వచ్చాయి. తడాఖా చూపిస్తామంటూ సెలవు పెట్టి వెళ్లిపోతారు. ఎంతకూ సిలబస్ పూర్తిచేయరు. దీంతో నిర్వాహకులు కూడా వారితో సర్దుకుపోవటమో, వారికి భాగస్వాములు కావటమో జరుగుతోంది.

ధర్మగిరిలో చేరే విద్యార్థులకు ఇటీవల టీటీడీ భారీ ప్యాకేజీలు ప్రకటించింది. దీని ప్రకారం పిల్లలు చేరగానే మూడు లక్షల రూపాయలు వారి పేరిట డిపాజిట్ చేస్తారు. ఆగమాలు నేర్చుకునేవారికి లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తారు. వారు 12, 8 సంవత్సరాల కోర్సు పూర్తి చేసుకుని తిరిగి వెళ్లేటప్పుడు ఆ మొత్తాన్ని వడ్డీతో కలిపి ఇస్తారు. ఈ సౌలభ్యాన్ని వదులుకోలేక పేద విద్యార్థులు ఇక్కడి దారుణాలపై నోరు మెదపలేక పోతున్నారు. ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో టీటీడీ అధికారులు బుధవారం వేద పాఠశాలలో పరిస్థితి చక్కదిద్దేందుకు పరిపాలనాధికారిగా సుబ్రమణ్యాన్ని నియమించారు.

శ్రీవారి ఆలయానికి అవసరమైన వేద పండితులను తయారు చేసుకోవాలనే సంకల్పంతో 1884లో వేద పాఠశాలను ప్రారంభించారు. తొలుత తిరుపతి గోవిందరాజస్వామి ఉత్తర మాడవీధిలోని ప్రస్తుత మ్యూజియంలో ప్రారంభించారు. 1951లో శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి మార్చారు. క్రమేపీ విద్యార్థుల సంఖ్య పెరగడంతో తిరుమల శిఖరభాగాన ఉన్న నారాయణగిరి కొండల్లో ధర్మగిరి వేద పాఠశాలను ఏర్పాటు చేశారు. తిరుమల వేద పాఠశాలలో ఒక విద్యార్థిపై సహ విద్యార్థులు లైంగిక వేధింపులు జరిపిన మాట వాస్తవమే టిటిడి కార్యనిర్వాహణాధికారి కృష్ణారావు అంగీకరించారు.

వైయస్ జగన్‌ది చంద్రబాబు వైఖరే, తెలంగాణపై ఇద్దరూ ఏకం

తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ స్పష్టమైన వైఖరి తీసుకునే అవకాశాలు లేవు. ఆయన స్పష్టంగా తెలంగాణకు అనుకూలంగా వైఖరి తీసుకుంటారని ఇటీవల వచ్చిన వార్తలు అబద్ధాలేనని తెలిసోతోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న వైఖరినే ఆయన అనుసరించే అవకాశాలున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు గోనె ప్రకాశ రావు గురువారం చేసిన ప్రకటన ఈ విషయాన్ని తెలియజేస్తోంది. తెలంగాణకు చంద్రబాబు, వైయస్ జగన్ అడ్డు కారని ఆయన చెప్పారు. తెలంగాణపై ఆయన కేంద్ర వైఖరిని తప్పు పట్టారు.గోనె ప్రకాశ రావు ప్రకటనను బట్టి వైయస్ జగన్ తెలంగాణపై రెండు కళ్ల సిద్ధాంతాన్నే ఆనుసరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. తనకు రెండు ప్రాంతాలు రెండు కళ్లు అంటూ చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు. తెలంగాణపై ఆయన కాంగ్రెసు వైఖరిని తప్పు పడుతున్నారు. తెలంగాణను ఇచ్చేది తెచ్చేది తాము కాదని వైయస్ జగన్ చెప్పే అవకాశాలున్నాయి. అసలు జగన్ తెలంగాణపై మాట్లాడుతారా అనేది కూడా అనుమానమే. వైయస్సార్ కాంగ్రెసు నాయకులు మాత్రమే జగన్ తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ ఊదరగొడుతున్నారు. కట్టె విరగకుండా పాము చావకుండా జగన్ వైఖరి ఉంటుందని చెప్పవచ్చు. అన్ని విషయాల్లో చంద్రబాబుపై కత్తులు నూరుతున్న వైయస్సార్ కాంగ్రెసు నాయకులు తెలంగాణ విషయంలో మాత్రం ఆయనను సమర్థిస్తున్నారు.

19, మే 2011, గురువారం

టీఆర్‌ఎస్‌, జగన్‌ కలిస్తే మనం మటాష్‌

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ఈ ప్రాంతంలో పార్టీ మనుగడ అసాధ్యమని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ గులాం నబీ ఆజాద్‌కు ఆ పార్టీ సీనియర్‌ నేతలు స్పష్టంచేశారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అని ముగ్గురు మంత్రులు పేర్కొన్నారు. సమైక్యరాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధికోసం చేసిన ఒప్పందాలన్ని ఉల్లంఘనకే గురయ్యాయని, ప్రత్యేక రాష్టమ్రే దానికి పరిష్కారం అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొందరు ఆజాద్‌కు తెలియజేశారు. హైదరాబాద్‌ వచ్చిన గులాం నబీ ఆజాద్‌తో తెలంగాణ సీమాంధ్ర నేతలు భేటీ విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్‌ తెలంగాణ సీనియర్‌ నేతలు భేటీ అయ్యారు.

పిసిసి మాజీ అధ్యక్షులు పి.నర్సారెడ్డి, సీనియర్‌ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి భేటీ అయ్యారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే తెలంగాణాలో కాంగ్రెస్‌ పార్టీ నాశనం అవుతుందని ఆజాద్‌కు పి.నర్పారెడ్డి స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌తో జగన్‌ పొత్తు పెట్టుకొనే అవకాశముందని, ఇదే జరిగితే తెలంగాణాలో కాంగ్రెస్‌ వాష్‌ఆవుట్‌ అవుతుందని పేర్కొన్నారు. అలా కాకుండా ప్రత్యేక రాష్ట్రం ఇస్తే మాత్రం జగన్‌ను తెలంగాణాలో కాలుమోపనీయమని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చింది తామే కాబట్టి ఈ ప్రాంతంలో అధికారంలోకి వచ్చేది కూడా కాంగ్రెస్‌ పార్టీయేనని పి.నరసారెడ్డి, పాల్వాయిగోవర్దన్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈ ప్రాంతంలో టిడిపి ఇప్పటికే జీరోగా ఉందని, ప్రత్యేక రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలపడే అవకాశముందని ఆజాద్‌కు వారు తెలియజేశారు.

పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన తనకు ఇప్పుడు ఏ పదవిపై ఆశలేదని, పార్టీ మనుగడ కోసమే తెలంగాణను కోరుతున్నానని ఆజాద్‌తో పి.నర్పారెడ్డి చెప్పినట్లు తెలిసింది. మరోవైపు తెలంగాణ ఇవ్వకపోతే మాత్రం ప్రజాప్రతినిధులు, మంత్రులు ఎవరూ తిరగలేని పరిస్థితి అని త్వరగా ప్రత్యేక రాష్ట్రంపై నిర్ణయం తీసుకోవాలని ఆజాద్‌కు మంత్రులు కె.జానారెడ్డి, బి.సారయ్య, డి.శ్రీధర్‌బాబులు కోరారు. సమైక్యరాష్ట్ర ఏర్పాటు సమయంలో చేసుకొన్న ఒప్పందాలు, హక్కుల తీర్మానాలు అని ఉల్లంఘనకు గురయ్యాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ యాదవ్‌రెడ్డి, ఇంద్రసేన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆరేపల్లి మోహన్‌, ప్రవీణ్‌రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌కు తెలియజేశారు. మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్పిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన కొందరు కార్పోరేటర్లు తెలంగాణ అంశాన్ని తొందరగా తేల్చాలని కోరారు.

ప్రజారాజ్యం విలీనాన్ని ప్రశ్నిస్తూ అధినేత చిరంజీవికి లీగల్ నోటీసులు

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి ఆ పార్టీకే చెందిన ఓ కార్యకర్త లీగల్ నోటీసులు పంపించారు. ప్రకాశం జిల్లాకు చెందిన లక్ష్మణ్ నాయుడు అనే ప్రజారాజ్యం పార్టీ కార్యకర్త పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడాన్ని ప్రశ్నిస్తూ లీగల్ నోటీసులు పంపించారు. పార్టీని విలీనం చేయడం ద్వారా చిరంజీవి పార్టీకి ఓటు వేసిన లక్షలాది మంది ఓటర్లకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ నోటీసులు ఇచ్చారు.

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన కారణంగా తాను పార్టీ కోసం ఇప్పటి వరకు ఖర్చు చేసిన డబ్బును ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ఇటీవల పార్టీ విలీనంపై ప్రజారాజ్యం పార్టీ నేతలు చిరంజీవిని ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే.

18, మే 2011, బుధవారం

కాసేపు సరదా

పెట్టుబడికి, శ్రమ కి తేడా ఏంటి ?
టీచర్ : పెట్టుబడికి, శ్రమ కి తేడా ఏంటి ?
హరి : మీరు ఒక వ్యక్తి కి డబ్బు అప్పిచ్చారనుకోండి, మీరు అప్పు ఇచ్చిన డబ్బు పెట్టుబడి. దాన్ని మీరు అతని దగ్గర నుంచి వసూలు
చేయడానికి చేసే ప్రయత్నాలు శ్రమ.
---------------------------------------------------------------------
వారెవ్వా! ఏమి చెప్పేవు
చిన వెంగళప్ప : అన్నయ్య !' గో ' కి వెర్బ్ ఫామ్స్ చెప్పవా !
పెద వెంగళప్ప : వేరి సింపుల్ రా, GO , GOKED , GOKEN .

---------------------------------------------------------------------

నభూతో... నభవిష్యత్

మారిషస్
లెక్కలేనన్ని బీచ్ లతో, పచ్చని కొండలు, అడవులతో అందంగా ఉండే ద్వీపం మారిషెస్. ఈ సమయంలో అక్కడ కొద్దిగా ఎండతో, అప్పుడప్పుడు చిరుజల్లులతో, 24 డిగ్రీల మినిమం టెంపరేచర్ తో గమ్మతైన శీతాకాల వాతావరణం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హనీమూన్లకు ఈ సమయం అనువైనదిగా చెబుతారు. బీచ్ లకు పెట్టింది పేరు అయిన మారిషెస్ లో బ్లూబే బీచ్, పెరేయ్బెరే బీచ్, లా ప్రేనేఉసే బీచ్ వంటి తదితర బీచ్ లు కేవలం పర్యటకులనే కాకుండా షూటింగుల కోసం సినిమా వాళ్ళను కూడా అమితంగా ఆకర్షిస్తాయి.

కొన్ని ఆలోచనలు..

ఇష్టం

ఇష్టానికి మరణం ఉండదు
ఇష్టం ఉన్నపుడు కష్టానికి జననం ఉండదు!
-----------------------------------------------------
అతను - ఆమె

అతను - చందమామ
ఆమె - వెన్నెలమ్మ
చందమామ, వెన్నెలమ్మ రెండు కాదు ఒకటే.
---------------------------------------------------------
ప్రేమంటే...

