24, మార్చి 2011, గురువారం

కాసేపు నవ్వుకొండి మనసార

నవ్వడం ఒక భోగం

నవ్వలేక పోవడం ఒక రోగం

నవ్వించడం ఒక యోగం

మీకోసము ఒక్క చిన్న ప్రయత్నము;)

వారులేని ఈ బతుకేల?!
"మా వారు తప్పిపోయారని వారం రోజుల క్రితం రిపోర్టు ఇచ్చాను. ఇంత వరకు వారి అచూకీ కనుక్కోలేకపోయారు. ఆయన లేకుండా నేను బతకలేనండీ ... '' రెండు చేతులతో మొఖం కప్పుకుని ఏడ్చింది కోమలి.
"క్షమించమ్మా! మీవారి మీద మీకున్న ప్రేమను అర్థం చేసుకోగలను. ఐనా మా ప్రయత్నం మేం చేస్తూనే ఉన్నాం ...'' జాలిగా అన్నాడు పోలీస్ అధికారి.
"ఆయన వెళ్లినదగ్గర్నుండి ఎక్కడి పనులక్కడే ఆగిపోయాయంటే నమ్ముతారా? ఇల్లంతా మాసిన బట్టలే ... సింకునిండా అంట్లే ... ఏ మూల చూసినా బూజే ... హాటల్ తిండి తినలేక నిజంగానే చచ్చిపోతున్నాను ఎస్.ఐ. గారూ ...'' ఏడుపు ఆపి, కొంగుతో కళ్లొత్తుకుంటూ చెప్పింది కోమలి.
ఏడాదిలో రాత్రులెన్ని?
"సంవత్సరానికి 365 రోజులైతే ... అందులో రాత్రులెన్ని?'' అడిగింది టీచర్.
"పది టీచర్?'' చెప్పాడు టింకూ.
"అదెలా?'' ఆశ్చర్యపోయింది టీచర్.
"ఒక శివరాత్రి, తొమ్మిది నవరాత్రులు... మొత్తం పది'' వివిరించాడు టింకూ వేళ్లు లెక్కబెడుతూ.
ఆర్డర్ - ఆర్డర్
ఒక కేసు విచారణ నిమిత్తం నిషాలో ఉన్న మంగరాజుని కోర్టుకి తీసుకొచ్చి బోనులో నిలబెట్టారు పోలీసులు.
కోర్టు హాల్లో అందరూ మాట్లాడుకోవడం గమనించిన జడ్జి "ఆర్డర్ - ఆర్డర్'' అంటూ గట్టిగా కేకేశాడు.
వెంటనే "ఒక చిల్లీ చికెన్, క్వార్టర్ రాయల్ స్టాక్ విస్కీ తీసుకురా'' జడ్జీకంటే గట్టిగా అరిచి, జనాల్ని చూసి నాలుక కరుచుకున్నాడు గంగరాజు.
యథా గురూ ...
"గోల్డ్ చెయిన్ కరిగిస్తే ఏమొస్తుంది పిల్లలూ?''
"గోల్డు సార్ ... ''
"వెండి చెయిన్ కరిగిస్తే?''
"వెండి సార్ ...''
"సైకిల్ చెయిన్ కరిగిస్తే?''
"సైకిల్ సార్ ...''
" !!!!! .... ???''
'ఉత్త'ర కుమారుడు
"ఐదు సంవత్సరాలనుండి కమలకి ప్రేమలేఖల్ని రాస్తున్నాను తెలుసా?'' విచారంగా అన్నాడు ప్రేమారావు.
"అయితే ఓకె అంటుంది - బాధ పడకు'' ధైర్యం చెప్పాడు మిత్రుడు గోపాల్రావు.
"ఓకె అంది కాని నాతో కాదు, ఈ ఐదేళ్లూ నా ఉత్తరాల్ని అందించిన పోస్టుమాన్‌తో'' అసలు సంగతి చెప్పాడు ప్రేమారావు.
కొళాయి నీళ్లు వాడుతున్నాం!
"మీవారు ఇంటి వెనకున్న బావిలో పడి,పోయారట కదా? పాపం - బాధని ఎలా భరిస్తున్నారో?'' అంది చుట్టంచూపుగా వచ్చిన ఆదిలక్ష్మి.
"భరించక తప్పుతుందా వదినా ? ఎంచక్కా నూతి నీరు వాడుకునేవాళ్లం. ఇప్పుడు కొళాయి నీటి కోసం రెండు మైళ్లు నడవాల్సి వస్తోంది - ఖర్మ'' ఉస్సురంటూ చెప్పింది సుబ్బలక్ష్మి.
కోపం వచ్చింది...
వెంగళప్ప భార్య వెంగళప్పకు రెండు పది రూపాయల నోట్లిచ్చి పది రూపాయలకు వంకాయలు, పది రూపాయలకు దోసకాయలు తెమ్మని బజారుకు పంపింది. వెంగళప్ప హుషారుగా సంచితో బయలుదేరి, కొద్దిసేపటికే వెనక్కి వచ్చేశాడు.
అతడి చేతిలో ఖాళీ సంచి తప్ప కూరగాయలు లేవు. వెంగళప్ప భార్య పట్టలేని కోపంతో ‘‘కూరలేవీ?’’ అని అడిగింది.
‘‘నువ్యు ఏ పదితో వంకాయలు ఏ పదితో దోసకాయలు తెమ్మన్నావో చెప్పలేదు కదా. నన్నంటావేం?’’ అన్నాడు వెంగళప్ప కోప్పడుతూ.
-------------------------------------------------------------------------
"ఈ మధ్య అస్తమానం పళ్లు తోముతున్నావేంట్రా?'' ఆశ్చర్యపోయాడు తండ్రి.
"నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందట నాన్నా - టీచర్ చెప్పింది'' బదులిచ్చాడు నాని.
----------------------------------------------------------------------
70 కిలోలు
‘‘ఏమే లలితా... నెలరోజులు ఎక్సర్‌సైజ్ చేసేసరికి నా బరువు ఆరు కిలోలు తగ్గిపోయింది’’ చెప్పింది కవిత ఆశ్చర్యంగా.
‘‘నెల రోజులకు ఆరు కిలోలేనా?
‘‘నాకు ఒక్క రోజులో డెబ్బయ్ కిలోలు తగ్గిపోయింది తెలుసా?’’ అంది లలిత.
‘‘మైగాడ్ ఎలా?’’ అడిగింది కవిత.
‘‘మా ఆయనకు డైవోర్స్ ఇచ్చేశాను’’ అసలు విషయం చెప్పింది లలిత.
డబ్బులు చాలవ్
చెడు అలవాట్ల గురించి టీచర్ పాఠం చెబుతూ... స్టూడెంట్స్‌కు ప్రశ్నలు వేస్తోంది.
టీచర్: శ్రీకాంత్ నువ్వు చెప్పు బ్రాందీ, విస్కీ లాంటివి తాగొచ్చా?
స్టూడెంట్: తాగకూడదు అని మా డాడీ చెప్పారు.
టీచర్: వెరీగుడ్. తండ్రి అంటే అలా ఉండాలి. మరి ఎందుకు తాగకూడదో చెప్పారా?
