6, ఏప్రిల్ 2011, బుధవారం

బాబా ప్రశాంతి నిలయాన్ని, దాని కార్యకలాపాలను నడిపించేదెవరనే ప్రశ్న ఉదయిస్తోంది.

ప్రశాంతి నిలయాన్ని, దాని కార్యకలాపాలను పుట్టపర్తి సత్య సాయిబాబా తర్వాత ముందుకు నడిపించేదెవరనే ప్రశ్న ఉదయిస్తోంది. సత్య సాయిబాబాకు వారసుడే లేడని అంటున్నారు. నాలుగేళ్ల క్రితం సత్య సాయిబాబా ఆరోగ్యం దెబ్బ తిన్నప్పుడే ఆయన వారసుడిపై చర్చ జరిగింది. అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతున్న పుట్టపర్తే దాని ప్రధాన కేంద్రం కానుందనే వార్తలు వస్తున్నాయి. సాయిబాబా 1963 జులై 6వ తేదీన గురు పూర్ణిమ సందర్భంగా తన ఆధ్యాత్మిక రహస్యాన్ని వెల్లడించారు. శివ - శక్తి సూత్రానికి సంబందించిన ముగ్గురి అవతారమని ఆయన చెప్పుకున్నారు. శ్రీ సత్య సాయిబాబా శివుడు, పార్వతి, కర్ణాటకలోని మాండ్యాలో గల ప్రేమ సాయిల అవతారంగా తనను ఆయన చెప్పుకున్నారు.

చిన్నప్పుడు తాను రాసిన పాటల్లో కూడా సత్య సాయి షిర్డీ సాధువును ఉటంకిస్తూ వస్తున్నారు. తాను 8 ఏళ్ల తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీలో తాను తిరిగి జన్మిస్తానని షిర్డీ సాయిబాబా తన మరణానికి ముందు 1918లో ప్రకటించాడు. సత్యసాయిబాబా 1926లో జన్మించారు. తనను షిర్డీ బాబాగా ప్రకటించుకున్నారు. గత జన్మలో తాను షిర్డీ సాయిబాబానని ఆయన తర్వాత ప్రకటించుకున్నారు. తాను మాండ్యాలో ప్రేమ సాయిగా పుడుతానని సత్యసాయి బాబా తన ప్రవచనాల సందర్భంగా చెప్పేవారు. కానీ ఇప్పటి వరకు సత్యసాయి ట్రస్టు ఆయన వారసుడిని ప్రకటించలేదు. సత్యసాయి వారసుడిని ప్రకటించే కార్యక్రమానికి సత్యసాయి ట్రస్టు స్వస్తి చెప్పినట్లు సమాచారం. సత్యసాయి బాబా సోదరుడు జానకీ రామ్ కుమారుడు రత్నాకర్ సత్య సాయి ట్రస్టులో శక్తివంతుడైన సభ్యుడు.

బాబా ని కుడా వదలని రాజకీయం???

కోట్లాది భక్త జనానికి ప్రశాంతతను ఇచ్చే భగవాన్ సత్యసాయి ఆధ్వర్యంలోని సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఆధిపత్య పోరులో కూరుకు పోయినట్టుగా తెలుస్తోంది. వందల కోట్ల రూపాయలతో ప్రజలకు నీటి వంటి పలు సౌకర్యాలను అందిస్తున్న సత్యసాయిని ట్రస్టు సభ్యులు తమ బంధీలో ఉంచినట్లుగా తెలుస్తోంది. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం కేంద్రంగా సత్యసాయిబాబా ఆధ్వర్యంలోని ట్రస్టు జిల్లా, రాష్ట్రం, దేశాన్ని దాటి విదేశాలలో కూడా సేవా కార్యక్రమాలు అందిస్తోంది. బాబా సేవలకు తోడ్పుటును అందించడానికి చాలామంది కోట్లాది రూపాయలు అందజేసి ట్రస్టుకు చేయూత నిస్తున్నారు.

