15, ఏప్రిల్ 2011, శుక్రవారం

జూనియర్ ఎన్టీఆర్‌కు ఎక్కువ మార్కులు పడ్డాయి.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి రాజకీయ వారసుడిగా సినీ హీరో, స్వర్గీయ ఎన్టీ రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్‌కే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు సాగుతోందని, నారా లోకేష్‌కూ జూనియర్ ఎన్టీఆర్‌కూ మధ్య పోటీ జరుగుతోందని, ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీలో సంక్షోభం నెలకొందని ప్రచారం జరిగిన నేపథ్యంలో దట్స్ తెలుగు ఓ ఆన్‌లైన్ పోల్ నిర్వహించింది. చంద్రబాబు రాజకీయ వారసుడు ఎవరు అనే ప్రశ్న వేసి జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్, బాలకృష్ణ, హరికృష్ణ పేర్లు ఇవ్వడం జరిగింది. వీరిలో చంద్రబాబు రాజకీయ వారసుడు ఎవరో చెప్పాలని దట్స్ తెలుగు పాఠకులను అడిగింది. ఈ పోల్ సర్వేలో విచిత్రమైన ఫలితాలు వచ్చాయి.


చంద్రబాబు రాజకీయ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్‌కు ఎక్కువ మార్కులు పడ్డాయి. చంద్రబాబు రాజకీయ వారసుడు ఎన్టీఆర్ అంటూ 51 శాతం మంది అభిప్రాయపడ్డారు. విచిత్రమేమిటంటే, నందమూరి బాలకృష్ణ మూడో స్థానంలో నిలిచారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ రెండో స్థానంలో నిలువడం గమనార్హం. చంద్రబాబు రాజకీయ వారసుడిగా నారా లోకేష్ పేరును సూచిస్తూ 28 శాతం మంది ఓటేశారు. బాలకృష్ణకు 17.2 శాతం ఓట్లు వచ్చాయి. నందమూరి హరికృష్ణ నాలుగో స్థానంలో నిలిచారు. ఆయనకు కేవలం 3.8 శాతం ఓట్లే వచ్చాయి.

అయితే, ఈ ఆన్‌లైన్ పోల్‌కు ఓ పరిమితి ఉందనే విషయాన్ని గ్రహించాలి. ఆన్‌లైన్ సౌకర్యం చాలా తక్కువ మందికి మాత్రమే అందుబాటులో ఉంది. నగర, పట్టణ ప్రజలకు, చదువుకున్నవారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంది. వైట్ కాలర్ ఉద్యోగస్థులకు, సంపన్నులకు, మధ్య తరగతి వారికి మాత్రమే ఆన్‌లైన్ సౌకర్యం ఉంది. గ్రామీణ ప్రజలకు, నిరక్షరాస్యులకు ఇది అందుబాటులో లేదు. అందువల్ల గ్రామీణ, నిరక్షరాస్యులైన ప్రజల మనోగతం ఈ పోల్‌లో ప్రతిబింబించలేదని చెప్పాల్సి ఉంటుంది

మమత ప్రభంజంలో స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇరుక్కుపోయారు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెసు-కాంగ్రెసు కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వేలు తెలుపుతున్నాయి. రెండు ప్రసిద్ధ సంస్థలు వేరు వేరుగా చేసిన సర్వేలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టిఎంసి అధికారంలోకి వస్తుందని తేలింది. హెడ్ లైన్స్ టుడే ఛానల్ కోసం ఓఆర్‌జి చేసిన సర్వేలో టిఎంసి 182 స్థానాలను, లెఫ్ట్ కూటమి 101 స్థానాలను గెలుచుకుంటుందని తేల్చింది. స్టార్ ఆనంద ఛానల్ కోసం నీల్సన్ చేసిన సర్వేలో టిఎంసి 215, లెఫ్ట్ కూటమి 74 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. బుద్దదేవ్ కంటే మమతా బెనర్జీవైపై బెంగాళీలు మొగ్గు చూపుతున్నారని సర్వేలు తేల్చాయి.


ముఖ్యమంత్రిగా మమతను 56 శాతం మద్దతు ఇస్తే, బుద్దేవ్‌కు 20 శాతం మాత్రమే ఇవ్వడం విశేషం. అయితే ఇప్పటి వరకు జ్యోతిబసు మెరుగైన ముఖ్యమంత్రిగా బెంగాళీలు చెబుతున్నారు. టిఎంసి గద్దెనెక్కితే ముప్పయి అయిదేళ్ల లెఫ్ట్ అధికారానికి బెంగాళీలు గండి కొట్టినట్లే. దశాబ్దాల పాటు అధికారం కోసం వేచి చూస్తున్న మమత ఈసారి తనకు అధికారం తప్పకుండా వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. గత పార్లమెంటు ఎన్నికల సమయం నుండే లెఫ్ట్ కూటమి ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. భారీగా పార్లమెంటు సీట్లను టిఎంసికి కోల్పోయింది. ఇప్పుడు కూడా సర్వే ఫలితాలు నిజం అయితే 227 స్థానాలున్న లెఫ్ట్ సగానికి పైగా తగ్గుతాయి.

మమత ప్రభంజంలో స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇరుక్కుపోయారు. ఆయన తన సొంత నియోజకవర్గం జాదవ్‌పూర్ నుండి పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థులుగా ఆయన ప్రభుత్వం హయాంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసి రిటైర్ అయిన మనీష్ గుప్తా టిఎంసి నుంచి, సిపిఎం నుండి బయటకు వచ్చిన శమీర్ పార్టీ ఫర్ డెమక్రటిక్ సోషలిజం నుండి బుద్దదేవ్‌పై పోటీకి దిగుతున్నారు. దీంతో ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో పలువురిని గెలిపించాల్సిన బాధ్యతలో ఉన్న బుద్దదేవ్ తన గెలుపుకోసం తన నియోజకవర్గంలోనే ఎక్కువ సమయాన్ని కేటాయించడం విశేషం. గత పార్లమెంటు ఎన్నికలలో సిపిఎం ఎపీ అభ్యర్థి చాలా తక్కువ ఆధిక్యంతో గెలుపొందడం బుద్దదేవ్‌కు చెమటలు పట్టిస్తున్నాయి. అయితే బుద్దదేవ్‌పై ఓటర్లకు వ్యతిరేకత లేకున్నప్పటికీ పార్టీపైన మాత్రం తీవ్ర అసంతృప్తి నెలకొంది