స్టూడెంట్: చెప్పారు టీచర్. ఇద్దరం తాగితే డబ్బులు చాలవట.
3 వికెట్లు, 6 పేషెంట్లు
ఊళ్లోని ప్రముఖులంతా కలసి క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు.
ఓ డాక్టర్ బౌలింగ్ చేస్తూండగా ఓ వ్యక్తి మ్యాచ్ చూడ్డానికొచ్చాడు.
‘‘డాక్టరుగారు ఎలా ఆడుతున్నారు?’’ పక్కనున్న వ్యక్తిని అడిగాడతను.
‘‘అదరగొట్టేస్తున్నారు! ఇప్పటికిప్పుడే ఆయనకు మూడు వికెట్లు, ఆరు పేషంట్లు దొరికారు’’.
రోజుకి 25
‘మా మావయ్య, ఒక సంవత్సరంగా పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నాడండీ...’ సైకాలజిస్ట్ దగ్గరకొచ్చి చెప్పాడు శంకర్రావు.
‘‘ఏం చేస్తున్నాడు?’’
‘‘ప్రొద్దున్నుంచీ సాయంత్రం వరకూ కుర్చీలో కూర్చుని చేతుల్లో స్టీరింగ్ ఉన్నట్లు ఊహించుకుని కారు నడుపుతున్నట్లు ప్రవర్తిస్తున్నాడండీ!’’
‘‘అది కారు కాదనీ, కుర్చీ అనీ నువ్వు చెప్పలేదూ?’’
‘‘ఎలా చెప్తానండీ! సాయంత్రం కారు కడిగినందుకు నాకు రోజుకి పాతిక రూపాయలిస్తూంటేనూ!’’
‘‘మరిప్పుడెందుకు ఇక్కడికి వచ్చినట్లు?’’
‘‘ఇప్పుడు కారు తనే కడుక్కుంటున్నాడండీ...’’
చంద్ర వంట
భార్యావిధేయుడయిన రంగారావ్ ఓ మనస్తత్వ వైద్యుడి దగ్గరకొచ్చాడు.
‘‘ప్రతిరోజూ ఒకటే కలండీ! పద్నాలుగుమంది ప్రపంచంలో కెల్లా అందమైన సుందరీమణులతో నేను చంద్రమండలం మీద దిగానట...’’ దిగులుగా చెప్పాడతను.
‘‘ఓరినీ! అంత అద్భుతమయిన కల వస్తూంటే ఆ విచారం దేనికోయ్?’’
‘‘భలేవారే? వాళ్ళందరికీ అన్నం వండిపెట్టడం తేలికనుకున్నారేమిటి?’’ మరింత దిగులుగా అన్నాడతను.
తేడా లేదు!
ఎండాకాలం: వర్షాభావం వల్ల రిజర్వాయర్లు ఎండిపోవడంతో అధికారికంగా విద్యుత్ సరఫరా 6 గంటలు తగ్గించడమైనది.
వర్షాకాలం: అధిక వర్షాల కారణంగా కరెంటు తీగెలు తెగిపడిపోయినందువల్ల విద్యుత్ సరఫరా నిరవధికంగా నిలిపివేయడమైనది.
పెళ్లే పెద్ద గుండె కోత!
భార్య: ఏంటండీ, టీవీ చూస్తూ ఏడుస్తున్నారు. ఏం సీరియల్ వస్తుందేంటి?
భర్త: ఓసి పిచ్చి మొహమా! సీరియల్ అయితే ఎందుకేడుస్తానే, నేను చూస్తోంది మన పెళ్లి సీడీ!
తిట్ల పుట్ట
మామగారు: ఏమోయ్ అల్లుడూ! ఎప్పుడూ మా అమ్మాయిని తిడుతున్నావట?
అల్లుడు: అలా చెప్పి చచ్చిందా ఆ చచ్చు పీనుగ!
నీదీ అదే రూపం!
సుబ్బారావ్: మీ అక్క గుమ్మంలో నిలబడి అస్తమానం నన్నే చూస్తోంది ఎందుకని?
అప్పారావ్: మా అక్కయ్యకు కొండముచ్చులంటే భలే ఇష్టంలేరా!
పంచ్!
టీచర్: ‘నారు పోసినోడే నీరు పోస్తాడు’ లాంటి సామెత ఇంకొకటి చెప్పరా!
స్టూడెంట్: పాఠం చెప్పిన వాళ్లే పరీక్ష రాయాలి టీచర్!
ఇదుంటే చాలు వచ్చేస్తాడు!
యముడు: పిసినారి పాపయ్యను తీసుకురమ్మంటే, అతని ఇనప్పెట్టెను తెచ్చారేంట్రా?
యమకింకరులు: ఇది లేకుండా అతను రావట్లేదు యమా!
పోతే పోనియ్!
కావేరి: అక్కా, ఈరోజు బియ్యంలో రాళ్లు ఏరడం లేదేంటి?
కీర్తన: ఈరోజు నేను ఉపవాసం కదా, వంట ఆయనొక్కరికే!
భళా మీ హస్తవాసి!
డాక్టర్: నేను రాసిచ్చిన మందులతో ఏమైనా ఇంప్రూవ్‌మెంట్ ఉందా?
పేషెంట్: ఎందుకులేదండీ, పోయినసారి 50 అయితే, ఈసారి 80 తీసుకున్నారు!
ఎటకారం!
భర్త: బంగారంలాంటి పాలు, పిల్లిపాలు చేశావే!
భార్య: గేదెపాలు పిల్లిపాలు ఎలా అవుతాయండీ!
గుడ్డు గుడ్డు.... కోడిగుడ్డు!
బడిలో టీచరు అంటోంది .....!
‘‘రామూ! ఇలా రాస్తే పరీక్షల్లో నీకు కోడి గుడ్లు రాక తప్పదు’’
రాము : అయ్యో వాటితో నాకేం లాభం టీచర్, మేం శాకాహారులం.
బాతుగుడ్డు బబ్లూ...
అల్లరిపిల్లాడైన బబ్లూ కిరాణా షాప్‌కి వెళ్ళి... ‘బాతుగుడ్లు వున్నాయా?’ అని అడిగాడు.
‘లేవు’ అని జవాబిచ్చాడు యజమాని.
మర్నాడు వెళ్లి మళ్లీ అదే ప్రశ్న వేస్తే ‘మా దగ్గర దొరకవు’ అన్నాడు యజమాని.
బబ్లూ రోజూ వెళ్ళి అదే ప్రశ్న వేస్తుండటంతో విసిగిపోయాడు యజమాని.
‘రేపొచ్చి మళ్ళీ బాతుగడ్డు అడిగావంటే కాళ్ళలో మేకులు దిగేస్తా’ అన్నాడు కోపంగా.
ఆ మర్నాడు బబ్లూ మళ్ళీ షాప్‌కి వచ్చాడు.
‘మీ దగ్గర మేకులున్నాయా?’
‘లేవు’
‘అయితే మరి బాతుగుడ్లున్నాయా?’
గండం
‘ఏంటల్లుడూ... బంగారంలాంటి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశావట’
అడిగారు ఆగమేఘాల మీద వచ్చిన మామగారు.
‘మరేం చేస్తారు నాన్నా, ఆయనకు నిద్రలో ప్రాణగండం ఉందని జ్యోతిష్కుడు చెప్పాడు’ అసలు విషయం చెప్పింది కూతురు.