దీంతో వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఈ ట్రస్టులో ఉన్నాయి. దీంతో బాబా పక్కన తమ స్వార్థానికి సేవా సామ్రాజ్యాన్ని ఉపయోగించుకోవాలని చూసే స్వార్థపరులు చేరినట్టుగా భక్తులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఓ అజ్ఞాత భక్తుడితో బాబా ఇటీవల ఆవేదనతో చెప్పినట్టుగా తెలుస్తోంది. ట్రస్టులోని కొందరు సభ్యులు తనను బంధీని చేసినట్లు బాబా ఆ భక్తుడి ముందు వాపోయినట్లుగా తెలుస్తోంది. తాను తలపెట్టిన సేవా యజ్ఞాన్ని సొంత కైంకర్యానికి ఉపయోగించుకుంటున్నారని ఆయన ఆవేదన చెందినట్లుగా తెలుస్తోంది.

సత్యసాయి ట్రస్టులో ఆధిపత్య పోరు ఎప్పటినుండో నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. బాబాను జాగ్రత్తగా చూసుకోవాల్సిన ట్రస్టు సభ్యులే ఆయన పట్ల నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బాబా ఆసుపత్రిలో చేరినప్పటినుండి జరుగుతున్న పరిణామాలు కూడా ఇందుకు అనుమానాలు కలిగిస్తున్నాయి. ట్రస్టు సభ్యులు కూడా బాబా ఆరోగ్యం పట్ల గోప్యత ప్రదర్శిస్తున్నట్లుగా భక్తులతో పాటు బాబా కుటుంబ సభ్యులు ఆనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యానికి ట్రస్టు సభ్యులే కారణమని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రెండు రోజులకు ఒకసారి భక్తులకు కనిపించి సందేశం ఇచ్చే బాబా గత నవంబర్‌లో ఆయన జన్మదిన ఉత్సవాల తర్వాత భక్తులకు కనిపించనే లేదంట. అంతేకాదు జన్మదిన సందర్భంగా భక్తులకు కనిపించి సందేశమిచ్చే బాబా ఇటీవలి జరిగిన జన్మదిన వేడుకల్లో మాత్రం భక్తులకు కనిపించడమే కానీ ఎలాంటి సందేశం ఇవ్వలేదంట.

దీంతో ఐదారు నెలలుగా బాబా ఆరోగ్యం సరిగా లేనప్పటికీ ట్రస్టు సభ్యులు బయటకు చెప్పటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. బాబా ఆరోగ్యం బాగా లేదని తెలిసి ప్రత్యేక వైద్య బృందం హెలికాప్టర్‌లో వచ్చినప్పటికీ ఓ ట్రస్టు సభ్యుడు రాహుకాలం పేరిట గంటపాటు వైద్యం అందించకుండా దూరం ఉంచడం భక్తుల్లో మరింత అనుమానం కలిగిస్తోంది. గత జన్మదిన వేడుకల తర్వాత బాబా ఆరోగ్యం క్రమంగా క్షీణించినట్లు పలువురు భావిస్తున్నారు. బాబా నెలలుగా అన్నం తినకుండా మానేసినా ట్రస్టు సభ్యులు అన్నం పెట్టలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. బాబా వద్దకు సన్నిహిత బంధువులెవరినీ ట్రస్టు సభ్యులు రానివ్వక పోవడంతో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మూడు రోజుల క్రితం మాత్రం బాబాకు వెంటలేషన్ కోసం సమ్మతి కావాలంటూ బంధువులను సంప్రదించారంట.

సత్యసాయి సెంట్రల్ ట్రస్టుకు భగవాన్ సత్యసాయిబాబు అధ్యక్షుడు కాగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చక్రవర్తి కార్యదర్శి. ఇందులో సభ్యులుగా సత్యసాయి సోదరుడి కుమారుడు రత్నాకర్, సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భగవతి తదితరులు ఈ ట్రస్టులో సభ్యులు. ట్రస్టు చెక్ పవర్‌తో పాటు వ్యవహారాలన్నీ బాబాతో పాటు కార్యదర్శి పేరుమీద నడుస్తాయంట. అయితే సత్యసాయి తమ్ముడి కుమారుడు రత్నాకర్‌కు కూడా ఇటీవల చెక్ పవర్ పేరిట బదలాయింపులు జరిగేందుకు ప్రయత్నాలు జరిగాయంట. అయితే దీనికి మిగిలిన సభ్యులు అడ్డు చెప్పడంతో వెనక్కి తగ్గారంట. దీంతో ట్రస్టులో ఆధిపత్య పోరు నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ట్రస్టులో తమిళనాడుకు చెందిన వారి హవా నడుస్తున్నట్టు కూడా తెలుస్తోంది.

