24, మే 2011, మంగళవారం

జూనియర్ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఇంచార్జీ??

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్‌కు సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కౌంటర్ ప్రారంభమైంది. పార్టీ మహానాడుకు ముందే తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు ముదురుతోంది. తెలంగాణలో సీనియర్ శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి వ్యవహారం రగులుతున్న సమయంలోనే వారసత్వ పోరు కొత్త రూపు ధరించడం విశేషం. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి నారా లోకేష్‌ను ఇంచార్జీగా ప్రకటించాలని కోరుతూ తీర్మానం చేయాలని నిర్ణయించుకున్న సమయంలోనే కృష్ణా జిల్లా రాజకీయాలు దానికి కౌంటర్‌గా ప్రారంభమయ్యాయి.

కృష్ణా జిల్లాలోని ఏదో ఒక శాసనసభా నియోజక వర్గం ఇంచార్జీగా జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రకటించాలని కోరుతూ జిల్లా నాయకత్వం తీర్మానం చేయడానికి సిద్ధపడుతోంది. మంగళవారం మధ్యాహ్నం బందరులో కృష్ణా జిల్లా పార్టీ సమావేశం జరుగుతోంది. ఇందులో మహానాడులో ప్రతిపాదించే తీర్మానాలపై చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్‌ను ఏదో ఒక నియోజకవర్గం ఇంచార్జీగా నియమించాలనే తీర్మానం పురుడు పోసుకుంటుందని అంటున్నారు. తాత స్వర్గీయ ఎన్టీఆర్ సొంత జిల్లా కృష్ణా నుంచి జూనియర్ ఎన్టీఆర్ తన రాజకీయ ప్రవేశం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ ఇంచార్జీగా వ్యవహరించడానికి అనువైన నియోజకవర్గాన్ని కూడా పార్టీ నాయకులు గుర్తించనున్నారు.

తన కుమారుడు లోకేష్‌ను చంద్రగిరి నియోజక వర్గం ఇంచార్జీగా నియమించాలనే చిత్తూరు జిల్లా పార్టీ నాయకుల ఒత్తిడిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. పార్టీని బలోపేతం చేయాల్సిన తరుణంలో వారసత్వ పోరు రగలడం చంద్రబాబుకు కాస్తా ఇబ్బందిగానే ఉందని చెబుతున్నారు. తెలంగాణకు సంబంధించి నాగం జనార్దన్ రెడ్డి వ్యవహారం తలనొప్పిగా పరిణమించింది. ఇదే సమయంలో వారసత్వ పోరు కొత్త మార్గంలో తలకు చుట్టుకుంటుండడం చంద్రబాబు అసహనానికి కారణమని అంటున్నారు.

చంద్రబాబు వ్యూహం కూడా తిరగబడేట్లే ఉంది.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాజకీయాల్లో చాణక్యుడని, అతని వ్యూహం ముందు అందరూ చిత్తు కావాల్సిందేనని ఇప్పటి వరకు ఓ నమ్మకం ఉంటూ వచ్చింది. అంతేకాకుండా, ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత కష్టమైనా, నష్టమైనా తెలుగుదేశం పార్టీ భరిస్తుందనే విశ్వాసం ప్రజల్లో ఉండేది. ప్రత్యర్థులనే కాదు, పార్టీ వ్యతిరేకులను తన వ్యూహాలతో దారికి తెచ్చుకునే నేర్పు చంద్రబాబుకు ఉందని అనుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులవుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీపై, పార్టీ నాయకులపై చంద్రబాబు పట్టు కోల్పోయినట్లు కనిపిస్తున్నారు. తాను అనుసరించిన వ్యూహమే తన కొంప ముంచేలా ఉంది. తన దారిలో నడవని నేతలను కట్టడి చేయడానికి పార్టీలో వారికి వ్యతిరేకంగా మరో గ్రూపు తయారు చేసే చంద్రబాబు వ్యూహం బెడిసి కొడుతోంది.