పరిగెత్తాడు ఫ్రెండ్.
బడాయి
రంగారావు ఉత్తరధ్రువం పర్యటనకు వెళ్లొచ్చాడు. మర్నాడు తన స్నేహితులతో యాత్రా విశేషాలు చెబుతున్నాడు.
‘‘అక్కడ ఎంత చల్లగా ఉందంటే... మేం సిగరెట్ ముట్టించడానికి అగ్గిపుల్ల వెలిగించగానే మంట గడ్డకట్టుకుపోయేది. ఎంత ఊదినా ఆరేది కాదు’’ అన్నాడు.
ఇంతలో పక్కనే ఉన్న పాపారావు... ‘‘అందులో గొప్పేం ఉంది? మేం వెళ్లినప్పుడైతే పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. మా నోట్లోంచి శబ్దం రావడం ఆలస్యం, మాటలన్నీ గడ్డకట్టుకుపోయేవి. ఆ తర్వాత మా తిప్పలు తిప్పలు కావు. ఆ మాటలన్నిటినీ జాగ్రత్తగా ఏరుకుని వెచ్చబెట్టే దాకా, ఎవరు ఏం మాట్లాడారో తెలిసేది కాదు’’ అని చెప్పాడు.
చల్లని చేయి
"ఎందుకు ఆ డాక్టరు దగ్గరకే ఎక్కువ రోగులు వెళతారు?’’ అడిగాడు ఒకాయన నర్సుని.
‘‘ఎందుకంటే ఆ డాక్టరు చేతి చలువ అలాంటిది. రోజూ గంటకోసారి ఆయన ఫ్రిజ్‌లో చేయి పెడుతుంటారు. అందుకే ఆ డాక్టర్ దగ్గరికే వెళతారు’’ అక్కసుగా అన్నది నర్సు.

విడాకులు
కొత్తగా కాపురం ప్రారంభించిన శ్రీదేవి మొదటిసారిగా భర్తకు వంట చేసి పెట్టింది.
అతను మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆత్రంగా అడిగింది...
‘‘రోజూ ఇన్ని ఐటమ్స్‌తో ఇలాగే వంట చేస్తే నాకేమిస్తారేంటి’’ అడిగింది గోముగా.
‘విడాకులు’ కరుగ్గా చెప్పాడు భర్త తరుణ్.
సిమెంట్...
‘పొద్దున్నుంచి చూస్తున్నా, ఏమైంది మీ ఆయన అసలు నోరు తెరవడం లేదు’ అడిగింది పక్కింటి పంకజం.
‘అదా... పళ్లు కదులుతున్నాయని నిన్న డాక్టర్ దగ్గరకెళ్తే సిమెంట్ పెట్టాలి. రెండు వేలు అవుతుంది అన్నారట. అదేదో నేనే పెట్టుకుంటా అని ఇంట్లో ఉన్న సిమెంట్‌ను పళ్లకు పెట్టుకున్నారు అంతే! అలా ఉండిపోయారు’ చెప్పింది విశాలాక్షి.
ఏం చేస్తానంటే...
రవి: మీ నాన్నగారి జేబులోంచి పది రూపాయలు కింద పడిపోయాయనుకో, ఏం చేస్తావు?
రాజు: పదితో ఏం చేస్తాం, మరో పది అమ్మ ఎక్కడయినా దాచిందేమో వెతుకుతా.

ఒకాయన: ఏయ్! టైలర్! ఈ బట్టలింత పొట్టిగా కుట్టేవేం! గుడ్డ ఏమన్నా మిగుల్చుకున్నావా!
టైలర్: ఆ అదేంలేదుసార్! మీరిచ్చినప్పుడు కొలతంతే. ఎటొచ్చి నేను ఇప్పుడిచ్చానంతే!
తెలివి మీరిన పులి
"ముసలోడా ఆగు ...'' అడవిదారిలో అడ్డుపడి అంది పులి.
"ఈ దారిలో యువకులు చాలామంది వస్తుంటారు. వాళ్లది వేడి రక్తం'' తెలివిగా తప్పించుకోబోయాడు ముసలాయన.
"నా కెందుకో ఈ రోజు కూల్‌డ్రింక్ తాగాలని ఉంది మరి'' చెప్పింది పులి.


పుత్రరత్నం తెచ్చేశాడు
"ఎదురింటి సుబ్బారావుగారి అమ్మాయికి లెక్కల్లో 99 మార్కులొచ్చాయండి'' గొప్పగా చెప్పింది భార్య.
"అవునా? మరి మిగిలిన ఒక్కటీ ఎవరు ఎత్తుకెళ్లారట?'' ఎదురింటివారి గొప్పదనం భరించలేని భర్త సాగదీస్తూ అన్నాడు.
"మిగిలిన ఆ ఒక్కటీ మీ పుత్రరత్నం తీసుకొచ్చేశాడు లెండి'' మరింత వ్యంగ్యంగా సంధించింది భార్య.