ఒక్కోసారి అనిపిస్తుంది ప్రేమంటే -

"రెండు బలహీన హృదయాలు చాలా బలంగా ఇష్టపడడం" అని.
----------------------------------------------------------------
మన ప్రాణాలన్నీ...

నీ ఒంట్లో నలతగా ఉందంటేనే
నా మనసు ఎంతో కలత చెందుతుంది!
నా పంచ ప్రాణాలూ నీ ఒక్క ప్రాణమే అంటే
నా ఒక్క ప్రాణం కోసం నీ పంచ ప్రాణాలు పనంగా పెట్టవా?
మన ప్రేమలో ఒక్కోసారి నాకు బలంగా అనిపిస్తుంది-
కష్టం నీది అనుభవించాలని.. సంతోషం నీతో అనుభవించాలని...
---------------------------------------------------------------------

పాత మిత్రులు ఒక్కటవుతారా

పాత మిత్రులు ఒక్కటవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబును తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దువ్వుతున్నట్లు ప్రచారం సాగుతోంది. స్టార్ అట్రాక్షన్ కోసమే కాకుండా సామాజిక వర్గంలో సమతౌల్యం కోసం చంద్రబాబును దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. తన బావమరిది హరికృష్ణ, మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్ తనపై కత్తి కట్టిన నేపథ్యంలో మోహన్ బాబును చేరదీయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు.



జూనియర్ ఎన్టీఆర్ పెళ్లిలో చంద్రబాబు మోహన్ బాబుతో మాట్లాడుతూ చంద్రబాబు ఎక్కువ సమయం గడిపారు. బావ మరిది, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణతో ఆయన ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. తాను కుదిర్చిన పెళ్లి కాబట్టి చంద్రాబాబు కాస్తా హడావిడి చేసినట్లు భావిస్తున్నారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కూడా ఏ విధమైన విభేదాలు లేనట్లే పెళ్లిలో జూనియర్ ఎన్టీఆర్‌తో వ్యవహరించారు.

సూర్యనమస్కారం.. సమస్యలు దూరం

వేకువనే నిద్ర లేచి దినచర్య మొదలుపెడితే.. మానసికంగా, శారీరకంగా బోలెడు ప్రయోజనాలు. అలా లేచిన వెంటనే పనిలో పనిగా లేలేత భానుడికి నమస్కారాలు చేయాలని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దానివల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావంటున్నాయి.

సూర్యనమస్కారాలు చేయడం వల్ల గుండెకు చాలా మేలు జరుగుతుంది. కవాటాలకు రక్త సరఫరా చురుగ్గా ఉంటుంది. అలాగే రక్తంలో ప్రాణవాయువు శాతమూ సజావుగా సాగుతుందని చెబుతున్నాయి అధ్యయనాలు.

అజీర్తి సమస్యలు ఉన్నవారు.. నిపుణుల సూచనలతో సూర్యనమస్కారాలు చేయాలి. దీనివల్ల ఎంతో మార్పు ఉంటుంది. అలాగే నాడీవ్యవస్థా చురుగ్గా పనిచేస్తుంది. శ్యాసకోస సమస్యలుంటే దూరమవుతాయి. ఒత్తిడి, మానసిక కుంగుబాటు వంటివి దూరమై తనువు, మనసు ఉత్తేజితమవుతాయి.


నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికీ ఇది చక్కని పరిష్కారం. ఇలాంటి వారు నిశబ్ద వాతావరణంలో సూర్యనమస్కారాలు చేయాలి. చాలా మార్పు కనిపిస్తుంది. బద్ధకం వదిలి రోజంతా చురుగ్గా ఉల్లాసంగా ఉండాలన్నా సరే.. దీనిని మించిన ప్రత్యామ్నాయం లేదు. చేస్తున్న పనిపట్ల శ్రద్ధ, ఏకాగ్రత అలవడుతుంది.

వూబకాయం ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. క్రమం తప్పకుండా చేయడం వల్ల ఉదర కండరాలు దృఢమవుతాయి. పొట్ట చుట్టూ పేరుకొన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. సూర్య కిరణాల ప్రభావంతో శరీరంలోని అధిక కెలొరీలు ఖర్చవుతాయి. కొవ్వు నిల్వలు కరిగిపోతాయి. వెన్నెముక దృఢమవుతుంది. జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. శరీరం తాజాదనాన్ని సంతరించుకున్న మార్పు ఇట్టే కనిపిస్తుంది.

నెలసరి సంబంధ సమస్యలతో బాధపడేవారు తరచూ వీటిని చేయడం మంచిది. అధ్యయనాల ప్రకారం.. యుక్తవయసు నుంచి సూర్యనమస్కారం చేయడం వల్ల భవిష్యత్‌లో ప్రసవ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను చాలామటుకు నివారించవచ్చు.

లేలేత, నులివెచ్చని సూర్యకిరణాలు ముఖాన్ని తాకితే చర్మానికి మేలు జరుగుతుంది. ముడతలు తొలగిపోతాయి.. వృద్ధాప్య చాయలు కనిపించవు. జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. చుండ్రు సమస్యను సైతం నివారించవచ్చు.

అయితే... వీటిని చేసేముందు.. వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.

17, మే 2011, మంగళవారం

వైయస్ జగన్‌ను ఎదుర్కోగలరా?

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోగలరా అనే అనుమానం కలుగుతోంది. వైయస్ జగన్ కాంగ్రెసుపైనా తెలుగుదేశం పైనా ప్రతీకారం తీర్చుకుని, తాను అధికారంలోకి రావడానికి ఎంత శ్రమకైనా ఓర్చుకునేందుకు సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. ప్రజల్లోకి వివిధ రూపాల్లో విస్తృతంగా వెళ్లడానికి ఆయన సిద్ధపడ్డారు. కడప ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన దాదాపు నెల రోజుల పాటు తెంపు లేకుండా తిరిగారు. తాను ఎలాగూ గెలుస్తాననే అతి విశ్వాసంతో గానీ ఇతర పార్టీల బలహీనత తనను గెలిపిస్తుందనే నమ్మకంతో గానీ నిర్లక్ష్యం చేయకుండా తిరిగారు.

ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన రైతు సమస్యలపై గుంటూరులో 48 గంటల పాటు దీక్షకు దిగారు. వైయస్ జగన్ తన దీక్ష విషయాన్ని ప్రకటించగానే చంద్రబాబు గుంటూరు జిల్లాలో రైతు సమస్యలపై పర్యటించారు. జగన్ దీక్ష ముందు అది పని చేసే పరిస్థితి లేదని అర్థమవుతోంది. శారీరక శక్తితో పాటు లక్ష్య సాధన పట్ల దీక్ష ఆయనను ముందుకు నడిపిస్తోంది. ఆ శక్తి అటు కిరణ్ కుమార్ రెడ్డికి గానీ ఇటు చంద్రబాబుకి గానీ ఉన్నట్లు లేదు. జగన్‌లాంటి పట్టుదల, వయస్సు గల నాయకుడు మాత్రమే అయనకు దీటు రాగలడని అనిపిస్తోంది.

గుంటూరు రైతు దీక్ష తర్వాత జగన్ విజయనగరం జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు. ప్రజల్లోకి వెళ్లే విషయంలో జగన్ ఎక్కడా విరామం ఇవ్వడం లేదు. అలా విరామం లేకండా చేపడుతున్న కార్యక్రమాల వల్ల కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కంగు తినే పరిస్థితే ఉంది. జగన్ ప్రాబల్యం క్రమక్రమంగా తగ్గుతుందనే నమ్మకంతో తెలుగుదేశం, కాంగ్రెసు నాయకులు ఉన్నట్లున్నారు. కానీ, ఆ ప్రాబల్యం, ఆదరణ తగ్గకుండా ఆయన కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు.

బాబాయ్ బాలయ్యను కాదని జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ వ్యూహం

బాబాయ్ బాలకృష్ణకు, అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య సంబంధాలు బెడిసికొట్టినట్లే భావిస్తున్నాయి. సోదరుడు నందమూరి హరికృష్ణ కూడా బాలయ్యకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెబుతున్నారు. బాలయ్యను పక్కన పెట్టి ఆయన తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌తో రాజకీయ వ్యూహ రచనకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వ పగ్గాలు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్‌కు దక్కకుండా అడ్డు పడడమే ప్రస్తుతం నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అనుసరిస్తున్న వ్యూహమని అంటున్నారు.

నారా చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించే స్థితిలో బాలకృష్ణ లేరనే విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ గుర్తించారు. గతంలో బాలకృష్ణ చేసిన ఓ వ్యాఖ్యపై కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఓ సినిమాలో బాలకృష్ణ అతిథి పాత్రలో కనిపించాల్సి ఉంది. అయితే, ఆ పాత్ర నుంచి బాలయ్యను తప్పించి హరికృష్ణ నటించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ వారసత్వ పోరులో నందమూరి కుటుంబ సభ్యులు రెండుగా చీలిపోయినట్లు సమాచారం. ఈ చీలికలో బాలకృష్ణ చంద్రబాబు వైపు ఉండగా, చంద్రబాబుపై పోరుకు జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ సిద్దపడినట్లు చెబుతున్నారు.

పాపం రెడ్డి గారి అబ్బాయి రైతు కోసం దీక్షలు

గతించిన రెడ్డి గారు ఇచ్చిన ఉచిత కరెంటుతో
కాయ కష్టం చేసుకొంటూ
సుఖంగా ఉన్నారు కదూ?
లేదు మీరు సుఖంగా లేరు
ఉంటే రెడ్డి గారు కొడుకు దీక్ష ల మీద దీక్ష లు చేసి
కడుపు మాడ్చుకొంటాడా?
మీ కోసం కేవలం మీ కోసం
రెడ్డి గారి శవం ఇల్లు చేరకముందు నుండే
స్వయంగా తనే రెడ్డిగారిలా
మీ మంచి చెడ్డలు చూసుకోవడం కోసం
కుర్చీ గురించి బెంగపడి సంతకాలు పెట్టిస్తే
అర్థం చేసుకోక అపార్థం చేసుకొని
అయ్యో నాన్న శవం రాకనే
పదవి కోసం పాకులాడెనే అనే ప్రచారం చేసారు.
పాపం రెడ్డి గారి అబ్బాయి అసుమంటోడంటే
నమ్మేస్తారా నమ్మకండి?
వాళ్ళ నాన్న జమానాలో కూడా మీ కష్టాలు చూడలేకే
తీరం వెంబడి ప్రభుత్వ ఆధ్వర్యాన స్వాధీనం చేసుకొంది.
లేదంటే మీరు సేద్యం సేద్యం అంటూ స్వేదం చిందిస్తారనే
సెజ్జులు పెద్ద పెద్ద స్టీలు ఫ్యాక్టరీలు అని అబద్దం చెప్పి
ప్రభుత్వ పరిహారాలు ఇప్పించి స్వాదీనాలు చేయించింది.
వారసత్వంగా రావాల్సి తప్పి పోయిన కుర్చీ మీద
కూర్చేబెట్టే వరకు తన బెట్టు వదలడు
మీ కోసం కేవలం మీసం రైతుగారు
వచ్చి పరామర్శించి పదవి వచ్చే లా చేయండి.