స్వాతంత్ర్య స్ఫూర్తి ఇంకా మిగిలి వుండడంవల్లనో ఏమో కానీ రాజకీయ నాయకులు అవినీతే లక్ష్యంగా వుండేవారు కాదు.

ఈరోజుల్లో రాజకీయనాయకులకు అందినకాడికి దండుకుని పదవి ఉండగానే ఇల్లు / ఇళ్ళు చక్కబెట్టుకోవడం వెన్నతో పెట్టిన విద్య. మరీ పాత తరం కాకపోయినా 60 వ దశకం వరకూ స్వాతంత్ర్య స్ఫూర్తి ఇంకా మిగిలి వుండడంవల్లనో ఏమో కానీ రాజకీయ నాయకులు అవినీతే లక్ష్యంగా వుండేవారు కాదు. వారిలో మాజీ ప్రధాని స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి ప్రథములని చెప్పుకోవచ్చు.

ఐన్ స్టీన్ గాంధీ గారి గురించి చెప్పినట్లు లాల్ బహదూర్ నిజాయితీని గురించి చెబితే భావితరాలు నమ్మకపోవచ్చు.
చెప్పిన వాణ్ని అజ్ఞానిగా జమ కట్టవచ్చు. కానీ ఇది నిజం. దానికి నిదర్శనంగా ఒక సంఘటన.

కేంద్ర రైల్వే మంత్రిగా వున్న రోజుల్లో 1956 లో మహబూబ్ నగర్ దగ్గర జరిగిన రైలు ప్రమాదంలో 112 మంది మరణించినందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. తర్వాత 1957 లో జరిగిన ఎన్నికలలో నెగ్గి తొలుత సమాచార, రవాణాశాఖ మంత్రిగా ఆ తర్వాత వాణిజ్య, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు.

కొన్ని సంవత్సరాల తర్వాత ఓ రోజు అనుకోకుండా ఒక మిత్రుడు ఆయన ఇంటికి వచ్చాడు. ఆ మిత్రునికి మంచి రుచి గల టీ ఇచ్చారు శాస్త్రి. ఆ రుచి చూసి ఆశ్చర్యంతో ఆ మిత్రుడు ' ఇంత రుచి గల టీ నేనెక్కడా తాగలేదు. ఈ రుచి ఎలా వచ్చింది ? ' అని అడిగాడు.

దానికి శాస్త్రి గారు నవ్వుతూ ' ఈ పొడి మీకు బజారులో ఎక్కడా దొరకదు. విదేశాలకు మాత్రమే ఎగుమతి చేసేది. నేను కేంద్ర పరిశ్రమల శాఖకు మంత్రిగా వున్నపుడు టీ బోర్డు వారు బహుకరించారు ' అన్నారు.

దానికా మిత్రుడు ' మీరు ఆ శాఖను నిర్వహించి చాలా కాలమైంది కదా ? ఇన్నాళ్ళదాకా వచ్చిందంటే వాళ్ళు చాలా డబ్బాలు ఇచ్చుండాలి ' అన్నాడు.

' అవును. చాలానే ఇచ్చారు. మొత్తం మూడు డబ్బాలు. రెండు అప్పుడే మా ఆఫీసు వాళ్లకిచ్చాను. ఒకటి నేను దాచుకున్నాను. ఈ టీ అంతే నాకిష్టం. అందుకే దాచుకుని అప్పుడప్పుడు మాత్రమే తాగుతాను ' అన్నారట లాల్ బహదూర్ శాస్త్రి గారు.

శ్రీశ్రీ :::ప్రశ్న

ప్రశ్న : 1+1 = 1 ఎలా అవుతుంది ?
శ్రీశ్రీ : ప్రేయసీ + ప్రియులు = ఇద్దరు ఒక్కటే !
దేవుడు + మానవుడు = ఇద్దరు ఒక్కటే !