పట్టిక ప్రభావం
"అదేంటి అర నిమిషం క్రితం నీ బి.పి.నార్మల్ ఉంది. వెంటనే ఇంతలా పెరిగిపోయిందేం?'' ఆశ్చర్యపోయాడు డాక్టర్ నిర్మల్‌కుమార్.
"సార్ ఎదురుగా ఉన్న మీ ఫీజు పట్టిక ఇప్పుడే చదివాను'' పిడచకట్టుకుపోయిన నాలుకని తడుపుకుంటూ అన్నాడు బ్రహ్మానందం.
పారిపోయింది
"బబ్లూ ... కుక్కపై వ్యాసం రాసుకురమ్మని చెప్పానా? మరెందుకు రాసుకురాలేదు?'' అడిగింది టీచర్."రాద్దామని కుక్కపైన పెన్ను పెట్టగానే పారిపోయింది టీచర్'' చాలా అమాయకంగా మొహం పెట్టి చెప్పాడు బబ్లూ.
వచ్చివెళ్లారు
"మేము మొత్తం 25 మందిమి అన్నా చెల్లెళ్లం తెలుసా?''
"అదేంటి? కుటుంబనియంత్రణ అధికార్లు మీ ఇంటికి రాలేదా?''
"వచ్చారు కానీ, ఇదేదో స్కూలు తాలూకూ క్లాసురూం అనుకుని తిరిగి
వెళ్లిపోయారు''

వెయిటింగ్ రూంలెందుకు?
"ప్రతి రైలూ లేటుగా వస్తే ఈ పనికిమాలిన టైం టేబుల్ ఇక్కడెందుకూ?'' రైల్వే అధికారితో పేచీ పెట్టుకున్నాడు రామానందం.
"ప్రతి రైలూ కరెక్టు టైంకు వస్తే నీవు విశ్రాంతి తీసుకుంటున్న ఈ వెయింటింగ్ రూంలు ఎందుకు?'' మరింతగా మిర్రిచూస్తూ అన్నాడు రైల్వే అధికారి.

నాకూ ఇప్పుడే తెలిసింది
"డార్లింగ్ మనం ఇప్పుడు ఎక్కడి కెళ్తున్నాం?'' మెడచుట్టూ చేతులు వేసి గోముగా అడిగింది ప్రేయసి.
"అనంత దూరాలకు ప్రియా'' కంగారు పడుతూ చెప్పాడు ప్రియుడు.
"అంత దూరమా? ముందే నాకెందుకు చెప్పలేదు?'' అలకతో అంది ప్రేయసి.
"అంత దూరమని ఇందాక వెహికల్ బ్రేకులు ఫెయిలయ్యాకే తెలిసింది'' చెప్పాడు ప్రియుడు.

భయపడేదాన్ని కాను
"నాకు నీ మాటలతో కోపం తెప్పించకు. నాలో జంతువు ప్రవేశిస్తుంది'' అరిచాడు సుబ్బారావు.
"ఆ విషయం నాకు తెలుసు. కాని ఎలుకకి భయపడేంత పిరికిదాన్ని కాను నేను'' మరింత కోపంగా అంది.
సిగ్గు లేదా......
జడ్జి కోర్ట్ బోనులో నిలబడ్డ దొంగను ఉద్దేశించి అంటున్నాడు ఇలా.... 'ఇది మూడోసారి నువ్వు రావడం. నీకు సిగ్గనిపిన్చాడంలేదా ?
దొంగ :మీరైతే రోజు వస్తున్నారుగా !
మీకెందుకు సిగ్గు రావడం లేదు ?
నొప్పి...
పేషెంట్: ఎడమ కాలు నొప్పి పెడుతోంది. ఏంచేయమంటారు?
డాక్టర్: ఆందోళన పడకండి. ఓల్డ్ ఏజ్‌లో ఇలాంటివి సహజమే...
పేషెంట్: నా కుడికాలుకి కూడా సేమ్ ఏజ్ కదా... మరి అదెందుకు నొప్పి పెట్టడం లేదు?

గొప్పలు
తన తండ్రి గురించి కొడుకు ఇలా చెబుతున్నాడు.
‘మా నాన్న పులి, నరసింహ, ఠాగూర్’ అన్నాడు. పక్కనే ఉన్న అతడి ఫ్రెండ్ ఇలా అన్నాడు. ‘అవునా అయితే మీ నాన్నను చూడాలంటే టికెట్టెంత?’ అన్నాడు.

ఆ నలుగురి ఆచూకీ ఎందుకు కనిపెట్టలేకపోతున్నారన్నది మాత్రం ‘మిలియన్’ డాలర్ ప్రశ్నగా మిగుల్తోంది.

మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై జరిగిన విగ్రహాల విధ్వంసం కేసులో టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీష్‌రావు, కె.తారక రామారావులు గత పది రోజులుగా పరారీలో ఉన్నారు. అవును ఇది పచ్చినిజం. అదేంటి నిత్యం వీరు ఏదో ఒక సమావేశంలో పాల్గొంటూ ప్రజల మధ్యే ఉంటున్నారు కదా.. పరారీలో ఉండటమేంటి అన్న ధర్మ సందేహం సగటు మనిషికెవరికైనా రావచ్చు. అయితే పోలీసులకు మాత్రం అలాంటి సందేహం రాలేదు. నవ్విపోదురుగాక మాకేంటి.. అన్నట్లుగా విధ్వంసం కేసులో ఆ నలుగురూ పరారీలో ఉన్నారని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. విధ్వంసం దృశ్యాలున్న టెలివిజన్ చానల్స్ ఫుటేజీ ఆధారంగా వేర్వేరు ప్రాంతాలకు చెందిన 58 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. ఆ నలుగురి ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ కార్యక్రమానికి పిలుపునివ్వడంతోపాటు అనుమతి లేకున్నా ఆ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ తదితరులపై కేసులు నమోదు చేసిన గాంధీనగర్ పోలీసులు.. వారిని అరెస్టు చేయడం మాత్రం మరిచిపోయారు. పైగా తమ తప్పు ఉండకూదనే ఉద్దేశంతో వారంతా పరారీలో ఉన్నట్లుగా చూపుతూ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. అయితే విధ్వంసంతో సంబంధం ఉందనే ఆరోపణలతో ట్యాంక్‌బండ్‌కు సమీపంలోని ఆలయంలో పురోహితుడు పి.శ్రీనివాసాచారి, మచిలీపట్నం ప్రాంతానికి చెందిన పర్యావరణ ఉద్యమకారుడు అడ్డాల నారాయణరావు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి గాంధీ ఆస్పత్రికి వచ్చిన మితేష్, రమేష్ సహానీ, మైనర్ విద్యార్థులు శరత్, సందీప్, న్యాయవాదులు శ్రీరంగారావు, ఆదిత్య, ఇంద్రసేన్‌రెడ్డి, రాము తదితరులపై కేసులు బనాయించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
నిందితుల సంఖ్యను భారీగా చూపేందుకు పదుల సంఖ్యలో యువకుల అరెస్టులు చూపారు. ఇంతమందిని కష్టపడి కనిపెట్టి అరెస్టు చేసిన పోలీసులు... ఆ నలుగురి ఆచూకీ ఎందుకు కనిపెట్టలేకపోతున్నారన్నది మాత్రం ‘మిలియన్’ డాలర్ ప్రశ్నగా మిగుల్తోంది. సంచలనం సృష్టించిన కేసుల్లో హంతకులను పట్టుకునేందుకు మెరికల్లాంటి పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన తరహాలోనే ఆ నలుగురినీ పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఖాకీ బాస్‌లు ప్రకటించినా ఆశ్చర్యపోనక్కరలేదేమో

కీళ్లకు సంబంధించిన సమస్యలు ఎందుకు అధికమవుతాయి?