మహబూబ్‌నగర్ జిల్లా నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి విషయంలో చంద్రబాబు అనుసరించిన వ్యూహం పూర్తిగా బెడిసికొట్టినట్లే కనిపిస్తోంది. పార్టీ వైఖరిని నాగం జనార్దన్ రెడ్డి తూర్పారపడుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారా, ఆ నిర్ణయాన్ని సమీక్షించి వెనక్కి తీసుకుంటారా తేల్చాలని ఆయన పట్టుబడుతున్నారు. నాగం జనార్దన్ రెడ్డి పట్టులో అర్థం ఉంది. తెలంగాణ ప్రజల ముందు చంద్రబాబును నాగం జనార్దన్ రెడ్డి ద్రోహిగా నిలబెడుతున్నారు. ఇతర పార్టీల నాయకులు ఇప్పటికే కావాల్సినంత చంద్రబాబు వైఖరిని తప్పు పడుతూ వచ్చారు. దీంతో తెలంగాణ ప్రాంతంలో ప్రజలు చంద్రబాబును నమ్మడానికి వీలు లేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డే ముందుకు రావడంతో ఆయన పప్పులు ఉడికేట్లు లేవు. చంద్రబాబు అనుకూల తెలంగాణ ప్రాంత నాయకత్వం దుమ్ము దులిపేందుకు కూడా ఆయన వెనకాడడం లేదు.

ఇకపోతే, వారసత్వ పోరు నానాటికీ రాజకుంటోంది. తన కుమారుడు నారా లోకేష్‌ను తెర మీదికి తేవాలనే చంద్రబాబు వ్యూహం కూడా తిరగబడేట్లే ఉంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి పార్టీ ఇంచార్జీగా నారా లోకేష్ పేరును ప్రకటించాలని ఆ ప్రాంత నాయకులు పట్టుబట్టడం కూడా చంద్రబాబుకు తలనొప్పిగానే పరిణమించింది. నారా లోకేష్‌ను అడ్డుకోవడానికి నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు తమ అస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు. కృష్ణా జిల్లాలో దాని ప్రకంపనలు కనిపిస్తున్నాయి. వల్లభనేని వంశీని దారికి తెచ్చామని అనుకున్నా అది రగులుతూనే ఉన్నది.

తాజాగా, పార్టీ సీనియర్ నాయకుడు బుచ్చయ్య చౌదరి పార్టీ నుంచి తప్పుకోవడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. బుచ్చయ్య చౌదరి పార్టీ నాయకత్వ తీరు పట్ల, అంటే చంద్రబాబు తీరు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే విషయం మాత్రం నిర్ధారణ అయింది. నాగం జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంత నాయకులను చంద్రబాబు ఉసిగొల్పినా అది ఫలితం ఇచ్చే సూచనలు కనిపించడం లేదు. సీమాంధ్ర సీనియర్ నాయకులు పార్టీ వ్యవహారాల పట్ల పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద, చంద్రబాబు కోలుకోలేని స్థితిలోకి జారుకుంటున్నారని మాత్రం అనిపిస్తోంది.

నారా లోకేష్ వర్సెస్ వైయస్ జగన్

రాష్ట్ర రాజకీయాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్సెస్ నారా లోకేష్‌గా మార్చేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. అందుకుగాను ఈ నెల 28వ తేదీన జరిగే మహానాడులో తీర్మానం చేసి తన కుమారుడు నారా లోకేష్‌ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెస్తున్నారు. తాను ఇప్పుడే పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చంద్రబాబు అనుకోవడం లేదు. కానీ వచ్చే ఎన్నికల నాటికి లోకేష్‌ను జగన్‌కు దీటుగా నిలబెట్టి పార్టీ విజయానికి వాడుకోవాలని ఆయన చూస్తున్నట్లు అనుకోవచ్చు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు కాబట్టి ఆ కోరిక మేరకే నారా లోకేష్ రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పడానికి తగిన రంగాన్ని చంద్రబాబు సిద్ధం చేశారు.

