30, ఏప్రిల్ 2011, శనివారం

చిరంజీవి వైయస్ జగన్ పై దూకుడు

కాంగ్రెసులో తన పార్టీని విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిలో ఆత్మ విశ్వాసం పెరిగినట్లు కనిపిస్తోంది. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల్లో అపజయం పాలైన తర్వాత అంతగా ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించలేకపోయారు. అడుగు తీసి అడుగు వేస్తుంటే ఆయనలో ఆత్మవిశ్వాసం కొరవడినట్లు కనిపిస్తూ వచ్చారు. పార్టీని స్థాపించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడానికి వెనకాడారు. కాంగ్రెసులో పార్టీని విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన కడప, పులివెందుల ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెసు పార్టీకి స్టార్ కాంపెయినర్ అయ్యారు.


ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన దూకుడును ప్రదర్శించారు. తన సహజశైలికి భిన్నంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్‌పై, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజానికి, ఇప్పటి వరకు ఇతర పార్టీల నాయకులు చేసే విమర్శలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో చిరంజీవి ఉండేవారు. ఇప్పుడు ఆయన ఎదురు దాడికి దిగారు. ఆ ఎదురు దాడిని చూస్తుంటే ఆయనకు కాంగ్రెసు నాయకత్వం బలమైన విశ్వాసాన్నే కల్పించినట్లు చెప్పవచ్చు.

వైయస్ జగన్ అక్రమాస్తుల గురించి ఆయన తన ప్రచారంలో ప్రశ్నించారు. జగన్ అహంకారం వల్ల, అధికార దాహం వల్లనే ఈ ఉప ఎన్నికలు వచ్చాయని విమర్సించారు. చంద్రబాబుపై గతంలో ఎన్నడూ లేని విధంగా విరుచుకుపడ్డారు. చంద్రబాబు కాంగ్రెసు పార్టీలోకి రావాల్సి వస్తుందని, తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల ఆధిపత్యం పెరిగితే అది చంద్రబాబుకు తప్పదని, చంద్రబాబు కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. నిజానికి, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చిరంజీవికి పడని విషయం. కానీ, ఆయన ప్రత్యర్థులను ఎదుర్కుని, కాంగ్రెసులో తానే సరైన నాయకుడిని అని చాటుకోవడానికి అది తప్పడం లేదని అంటున్నారు.

పనిలో పనిగా ఆయన తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయాలని నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి తాము మద్దతు ఇవ్వాలని అనుకున్నామని, అది విలీనం దాకా సాగిందని ఆయన చెప్పుకున్నారు. చిరంజీవి చుట్టూ కాంగ్రెసు నాయకులు దడి కట్టడం కూడా ప్రచారంలో గమనించవచ్చు. అంత మంది తన వెంట వస్తున్నారనే భావన కూడా ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఉంటుంది

సాలార్ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ కోటలో సంచలన సంఘటన జరిగింది.

సాలార్ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ కోటలో సంచలన సంఘటన జరిగింది. హైదరాబాద్ పాతబస్తీలో ఓవైసీ కుటుంబానికి ఎదురు లేదని భావిస్తూ వస్తున్న నేపథ్యంలో శానససభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీపై దాడి జరిగింది. ఇది మామూలు దాడి కాదు. దాడిలో అక్బరుద్దీన్ తీవ్రంగా గాయపడ్డారు. సాలార్ సుల్తాన్ సలావుద్దీన్‌కు పాతబస్తీ పెట్టని కోటగా ఉంటూ వస్తోంది. ఆయనను ఎదుర్కోవడానికి ప్రత్యర్థులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. సలావుద్దీన్ వరుసగా ఆరు సార్లు హైదరాబాద్ లోకసభ స్థానం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. సాలార్ మజ్లీస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం)కు నాయకత్వం వహిస్తూ వచ్చారు. దాన్నే మజ్లీస్ పార్టీగా వ్యవహరిస్తారు.