పొద్దున్నే చలికి వణికిపోతూ తప్పని పరిస్థితిలో పనులున్నాయని లేచి కూర్చుంటున్నారా? మంచం మీద నుంచి కాలు కింద పెడదామంటే భరించరానంత నొప్పిగా ఉంటుందా? నొప్పి నివారణకు అదేపనిగా పెయిన్ కిల్లర్లు వేసుకుంటూ చలికాలాన్ని ఎలాగోలా గడిపేయాల్సిందే అంటూ నిట్టూరుస్తున్నారా? చలికాలంలో ఎముకలకు, కీళ్లకు సంబంధించిన సమస్యలు ఎందుకు అధికమవుతాయి? వీటి నుంచి రిలీఫ్ పొందడం ఎలా?

చలికాలం శరద్ రుతువు చివరన మొదలై హేమంత రుతువులో బలీయంగా ఉండి శిశిర రుతువు మొదటి భాగం వరకు ఉంటుంది. ఈ కాలంలో ఉత్తర దిక్కు నుంచి వీచే అతి చల్లని గాలుల వల్ల మన చర్మం పొడిబారి, ఎండినట్టుగా అవుతుంది. చలి, రూక్ష గుణం(పొడిబార్చే గుణం) వల్ల వాతం ప్రకోపం చెందుతుంది. ఈ కాలంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. సరైన వేళలో తగినంత ఆహారం తీసుకోకుంటే ఈ అగ్ని శరీర ధాతువులను వికృతం చేస్తుంది. భోజన వేళలు పాటించకపోతే వాతం వృద్ధి చెందుతుంది. అధిక ప్రయాణాలు, రాత్రిపూట ఎక్కువ సమయం మేల్కొని ఉండటం, పగలు నిద్రించడం, చల్లని గాలులు అధికంగా ఉండటం... వల్ల వాతం ప్రకోపం చెంది (పెరిగి) అది శరీరంలో వివిధ అవయవాలలో చేరి అనేక వ్యాధులను కల్గిస్తుంది.
ఆమవాతం (రుమటాయిడ్ ఆర్థరైటిస్):