వైయస్ జగన్ కాంగ్రెసుకే కాకుండా నారా చంద్రబాబునాయుడికి కూడా బలమైన సవాల్ విసురుతున్నారు. చెప్పాలంటే, ఆయన ఎక్కువగా చంద్రబాబునాయుడినే లక్ష్యంగా చేసుకుని వాగ్బాణాలు ఎక్కుపెడుతున్నారు. చంద్రబాబు కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారని పదే పదే ఆరోపించడం ద్వారా తెలుగుదేశం అస్తిత్వాన్ని, మూలాలను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తోడు, ఏ మాత్రం వ్యవధి ఇవ్వకుండా వైయస్ జగన్ కార్యక్రమం మీద కార్యక్రమం తీసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు. కడప ఉప ఎన్నికల్లో ఆయన కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ఉప ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు సమస్యలపై గుంటూరులో దీక్ష చేపట్టారు. మంగళవారం నుంచి విజయవాడ జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు. తెరిపి లేకుండా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి వెళ్లడానికి వైయస్ జగన్‌కు వయస్సు సహకరిస్తోంది.

జగన్‌కు దీటుగా ముందుకు సాగడానికి చంద్రబాబుకు వయస్సు అడ్డుపడుతోంది. అంత విస్తృతంగా పర్యటించడం చంద్రబాబు వల్ల కాదనేది తెలిసిపోతూనే ఉన్నది. ఈ స్థితిలో నారా లోకేష్‌ను రంగం మీదికి తెచ్చి, జగన్‌తో పోటీ పడేలా చేయాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. చంద్రబాబు తన స్థానాన్ని పదిలం చేసుకుని, తిరిగి అధికారం చేపట్టడానికి నారా లోకేష్ ఓ అస్త్రంగా పనికి వస్తారని భావిస్తున్నారు. నారా లోకేష్ తనను దింపడానికి ప్రయత్నం చేసే అవకాశాలు లేవు కాబట్టి మరింత కాలం తాను నాయకత్వం నెరపడానికి, ఎన్నికల్లో గెలిస్తే ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి అవకాశం ఉంటుందని చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెసు పార్టీ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉందని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. తమిళనాడులో మాదిరిగా ఆంధ్రప్రదేశ్ కూడా రెండు ప్రాంతీయ పార్టీల ప్రాబల్యానికి అలవాలంగా మారుతుందని అంటున్నారు. ఈ స్థితిలో తమిళనాడులో కరుణానిధికి స్టాలిన్ పనికి వచ్చినట్లుగా రాష్ట్రంలో నారా లోకేష్ తనకు పనికి వస్తారని చంద్రబాబు అనుకుంటున్నట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ జోరును తట్టుకోవడం నారా లోకేష్ వల్లనే అవుతుందని అనుకుంటున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు నారా లోకేష్ వర్సెస్ వైయస్ జగన్‌గా మారే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

జూ. ఎన్టీఆర్ ఏం చేస్తారు?

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్ అధికారిక రాజకీయ రంగ ప్రవేశానికి మార్గం సుగమం చేశారు. తన రాజకీయ వారసత్వాన్ని నారా లోకేష్‌కు అప్పగించడానికి రంగం సిద్ధం చేశారు. నేరుగా రాష్ట్ర స్థాయి నాయకత్వంలోకి తేకుండా క్రమంగా అక్కడికి చేరుకునేలా ఆయన పక్కా ప్రణాళికను రచించి అమలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పార్టీ ఇంచార్జీగా నియమించడం ద్వారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించడానికి వీలు కల్పిస్తున్నారు. చంద్రగిరి మండల నాయకులు తీర్మానం చేసి పార్టీ మహానాడుకు పంపితే దాన్ని ఆమోదించేందుకు రంగం సిద్ధమైంది.

