9, ఏప్రిల్ 2011, శనివారం

ఈనాటి రాజకీయాల్లో ఈ సంస్కారం అరుదై పోయింది.

ఇప్పటి తరం రాజకీయ నాయకుల్లో అరుదుగా కనిపించే సంస్కారం గత తరం రాజకీయ నాయకుల్లో తరుచుగా కనబడేదనడానికి ఒక ఉదాహరణ.
దామోదరం సంజీవయ్య గారు ఆంద్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి. 1960 వ సంవత్సరం నుండి 1962వరకూ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కర్నూలు జిల్లాకు చెందిన సంజీవయ్య మొదటి దళిత ముఖ్యమంత్రిగా ఘనత వహించారు. తర్వాత కేంద్రంలో కార్మిక ఉపాధి శాఖ మంత్రిగా పని చేశారు. అంతటి ఉన్నత స్థానానికి చేర్చింది ఆయన సంస్కారమే !
విదేశీ పర్యటనలంటే ఈనాటి రాజకీయనాయకులు ఎగిరి గంతులేస్తారు. సంజీవయ్య గారికి విదేశాలనుంచి చాలాసార్లు ఆహ్వానాలందాయి. అయితే వాటిని ఆయన సున్నితంగా తిరస్కరించేవారు. సంజీవయ్య గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్న రోజుల్లో అమెరికా రాయబారి గాల్ బ్రెట్ అమెరికాకు ఆహ్వానించారు. అయితే తనకు ఈ దేశంలోనే చెయ్యడానికి చాలా పని ఉందని ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఆ రాయబారి ఆయన సంస్కారానికి ముగ్దుడయ్యాడు.
విదేశీ పర్యటనలకు ప్రజాధనం ఖర్చు చెయ్యడం సంజీవయ్య గారికి ఇష్టం ఉండేది కాదు. ఆయన రాష్ట్ర సహకార శాఖ మంత్రిగా ఉన్న రోజుల్లో విదేశాలనుంచి చాలా ఆహ్వానాలు అందాయి. అయితే ఆయన అవేమీ ఉపయోగించుకునే వారు కాదు. పైగా " సహకార రంగంలో ఇతర దేశాల కంటే మనమే ముందున్నాం. ఇక అక్కడికి వెళ్లి నేర్చుకునేదేమిటి ? అనవసరంగా ప్రజా ధనం వృధా చెయ్యడం తప్ప " అనేవారు. ఈనాటి రాజకీయాల్లో ఈ సంస్కారం అరుదై పోయింది.

పార్టీని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోవాలనే నందమూరి కుటుంబ సభ్యుల వ్యూహం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి నందమూరి కుటుంబ సభ్యులు ఎసరు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ పగ్గాలను చంద్రబాబు నుంచి లాక్కోవడానికి నందమూరి కుటుంబ సభ్యులు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నట్లు ఓ ప్రముఖ దినపత్రిక వార్తాకథనం సారాంశం. తెలుగుదేశం పార్టీని స్వర్గీయ ఎన్టీ రామారావు కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి చేతుల్లో పెట్టడానికి ఆమె సోదరుడు హరికృష్ణ, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తెర వెనక పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. కృష్ణా జిల్లా పార్టీ రాజకీయాల్లో తలెత్తిన విభేదాల వెనక హరికృష్ణనే ప్రధాన పాత్ర పోషించినట్లు సమాచారం.


చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన దేవినేని ఉమా మహేశ్వర రావుపై జూనియర్ ఎన్టీఆర్ వర్గానికి చెందిన కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేయడం వెనక పార్టీని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోవాలనే నందమూరి కుటుంబ సభ్యుల వ్యూహం ఉందని చెబుతున్నారు. చంద్రబాబుపై నేరుగా విమర్శలు చేయలేక ఉమా మహేశ్వర రావును టార్గెట్ చేసుకుని తమ కథ నడిపించినట్లు ప్రచారం జరుగుతోంది. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లకు సినీ హీరో బాలకృష్ణ పరోక్ష మద్దతు లభిస్తున్నట్లు చెబుతున్నారు. తన కూతురు బ్రాహ్మణిని చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు ఇచ్చి వివాహం చేయడంతో బాలకృష్ణ చంద్రబాబుకు వ్యతిరేకంగా తెర మీదికి రావడానికి ఇష్టపడడం లేదని అంటున్నారు.