శరీరంలోని ఆమం (అన్‌డెజెస్టైడ్ మెటీరియల్) ప్రకోపించి వాతంతో అనేక జాయింట్స్‌కు చేరి, అక్కడ తీవ్రమైన నొప్పిని, వాపును, మంటను కలిగిస్తుంది. ఈ వ్యాధులకు కారణభూతమైన ఆమం శరీరంలో విషంతో సమానమైంది. మిగిలిన కాలాలతో పోలిస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ చలికాలంలో తీవ్రంగా ఉండి అమితమైన బాధకు గురిచేస్తుంది. ఈ వ్యాధి కేవలం జాయింట్స్‌లోనే గాక శరీరమంతా విస్తరించడంతో ఉదయం పూట శరీరం కదలించలేకపోతారు. ఆకలి మందగిస్తుంది. జ్వరంగా ఉంటుంది. కీళ్లలో తేలు కుట్టినంత నొప్పి ఉంటుంది. మలం దుర్వాసన వస్తుంది. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే కీళ్లు పూర్తిగా స్తంభించిపోయి, శరీరాన్ని కదిలించలేకపోతారు. మెల్లగా గుండెకు కూడా పాకుతుంది. తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండానే మళ్లీ తినడం, మసాలాలు, నూనె ఉన్న పదార్థాలు, మాంసాహారం, రాత్రిపూట పొద్దుపోయిన తర్వాత భుజించడం... వంటి కారణాల వల్ల ఈ వ్యాధి ఎక్కువవుతుంది. సంధివాతం, ఆమవాతంలలో కీళ్ల నొప్పులు వస్తాయి. చలికాలంలో అధికమవుతాయి. అయితే ఈ రెండింటి చికిత్సలో పూర్తి విరుద్ధమైన చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. ఆమవాతం ఉన్నవారికి మొదట ఆకిలిని, జీర్ణ శక్తిని పెంపొందించాలి. కీళ్లలో ఉండే ఆమం (ఇన్‌డైజేషన్ మెటీరియల్)ను కరిగించే పాచన చికిత్స అనే ప్రక్రియ ద్వారా బయటకు పంపేయాలి. ఈ చికిత్సలో వాలుకాస్వేదం, ధాన్యామ్లధార, కషాయధార, వస్తికర్మ, విరేచనం వంటి శోధన చికిత్సలు, ఔషధాలతో కలిపి శమన చికిత్స చేయాలి. శమన చికిత్సలో భాగంగా షడ్‌ధరనచూర్ణం, ఎరండతైలం, సింహనాదగుగ్గులు, ఆమవాతంరస్, షడ్గుణ సింధూరం, వాతగజాంకుశరస్ వంటి ఔషధాలు వాడాలి.
ముందు జాగ్రత్తలు:
ఆమవాతం లక్షణాలు కనిపించినప్పుడు సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ఎప్పుడూ గోరువెచ్చని నీరు తాగాలి. భోజనం చేసిన వెంటనే కనీసం వంద అడుగులు నడవాలి. శొంఠి చూర్ణం, బియ్యం కడుగును వేడినీళ్లతో సేవిస్తే ఉపశమనం పొందవచ్చు. ఈ ఆమవాతానికి ఉదయం పూట చిన్న చిన్న యోగాసనాలు చేస్తే మార్నింగ్ స్టిఫ్‌నెస్ నుంచి విముక్తి పొందవచ్చు. గృధ్రసీ వాతంలో కాళ్లు తిమ్మిరి పట్టడం, నడుంనొప్పి వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే భుజంగాసనం, వజ్రాసనం వంటి ఆసనాలు, వేడినీళ్లతో స్నానంతో ఉపశమనం పొందవచ్చు. మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. కాస్త గట్టిగా ఉండే పడకమీద నిద్రించాలి. రాత్రిళ్లు ఎక్కువసేపు మేలుకోకూడదు. ఈ కాలం శరీరంలో వాతం ప్రకోపించడం వల్ల నొప్పులు (కండరాల నొప్పి), శరీరం పట్టేసినట్టు ఉండటం, సైనసైటిస్, బద్దకంగా అనిపించడం సాధారణ లక్షణాలు. అధిక రూక్షత్వం (పొడిబారడం) వల్ల చర్మం పొడిగా ఉండి దురద, పగుళ్లు, చుండ్రు ఎక్కువవుతాయి. చలికాలంలో ప్రతీ ఉదయం సాధారణంగా మన ఇళ్లలో లభించే నువ్వుల నూనెతో శరీరం అంతా మర్దన చేసుకోవడం, ఉష్ణ జల స్నానం, వేడిని కలిగించే వస్ర్తాలతో శరీరాన్ని కప్పి ఉంచాలి. శీతల పానీయాలను తీసుకోకూడదు. తప్పనిసరిగా నెయ్యి భోజనంలో వాడాలి. పైన చెప్పిన పంచకర్మచికిత్సలు వ్యాధులను తగ్గించడమే కాకుండా, వ్యాధి రాకుండా చేస్తాయి. అయితే ఈ పంచకర్మలను నిపుణుల పర్యవేక్షణలోనే చేయించుకోవాలి.
సంధివాతం (ఆస్టియో ఆర్ర్థరైటిస్):
ఈ వ్యాధి ప్రకోపిస్తే వాతం సంధుల (కీళ్లు)లో చేరి ఎముకల అరుగుదలకు కారణమై వాపు, నొప్పి, తిత్తివటిస్పర్మ వల్ల ఎముకల మధ్య ఖాళీ ప్రదేశం తగ్గుతుంది. కాళ్లను కదిలించినప్పుడు తీవ్రమైన నొప్పితో బాధపడతారు. నడవలేరు. వ్యాధి తీవ్రావస్థలో నడవకున్నా విపరీతమైన బాధ కలుగుతుంది. ఈ వాతం కారణంగా కీళ్ల వద్ద ఎముకలను పట్టి ఉంచే డిస్క్ ముడుచుకొని ఉంటాయి. స్ర్తీలలో రుతుస్రావం ఆగిపోయిన తర్వాత, చిన్న వయసులో గర్భాశయం తొలగించినప్పుడు కలిగే హార్మోన్ల అసమతుల్యం వల్ల, అధిక బరువు కారణంగా ఎముకల మీద ఒత్తిడి పెరిగి ఎముకలలో పటుత్వం తగ్గి ఈ వ్యాధితో బాధపడాల్సి వస్తుంది.
చికిత్స:
రోగి వయసు, శక్తిని బట్టి శమన, శోధనకర్మ చికిత్స చేయాలి. శోధన చికిత్స శరీరంలో ఉండే అనేక విషపదార్థాలను బయటికి పంపడమే కాకుండా నీరసపడ్డ జీవకణాల్లో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. వ్యాధి పూర్తిగా శోధనం అయిన తర్వాత శమన చికిత్స (ఔషధా లు) ద్వారా పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. ఈ సంధివాతానికి చికిత్సలో అభ్యంగస్వేదనం చేయాలి. అభ్యంగన వల్ల శరీరంలోని అన్ని జాయింట్లలో కదలికలు సాధారణ స్థితిలో కల్పించవచ్చు. ఈ అభ్యంగ చికిత్సలో అవసరాన్ని బట్టి పత్రపోటల స్వేదం, కాయసేకం, వస్తికర్మ, షస్టికశాలిపిండస్వేదం, రక్తమోక్షణం (జలగలచే చెడు రక్తం తీయడం) వంటి పంచకర్మ ప్రక్రియల ద్వారా చికిత్స చేయాలి. వీటిలో వస్తికర్మ చాలా ప్రధానం. అయితే దీన్ని వైద్యుల పర్యవేక్షణలోనే చేయాలి. తైల అభ్యంగం, వేడినీటి స్నానం ద్వారా మంచి ఉపశమనం కలుగుతుంది.

కీళ్లనొప్పులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కాల్షియం అధికంగా ఉండే పాలు, పెరుగు, మజ్జిగ, ఘృతం(నెయ్యి),

కీరదోస... లను విరివిగా తీసుకోవాలి. వ్యాయామాలు ఎక్కువగా చేయకూడదు.

మెట్లు, కొండలు, గుట్టలు ఎక్కడం, కింద కూర్చోవడం వంటివి చేయకూడదు.

చల్లని నీటితో స్నానం చేయకూడదు.

తీపి, పులుపు రసాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.

దుంపకూరలు, శనగపిండి తీసుకోకూడదు.
చలి కాలంలో బాధించే వ్యాధులు...
సంధివాతం (ఆస్టియో ఆర్ర్థరైటిస్), ఆమవాతం (రుమటాయిడ్ ఆర్ర్థరైటిస్), కటిశూలం (లో బ్యాకేక్), గృధ్రసీ (సయాటికా), అస్థిచ్యుతి (డిస్క్ ప్రొలాప్స్), శిరశ్శూల (మైగ్రెయిన్), అస్థి సౌషీర్యం (ఆస్టియో పోరోసిస్), వాతవహసిర (వేరికోస్‌వైన్స్), ఆర్జిత వాతం (ఫేసియల్ పెరాలసిస్), పక్షవాతం (పెరాలసిస్), నిద్రానాశనం (ఇన్‌సామ్నియా)... మొదలైనవి.
గృధ్రసీ వాతం (సయాటికా):
నడుములో నొప్పి మొదలై, కాలి బొటనవేలి వరకు లాగినట్లు నొప్పి ఉంటుంది. వెన్నెముకలో పూసలు (వర్టిబ్రే) అస్థచ్యుతి జరగడం, అరగడం, ఎముకల మధ్య ఉండే స్నాయువు (డిస్క్) ముందుకు జరగడం వల్ల అక్కడి నుంచి మొదలయ్యే నరాల మీద ఒత్తిడి పడి ఆ నరం శరీరంలో ఎక్కడి వరకు వెళుతుందో అంతమేరకు సూదులు పొడిచినట్టుగా నొప్పి, బాధ, తిమ్మిర్లు కలుగుతాయి. దీంతో రోగి కుంటినట్లు నడుస్తాడు. ఈ వ్యాధి వల్ల ఎక్కువసేపు నిలబడలేక , కూర్చోలేక, నడవలేకపోతాడు. ఎగుడు దిగుడు ప్రదేశాలలో నడవడం, అధిక ప్రయాణం, సరైన పరుపు, పాదరక్షలు వాడకపోవడం, నడుముకు దెబ్బ తగలడం, ఎక్కువ సేపు కూర్చొని ఉండటం, అధికబరువు మోయడం, తీవ్రమైన మలబద్ధకం మొదలైన వాటి వల్ల, పైన చెప్పిన వాత ప్రకోప కారణాల వల్ల వాత ప్రకోపం జరిగి నడుము ఎముకలలోని సందులలో కదలికలు ఏర్పడి ఈ వ్యాధి వస్తుంది.
చికిత్స:
విరేచనం, వస్తికర్మ, కటివస్తికామసేకం, పత్రపోటలీ స్వేదం, షష్టికశాలి పిండస్వేదం మొదలైన శోధన కర్మలు ఈ సమస్యకు ఉపయుక్తంగా ఉంటాయి. వీటితో పాటు శమన చికిత్సలో భాగంగా బృహత్‌వాతచింతామణి, త్రయోదశాంగ గుగ్గులు, రసరాజరసం, యోగేంద్రరసం, రాస్నాసప్తక కషాయం.. అవసరం మేరకు వాడాలి.