లబ లబ లాడుతారో ??

ఎప్పటి నుండో అట్టిపెట్టుకొన్న కానుక
ఫలితాలు ప్రకటించే వేళ
ప్రజలందరికీ సమర్పించారు.
అదే ‘చమురు ధరలు’
ఛీ ఛీ అనుకొంటారో
లబ లబ లాడుతారో
మీ ఇష్టం అంటూ
ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత
తమ తలకు చమురంటిన చందం మాత్రం
మీకు కోపం తెప్పించినా ఎవరూ ఏమీ చేయలేరు?
ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో చేతి నుండి పవరు పోయినా
కేంద్రంలో విశ్వాస పాత్రమైన దర్యాప్తు సంస్థలను
చెప్పు చేతల బట్టి
చెయ్యి ప్రధాన కుర్చీని పట్టి ఉంచుకొంటుంది.
ఊసురో మనే ప్రతిపక్షాలు ఉన్నంత కాలం
వాళ్ళు తమ కర్తవ్యమ్ చెయ్యలేదని విమర్శించే మన లాంటి వాళ్ళు
ఉన్నంత కాలం ఈ కాలం ఇలా చేతికి కలిసి పోతూ ఉంటుంది

15, మే 2011, ఆదివారం

చిరంజీవి కన్నా విజయ్‌కాంత్ బెట్టర్

చిరంజీవి ఆంధ్రదేశంలో మెగాస్టార్, విజయ్ కాంత్ తమిళంలో సూపర్ స్టార్. రాజకీయాల్లో ఇద్దరిదీ ఒకే పరిస్థితి. విజయ్‌కాంత్ ఐదేళ్ల క్రితం పార్టీ పెట్టి తానొక్కడే గెలిచాడు. మెగాస్టార్ మూడేళ్ల క్రితం పార్టీ పెట్టి శాసనసభలో 18 సీట్లు గెలుచుకున్నాడు. ఈ లెక్కన విజయ్‌కాంత్ కన్నా చిరంజీవి మెరుగ్గా కనిపిస్తారు. కానీ పార్టీని నిలబెట్టే విషయంలో, రాజకీయాలను ముందుకు నడిపిస్తూ తాను పుంజుకునే వ్యూహంలో విజయ్‌కాంత్‌నే గొప్పగా చెప్పాల్సి ఉంటుంది.

ఒక్క సీటు గెలిచినా ఏ మాత్రం నిరాశపడకుండా తన పార్టీ డిఎండికెను ముందుకు నడిపిస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో అన్నాడియంకెతో పొత్తు పెట్టుకుని 41 సీట్లకు పోటీ చేసి 29 సీట్లు గెలుచుకున్నాడు. చిరంజీవి మాత్రం పార్టీని నడిపించలేక కాంగ్రెసులో విలీనం చేయడానికి పూనుకున్నారు. ఈ విషయంలో విజయ్ కాంత్‌ను చిరంజీవి కన్నా బెట్టర్ అని చెప్పక తప్పదు. ప్రస్తుతం తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీల్లో ఓ ప్రాంతీయ పార్టీని దెబ్బ తీస్తే తన మనుగడ సాధ్యమని గ్రహించిన విజయ్ కాంత్ ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధ పడ్డారు. ప్రభుత్వంలో చేరాలని అన్నాడియంకె నేత జయలలిత ఆఫర్‌ను తోసిపుచ్చారు. కరుణానిధి నాయకత్వంలోని డిఎంకెకు కేవలం 23 సీట్లే దక్కడంతో విజయ్‌కాంత్‌కు ప్రతిపక్ష హోదా లభిస్తుంది. ఆ రకంగా పార్టీని బలోపేతం చేయడానికి వీలవుతతుందనేది విజయ్ కాంత్ అభిప్రాయం.

కడప ఉప ఎన్నికలు మాత్రం గట్టి దెబ్బ వేశాయి.

జాతీయ కాంగ్రెసు పార్టీకి ఐదు రాష్ట్రాల ఎన్నికలు సంతృప్తి మిగిల్చినప్పటికీ కడప ఉప ఎన్నికలు మాత్రం గట్టి దెబ్బ వేశాయి. ఎన్నికలు పూర్తయి ఫలితాలు రావడంతో కాంగ్రెసు ఇక రాష్ట్ర కాంగ్రెసు ప్రక్షాళనపై అధిష్ఠానం దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు గులాం నబీ ఆజాద్‌ సోమవారం హైదరాబాద్‌ రానున్నారు. రెండు రోజులు ఇక్కడే ఉండనున్నారు. కడప ఉప ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయాన్ని అగ్ర నాయకత్వం తీవ్రంగానే పరిగణిస్తోంది. ఫలితాలపై పోస్టుమార్టం నిర్వహించడంతోపాటు రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని మెరుగుపరచుకోవడం అత్యవసరంగా భావిస్తోంది. ముఖ్యమంత్రి- కొందరు మంత్రుల మధ్య స్పర్థలున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో పరిస్థితిని గాడిన పెట్టాల్సిన అవసరాన్ని గుర్తించింది. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య సమన్వయం కరవై కిందిస్థాయి శ్రేణులు అయోమయంలో ఉన్న తరుణంలో ఆజాద్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకొంది.

రెండ్రోజుల పాటు ఇక్కడే ఉండి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యడితోపాటు పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో ఆయన వేర్వేరుగా సమావేశం కానున్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం బాధ్యతలు కూడా చూస్తూ వచ్చిన ఆజాద్‌ అక్కడి ఎన్నికలపై దృష్టిపెట్టి ఇన్ని రోజులూ ఆంధ్రప్రదేశ్‌ గురించి పట్టించుకోలేదు. మార్చి 25న ఢిల్లీలో తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలతో విడివిడిగా సమావేశం కావడం తప్ప ఎలాంటి పార్టీ కార్యక్రమాన్నీ చేపట్టలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఆయన ముందు ప్రధానంగా నాలుగు సవాళ్లున్నాయి. అందులో మొదటిది తమ వర్గంలో చాలా మంది ఎమ్మెల్యేలున్నట్లు జగన్ వెంట వెళుతున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితి ఏమిటి, ఎవరు పార్టీతో ఉంటారు, ఎవరు వ్యతిరేకంగా వెళతారు, అన్న విషయాలపై ఆయన దృష్టి సారించున్నారు. నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉపసభాపతికి సీఎల్పీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇతర ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటన్నది ఆజాద్‌ చర్చించనున్నట్లు తెలిసింది.

ఆ వివరాలను ఆయన అధిష్ఠానం దృష్టికి తీసుకువెళతారని, అక్కడ చర్చించాక తదుపరి చర్యలుంటాయని సమాచారం. ముఖ్యమంత్రిని క్రియాశీలం చేయడం
వైయస్ మరణానంతరం పార్టీలో ఏర్పడిన నాయకత్వ లోటును పూడ్చడానికి కాంగ్రెసు అధిష్ఠానం బలమైన సామాజికవర్గానికి చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినా ఆయన పార్టీలో ధైర్యం నింపే చొరవ చూపలేకపోతున్నారన్న విమర్శ ఉంది. పార్టీ నాయకులెవ్వరితో ఆయన కలవలేకపోతున్నారని, ఎవరినీ విశ్వాసంలోకి తీసుకోవడం లేదనే భావన ఎంపీల్లో ఉంది. పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించే అంశాలు తలెత్తినప్పుడు బహిరంగంగా ధైర్యంగా మాట్లాడే చొరవ చూపలేకపోతున్నారని చెబుతున్నారు. కడప ఉప ఎన్నిక సమయంలో ప్రదర్శించిన వైఖరి ఆయనలోని నాయకత్వ లోపాన్ని ఎత్తిచూపిందంటున్నారు.

ఉప ఎన్నికల అనంతరం ఢిల్లీకొచ్చిన డిఎల్ రవీంద్రారెడ్డి అధిష్ఠానం వద్ద ముఖ్యమంతి శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆజాద్‌ తొలుత ముఖ్యమంత్రి వ్యవహార శైలిలో మార్పు తీసుకురావాల్సి ఉందని ఎంపీలంటున్నారు. ఈ నెల్లోనే పీసీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతున్నందున దానిపై చర్చ జరుగుతుంది. రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన డి.శ్రీనివాస్‌ ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన కొనసాగుతున్నారు. తన రాజకీయ భవిష్యత్తు ఏమిటో తెలియని గందరగోళంలో ఆయన ఉన్నారని, అలాంటి వ్యక్తి పార్టీని ఏం నడుపుతారని సీనియర్‌ నాయకుడు ఒకరు ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా తిరిగి పార్టీశ్రేణులను ఉత్సాహపరచాల్సిన పరిస్థితుల్లో ఆయన హైదరాబాద్‌ వదిలిపెట్టిపోవడం లేదని, కడప ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రితో సహా నాయకులంతా తిరిగినా డీఎస్‌ మాత్రం అటువైపు కన్నెత్తి చూడలేదని ఉదహరిస్తున్నారు.

డిఎస్‌ వ్యవహారశైలి నచ్చని తెలంగాణ ఎంపీలంతా మల్కాజ్‌గిరి ఎంపీ సర్వేసత్యనారాయణ పేరును ఆ పదవికి ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అంశం కాంగ్రెసుకు ప్రధాన అడ్డంకిగా మారిన ఈ అంశంపై ఏదో ఒకటి త్వరగా తేల్చేయాలని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అధిష్ఠానం మనసులో మాటేంటో కచ్చితంగా చెబితే దానికనుగుణంగా నడుచుకోవడానికి వీలవుతుందని పేర్కొంటున్నారు. సోనియాతో భేటీ ఆజాద్‌ శనివారం ఉదయం 10-జన్‌పథ్‌లో సోనియాగాంధీని కలిసి రాష్ట్ర పర్యటనపై చర్చించారు. హైదరాబాద్‌ పర్యటనలో కచ్చితంగా తెలంగాణ అంశం తెరమీదికి వచ్చే అవకాశం ఉన్నందున దానిపై ఏం చెప్పాలన్నదానిపై కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.పార్టీ బలోపేతంలో భాగంగా జిల్లాల అధ్యక్షుల ఎంపిక తదితర అంశాల గురించి క్షేత్రస్థాయి సమాచారాన్ని ఆజాద్‌ సమీక్షించనున్నారు.జాతీయ కాంగ్రెసు పార్టీకి ఐదు రాష్ట్రాల ఎన్నికలు సంతృప్తి మిగిల్చినప్పటికీ కడప ఉప ఎన్నికలు మాత్రం గట్టి దెబ్బ వేశాయి. ఎన్నికలు పూర్తయి ఫలితాలు రావడంతో కాంగ్రెసు ఇక రాష్ట్ర కాంగ్రెసు ప్రక్షాళనపై అధిష్ఠానం దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు గులాం నబీ ఆజాద్‌ సోమవారం హైదరాబాద్‌ రానున్నారు. రెండు రోజులు ఇక్కడే ఉండనున్నారు. కడప ఉప ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయాన్ని అగ్ర నాయకత్వం తీవ్రంగానే పరిగణిస్తోంది. ఫలితాలపై పోస్టుమార్టం నిర్వహించడంతోపాటు రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని మెరుగుపరచుకోవడం అత్యవసరంగా భావిస్తోంది. ముఖ్యమంత్రి- కొందరు మంత్రుల మధ్య స్పర్థలున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో పరిస్థితిని గాడిన పెట్టాల్సిన అవసరాన్ని గుర్తించింది. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య సమన్వయం కరవై కిందిస్థాయి శ్రేణులు అయోమయంలో ఉన్న తరుణంలో ఆజాద్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకొంది.