ప్ర : శ్రీశ్రీకి కుడికన్ను అదురుతుందా ?
శ్రీశ్రీ : శ్రీశ్రీ ఎప్పుడూఎడమ ప్రక్కనే ఉంటాడు. కుడిప్రక్కన ఉండడు. పుట్టిన దగ్గరనుండి ఎడమ కాలు, ఎడమ చెయ్యి అలవాటు. కొంతకాలం ఎడమ చేత్తోనే రాసేవాణ్ణి.

ప్ర : శ్రీశ్రీ అంటే అర్థమేమిటి ?
శ్రీశ్రీ : చాలా ఉన్నాయి. శ్రీశ్రీ రచనలు ఎంతమంది చదివారో అన్ని అర్థాలు.

ప్ర : తెలంగాణా ప్రజల కోరికలు అర్థరహితమా ?
శ్రీశ్రీ : ఏ ప్రజల కోరికలు అర్థరహితం కావు. వాళ్ళ తరఫున వకాల్తా పుచ్చుకునే వినాయకుల వ్యాఖ్యానాలే అర్థరహితమైనవి.


ప్ర:: మీ కవిత్వం చూస్తే ఆవేశం, మీ ప్రవర్తన చూస్తే అసహ్యం. మీరేమంటారు ?
శ్రీశ్రీ : నా ప్రవర్తన నాతోనే అంతమవుతుంది. నా కవిత్వం తెలుగుజాతి ఉన్నంత కాలం నిలుస్తుంది.

ఆటా పాట అంటూ తల్లిదండ్రులకు డబ్బు సంపాదించే యంత్రాలుగా మారిపోవాలా ?

బాల్యం ఎంత మధురమైనది
పెద్దతనంలో తీపి జ్ఞాపకాల్నిస్తుంది

మరి ఆ బాల్యంలో మాధుర్యం నేడు కరువైపోతోంది
పెద్దతనానికి చేదు జ్ఞాపకాలే మిగులుస్తోంది

బాల కార్మికులను రక్షించడానికి చట్టాలున్నాయి
మరి ఈ బాల కార్మికులను రక్షించడానికి ఏ చట్టాలున్నాయి ?

తమ పిల్లల్ని హింసిస్తే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు
తల్లిదండ్రులే హింసిస్తే ఆ పిల్లల్ని కాపాడేవారెవరు ?

ఆడుతూ పాడుతూ చదువుకుని బంగారు భవిష్యత్తు బాట వేసుకోవాలా ?
ఆటా పాట అంటూ తల్లిదండ్రులకు డబ్బు సంపాదించే యంత్రాలుగా మారిపోవాలా ?

తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దాలా ?
తమ తాత్కాలికావసరాల కోసం వారి భవిష్యత్తును తాకట్టు పెట్టాలా ?

ఒకప్పుడు పిల్లలకు తెరమీద నటించే అవకాశం రావడం అదో అద్భుతం
తమ పిల్లలని నటింపజేయడం ఓ సరదా ! పిల్లలే పూర్తిగా నటించిన సినిమాలు చాలా తక్కువ. కేవలం ఒకటి రెండు సీన్లుకే పరిమితమయ్యేవారు. అరుదుగా అక్కడక్కడా పూర్తి నిడివి బాల పాత్రలుండేవి.
వాటిల్లో నటించే పిల్లలు ఎక్కువగా సినీ రంగంలో పనిచేస్తున్న వారి పిల్లలే అయ్యేవారు. లేదా కొంతమంది ఉత్సాహంకొద్దీ తమ పిల్లల్ని ఒకటి లేక రెండు సినిమాల్లో నటింపజేసేవారు. వారి భవిష్యత్తుకు ఆటంకం కలగడానికి అప్పటి తల్లిదండ్రులు అంతగా ఇష్టపడేవారు కాదు. అయితే డబ్బు కోసం పిల్లల్ని సినిమాల్లో నటించడానికి పంపే తల్లిదండ్రులు ఆ రోజుల్లో కూడా వున్నా ఆర్థికంగా ఇబ్బందులుండి తప్పనిసరి పరిస్థితుల్లో ఆపని చేసేవారే ఎక్కువగా వుండేవారు.