వాతం ప్రకోపం చెంది శిరస్సును చేరినప్పుడు మైగ్రేన్, కళ్లనొప్పి, నిద్రానాశనం (ఇన్‌సామ్నియా) వస్తాయి. ఇతర హార్మోన్ సంబంధిత వ్యాధులను కలిగించే వాతం జీర్ణాశయం చేరినప్పుడు గ్యాస్‌ట్రబుల్, మలబద్ధకం, పైల్స్‌ను కలిగిస్తుంది. రక్తంతో చేరినప్పుడు శరీరంలో అనేక రకాలైన పుండ్లను, సిరలలో చేరినప్పుడు వేరికోస్ వెయిన్స్‌ను, గౌట్ కలిగిస్తుంది. వాతం - ఎముకలు, మజ్జతో చేరినప్పుడు కీళ్లనొప్పి, ఆస్టియోపోరోసిస్ కలిగిస్తుంది.

కిడ్నీని కాపాడుకుంటే గుండెను రక్షించుకోవచ్చు.

రక్తాన్ని శుభ్రపరిచే అద్భుత యంత్రం కిడ్నీ ఒక్కసారిగా మూలనపడితే...! శరీరంలో మలినాలన్నీ పేరుకుపోయి వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం అయిపోతాయి. రక్తపోటు పెరిగి గుండె, మెదడు లాంటి ప్రధాన అవయవాలు కూడా దెబ్బతింటాయి. క్రానిక్ కిడ్నీ వ్యాధికి గురైనవారిలో గుండె దెబ్బతినడం వల్ల సగం మంది మృత్యువాత పడుతున్నారు. అందుకే కిడ్నీని కాపాడుకుంటే గుండెను రక్షించుకోవచ్చు.

శరీరంలోని మలినాలను అన్నింటినీ ఎప్పటికప్పుడు బయటికి పంపిస్తూ ఉండే ప్రధాన అవయవం కిడ్నీ. శరీరంలోని అన్ని భాగాల నుంచి సేకరించిన రక్తాన్ని వడపోసి, ఆ మలినాలను మూత్రం రూపంలో బయటకు పంపిస్తుంది. కిడ్నీలో ఉండే నెఫ్రాన్‌లు ఈ వడపోతకు ఉపయోగపడతాయి. అనేక రకాల కారణాల వల్ల ఇలా కిడ్నీ పనితీరు దెబ్బతినడం వల్ల రక్తం వడపోత ప్రక్రియ సజావుగా సాగదు. ఫలితంగా రక్తం సక్రమంగా శుభ్రం కాదు. మలినాలన్నీ పేరుకుపోవడం వల్ల శరీరంలోని అవయవాలన్నీ దుష్ప్రభానికి లోనవుతాయి. రక్తపోటు పెరగడం వల్ల గుండెకు హాని కలిగే ప్రమాదం ఎక్కువ.

చాలా రకాల జబ్బులు కిడ్నీ దెబ్బతినడానికి కారణం అవుతాయి. మధుమేహం, అధిక రక్తపోటు, క్రానిక్ గ్లోమెర్యులో నెఫ్రైటిస్ (గ్లోమెర్యులస్ వాపు), పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్ (కిడ్నీలో సిస్ట్‌లుఏర్పడటం), కుటుంబంలో ఎవరికైనా కిడ్నీవ్యాధులుంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా ఉంది. పెయిన్ కిల్లర్లు అతిగా వాడటం వల్ల కూడా కిడ్నీలు దెబ్బతింటాయి. కిడ్నీ పనితీరు బాగుంటే గుండెతో పాటు మిగిలిన అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి.

గుర్తించడం కష్టమే!
సాధారణంగా కిడ్నీ పూర్తిగా దెబ్బతినేవరకు పైకి ఎటువంటి లక్షణాలూ కనిపించవు. చాలా సందర్భాల్లో ఇతర జబ్బుల కోసం మూత్ర,రక్త పరీక్షలు చేసినప్పుడు సమస్య బయటపడుతుంది.

చాలామందిలో కిడ్నీ పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ ఏర్పడే మూత్రం పరిమాణం మాత్రం సాధారణంగానే ఉంటుంది. కానీ వాటిలో మాత్రం వ్యర్థ పదార్థాలన్నీ పోవు. మూత్ర పరిమాణం మామూలుగానే ఉండటం వల్ల కిడ్నీలో సమస్య ఉందనే అనుమానం రాదు.

కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు అనేక రకాల లక్షణాలు మూకుమ్మడిగా కనిపిస్తాయి. ఆకలి లేకపోవడం, వాంతులు, వికారం, గుండె చుట్టూ వాపు, నాడుల్లో సమస్యలు, మానసిక స్థితి సక్రమంగా ఉండకపోవడం, మగతగా ఉండటం, ఫిట్స్ రావడం, అపస్మారక స్థితిలోకి కూడా వెళ్లవచ్చు. ముఖం, పాదాల్లో వాపు, రక్తపోటు పెరగడం, రక్తహీనత, ఎముకల సమస్యలు, ఎలక్ట్రొలైట్ల పరిమాణంలో మార్పులు... ఈ లక్షణాలన్నింటినీ కలిపి యూరేమియా అంటారు.