రెండ్రోజుల పాటు ఇక్కడే ఉండి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యడితోపాటు పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో ఆయన వేర్వేరుగా సమావేశం కానున్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం బాధ్యతలు కూడా చూస్తూ వచ్చిన ఆజాద్‌ అక్కడి ఎన్నికలపై దృష్టిపెట్టి ఇన్ని రోజులూ ఆంధ్రప్రదేశ్‌ గురించి పట్టించుకోలేదు. మార్చి 25న ఢిల్లీలో తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలతో విడివిడిగా సమావేశం కావడం తప్ప ఎలాంటి పార్టీ కార్యక్రమాన్నీ చేపట్టలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఆయన ముందు ప్రధానంగా నాలుగు సవాళ్లున్నాయి. అందులో మొదటిది తమ వర్గంలో చాలా మంది ఎమ్మెల్యేలున్నట్లు జగన్ వెంట వెళుతున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితి ఏమిటి, ఎవరు పార్టీతో ఉంటారు, ఎవరు వ్యతిరేకంగా వెళతారు, అన్న విషయాలపై ఆయన దృష్టి సారించున్నారు. నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉపసభాపతికి సీఎల్పీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇతర ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటన్నది ఆజాద్‌ చర్చించనున్నట్లు తెలిసింది.

ఆ వివరాలను ఆయన అధిష్ఠానం దృష్టికి తీసుకువెళతారని, అక్కడ చర్చించాక తదుపరి చర్యలుంటాయని సమాచారం. ముఖ్యమంత్రిని క్రియాశీలం చేయడం
వైయస్ మరణానంతరం పార్టీలో ఏర్పడిన నాయకత్వ లోటును పూడ్చడానికి కాంగ్రెసు అధిష్ఠానం బలమైన సామాజికవర్గానికి చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినా ఆయన పార్టీలో ధైర్యం నింపే చొరవ చూపలేకపోతున్నారన్న విమర్శ ఉంది. పార్టీ నాయకులెవ్వరితో ఆయన కలవలేకపోతున్నారని, ఎవరినీ విశ్వాసంలోకి తీసుకోవడం లేదనే భావన ఎంపీల్లో ఉంది. పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించే అంశాలు తలెత్తినప్పుడు బహిరంగంగా ధైర్యంగా మాట్లాడే చొరవ చూపలేకపోతున్నారని చెబుతున్నారు. కడప ఉప ఎన్నిక సమయంలో ప్రదర్శించిన వైఖరి ఆయనలోని నాయకత్వ లోపాన్ని ఎత్తిచూపిందంటున్నారు.

ఉప ఎన్నికల అనంతరం ఢిల్లీకొచ్చిన డిఎల్ రవీంద్రారెడ్డి అధిష్ఠానం వద్ద ముఖ్యమంతి శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆజాద్‌ తొలుత ముఖ్యమంత్రి వ్యవహార శైలిలో మార్పు తీసుకురావాల్సి ఉందని ఎంపీలంటున్నారు. ఈ నెల్లోనే పీసీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతున్నందున దానిపై చర్చ జరుగుతుంది. రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన డి.శ్రీనివాస్‌ ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన కొనసాగుతున్నారు. తన రాజకీయ భవిష్యత్తు ఏమిటో తెలియని గందరగోళంలో ఆయన ఉన్నారని, అలాంటి వ్యక్తి పార్టీని ఏం నడుపుతారని సీనియర్‌ నాయకుడు ఒకరు ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా తిరిగి పార్టీశ్రేణులను ఉత్సాహపరచాల్సిన పరిస్థితుల్లో ఆయన హైదరాబాద్‌ వదిలిపెట్టిపోవడం లేదని, కడప ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రితో సహా నాయకులంతా తిరిగినా డీఎస్‌ మాత్రం అటువైపు కన్నెత్తి చూడలేదని ఉదహరిస్తున్నారు.

డిఎస్‌ వ్యవహారశైలి నచ్చని తెలంగాణ ఎంపీలంతా మల్కాజ్‌గిరి ఎంపీ సర్వేసత్యనారాయణ పేరును ఆ పదవికి ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అంశం కాంగ్రెసుకు ప్రధాన అడ్డంకిగా మారిన ఈ అంశంపై ఏదో ఒకటి త్వరగా తేల్చేయాలని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అధిష్ఠానం మనసులో మాటేంటో కచ్చితంగా చెబితే దానికనుగుణంగా నడుచుకోవడానికి వీలవుతుందని పేర్కొంటున్నారు. సోనియాతో భేటీ ఆజాద్‌ శనివారం ఉదయం 10-జన్‌పథ్‌లో సోనియాగాంధీని కలిసి రాష్ట్ర పర్యటనపై చర్చించారు. హైదరాబాద్‌ పర్యటనలో కచ్చితంగా తెలంగాణ అంశం తెరమీదికి వచ్చే అవకాశం ఉన్నందున దానిపై ఏం చెప్పాలన్నదానిపై కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.పార్టీ బలోపేతంలో భాగంగా జిల్లాల అధ్యక్షుల ఎంపిక తదితర అంశాల గురించి క్షేత్రస్థాయి సమాచారాన్ని ఆజాద్‌ సమీక్షించనున్నారు.

13, మే 2011, శుక్రవారం

కడప కింగ్ ఆవినీతి గెలిచింది

కడప లోకసభ, పులివెందుల శాసనసభ ఉప ఎన్నికల ఫలితాలు పలు ప్రశ్నలను ముందుకు తెస్తున్నాయి. ఉప ఎన్నికలు వైయస్ జగన్ చెప్పినట్లు రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులకు నాంది పలుకుతాయా అనే ప్రశ్న అత్యంత ప్రధానంగా ముందుకు వస్తుంది. భారీ మెజారిటీతో వైయస్ జగన్, వైయస్ విజయమ్మ విజయం ఏ విధమైన సంకేతాలను అందిస్తోందనేది ప్రధానాంశం. సాధారమైన మెజారిటీతో వీరిద్దరు గెలిచి ఉంటే ఈ ప్రశ్నలకు అవకాశం ఉండేది కాదు. సెంటిమెంటు వల్ల విజయం సాధించారని చెప్పి తప్పించుకోవడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది.

వైయస్సార్‌కు లభించిన దాని కన్నా ఎక్కువ మెజారిటీ విజయమ్మకు, జగన్‌కు లభించింది. వైయస్సార్ మరణం వల్ల పెల్లుబుకిన సానుభూతి ఎన్నికల్లో ఏదో మేరకు పని చేసిందని అంగీకరించక తప్పదు. కానీ, అంతకు మించిన సంకేతాన్ని ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఇచ్చాయని అంటున్నారు. వైయస్సార్ రాజకీయ వారసత్వాన్ని వైయస్ జగన్‌కు కట్టబెట్టడానికి ప్రజలు సిద్ధమయ్యారనే విషయాన్ని కూడా చెప్పినట్లు విశ్లేషిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసులో ఉండడం వల్లనే సంక్షేమ పథకాలను అమలు చేశారని, అవన్నీ కాంగ్రెసు పథకాలేనని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని కూడా అర్థమవుతోంది. కాంగ్రెసులో ఉన్నప్పటికీ ఆ పథకాలను రాజశేఖర రెడ్డి కాబట్టే అమలు చేశారని, మరో ముఖ్యమంత్రి అయితే అమలు చేసి ఉండేవారు కారని ప్రజలు భావిస్తున్నట్లు చెప్పవచ్చు.

జనాదరణ లేని నాయకులను ముఖ్యమంత్రులుగా నిలబెట్టే కాంగ్రెసు అధిష్టానం వైఖరిపై నిరసనగా కూడా ఫలితాలను చూస్తున్నారు. పైగా, ఓ కొడుకును, ఓ తల్లిని ఒంటరి చేసి ఓడించాలని ప్రయత్నాలు చేస్తున్నారని వైయస్ జగన్ తన ప్రచారంలో చెప్పిన మాట బాగానే పని చేసిందని కూడా అంటున్నారు. అలాగే, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తనను ఓడించడానికి కుమ్మక్కయ్యాయని జగన్ వర్గం చేసిన విమర్శ కూడా ప్రజల్లోకి వెళ్లిందని చెబుతున్నారు. వైయస్ జగన్ అవినీతిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదనే చెప్పవచ్చు. అలాగే, వైయస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించిన కాంగ్రెసు నాయకులను కూడా ప్రజలు తిప్పి కొట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో వ్యక్తమైన ప్రజాభిప్రాయమే వ్యక్తం కావచ్చుననే ఆందోళన కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను తీవ్ర మథనానికి గురి చేసే అవకాశాలున్నాయి. ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా చూపడానికి జగన్ వర్గం వెనకాడదనేది నిజం. ఏమైనా, వైయస్ జగన్‌కు ఉప ఎన్నికల ఫలితాలు ఎనలేని మనో ధైర్యాన్నిచ్చాయని చెప్పక తప్పదు.

నేనంటే నాకెంతో ఇష్టం

చెక్కిలి మీంచి జారి పడే నీ కన్నీటి చుక్కలని
నేల బడకుండా నా దోసిలి పట్టి
అందులో నేను నీకు చూపించే
ముడుచుకున్న నీ ప్రతిబింబం లొ
నువ్వు మరిచిపోయిన
చిరునవ్వు ఆనవాలు లేదని చెప్పి
నవ్వుల పువ్వులు నీ మోముపైన
పూయించిన ప్రతి సారీ...

నేనంటే నాకెంతో ఇష్టం
నీ కష్టం లొ నేనున్నందుకు
ఆ దోసిలి నాదైనందుకు..

తల్లి కొడుకు ఈ రోజుల్లొ ఎంత వరుకు ??

నవ మాసాలూ మోసి
నలుగు పెట్టి స్నానం చేయించి
నాలుగు ముద్దలు పెట్టి
నడక నేర్పించి బడికి పంపి
నచ్చిన పిల్లకిచ్చి పెళ్లి చేసి
నా బంగారు కొండ అని మురిసిన తల్లికి
నడుం పడిపోయి మంచం పట్టగా
చూసుకోడానికి రావాల్సిన కొడుకు - కనపడుట లేదు
చివరగా కట్టుకున్న పెళ్ళాం కౌగిలిలో
కళ్ళు మూసుకుని వుండగా చూసిన గురుతు

ఇప్పుడు నిద్ర కావాలన్నాపట్టట్లేదు

నీ కమ్మని ఒడిలో
నా కన్నుల కిటికీలు మూసి
కరిగిపోవాలని ఉంది ..
సాయంకాలం సూర్యున్ని పంపేసి
వెలుతురుని వెళ్ళ గొట్టేసి
మిణుగురులని కూడా తరిమేసి
మబ్బుల్లాంటి మెత్తటి పరుపు మీద
చక్కటి దుప్పటి కప్పుకుని
దిండు మీద తల పెట్టి
నా గుండె సడి వినపడే నిశ్శబ్దంలో
నీ రాక కొరకు వేచి వున్న నాకు
నీ దర్శన భాగ్యం కలగదేమి?
వయసులో వున్నప్పుడు
నిన్ను నిర్లక్ష్యం చేసానని
నా మీద కక్ష కట్టావా?
నన్ను మన్నించు
నీ కౌగిట కరిగించు

ఇది ఎందుకంటే:
రాత్రంతా మెలకువగా ఉండే అలవాటు నాకు..
చిన్నప్పుడు అమ్మ పదే పదే పడుకోమని చెప్పినా పట్టించుకునే వాడిని కాదు..
ఇప్పుడు నిద్ర కావాలన్నాపట్టట్లేదు
"అందుకే చిన్నప్పటి నించి తొందరగా నిద్ర పోరా అని చెప్పా" అని అమ్మ అంటుంటే
ఇలా నిద్రా దేవికి విన్నపం రాసాను..