కానీ ఇప్పుడు బుల్లి తెరనిండా నాట్యం చేస్తున్న పిల్లలే ! అవి నాట్యాలనడం కంటే విన్యాసాలనడం మేలేమో ! ఇవి చేస్తున్న పిల్లలకు తాము చేస్తున్నది ఏమిటో అవగాహన వుందా ? ఏ లక్ష్యం కోసం ఆ పని చేస్తున్నారో వారికి తెలుసా ? భవిష్యత్తులో వీటి ప్రభావమేమిటో వారికి అవగాహన వుందా ? ఎవరికోసం తాము ఈ కసరత్తులు చేస్తున్నామో వారికి అర్థమవుతుందా ? ముమ్మాటికీ కాదు . ఇవేమీ వాళ్లకు తెలీదు. అర్థమయ్యేంత జ్ఞానం వారికి వుండదు. ఈ ఆట పాటా కార్యక్రమాల్లో బహుమతులు గెలుచుకున్న పిల్లలకు అదే వృత్తి కాగలదా ? ఒకవేళ అయినా ఎంతకాలం ఆ వృత్తిలో వుండగలరు ? ఎంత డబ్బు సంపాదించగలరు ? అసలు అంతమంది విజేతల్లో ఎంతమంది తమ గమ్యస్థానం అనుకునే సినిమా రంగానికి చేరుకోగలుగుతున్నారు ?

హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో శిక్షణ పేరుతో హింసకు గురవతూ అందమైన బాల్యాన్ని తాకట్టు పెట్టుకోవడం అవసరమా ?

అనారోగ్యం చేసినా, కదలలేని పరిస్థితుల్లో వున్నా పోటీలకు తయారు చెయ్యడం కోసం వాళ్ళని హింసించే తల్లిదండ్రులు,
బహుమతి రాకపోతే నిన్ను ఏం చేస్తానో చూసుకో అని బెదిరించే తల్లిదండ్రులు, ఓడిపోతే కెమెరా ఎదురుగా మేమేం బాధపడటంలేదని, కృషి చేసినా అదృష్టం కలసిరాలేదని, ఇదో చాలెంజ్ గా తీసుకుంటామని సన్నాయినొక్కులు నొక్కి. ఇంటికెళ్ళాక మా పరువు తీసావని గొడ్డును బాదినట్లు బాదే తల్లిదండ్రులు....... ఇలా పిల్లలని తమ కంటిపాపల్లా పెంచాల్సింది పోయి వాళ్ళెంత చిత్రహింస అనుభవించినా తమకి డబ్బు, కీర్తి సంపాదించి పెట్టాలని శాసించే తల్లిదండ్రుల గురించి మీకు తెలుసా ? తమ అవసరాలకీ, తమ ఆడంబరాలకీ పిల్లల్ని బలి చేసే హక్కు ఆ తల్లిదండ్రులకు ఎవరిచ్చారు ? తమ అభిరుచుల్ని పిల్లలపై బలవంతంగా రుద్దడం ఎంతవరకూ సమంజసం ?

ఇది బాల కార్మిక నిరోధ చట్టం పరిధిలోకి రాదా ? గృహహింసా నిరోధ చట్టం లాగే బాల హింసా నిరోధ చట్టం వుందా ? లేకపోతే అలాంటి చట్టాల్ని తెచ్చి ఈ హింసనుంచి బాలల్ని కాపాడలేమా ?

ఈ పరిస్థితికి కారణమెవరు ?
వ్యాపారం పేరుతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న చానల్స్ వారా ?
ఈ బాల హింసను నిరోధించలేని ప్రభుత్వమా ?
తమ పిల్లలతోనే వ్యాపారం చేస్తున్న తల్లిదండ్రులా ?