చంద్రబాబుపై తిరుగుబాటుకు జరుగుతున్న వ్యూహంలో కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు. రాజకీయ నాయకురాలిగా, పాలనాదక్షురాలిగా పేరు గడించిన పురంధేశ్వరికి తెలుగుదేశం పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. సోదరి పురంధేశ్వరి అంటే హరికృష్ణకు ఎనలేని అభిమానం. స్వర్గీయ ఎన్టీఆర్ వారసురాలిగా పురంధేశ్వరిని నిలబెట్టాలనేది నందమూరి కుటుంబ సభ్యుల ప్రయత్నంగా చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీని తమ చేతుల్లోకి తీసుకుని రాష్ట్రంలో తిరిగి పార్టీకి వైభవం కగలించాలని, తాను ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని పురంధేశ్వరి కూడా భావిస్తున్నట్లు చెబుతున్నారు.

వైయస్ వివేకా గెలుపుపై మంచి ధీమాతో ఉన్నారు.

యవసాయ శాఖ మంత్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైయస్ వివేకానందరెడ్డి తన వదిన విజయమ్మపై పులివెందుల శాసనసభ నియోజక వర్గం నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సానుభూతి ఓటుతో పాటు అక్కడ వైయస్‌కు ఉన్న ప్రాబల్యం కారణంగా పలువురు విజయమ్మ గెలుపొందుతుందని చెబుతున్నారు. జగన్‌తో సై అన్న వివేకానందరెడ్డి తాను ఓడిపోతే ఏం చేస్తారు. దానికి ఆయనే కొన్ని టీవి ఇంటర్వ్యూలలో సమాధానం చెప్పారు. తాను పులివెందుల నియోజకవర్గంలో ఓడిపోతే సామాన్య కార్యకర్తగా నియోజకవర్గంలో పని చేస్తానని చెప్పారు. తాను ఎలాంటి మంత్రి పదవులు కానీ, ఎమ్మెల్సీ పదవులు కాని ఆశించనని చెప్పారు.


పార్టీని వీడిన జగన్‌ను ఓడించడానికి కడప , పులివెందుల ఉప ఎన్నికలను కాంగ్రెసు పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా అదే కుటుంబానికి చెందిన జగన్ చిన్నాన్న వైయస్ వివేకానందను వదినపై పోటికి నిలిపి జగన్‌ను దెబ్బ కొట్టాలని చూస్తుంది. తాను ఓడిపోతే ఎలాంటి పదవులు ఆశించనని వివేకా చెప్పినప్పటికీ కాంగ్రెసు పార్టీ భవితవ్యం కోసం తనయుడిపైనే పోరు సల్పుతున్న వివేకా ఓడితే కాంగ్రెసు ఆయనకు పార్టీలో సరియైన ప్రాతినిధ్యం ఇస్తుందా అనేది ప్రశ్నార్థకం. అంతేకాదు ఆయనపై కాంగ్రెసు పార్టీకి కూడా నమ్మకం లేని పరిస్థితి కనిపిస్తోందంట. ఆయన ఏ సమయంలో జగన్‌వైపు వెళతారనే అపనమ్మకంతో ఉన్నదంట పార్టీ. ఒకవేళ అదే జరిగితే తన తల్లిపైనే పోటీకి దిగిన చిన్నాన్నను జగన్ దగ్గరకు తీస్తారా అంటే అదీ కష్టమే.

అయితే వైయస్ వివేకా గెలుపుపై మంచి ధీమాతో ఉన్నారు. పులివెందుల ప్రజలు తనతో ఉన్నారని చెప్పారు. దివంగత తన అన్న బాటలో తాను పయనిస్తున్నట్టు చెప్పారు. వైయస్ ఎప్పుడూ కాంగ్రెసును వీడాలని అనుకోలేదని అలాగే తాను కూడా అన్న బాటలోనే కాంగ్రెసు పార్టీలోనే ఉండాలని భావిస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెసు అధిష్టానం తనను నిర్లక్ష్యం చేసిందని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని వీడి వెళ్లినప్పుడు కూడా ఆయన ఇదే చెప్పారు. తాను జగన్‌తో వెళ్లేది లేదని చెప్పాడు. జగన్ పార్టీ ప్రకటించాక కూడా అదే చెప్పారు. అన్న బాటను వీడి జగన్ పార్టీలో చేరేది లేదని చెప్పారు. అన్న బాటలోనే కాంగ్రెసు అభివృద్ధికి పాటుపడుతూ కాంగ్రెసు సూచించిన చోట పోటీ చేస్తానని చెప్పారు.

అన్నట్టుగానే ఆయన వదిన విజయమ్మపై పులివెందులనుండి పోటీకి దిగారు. వివేకా కాంగ్రెసు పార్టీనుండే పోటీలోకి దిగినప్పటికీ ఆయన వెంట ఆయన కుటుంబం లేక పోవడం విశేషం. కేవలం ఆయన భార్య, కూతురు తప్పితే మిగిలిన కుటుంబ సభ్యులు, బంధువులు అంతా జగన్ వెంటే ఉన్నారు. దీంతో వివేకా తాను ఒంటరి అయినట్లుగా ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ తనకు నియోజకవర్గ ప్రజలతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా తన గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.