నిరాశతో అందరినీ నిందిచాలనుకున్నాను

నా చుట్టూ పరుచుకున్న చీకటిలో
కళ్ళు నులుముకుని కర్తైన్ తీసి చూస్తే


చందమామ వెన్నెల చల్లుతున్నాడు
మంచు పూలతో తడిసిన నేల
తెల్లని తివాచి లా వెలిగిపోతుంది
మబ్బులు మేమేం తక్కువ తిన్నామా అని
వెన్నెలకి తమ దూది మేనులతో మెరుపులు దిద్దాయి
మినుకు మినుకు మంటూ మధ్యలో చుక్కలు
మెరిసి మెరిసి మాయమవుతున్నాయి


ఎంత పిచ్చి వాడిని నేను
కళ్ళు మూసుకుని లోకమంతా
చీకటిలో వుందని చింతిస్తున్నాను
కళ్ళు వుండీ లాభంలేదని
నిరాశతో అందరినీ నిందిచాలనుకున్నాను

రెప్పలు తీసే ప్రయత్నం
కిటికే చేరే పయనం
కర్తైన్ తీసే ధైర్యం చేస్తే..

నా కోసం లోకంలో చీకటిని తరిమేయ్యడానికి
నా నేస్తాలు చేసిన సాయం కనిపించింది
లోకం బావుంది నలువైపులా
నన్ను అలుముకున్న సంతోషంలా

పొద్దున్నే మూడున్నరకి కిటికీ CURTAIN తెరిస్తే కనిపించిన దృశ్యం స్ఫూర్తిగా....

12, మే 2011, గురువారం

చిరంజీవి ఇప్పుడు గిలగిలా తన్నుకుంటున్నట్లే

ఏరు దాటాక తెప్పను తగిలేయడం కాంగ్రెసు సంస్కృతి అనే మాట మరోసారి రుజవు అవుతోంది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మాటలకు బోల్తా పడిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఇప్పుడు గిలగిలా తన్నుకుంటున్నట్లే ఉన్నారు. పిలిచి సింహాసనం ఇస్తామని చెప్పిన సోనియా గాంధీ ఇప్పుడు చిరంజీవికి మొండిచేయి చూపుతున్నట్లే ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెసులో నెంబర్ వన్‌గా నిలబడాలని అనుకున్న చిరంజీవి ఆశలకు ఆదిలో కాంగ్రెసు అధిష్టానం గండి కొడుతోంది. విలీన సభను అట్టహాసంగా నిర్వహించి తన సత్తాను సోనియా గాంధీకో, రాహుల్ గాంధీకో చూపాలని ఆయన కలలు కంటూ వస్తున్నారు. ఆ కలలను కాంగ్రెసు అధిష్టానం చిదిమేసేదుకు ఏ మాత్రం వెనకాడడం లేదు.

కాంగ్రెసు చేతికి చిక్కిన చిరంజీవి ఇప్పుడు ఎటూ పోలేని పరిస్థితిలో చిక్కుకున్నారు. ఒడ్డున పడిన చేపలా విలవిలలాడుతున్నారు. గతంలో అడక ముందే అపాయింట్‌మెంట్ ఇచ్చిన సోనియా ఇప్పుడు అడిగినా ఇవ్వడం లేదు. విలీన సభకు రాహుల్ గానీ, సోనియా గానీ రారని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ చిరంజీవికి మొహమాటం లేకుండా చెప్పేశారని అంటున్నారు. అంతేకాదు, భారీగా విలీన సభను జరపాల్సిన అవసరం లేదని, తమ పార్టీ కార్యాలయంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి తీసుకుంటామని కూడా ఆయన చెప్పారట. దీంతో కంగు తినడం చిరంజీవి వంతైంది. వెనక్కి రాలేక ముందుకు పోలేక చిరంజీవి గిజగిజలాడుతున్నట్లే చెప్పాలి.

చిరంజీవికి రాష్ట్రంలో అంత సీన్ లేదని, అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని కాంగ్రెసు నాయకులెవరో సోనియాకు పూస గుచ్చినట్లు చెప్పారని సమాచారం. అంతేకాదు, చిరంజీవిని ప్రోత్సహిస్తే ఓ వర్గాన్ని మాత్రమే ప్రోత్సహిస్తున్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని, దాని వల్ల బలమైన సామాజిక వర్గం ఒకటి దూరమయ్యే ప్రమాదం ఉందని సోనియాకు చెప్పారని సమాచారం. కమ్మ సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి మధ్య విభేదాలను, వైరాలను చిరంజీవిని దెబ్బ తీయడానికి వాడుకున్నట్లు చెబుతున్నారు. దానికి తోడు, రెడ్లు లేకుండా కాంగ్రెసు మనుగడ సాగించడం కూడా కష్టమని చెప్పారని తెలుస్తోంది. చిరంజీవిని ఎక్కువగా ఆదరిస్తే రెడ్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్ వైపు చూసే అవకాశం ఉందని కూడా చెప్పారని అంటారు. ఏమైనా, కాంగ్రెసులో ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు ఎవరు పైకొస్తారో, పాతాళానికి దిగజారుతారో చెప్పడం సాధ్యం కాదని మరోసారి రుజువు అయిందని చెప్పవచ్చు

ఫేస్‌బుక్‌ వినియోగదార్ల ఖాతా వివరాలన్నీ మూడో వర్గానికి(థర్డ్‌ పార్టీ)??@@!!##

మీకు ఫేస్‌బుక్‌లో ఖాతా ఉందా.. అయితే కొంచెం జాగ్రత్త. వందల వేలకొద్దీ ఫేస్‌బుక్‌ వినియోగదార్ల ఖాతా వివరాలన్నీ మూడో వర్గానికి(థర్డ్‌ పార్టీ) ముఖ్యంగా వ్యాపార ప్రకటనల వారికి లీకవుతున్నట్లు డేటా సెక్యూరిటీ సొల్యూషన్ల సంస్థ సిమాంటెక్‌ వెల్లడించింది. కొన్నేళ్లుగా ఇలా జరుగుతోందని ఆ సంస్థ తన అధికారిక బ్లాగులో పేర్కొంది. ఫేస్‌బుక్‌ ఖాతాదారుల 'యాక్సెస్‌ టోకెన్లు' లీక్‌ కావడంతో ప్రకటనదార్లు ఆయా ఖాతాల్లోని ప్రొఫైల్స్‌, ఫొటోలు, చాటింగ్‌ వివరాలను వారు పొందడమే కాకుండా ఆయా ఖాతాల్లోకి సందేశాలను పంపడమూ చేస్తున్నారని వివరించింది. యాక్సెస్‌ టోకెన్లనేవి అదనంగా ఇచ్చే తాళం చెవుల లాంటివి.

వీటి ద్వారా ఖాతాదారు బదులు వేరెవరైనా ఖాతాను యాక్సెస్‌ చేసుకోవచ్చు. కేవలం గత నెలలోనే 1,00,000 అప్లికేషన్లు లీకేజీ పాలయ్యాయని సిమాంటెక్‌ అంచనా. కొన్నేళ్లుగా చూస్తే లక్షల కొద్దీ టోకెన్లు వారిబారినపడి ఉండొచ్చని ఆ సంస్థ తన బ్లాగులో తెలిపింది. ఫేస్‌బుక్‌ సంస్థకు ఈ విషయాన్ని తెలిపామనీ.. లీకేజీ గురించి ఆ సంస్థ సైతం అంగీకరించిందని.. అందుకు తగ్గ చర్యలు తీసుకోనున్నట్లు కూడా తమకు వివరించిందని అందులో పేర్కొంది

తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశాo

ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశానికి గురువారం ఎంపీ, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బావమరిది హరికృష్ణ, తెలంగాణ అంశంపై పార్టీపై తిరుగుబాటు చేస్తున్న సీనియర్ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి హాజరు కావడం పలువురుని విస్మయానికి గురి చేసింది. గత కొంతకాలంగా హరికృష్ణ - చంద్రబాబు మధ్య వారసత్వ పోరు నడుస్తున్నట్టుగా వాదనలు వస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు తర్వాత టిడిపి వారసుడిగా నందమూరి వంశమే ఉండాలనిచూస్తున్న హరికృష్ణ, చంద్రబాబు తనయుడు లోకేష్ రాజకీయాల్లో ప్రత్యక్ష పాత్ర పోషించడం జీర్ణించుకోలేక పోతున్నారనేది వార్తల సారాంశం. బాబు తర్వాత నారా వంశానికి చెక్ పెట్టేందుకు హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్‌ను తెరపైకి తెచ్చారు. అనంతరం ఇరు కుటుంబాల మధ్య ఎక్కడా ప్రత్యక్షంగా గొడవలు జరగనప్పటికీ పరోక్షంగా మాత్రం ఓ చిన్నపాటి యుద్ధమే జరిగింది. అది నిజమేనన్నట్లు పెళ్లి సంబంధాన్ని సెట్ చేసిన చంద్రబాబే జూ.ఎన్టీఆర్ పెళ్లిలో ముక్తసరిగా కనిపించడం వారి మధ్య వారసత్వ పోరు నడుస్తున్నదనే విషయాన్ని చెప్పకనే చెప్పాయి.

ఇక నాగం జనార్ధన్ రెడ్డి కూడా గత కొన్నాళ్లుగా పార్టీలో ఉంటూనే కాలికి ముల్లులా తయారయ్యాడు. తెలంగాణకు అనుకూలంగా పార్టీలు నిర్ణయం తీసుకోకుంటే మనుగడ సాగించలేవని టిడిపిలో ఉంటూనే విమర్శలు చేశారు. అధినేత చంద్రబాబుపై కూడా పరోక్షంగా ఘాటుగానే విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో నాగం, హరికృష్ణలు పార్టీ సమావేశానికి రారని అందరూ భావించారు. కానీ వారిద్దరూ సమావేశాలకు రావడం అందరికీ విస్మయం కలిగించింది. అయితే సమావేశంలో, తర్వాత వారు ఏమి మాట్లాడుతారో అనే దానిపై ఇప్పుడు అందరూ ఉత్కంఠగా ఉన్నారు.

ఇళయరాజా, మోహన్ బాబు సంయుక్తంగా సంగీత విశ్వ విద్యాలయాన్ని నెలకొల్పటానికి సంకల్పించుకున్నారు.