సాలార్ మరణం తర్వాత మజ్లీస్‌కు ఆయన ఇద్దరు కుమారులు అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వం వహిస్తూ వస్తున్నారు. తండ్రికి దీటుగా పాతబస్తీలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. అక్బరుద్దీన్ చాంద్రాయణగుట్ట నుంచి శాసనసభకు ఎన్నికై మజ్లీస్ శాసనసభా పక్ష నేతగా వ్యవహరిస్తుండగా, అసదుద్దీన్ హైదరాబాద్ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సాలార్ - ఎ - మిలెట్‌ (సామాజిక వర్గం కమాండర్)గా సలావుద్దీన్‌ను వ్యవహరించేవారు. చిన్నగా ఆయనను సాలార్‌గా వ్యవహరించేవారు. సాలార్ పేరు చెప్తే ప్రత్యర్థులకు గుండె దడ. ఆయన 2008 సెప్టెంబర్ 29వ తేదీన మరణించారు.

నిజానికి, అఖిల భారత మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నైజాం జమానాలో స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న హైదరాబాద్ రాజ్యంవారిని ఎదుర్కోవడానికి ముందుకు వచ్చింది. దాని కార్యకర్తలను రజాకార్లుగా పిలిచే వారు. దానికి కాశిం రజ్వీ నాయకత్వం వహించేవాడు. తెలంగాణ పల్లెల్లో కాశిం రజ్వీ ఆగడాలకు అంతులేదు. హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైన తర్వాత ఆ పార్టీకి సాలార్ నాయకత్వం వహిస్తూ వచ్చారు. దాన్ని ఎన్నికల బరిలోకి దింపి నైజాం రాజధాని హైదరాబాద్ పాతబస్తీలో పట్టు సాధించారు. ముస్లింలకు ఏకైక ప్రతినిధిగా చెలామణి అవుతూ వచ్చారు.

సాలార్‌ను ఎదుర్కోవడానికి అప్పటి బిజెపి నాయకుడు ఎ. నరేంద్ర తీవ్రంగా ప్రయత్నించారు. ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. నరేంద్ర అందుకు గాను టైగర్‌గా పేరు సంపాదించుకున్నాడు. సిపిఎం కూడా పాతబస్తీలో పాగా వేయడానికి ప్రయత్నించింది. బిజెపి ఒక్కప్పుడు పాతబస్తీలో బలంగా ఉండేది. బద్దం బాల్ రెడ్డి వంటి బిజెపి నాయకులు ఎప్పటికప్పుడు సాలార్‌కు సవాల్ విసురుతూ వచ్చారు. కానీ క్రమంగా బిజెపి వెనక్కి తగ్గుతూ వచ్చింది. పాతబస్తీ నుంచి దాని మద్దతుదారులు కొత్త నగరానికి వలసలు పెరగడం కూడా అందుకు ఓ కారణం. కాగా, సాలార్‌కు అత్యంత సన్నిహితుడైన అమానుల్లా ఖాన్ ఆ తర్వాత విభేదించి ఎంబిటిని స్థాపించాడు. మజ్లీస్‌కు దీటుగా దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించాడు. కానీ, ఫలితం అంతంత మాత్రంగానే సాధించాడు. ఇప్పటికీ ఆ పార్టీ కొనసాగుతోంది. మజ్లీస్‌ను వ్యతిరేకించేవారు పాతబస్తీలో ఎంబిటి వైపు ఉండడం సాధారణ విషయంగా మారింది.

సాలార్ మృతి తర్వాత ఆయన కుమారులు అసదుద్దీన్, అక్బరుద్దీన్ పాలక పార్టీకి దగ్గరగా ఉంటూ తమ పనులు చేయించుకుంటూ ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నారు. పాలక పార్టీలకు దగ్గరగా ఉంటూ మరో పార్టీ పాతబస్తీలో పట్టు సాధించకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. ఇదే సమయంలో విద్యా సంస్థలను, ఆస్పత్రులను, ఇతర సంస్థలను స్థాపించి ఓవైసీ కుటుంబం ఆర్థికంగా కూడా పటిష్టంగా మారుతూ వచ్చింది. ఈ స్థితిలో అక్బరుద్దీన్‌పై దాడి జరగడం ఓవైసీ కుటుంబానికి రాజకీయంగా సవాల్ లాంటిదే.