ఇప్పటి పరిస్థితి ఇదైతే గతంలో కొంతమంది బాల నటుల పరిస్థితి గురించి స్వామి చిత్రానంద గా ప్రసిద్ధికెక్కిన కె. వి. రావు గారు కొంతకాలం క్రితం విజయచిత్రలో రాసారు. రావు గారు తెలుగు చిత్ర సీమలో సహాయ దర్శకుడిగా సుమారు అయిదు దశాబ్దాలు ప్రముఖ దర్శక నిర్మాత బి.ఏ సుబ్బారావు గారి దగ్గర, బాపు గారి దగ్గర చాలా చిత్రాలకు సహకార దర్శకుడిగా, సహ దర్శకుడిగా పనిచేశారు. ఆయన తన అనుభవంలో చూసిన కొన్ని సంఘటనలను ఏర్చి కూర్చి రాసిన వ్యాసం నుంచి కొన్ని భాగాలు.......

తన తల్లిని తండ్రి వదిలేసిన కారణంగా తాను నటించి తల్లిని పోషించాల్సి వచ్చింది ఒక బాలనటుడికి. బాల నటుడిగా అగ్రశ్రేణికి చేరాడు. ద్విపాత్రాభినయం కూడా చేసాడు. కానీ, చదువుకోలేదు. సెట్ లోకి వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడే డైరెక్టర్ గారి పిల్లల్ని ( తన ఈడు వారిని ) చూసి సెట్ బయిటకు వెళ్లి " తాను స్కూల్ కు వెళ్ళడం లేదనీ, వాళ్ళలా ఇంగ్లీష్ మాట్లాడలేననీ భోరున ఏడ్చాడు.
' చదువుకుంటున్న ఆ పిల్లలకన్నా నువ్వే గొప్ప - కొన్ని వేలమందికి తెరమీద కనబడి - వాళ్ళందర్నీ నువ్వు నవ్విస్తున్నావు ' అని ఓదార్చి షాట్ కి తీసుకెళ్ళాను.
************
షూటింగ్లో 11 గంటలకు పిల్లలందరికీ బిస్కట్లు, పాలు, హార్లిక్స్ ఇచ్చేవారు. ఓ బాలనటుడు- తనకిచ్చిన బిస్కట్లు తినకుండా దాచుకునేవాడు. ' ఎందుకయ్యా దాచుకుంటున్నావు అని అడిగితే -
' నాకు బిస్కట్లు వద్దండీ - పొద్దున్న టిఫిన్ తిన్నా కదండీ - ఇవి మా చెల్లాయికి పట్టుకెడ్తానండీ ! ' అన్నాడు.
' ఫర్వాలేదు - నువ్వు తినేయ్. వెళ్ళేటపుడు మీ చెల్లాయికి పట్టుకెళ్డువుగాని ' అని చెబితే అప్పుడు తిన్నాడు.
' సార్ ! అతనికి షర్ట్ యిచ్చారు గదండి. నాకూ షర్టిప్పించండి " అన్నాడు.
" నీ షర్ట్ బాగుంది. అంచేత నీ షర్ట్ మార్చలేదు. "
" అది కాదండి. నాకు ఈ షర్ట్ ఒక్కటే వుందండీ - అందుకని " అని చెప్పాడు.
ఇతను చెబుతున్నది నిజమేనా అని అతన్ని తీసుకువచ్చిన జూనియర్ ఆర్టిస్ట్ సప్లయిర్ని అడిగాను.
" నిజమేనండీ ! వీళ్ళ అమ్మని నాన్న వదిలేసాడు. తల్లినీ, చెల్లినీ పోషించాల్సింది వీడే - తల్లి కూడా అప్పుడప్పుడు వేషాలు వేస్తుంది. చెల్లెలు చదువుకుంటోంది. వీడు యాక్టు చేసి తల్లినీ, చెల్లెల్నీ పోషించాలి. చెల్లిని మాత్రం సినిమాలోకి దింపను. చదివిస్తాను అంటాడు " అని నిజం చెప్పాడు. ఆ కుర్రాడికి సరిపోయే రెండు షర్టులు చెల్లెలికి రెండు గౌన్లు యిప్పించాను.