మాస్ట్రో ఇళయరాజా తన అద్వితీయమైన సంగీత జ్ఞానంతో అజరామరమైన పాటలను రూపొందించి సంగీత ప్రియులను మైమరపించారు. ఇప్పుడు ఆ స్వరబ్రహ్మ తన జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ రేపటితరం సంగీత కళాకారులను తయారు చేసే పనికి పూనుకున్నారు. ఈ ప్రయత్నానికి ప్రముఖ నటుడు, నిర్మాత పద్మశ్రీ డా. మోహన్ బాబు చేయూతనందించనున్నారు.

ఇళయరాజా, మోహన్ బాబు సంయుక్తంగా సంగీత విశ్వ విద్యాలయాన్ని నెలకొల్పటానికి సంకల్పించుకున్నారు. వారిరువురు సోమవారం రాత్రి తిరుమలలో వెంకటేశ్వర స్వామి సన్నిదిలో ఈ విషయాన్నీ విలేకరులకు తెలియజేసారు. మోహన్ బాబు మాట్లాడుతూ ప్రపంచంలోనే ఇంతవరుకు సంగీత విశ్వ విద్యాలయం లేదు, తిరుపతిలో తాను ఏర్పాటు చేసిన శ్రీ విద్యానికేతన్ ప్రాంగణంలోనే ఈ సంగీత యునివర్సిటీ స్థాపన జరుగుతుందని అన్నారు. ఈ అంశానికి సంబందించిన పూర్తివివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

ఎన్నికల తర్వాత భారీ మార్పులు???

కడప ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు వస్తాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అంటూ వచ్చారు. ఉప ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు, వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ, పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి ఊదరగొడుతూ వస్తున్నారు. కడప లోకసభ స్థానంలో వైయస్ జగన్, పులివెందుల శాసనసభా స్థానంలో వైయస్ విజయమ్మ విజయం ఖాయమని కాంగ్రెసు పార్టీ నాయకులు కూడా ఓ నిర్ధారణకు వచ్చినట్లే కనిపిస్తోంది. అందువల్ల ఇప్పుడు ఫలితాలపై పెద్దగా ఉత్కంఠ లేదు. జగన్‌కు లభించే మెజారిటీపై, తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల్లో ఏది రెండో స్థానంలో నిలుస్తుందనేది విషయంపై మాత్రమే ఆసక్తి ఉంది.

జగన్ భారీ మెజారిటీతో విజయం సాధించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, ఈ ఉప ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలుస్తాయని గ్యారంటీగా చెప్పలేం. జగన్ వెంట వెళ్తున్న నలుగురు శాసనసభ్యులకు మాత్రమే కాంగ్రెసు ఇప్పటి వరకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వాటికి ఆ శాసనసభ్యులు వివరణలు కూడా ఇచ్చారు. కానీ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవడం లేదు. జగన్ వెంట దాదాపు 23 మంది కాంగ్రెసు శాసనసభ్యులు వెళ్తున్నారు. వారందరిపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెసు అధిష్టానం సిద్ధంగా లేదు. అదే సమయంలో కాంగ్రెసును పూర్తిగా కాదని వెళ్తారా అనేది సందేహమే.

కాగా, ఉప ఎన్నికల ఫలితాలు జగన్‌కు కొత్త ఊపునిచ్చే అవకాశాలున్నాయి. అయితే, జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యులు ఉప ఎన్నికల తర్వాత రాజీనామాలకు సిద్ధపడతారనే వార్త గత కొద్ది రోజులుగా వస్తోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా అదే మాట చెప్పారు. అయితే, వ్యూహాన్ని జగన్ ఆహ్వానిస్తారా, లేదా అనేది సందేహమే. షోకాజ్ నోటీసులు జారీ చేసిన నలుగురు శాసనసభ్యులపై చర్యలు తీసుకుని, మిగతావారిపై కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకుంటే మాత్రమే ఆ పరిస్థితి ఉత్పన్నం కావచ్చు. అందుకు కాంగ్రెసు అధిష్టానం ముందుకు వస్తుందా అనేది సందేహమే.

రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తి కాలం కొనసాగించడానికే ప్రయత్నాలు జరిగే అవకాశాలున్నాయి. అయితే, తెలంగాణ అంశం కిరణ్ కుమార్ రెడ్డి పదవికి ఎసరు పెట్టే అవకాశాలున్నట్లు వైయస్ జగన్ వర్గం భావిస్తోంది. అయితే, తెలంగాణ శాసనసభ్యులు అంత దూరం పోతారని అనుకోవడానికి కూడా ఏమీ లేదు. పైగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వచ్చే శాసనసభ, పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కోవడానికి మాత్రమే సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోంది. ఆయన సత్వరం తెలంగాణ అంశంపై తేల్చుకోవడానికి ఏమీ తొందర పడడం లేదని అంటున్నారు. ఈ స్థితిలో కడప ఉప ఎన్నికల తర్వాత భారీ మార్పులు సంభవిస్తాయనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేం. అయితే, రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా సాధ్యమే.

ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశం??

తన బావ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై రాజ్యసభ సభ్యుడు, స్వర్గీయ ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి హరికృష్ణకు కోపం చల్లారలేదని అంటున్నారు. అధికార మార్పిడి సందర్బంగా తన తండ్రి స్వర్గీయ ఎన్టీ రామారావుకు, ఆ తర్వాత తనకు జరిగిన అవమానం పట్ల ఆయన రగిలిపోతూనే ఉన్నారట. లక్ష్మీపార్వతిపై తమకు ఉన్న వ్యతిరేకతను చంద్రబాబు వాడుకుని తన తండ్రిని పదవీచ్యుతుడ్ని చేశాడని, అందుకు తమను వాడుకుని ఆ తర్వాత తమను కూడా వదిలేశారని ఆయన భావిస్తున్నారని సమాచారం. అందుకు తగిన ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతోనే హరికృష్ణ ఉన్నారని అంటున్నారు. పైగా, నందమూరి కుటుంబానికి చెందిన తెలుగుదేశం పార్టీని తమకు కాకుండా చేసేందుకు మరో పథకాన్ని చంద్రబాబు రచించడం కూడా ఆయనకు నచ్చడం లేదు.

నందమూరి కుటుంబ సభ్యులకు చంద్రబాబు తగిన ప్రాధాన్యం ఇవ్వడానికి సిద్ధంగా లేరని, పార్టీని తన కుమారుడు నారా లోకేష్ చేతిలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని గ్రహించిన హరికృష్ణ పార్టీని సొంతం చేసుకుని, స్వర్గీయ ఎన్టీఆర్ వారసులుగా రాజకీయాల్లో నిలబడాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకు తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌ను ముందు పెట్టేందుకు ఆయన సిద్ధపడ్డారని చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ తాత లక్షణాలను పుణికిపుచ్చుకోవడం అందుకు కలిసి వస్తుందని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

ఎన్టీ రామారావుపైకి వైస్రాయ్ హోటల్ వద్ద చంద్రబాబు మనుషులు చెప్పులు విసరడాన్ని హరికృష్ణ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. అదే సమయంలో తనకు, తన మరో బావ దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు అధికార మార్పిడి తర్వాత పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ప్రధానమైన పాత్ర లభిస్తుందని హరికృష్ణ ఆశించారు. ఆ మేరకు చంద్రబాబు హామీ కూడా ఇచ్చారని అంటున్నారు. అయితే, అధికారం తన చేతికి రాగానే చంద్రబాబు వారిద్దరని పక్కన పెట్టేశారు. దాంతో అసంతృప్తికి గురైన వారిద్దరు బయటకు వచ్చారు. దగ్గుబాటి వెంకటేశ్వర రావు కొంత కాలం లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ తెలుగుదేశంతో ఉన్నారు. అదీ పొసగలేదు. దీంతో దగ్గుబాటి, హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అది తగిన ఆదరణ పొందలేదు.

అన్న తెలుగుదేశం పార్టీ తగిన ఫలితాలు సాధించకపోవడంతో దగ్గుబాటి వెంకటేశ్వర రావు బిజెపిలోకి, ఆ తర్వాత కాంగ్రెసు పార్టీలోకి వెళ్లిపోయారు. హరికృష్ణ మాత్రం చంద్రబాబుతో సర్దుకుపోతూ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. అయితే, ఆయన పెద్దగా పార్టీ కార్యకలాపాల పట్ల ఆసక్తి చూపడం లేదు. ఎన్నికల్లో కూడా పెద్దగా ప్రచారానికి దిగలేదు. అయితే, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేశారు. ఆ సందర్భంగా బాలకృష్ణ కన్నా జూనియర్ ఎన్టీఆర్‌కే ఆదరణ ఎక్కువగా లభించింది. స్పష్టమైన వాచకం, విషయాల అవగాహన ఎన్టీఆర్‌ను బలంగా తయారు చేసింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్‌ను ఆలంబనగా చేసుకుని తెలుగుదేశం పార్టీని నందమూరి కుటుంబ సభ్యుల సొంతం చేయడం హరికృష్ణ లక్ష్యంగా చెబుతున్నారు

తెలుగు క్రికెటర్ల హవా జోరుగానే ఉంది.

ప్రస్తుతం జరుగుతున్న ఐపియల్4లో తెలుగు క్రికెటర్ల హవా జోరుగానే ఉంది. జాతీయ జట్టులో వారికి తగిన ప్రాతినిధ్యం లభించకపోవయినప్పటికీ ఐపియల్‌లో మాత్రం ఓ వెలుగు వెలుగుతున్నారు. వివిధ జట్లలో వారు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. వారిలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న అంబటి తిరుపతి రాయుడి సంగతి చెప్పనే అవసరం లేదు. అతను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మన్ననలు అందుకున్నాడు. ఓ నమ్మకమైన బ్యాట్స్‌మన్‌గా అవతరించాడు. దానికితోడు కీపింగ్ కూడా చేస్తున్నాడు. ట్వంటీ20 అంటే గుడ్డిగా బంతిని బాదడమనేది అతను చేయడం లేదు. ఆటలో చక్కటి సాంకేతికతను ప్రదర్శిస్తున్నాడు. చెప్పాలంటే, అలాంటి శాస్త్రీయమైన ఆట తెలుగు క్రికెటర్లకు వెన్నతో అబ్బిందని చెప్పవచ్చు.

కాగా, ముంబై ఇండియన్స్‌లోనే మరో ఆటగాడు రోహిత్ శర్మ ఉన్నాడు. అతను భారీ షాట్లకు పెట్టింది పేరు. రోహిత్ శర్మ తల్లి అన్నపూర్ణది విశాఖపట్నం. అందువల్ల, ఇతడ్ని కూడా తెలుగువాడిగానే పరిగణించాల్సి ఉంటుంది. గత ఐపియల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్నప్పుడు బ్యాట్‌తోనూ బంతితోనూ అద్భతంగా రాణించాడు. భారత వన్డే జట్టులో అతను నిలకడగా ఆడలేకపోతున్నాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.

ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడుతున్న వేణుగోపాల రావు కూడా ఐపియల్‌లో బాగా రాణిస్తున్నాడు. మాజీ క్రికెటర్లు అతన్ని గుండప్ప విశ్వనాథ్‌తో పోలుస్తున్నారు. ఢిల్లీ డేర్ డెవిల్స్ ఐపియల్‌లో పరాజయం పాలవుతుండడంతో వేణుగోపాల్ రావు ప్రతిభ వెలుగులోకి అంతగా రావడం లేదు. అయితే, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో అతను రాణిస్తున్నాడనే మాటను మాత్రం అందరూ అంగీకరిస్తున్నారు.

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ జట్టులో సంచలనం సృష్టిస్తున్న పాల్ వాల్తాటీ మన తెలుగువాడే. అతను కర్నూలు జిల్లా నంద్యాలకు చెందినవాడు. అయితే, అతని తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా ముంబైకి వెళ్లారు. అతను ఆడిన ఫస్ట్ క్లాస్ మ్యాచులు లేవనే చెప్పవచ్చు. కానీ, ఐపియల్‌లో మాత్రం అతని పేరు మారుమోగుతోంది. అయితే, ఇటీవలి మ్యాచుల్లో అతను వెనకబడి పోయాడు.

ఇక, హైదరాబాద్ మణికట్టు మాంత్రికుడు వివియస్ లక్ష్మణ్ కొచ్చి టస్కర్స్ కేరళ తరఫున ఆడుతున్నాడు. అయితే, లక్ష్మణ్ ట్వంటీ20 ఫార్మాట్‌కు పనికి రాడనే అభిప్రాయం బలంగా ఉంది. కానీ, ఆడిన ఒకటి, రెండు మ్యాచుల్లో మంచి ప్రదర్శనే ఇచ్చాడు. కాగా, హైదరాబాద్ డెక్కన్ చార్జర్స్ తరఫున స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఆడుతున్నాడు. నిరుడు కూడా అతను ఇదే జట్టులో ఉన్నాడు. నిరుడు రాణించిన స్థాయిలో అతను ఇప్పుడు రాణించడం లేదు.

ప్రభుత్వాన్ని కూల్చే వ్యూహాన్ని??

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలనే ఒత్తిడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై పెరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. ఆపరేషన్ 500 కోట్లు అనే శీర్షికతో ఈ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. అవసరమైతే శాసనసభ్యులను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చాలని పార్టీ నాయకుల నుంచి జగన్‌పై ఒత్తిడి పెరుగుతున్నట్లు చెబుతున్నారు. ఒక్కో శాసనసభ్యుడికి ఐదు కోట్ల వరకు ఆఫర్ చేయాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు జగన్ వర్గం ఓ ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రభుత్వాన్ని కూల్చే వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆలస్యం చేస్తే పార్టీ బలహీనతలు బయటపడతాయని, వేడిలో వేడిగా ప్రభుత్వాన్ని కూల్చే ప్రణాళికను అమలు చేయాలని అంటున్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ కూడా 2014 వరకు వేచి చూసే ఉద్దేశంతో లేరని అంటున్నారు. ప్రస్తుతం జగన్ వెంట 25 మంది దాకా శాసనసభ్యులున్నారు. ప్రభుత్వాన్ని కూల్చాలంటే 70 మందికి పైగా శానససభ్యుల అవసరం ఉంటుంది. ప్రభుత్వాన్ని కూల్చడానికి గానీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి గానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేరు.

తెలంగాణలో పార్టీ బలహీనపడిన నేపథ్యంలో మధ్యంతర ఎన్నికలను చంద్రబాబు కోరుకోవడం లేదు. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకోక ముందే ప్రభుత్వాన్ని కూల్చాలని వైయస్ జగన్ వర్గం భావిస్తుండగా, తెలంగాణపై నిర్ణయం తీసుకునే వరకు ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉంది. పైగా, జగన్ వైపు నుంచి శాసనసభ్యులు క్రమంగా వెనక్కి తగ్గుతున్నారు. ఇప్పటికే కాంగ్రెసు శాసనసభ్యురాలు కమలమ్మ, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు కాటసాని రాం రెడ్డి వెనక్కి వెళ్లిపోయారు. ప్రభుత్వాన్ని కూల్చడంలో జాప్యం చేస్తే మరింత ఎమ్మెల్యేలు కూడా వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉందని జగన్ భావిస్తున్నారు. దీంతో సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశంతోనే జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. అందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కలిసి వస్తుంది. అయితే, ఆ పార్టీ 11 మంది సభ్యుల బలం అందుకు సరిపోదు. పరిణామాలు ఎటు దారి తీస్తాయో వేచి చూడాల్సిందే.

రజనీకాంత్‌ను చంద్రముఖి సెంటిమెంట్ వెంటాడుతోందా ??

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను చంద్రముఖి సెంటిమెంట్ వెంటాడుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో నటించినవారు ప్రమాదాలకు గురి కావడంతో ఆయనను చంద్రముఖి సెంటిమెంట్ వెంటాడుతున్నట్లు భావిస్తున్నారు. డీహైడ్రేషన్‌తో రజనీకాంత్ గత నెల 29వ తేదీన ఆస్పత్రిలో చేరి, అదే రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. మళ్లీ ఈ నెల 4వ తేదీన ఆస్పత్రిలో చేరి మంగళవారం డిశ్చార్జీ అయ్యారు. ఈ సమయంలో ఆయన స్వాముల ధ్యాన మందిరానికి ఆశ్రమానికి వెళ్లి గంటపాటు ధ్యానం చేశారు. ఆ తర్వాత కాళికాంబ ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. ఆయన చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లే అవకాశాలున్నట్లు కూడా చెబుతున్నారు. దీంతో రాణా చిత్రానికి తీవ్రమైన ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

కాగా, రాణా చిత్రంలో ఆయన మూడు పాత్రలు పోషిస్తున్నారు. అరవై ఏళ్ల వయస్సు పైబడిన రజనీకాంత్ రాణా చిత్రంలో ఓ యువకుడి పాత్ర పోషిస్తున్నారు. దానికోసం ఆయన డైట్ చేసినట్లు చెబుతున్నారు. దాదాపు 20 రోజులు డైట్ చేయడంతో అది రజనీ ఆరోగ్యంపై ప్రభావం చూపిందని చెబుతున్నారు. దాదాపు 75 కిలోల బరువు ఉన్న రజనీ డైట్‌తో 15 కిలోల బరువు తగ్గారు. అంతేకాకుండా, ఆల్కహాల్ కూడా మానేశారు. ఇది ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపిందని చెబుతున్నారు. రజనీ ఆరోగ్యానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని వైద్యులు చెబుతున్నారు.

ఇదిలా వుంటే, రజనీని మాత్రం సెంటిమెంట్ తీవ్రంగా వేధిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రముఖి సినిమాలో నటించడం వల్లనే కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్, నటి సౌందర్య ప్రమాదంలో చనిపోయారనే సెంటిమెంట్ ప్రబలంగా ప్రచారంలో ఉంది. దీని ప్రభావం రజనీకాంత్ మనసుపై పనిచేస్తుందని చెబుతున్నారు. సెంటిమెంట్లను ఎక్కువగా నమ్మే రజనీకాంత్‌కు అదే ఇబ్బందిగా మారిందని అంటున్నారు. అంతేకాకుండా, రాణా చిత్రం కథకు చారిత్రక నేపథ్యం ఉంది. ఈ చిత్రంలో నటిస్తుండడం వల్ల కూడా రజనీకాంత్‌కు కష్టాలు తెచ్చిపెడుతుందని అనేవాళ్లు కూడా ఉన్నారు. దానివల్ల రాణా చిత్రం ముందుకు సాగుతుందా, లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే, స్థిరచిత్తం, దృఢసంకల్పం గల రజనీకాంత్ వాటిని అధిగమిస్తారని అశిస్తున్నారు

11, మే 2011, బుధవారం

సుఖమయమైన నిద్రకు......కొన్ని సలహాలు...

సుఖంగా, హాయిగా నిద్రపోయిన వారు ఎలాంటి సమస్యలు లేకుండా రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఒక్కరోజు సరైన నిద్ర లేకపోతే రోజంతా చికాకుగా ఉంటుంది. ప్రతి ఒక్కరు రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గర్భిణులు, మెదటసారి ప్రసవం అయిన చాలా మంది వారి వయస్సుతో పాటు నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు.

ప్రసవం అయినవారు వారంలో రెండు మూడు రోజులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.వర్కింగ్‌డేస్‌లో ఏడుగంటల ఇరవై నిమిషాలపాటు, సెలవు దినాలలో ఎనిమిది గంటల ఇరవైనిమిషాలసేపు నిద్రపోతున్నారు. పని ఒత్తిడి, లైఫ్‌స్టైల్‌, డిప్రెషన్‌ నిద్రపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. నిద్ర సరిపోని వారు తిండి, పని వంటి విషయాలపై ఆసక్తిని కోల్పోతున్నారని తేలింది.
కొన్ని సలహాలు...

ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒకే సమయంలో పడుకోవాలి. ఒకే సమయంలో నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి.
నిద్రకు ఉపక్రమించడానికి మూడు గంటల ముందు వ్యాయామం చేస్తే మంచి నిద్రపడుతుంది.
పడుకొనే ముందు కాఫీ, ఆల్కహాల్‌ సేవించడం వంటివి చేయకూడదు.
పడకగదిలో ఆరోమా కాండిల్స్‌ను వెలిగించుకోండి. వీటి నుంచి మంచి సువాసన వస్తుంది. సుఖంగా నిద్ర పడుతుంది.
పడుకునే ముందు మీకిష్టమైన మ్యూజిక్‌ను వినండి. తక్కువ సౌండ్‌తో సంగీతం వింటే ఇట్టే నిద్రలోకి జారుకునేలా చేస్తుంది

కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి

కడప, పులివెందుల ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని కచ్చితంగా చెప్పలేం. కానీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు మాటల్లోని ఒక అంశం మాత్రం నిజమనిపిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డికి ఇక దినదిన గండమేనని ఆయన చెప్పిన మాటల్లో వాస్తవం ఉందని చెప్పవచ్చు. ఉప ఎన్నికలు, ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కాస్తా ఊరట కలిగించాయనే చెప్పవచ్చు. ఇటు జగన్ వ్యవహారం గానీ అటు తెలంగాణ అంశం గానీ ఆయనను తీవ్రంగా వేధించలేదు. ఉప ఎన్నికల్లో తాను చేయాల్సిందంతా చేస్తున్నానని ఆయన ఇంత కాలం అనిపించుకున్నారు.

ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుల నుంచి కిరణ్ కుమార్ రెడ్డిపై దాడి పెరిగే అవకాశం ఉంది. ఉప ఎన్నికల ఫలితాలను చూపించి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ముఖ్యమంత్రి మీద తీవ్ర వ్యాఖ్యలు చేసే అవకాశాలు చేసే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు ఆయనను ఇరకాటంలో పెట్టేందుకే వారు ప్రయత్నాలు సాగిస్తారని కచ్చితంగా చెప్పవచ్చు. అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల విమర్శలను తిప్పికొట్టడానికి మంత్రులు ముందుకు వస్తారా, లేదా అనేది అనుమానంగానే ఉంది. ఇప్పటికే, కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలిపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యంగ్యాస్త్రం విసిరారు. కడప ఉప ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి ఎత్తుగడలను ఆయన తప్పు పట్టారు. మొదటి నుంచీ అసంతృప్తితో ఉన్న సీనియర్ మంత్రులు కిరణ్ కుమార్ రెడ్డికి ఏ మాత్రం సహకరించే అవకాశాలు లేవు. తమ పనేదో తాము చేసుకు పోతున్నామని మాత్రమే అనిపించుకునేందుకు పరిమితమవుతారని చెప్పవచ్చు.

కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి పట్ల ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా అంత సంతృప్తిగా లేరని తెలుస్తోంది. తనను కిరణ్ కుమార్ రెడ్డి సంప్రదించడం లేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన గుర్రుగా ఉన్నారని సమాచారం. పరిస్థితిని చక్కదిద్దడానికి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద ఇప్పుటికైతే ఏ విధమైన అస్త్రాలు లేవు. నామినేటెడ్ పదవులు మాత్రమే ఆయన వద్ద ఉన్నాయి. అయితే, వాటిని భర్తీ చేస్తే పార్టీలో అసంతృప్తి మరింత పెరగవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయం నుంచి డిఎస్‌తో పాటు సీనియర్ మంత్రులు కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.

కాగా, ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మరోసారి తెలంగాణ అంశం రాజకీయాలను వేడెక్కించే అవకాశాలున్నాయి. తెలంగాణ ఇవ్వకపోతే తాము రాజీనామాలు చేస్తామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు అంటున్నారు. కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు కూడా ఏదో ఒక కార్యక్రమానికి ముందుకు రాక తప్పదు. దీనివల్ల కూడా కిరణ్ కుమార్ రెడ్డికి కష్టాలు తప్పేట్లు లేవు. ఏమైనా, కిరణ్ కుమార్ రెడ్డికి ముళ్ల మీద నడకే అవుతుందనడంలో సందేహం లేదు.

ఆపద్బాంధవుడు చిరంజీవి జాక్‌పాట్ కొట్టే అవకాశాలు

ఆపద్బాంధవుడు చిరంజీవి జాక్‌పాట్ కొట్టే అవకాశాలు చాలా ఎక్కువే ఉన్నాయి. ప్రస్తుత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కయ్యానికి కాలు దువ్వుతూ ప్రభుత్వాన్ని అస్థిరం పాలు చేయాలని ప్రయత్నిస్తున్న తరుణంలో ఆదుకున్న చిరంజీవికి పార్టీ ఉన్నత స్థానం కల్పించాలని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కంకణం కట్టుకున్నారట. పార్టీ అత్యున్నత స్థాయి నిర్ణాయక సంస్థ కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి)లోకి చిరంజీవిని తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి.

నిజానికి, పిసిసి అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని ఆలోచించారు. అయితే, కొత్తగా వచ్చిన నాయకుడికి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తే సీనియర్లు అసంతృప్తికి గురి కావచ్చుననే ఉద్దేశంతో దొడ్డి దారిలో రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను ఆయన చేతిలో పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సిడబ్ల్యుసి సభ్యుడిగా చిరంజీవి రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో ప్రధాన భూమిక పోషించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

ఎన్టీఆర్‌తో జగన్ చెలిమి ఎందుకు?

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో ఎందుకు చెలిమి చేయాలని అనుకుంటున్నారనేది ఆసక్తికరంగా మారింది. అందుకు ప్రాతిపదిక ఏమైనా ఉందా అనేది కూడా ముఖ్యమైన విషయమే. రాజకీయాల్లో తన తండ్రి వారసుడిగా నిలబడేందుకు వైయస్ జగన్ ప్రయత్నాలు సాగిస్తుండగా, తన తాత స్వర్గీయ ఎన్టీఆర్ వారసత్వాన్ని సొంతం చేసుకోవాలనేది జూనియర్ ఎన్టీఆర్ లక్ష్యం. ఒక రకంగా ఇద్దరి లక్ష్యం ఒకే విధమైంది. అయితే, ఇద్దరు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నతమైన స్థానాన్ని ఆశిస్తున్నవారి మధ్య స్నేహం సాధ్యమవుతుందా అనే దానికి ప్రాతిపదిక కూడా ఉంది.

రాష్ట్రంలో ఇప్పటి వరకు రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలదే ఆధిపత్యం. అధికారాన్ని కూడా ఈ రెండు వర్గాలే పంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం సహాయంతో అధికారాన్ని సొంతం చేసుకోవడానికి బిసీలు రంగం సిద్ధం చేసుకున్నట్లు పరిణామాలు తెలియజేస్తున్నాయి. కాంగ్రెసు నాయకత్వం కింద చిరంజీవిని అందుకు బిసీ వర్గాలు ఆలంబనగా చేసుకున్నట్లు భావించవచ్చు. అందుకు అనుగుణంగానే చిరంజీవికి కాంగ్రెసు అధిష్టానం పార్టీలో పెద్ద పీట వేసేందుకు సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెసు ఇప్పటి వరకు రెడ్ల ఆధిపత్యంలో ఉండేది. దాన్ని క్రమంగా బిసీల దారి పట్టించేందుకు తెర వెనక ప్రయత్నాలు ముమ్మరంగానే సాగుతున్నాయి.

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రెడ్ల గొడుగు పార్టీగా పరిణామం చెందే ప్రమాదం ఎక్కువగానే ఉంది. జగన్ వెంట ఎస్సీలు, బిసిలు ఉన్నప్పటికీ రెడ్ల పార్టీగానే ముద్ర పడే అవకాశం ఉంది. కాంగ్రెసు పార్టీనే కాకుండా తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కూడా దెబ్బ తీయడం జగన్ లక్ష్యం. అందుకు బలమైన కమ్మ సామాజిక వర్గం మద్దతు జగన్‌కు అవసరంగా మారిందని చెప్పవచ్చు. చంద్రబాబును వ్యతిరేకిస్తున్న కమ్మ సామాజిక వర్గం నేతలు కాంగ్రెసు వెనక ఉన్నారు. వీరు జగన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్‌తో చెలిమి ద్వారా కమ్మ సామాజిక వర్గం మద్దతు కూడగట్టాలనేది జగన్ వ్యూహంగా భావించవచ్చు.

తక్షణమే తెలుగుదేశం పార్టీ పగ్గాలను చేపట్టడం జూనియర్ ఎన్టీఆర్ లక్ష్యం కాదు. చంద్రబాబు లోకేష్‌కు పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నారు. అందుకు తన బాబాయ్ బాలకృష్ణ మద్దతు లభించే అవకాశాలున్నాయి. అందువల్ల చంద్రబాబు రాజకీయ పథకాలను విఫలం చేయడమే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుత లక్ష్యం. లోకేష్‌కు పార్టీ పగ్గాలు లభించకుండా చేయడమే ఆయన కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ లక్ష్యం కూడా అదే. తాత్కాలికంగా వైయస్ జగన్‌తో చెలిమి చేసి చంద్రబాబు వ్యూహాలను దెబ్బ తీస్తూ పోవాలని జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

8, మే 2011, ఆదివారం

అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జగన్ విధానం కాదు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో కలిసి పనిచేయడాన్ని రాజకీయ నాయకులు ఇబ్బందిగానే భావిస్తున్నారనే ప్రచారం ప్రారంభమైంది. జగన్ తమను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి కూడా వైయస్సార్ కాంగ్రెసులో మొదలైనట్లు అర్థమవుతోంది. తమను పట్టించుకోకుండా, తాను చెప్పినట్లు నడవాలనే వైఖరి వల్ల వైయస్ జగన్ నష్టపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. పైగా, అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జగన్ విధానం కాదు. తాను తీసుకున్న నిర్ణయాలను తన వెంట నడుస్తున్న నాయకులు పాటించాల్సి ఉంటుంది. వాటి మంచిచెడుల గురించి చర్చించే వాతావరణం ఉండదు, ఆ సందర్భం కూడా రాదు. వైయస్ జగన్ వాణిజ్యవేత్త అని, వాణిజ్యవేత్తలు గుట్టుగా వ్యవహరిస్తారని, తాము నిర్ణయాలు తీసుకుని తన అనుచరులకు చెబుతారని వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకానొక సందర్భంలో అన్నారు.

వాణిజ్యవేత్తల పనితీరు రాజకీయాల్లో పనికి రాదని ఆయన చెప్పకుండానే చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి తాను చేయదలుచుకున్న పని గురించి చాలా మందితో మాట్లాడేవారని, దానివల్ల తాను చేయబోయే పనిలోని మంచీచెడులు తెలిసి వచ్చేవని ఆయన అన్నారు. గుట్టుగా వ్యవహరించే జగన్ వ్యవహార శైలి వల్ల నాయకులు ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికే బద్వేలు కాంగ్రెసు శాసనసభ్యురాలు కమలమ్మ వైయస్సార్ పార్టీకి దూరమయ్యారు. తాజాగా, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు కాటసాని రాంరెడ్డి కూడా ఆయనకు దూరం జరిగారు. జగన్ వెంట నడుస్తున్న శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి దంపతులు ఏం చెప్తే అది చేసే వ్యక్తి కాటసాని రాంరెడ్డి. అటువంటి కాటసాని రాంరెడ్డే జగన్‌కు దూరమయ్యారంటే మరింత మంది కూడా వెనక్కి తిరిగి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.

జగన్ వెంట నడుస్తున్న చాలా మంది శాసనసభ్యులు, నాయకులు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి చెప్పారు. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. పరిణామాలను పసిగట్టే ఆయన ఆ విధంగా చెప్పి ఉంటారనేది స్పష్టమవుతోంది. నిజానికి, ఒక వ్యక్తి ఇష్టానిష్టాలకు, నిర్ణయాలకు అనుగుణంగా ఓ కార్పొరేట్ కంపెనీలాగా నడిచే పార్టీలో కొనసాగడం అంత సులభం కాదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ కూడా సంకటస్థితిని ఎదుర్కోవడానికి ఓ కారణం ఇదే. పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుందా, ఉండదా అనే విషయాన్ని పక్కన పెడితే, పార్టీ అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుందని, అధినేత తమ మాటలు వింటారని అనిపించడం పార్టీ మనుగడకు అత్యంత ప్రధానమైన విషయం.

తన తండ్రి వైయస్సార్ సంక్షేమ పథకాలు, ఆయన వారసత్వం, తనపై ఉన్న ప్రజాదరణ తన పార్టీని అగ్రస్థానంలో నిలబెడుతుందని బహుశా వైయస్ జగన్ భావిస్తూ ఉండవచ్చు. కానీ, అది ఎల్లకాలం ఫలితాలు సాధించి పెట్టదు. నాయకులను తగిన విధంగా గుర్తించినప్పుడే పార్టీకి మనుగడ ఉంటుంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతి ఒక్కరినీ గుర్తించినట్లు కనిపించేవారు. తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యం ఉంటుందని ఆయన చేతల్లో చూపించేవారు. అందుకే, హీరో రాజశేఖర్ దంపతులు కాంగ్రెసు పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు జగన్ వ్యవహార శైలి నచ్చక వెనక్కి వచ్చారు. వారంతట వారు తనను బలపరచాల్సిందే తప్ప బలపరిచిన వారికి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేదని తలిస్తే జగన్ రాజకీయాల్లో దెబ్బ తినడం ఖాయం.