చంద్రగిరి నియోజకవర్గం నుంచి గతంలో చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు పోటీ చేశారు. ఆ తర్వాత సినీ నటి రోజా పోటీ చేశారు. తన స్వస్థలం చంద్రగిరి నియోజకవర్గం బాధ్యతలను చంద్రబాబు ఇప్పుడు తన కుమారుడు లోకేష్ చేతిలో పెడుతున్నారు. చంద్రగిరి నుంచి శాసనసభకు ఎన్నికయ్యేలా చూసి రాష్ట్ర రాజకీయాల్లో లోకేష్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించే విధంగా ప్రణాళిక అమలవుతోందని తెలిసి పోతూనే ఉన్నది. నారా లోకేష్‌ను ఎదుర్కోవడానికి సిద్ధపడిన స్వర్గీయ ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ వ్యూహం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో తన తండ్రి హరికృష్ణ సహకారం పొందుతున్న సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఏం చేయబోతారనే చర్చ జరుగుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ 2019 ఎన్నికలను లక్ష్యం చేసుకుని ముందుకు రావాలని అనుకుంటున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అందుకుగాను ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో కలిసి పని చేయడం ద్వారా 2014లో చంద్రబాబు గెలవకుండా చూడాలని అనుకుంటున్నట్లు కూడా చెబుతున్నారు. అయితే, వైయస్ జగన్‌తో పాటు నారా లోకేష్ లక్ష్యం కూడా 2014 ఎన్నికలే అవుతున్నాయి. అయితే, 2014లోనే చంద్రబాబు తప్పుకుని నారా లోకేష్‌కు పగ్గాలు అప్పజెప్తారని చెప్పలేం. దాదాపు పదేళ్ల పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి, తగిన అనుభవం సంపాదించుకునే వరకు చంద్రబాబు మాత్రమే నాయకత్వం వహిస్తారు. కింది స్థాయి నుంచి ప్రజల ఆమోదంతో, పార్టీ కార్యకర్తలో ఆమోదంతో లోకేష్ వచ్చారని చెప్పడానికి తగిన ప్రాతిపదికను కూడా చంద్రబాబు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏమైనా, జూనియర్ ఎన్టీఆర్‌కు ఇది పరీక్షా కాలమే.

పలువురు చెవులు కొరుక్కుంటున్నారు.

తెలుగుదేశం పార్టీలో ఇటు నారా, అటు నందమూరి కుటుంబాల మధ్య వారసత్వ పోరు జరుగుతున్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ కుమార్‌కు పార్టీలో మరింత ప్రాధాన్యత కల్పించే దిశలో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా బాబు సొంత జిల్లా చిత్తురు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గ బాధ్యతలను నారా లోకేష్ కుమార్‌కు అప్పగించేందుకు పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు సొంత జిల్లా నారావారిపల్లె కూడా చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉంది.

అయితే చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెసు హవా కూడా ఉంది. అక్కడ పులివెందులలా ఏకపక్షంగా లేదు. దీంతో అక్కడి టిడిపి చంద్రగిరి నియోజకవర్గానికి లోకేష్‌ను ఇంఛార్జ్‌గా నియమిస్తే పార్టీ బాగా బలపడుతుందని అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. పార్టీ అధినేత దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీని మరింత బలోపేతం చేయడానికి లోకేష్‌ను చంద్రగిరి నియోజకవర్గానికి ఇంఛార్జిగా నియమించాలనే తీర్మానాన్ని మంగళవారం జిల్లా పార్టీ సమావేశంలో ప్రవేశ పెట్టనున్నారని తెలుస్తోంది. అలా అయితే అది జిల్లా సమావేశంలో వీజీగానే ఆమోదం పొందుతుంది.

ఎలాగూ తనయుడి రాజకీయ ప్రవేశానికి తహతహలాడుతున్న చంద్రబాబు కూడా దానిని ఆమోదించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అంతేకాదు ఈ తీర్మానాన్ని త్వరలో జరిగే మహానాడులో ప్రవేశ పెట్టి ఆమోదించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయంట.
అయితే లోకేష్ కుమార్ కోసం జిల్లా పార్టీ నేతలు తీర్మానం ప్రవేశ పెట్టాల్సిందిగా చంద్రబాబు ఆదేశించారని కూడా పలువురు చెవులు కొరుక్కుంటున్నారు.