టెస్ట్‌లే శరణ్యం
అల్బుమిన్, ప్రొటీన్ల మోతాదు తెలుసుకోవడం కోసం మూత్ర పరీక్ష చేస్తారు. క్రియాటినిన్, సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్‌ల మోతాదు రక్తపరీక్షలో తెలుస్తుంది. అవసరాన్ని బట్టి అల్ట్రాసౌండ్, సిటి స్కాన్, కిడ్నీ బయాప్సీ చేయించుకోవాల్సి ఉంటుంది.

మధుమేహం, అధిక రక్తపోటు లాంటి సమస్యలు ఉన్నాలేకపోయినా కిడ్నీ దెబ్బతింటే గుండె కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి రీనల్ ఫెయిల్యూర్‌ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ఒకసారి కిడ్నీ పూర్తిగా దెబ్బతింటే గుండ పాడయ్యే అవకాశం 20 నుంచి 30 వంతులు అధికంగా ఉంటుంది. రక్తపోటును అదుపులో ఉంచుకోవడంతో పాటు, ప్రొటీన్‌ను మూత్రం ద్వారా వెళ్లిపోవడాన్ని తగ్గించగలిగితే కిడ్నీనే కాదు గుండెనూ కాపాడుకోవచ్చు.
నివారణ - చికిత్స
కిడ్నీలు దెబ్బతినడానికి గల కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ తగ్గాలంటే ముందుగా చేయాల్సింది రక్తపోటును నియంత్రించడం. ప్రొటీన్లు త క్కువగా తీసుకుంటే డయాలసిస్ అవసరాన్ని తగ్గించవచ్చు. కాబట్టి మాంసాహారం ద్వారా వచ్చే ప్రొటీన్‌ను తీసుకోకూడదు. పొటాషియంను తగ్గించాలి. కాబట్టి పండ్లు, పండ్ల రసాలను తీసుకోవద్దు. ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండే మాంసం, సోయాబీన్స్, డ్రై ఫ్రూట్స్ జోలికి వెళ్లకపోవడం మంచిది. తక్కువ కొవ్వు ఉండే ఆహారం, రక్తంలో చక్కెరలను నియంత్రించడం, ధూమపానానికి దూరంగా ఉండటం ద్వారా కొలెస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్తపడాలి.

మధుమేహం ఉన్నవాళ్లు చక్కెరల శాతం పెరగకుండా మరింత జాగ్రత్తపడాలి. కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుంది. కాబట్టి ఎరిత్రోపాయిటిన్, ఇనుము సప్లిమెంట్లు తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. కిడ్నీ పూర్తి స్థాయిలో దెబ్బతిన్నప్పుడు డయాలిసిస్ తప్పనిసరి అవుతుంది. అవసరాన్ని బట్టి హీమోడయాలిసిస్ లేదా పెరిటినియల్ డయాలిసిస్ గానీ చేయాలి. చివరి దశలో కిడ్నీమార్పిడి తప్ప మార్గం లేదు. మనదేశంలో ఏటా సుమారు రెండు లక్షల మందికి పైగా కిడ్నీ ఫెయిల్యూర్‌కి గురవుతున్నారు. వీరిలో చాలామంది గుండె దెబ్బతినడం వల్లనే మరణిస్తున్నారు. కిడ్నీ వ్యాధిని ముందుగా గుర్తించగలిగితే రెండింటినీ కాపాడుకునే వీలుంటుంది.

* అధిక రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంచుకోవడం

* ప్రొటీన్ల మోతాదు తగ్గించడం

* మాంసాహారం, పండ్లు, పండ్ల రసాలు వద్దు.

* ధూమపానానికి దూరంగా ఉండాలి.

* సోయాబీన్స్, డ్రైఫ్రూట్స్, కొవ్వు పదార్థాలు తీసుకోవద్దు

ఒత్తిడి భారం తగ్గాలంటే

నగరాల్లో పెరుగుతున్న పని భారం వల్ల ఒత్తిడి బారిన పడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దీనివల్ల గుండెజబ్బులు, రక్తపోటు, మధుమేహం లాంటి వ్యాధులు వచ్చిపడుతున్నాయి. అందుకే ఒత్తిడిని అధిగమించడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. జీవనశైలి మార్చుకోవడం, పని ఒత్తిడి తగ్గించుకోవడం వల్ల వ్యాధులు రాకుండా చూసుకోవచ్చని వారు అంటున్నారు.

మెడిటేషన్, యోగ

మెడిటేషన్, యోగ వల్ల ఒత్తిడి దూరమవుతుంది. సూర్యనమస్కారాలు, ప్రాణాయామం వంటివి క్రమం తప్పకుండా చేయడం అలవాటు చేసుకోవాలి.
నిద్ర
ఒత్తిడి భారం తగ్గాలంటే కంటి నిండా నిద్ర పోవాల్సిందే. ఒత్తిడి నుంచి బయటపడటానికి మనసుకు, శరీరానికి తగినంత సమయం అవసరం. నిద్రలో శరీరానికి కావలసిన విశ్రాంతి లభిస్తుంది. సరిపడా నిద్ర పోతే ఒత్తిడి తాలూకు ఛాయలు కనిపించవు.
సమయానుగుణంగా..
ఆఫీసు వ్యవహారాలను, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే ఒత్తిడి లేకుండా ఉంటుంది. అందుకోసం ప్రణాళికతో వ్యవహరించాలి. పనిని వాయిదావేయకూడదు. సమయానుగుణంగా నడుచుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు.
నో డ్రింక్
మందు తాగడం వల్ల ఒత్తిడి పోతుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ నిజానికి అది తాత్కాలికంగా ఒత్తిడి తగ్గినట్లు అనిపిస్తుందంతే. రోజూ డ్రింక్‌కు అలవాటు పడటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. డ్రింక్ చేయకపోతే ఉండలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు డ్రింక్ జోలికి వెళ్లకుండా ఉండాలి.

సిగరెట్‌కు దూరం
చాలా మంది కొంచెం పని ఒత్తిడి పెరగగానే సిగరెట్ తాగడం కోసం బయటకు వెళుతుంటారు. సిగరెట్ తాగడం వల్ల రిలాక్స్ అవుతామని వారు భావిస్తుంటారు. కానీ అది తాత్కాలికమే. వాస్తవానికి పొగాకులో ఉండే నికోటిన్ స్పందించే గుణాన్ని మరింత పెంచుతుంది.
ఎక్సర్‌సైజ్
వ్యాయామం చేయడం వల్ల మనసు ఉల్లాసంగా ఉంటుంది. పాజిటివ్ ఆలోచనా ధోరణి పెరుగుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలసట దూరమవుతుంది. దీనివల్ల పనులు పెండింగ్‌లో పెట్టకుండా పూర్తి చేసేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.