*************

ఎంతో చురుగ్గా వుండే అయిదేళ్ళ పాపని ఆమె తల్లినీ తండ్రినీ కాదని, తన దగ్గర వుంచుకుని ' బాలనటి ' ని చేసింది ఓ అమ్మమ్మ. ఒకరోజున ఆ పాప ' మొదటి టేకు ' ను ' ఓకే ' చెయ్యలేదు. అయినా చాలా బాగా చేసింది.
ఆ రాత్రి మొదటి టేకు ఓకే చేయలేదన్న కోపంతో ఆ పసిపాప కంట్లో అమృతాంజనం పెట్టింది అమ్మమ్మ. ఆ పాప ఒకటే ఏడుపు. అమ్మమ్మని చీవాట్లు పెట్టి, ఆ పాపను ఆ రాత్రి నాదగ్గరే పడుకో బెట్టుకున్నాను.

***********
ఓ నాడు ఓ పాప చెప్పింది.
' మా అమ్మమ్మ నాకు పట్టు పరికిణీ, జూకాలూ, నెక్లెసూ, గాజులూ, అన్నీ తెస్తుంది. తెలుసా ? " అంది.
నిజమే అనుకుని సంతోషించాను.
ఆ సాయింత్రం అమ్మమ్మ వచ్చింది - కారు నిండా ప్యాకెట్లే !
" వాటిలో ఆ పాపకోసం తెచ్చిన ఓ ఆర్ట్ సిల్క్ పరికిణీ, గిల్ట్ నగలూ వున్నాయి. మిగరావి అన్నీ ఆమె కోసం కొనుక్కున్న కంచి పట్టు చీరలూ, వెంకటగిరి నేత చీరలూ, ఆమె భర్తకోసం సేలం అంచు పంచెలూను !
*************
ఒక బాల నటుడు బాగా నటిస్తాడని తెలిసి, అతణ్ణి డైరెక్టర్ గారికి చూపించాలనుకున్నాను. ఆ కుర్రాడి తండ్రి -
" మా వాడికి రేపు 7 గం.లకే షూటింగ్ - 6 గం.లకి ఇంటి దగ్గర బయిల్దేరుతాం. మీరు 5 గం.లకి మాయింటికి రండి.ఆరు లోపల డైరెక్టర్ కి చూపించేసి, షూటింగ్ కి వెళ్ళిపోతాం " అన్నారు.
" సరే " అని 5 గం.లకి వాళ్ళ యింటికి వెళ్ళాను.
ఆ బాల నటుడు యింకా లేవలేదు. ( రాత్రి షూటింగ్ చాలా ఆలస్యమైందట )
నిద్రపోతున్న ఆ కుర్రాడిని అలాగే మోసుకెళ్ళి బాత్ రూం లో కుళాయి కింద కూలేసి కుళాయి తెరిచారు. అది శీతాకాలం.
కొడుకుని నటుడిని చేయాలనా ? వాడిని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించాలనా ? ఆ తండ్రి వుద్దేశం అర్థంకాలేదు.

...................... ఎంతటి అభివృద్దో కదా ~ !!

బళ్ళు ఓడలవుతాయి. ఓడలు బళ్ళవుతాయి. ఈ సృష్టిలో ఇది సహజం.

పూలమ్మిన చోట కట్టెలమ్మాల్సిన పరిస్థితి వస్తే .......... ఉహించడం కష్టం.
అప్పుడప్పుడు కొందరి జీవితాల్లోనైనా ఈ అనుభవం ఎదురవుతూ వుంటుంది బళ్ళు ఓడలవుతాయి. ఓడలు బళ్ళవుతాయి. ఈ సృష్టిలో ఇది సహజం. విధి ఆడే ఆటలో అందరూ పావులే !

చలన చిత్రసీమలో ఇలాంటి చిత్రవిచిత్రాలెన్నో కనిపిస్తాయి. తళుకు బెళుకులతో మురిపించే చలన చిత్రరంగంలో కొందరు ప్రముఖులకు ఇది అనుభవైకవేద్యమే ! భారత దేశంలో చలన చిత్ర రంగ పితామహుడు ఎవరు అనడిగితే వెంటనే దాదా సాహెబ్ ఫాల్కే అని చెప్పలేని వారెవరూ వుండరేమో ! ఆయన ఎంతటి కీర్తిప్రతిష్టలు ఆర్జించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ చలన చిత్ర పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే పేరనే వుంది. ఈ మధ్యనే మన తెలుగు మూవీ మొఘల్ రామానాయుడు గారు ఆ పురస్కారాన్ని అందుకున్న విషయం తెలుగు వారందరికీ తెలుసు.
అంతటి గొప్ప వ్యక్తి ఆర్జించి తన వారసులకు ఇచ్చినవి కీర్తి ప్రతిష్టలే కానీ ధన ధాన్యరాశులు కావు. దానికి తార్కాణం దాదా సాహెబ్ ఫాల్కే గారి ఏకైక కుమారుడు కొంతకాలం క్రితం వరకూ ముంబై వీధుల్లో తిరుగుతూ బ్రతుకుతెరువు కోసం అగరుబత్తిలు అమ్ముకుంటూ జీవనం సాగించారు. ఈ విషయం చాలామందికి తెలియదు కూడా !

మన తెలుగు చిత్రసీమలో హాస్య నటులకు స్టార్ డం తెచ్చిపెట్టిన నటుడు కస్తూరి శివరావు. ఆయన చిత్రసీమలో ప్రవేశించక ముందు హార్మోనియం, తబలా మొదలైన సంగీత వాయిద్యాలు వాయించేవారు. మూకీ సినిమాలకు అప్పట్లో ప్రతీ థియేటర్ లోను వ్యాఖ్యాతలుండేవారు. శివరావు గారు కూడా అలా చాలా మూకీ సినిమాలకు వ్యాఖ్యానం చెప్పేవారు. సినిమా ప్రొజెక్టర్ ఆపరేటర్ గా కూడా పని చేశారు. చిత్రరంగంలో ప్రవేశించి ' గుణసుందరి కథ ' చిత్రంతో తారాపథానికి చేరారు. ఒక వెలుగు వెలిగారు. ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా రాణించారు. ఆ రోజుల్లో సమాజంలో బాగా ధనవంతుల వద్ద మాత్రమే ఉండే ' బ్యూక్ ' కారు ఆయన దగ్గర ఉండేది. దాన్ని బట్టి ఆయన అప్పట్లో ఎంతటి ఉచ్చ స్థాయిలో వుండేవారో అర్థం చేసుకోవచ్చు.
అయితే రోజులేప్పుడూ ఒకేలా వుండవు. అంతటి స్థాయి నుంచి ఆయన పతనం ప్రారంభమై చివరిరోజుల్లో దుర్భర దారిద్యం అనుభవించారు. అంత్యక్రియలకు చందాలు వేసుకోవాల్సిన పరిస్థితి.
ఆయన నిర్మించి దర్శకత్వం వహించిన ' పరమానందయ్య శిష్యుల కథ ' చిత్రం నిర్మాణ దశలో వుండగా జరిగిన ఓ తమాషా సంఘటన. ఓ రోజు ఓ సన్నివేశంలో నటించడానికి గాడిద కావాల్సి వచ్చింది. సరే .... గాడిదను తీసుకొచ్చారు. సరిగ్గా ' టేక్ ' చేసే సమయానికి ఆది కాస్తా హాయిగా పడుకుంది. దాని శిక్షకుడు ఎన్ని రకాల ప్రయత్నించినా లేవలేదు. యూనిట్ లోని వారందరూ కూడా తమ యథాశక్తి దాన్ని లేపడానికి ప్రయత్నించారు. ఫలితం శూన్యం. చివరగా కస్తూరి శివరావు గారు లేచి దాని దగ్గరకు వెళ్ళి చెవిలో ఏదో చెప్పారు. అంతే ... ఆది వెంటనే చెంగున లేచి కూర్చుంది. అందరికీ ఆశ్చర్యమేసింది. గాడిద చెవిలో ఏం చెప్పారని శివరావు గారిని అడిగారు. దానికాయన
" నేనేం ప్రత్యేకంగా చెప్పలేదు. ' లే బాబూ ! నీకు పుణ్యముంటుంది ' అన్నానంతే ! దానిక్కూడా డబ్బులిచ్చేది నేనేనని తెలిసిపోయినట్లుంది. అందుకే నా మాట విని లేచింది " అన్నారు.