8, మే 2011, ఆదివారం

అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జగన్ విధానం కాదు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో కలిసి పనిచేయడాన్ని రాజకీయ నాయకులు ఇబ్బందిగానే భావిస్తున్నారనే ప్రచారం ప్రారంభమైంది. జగన్ తమను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి కూడా వైయస్సార్ కాంగ్రెసులో మొదలైనట్లు అర్థమవుతోంది. తమను పట్టించుకోకుండా, తాను చెప్పినట్లు నడవాలనే వైఖరి వల్ల వైయస్ జగన్ నష్టపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. పైగా, అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జగన్ విధానం కాదు. తాను తీసుకున్న నిర్ణయాలను తన వెంట నడుస్తున్న నాయకులు పాటించాల్సి ఉంటుంది. వాటి మంచిచెడుల గురించి చర్చించే వాతావరణం ఉండదు, ఆ సందర్భం కూడా రాదు. వైయస్ జగన్ వాణిజ్యవేత్త అని, వాణిజ్యవేత్తలు గుట్టుగా వ్యవహరిస్తారని, తాము నిర్ణయాలు తీసుకుని తన అనుచరులకు చెబుతారని వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకానొక సందర్భంలో అన్నారు.

వాణిజ్యవేత్తల పనితీరు రాజకీయాల్లో పనికి రాదని ఆయన చెప్పకుండానే చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి తాను చేయదలుచుకున్న పని గురించి చాలా మందితో మాట్లాడేవారని, దానివల్ల తాను చేయబోయే పనిలోని మంచీచెడులు తెలిసి వచ్చేవని ఆయన అన్నారు. గుట్టుగా వ్యవహరించే జగన్ వ్యవహార శైలి వల్ల నాయకులు ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికే బద్వేలు కాంగ్రెసు శాసనసభ్యురాలు కమలమ్మ వైయస్సార్ పార్టీకి దూరమయ్యారు. తాజాగా, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు కాటసాని రాంరెడ్డి కూడా ఆయనకు దూరం జరిగారు. జగన్ వెంట నడుస్తున్న శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి దంపతులు ఏం చెప్తే అది చేసే వ్యక్తి కాటసాని రాంరెడ్డి. అటువంటి కాటసాని రాంరెడ్డే జగన్‌కు దూరమయ్యారంటే మరింత మంది కూడా వెనక్కి తిరిగి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.

జగన్ వెంట నడుస్తున్న చాలా మంది శాసనసభ్యులు, నాయకులు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి చెప్పారు. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. పరిణామాలను పసిగట్టే ఆయన ఆ విధంగా చెప్పి ఉంటారనేది స్పష్టమవుతోంది. నిజానికి, ఒక వ్యక్తి ఇష్టానిష్టాలకు, నిర్ణయాలకు అనుగుణంగా ఓ కార్పొరేట్ కంపెనీలాగా నడిచే పార్టీలో కొనసాగడం అంత సులభం కాదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ కూడా సంకటస్థితిని ఎదుర్కోవడానికి ఓ కారణం ఇదే. పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుందా, ఉండదా అనే విషయాన్ని పక్కన పెడితే, పార్టీ అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుందని, అధినేత తమ మాటలు వింటారని అనిపించడం పార్టీ మనుగడకు అత్యంత ప్రధానమైన విషయం.

తన తండ్రి వైయస్సార్ సంక్షేమ పథకాలు, ఆయన వారసత్వం, తనపై ఉన్న ప్రజాదరణ తన పార్టీని అగ్రస్థానంలో నిలబెడుతుందని బహుశా వైయస్ జగన్ భావిస్తూ ఉండవచ్చు. కానీ, అది ఎల్లకాలం ఫలితాలు సాధించి పెట్టదు. నాయకులను తగిన విధంగా గుర్తించినప్పుడే పార్టీకి మనుగడ ఉంటుంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతి ఒక్కరినీ గుర్తించినట్లు కనిపించేవారు. తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యం ఉంటుందని ఆయన చేతల్లో చూపించేవారు. అందుకే, హీరో రాజశేఖర్ దంపతులు కాంగ్రెసు పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు జగన్ వ్యవహార శైలి నచ్చక వెనక్కి వచ్చారు. వారంతట వారు తనను బలపరచాల్సిందే తప్ప బలపరిచిన వారికి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేదని తలిస్తే జగన్ రాజకీయాల్లో దెబ్బ తినడం ఖాయం.

వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఎటు వైపు ఉంటారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

కడప లోకసభ స్థానానికి, పులివెందుల శాసనసభా స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఎటు వైపు ఉంటారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వైయస్సార్ రాజకీయ వారసత్వాన్ని సొంతం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్ ముందుకు సాగుతుంటే, వైయస్ తమ వాడేనని కాంగ్రెసు నాయకులు చెబుకుంటున్నారు. వైయస్సార్ చరిష్మాను, అభిమానాన్ని సొంతం చేసుకోవడానికి రెండు పార్టీలు ఉప ఎన్నికల్లో పోటీ పడ్డాయి.

వైయస్ రాజశేఖర రెడ్డికి సొంత అభిమానులున్నారు. ఆయనకు సొంత ప్రజాదరణ ఉంది. ఆ ప్రజాదరణను తమ వైపు తిప్పుకోవడానికి కాంగ్రెసు పార్టీ నాయకులు తీవ్రంగానే ప్రయత్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కూడా తమ ఎన్నికల ప్రచారంలో ఇదే ప్రయత్నం చేశారు. వైయస్ పథకాలన్నీ కాంగ్రెసు పార్టీవేనని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతగానే కొనసాగారని, అలా కొనసాగడానికి మాత్రమే ఇష్టపడ్డారని వారు ప్రజలకు నచ్చజెప్పి వారిని తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించారు. అయితే, వైయస్సార్ రాజశేఖర రెడ్డి పథకాలకు కాంగ్రెసు ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని వైయస్ జగన్ ఎప్పటికప్పుడు సూటిగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి ప్రయత్నించారు.

వైయస్సార్ అభిమానులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, కాంగ్రెసు పార్టీకి మధ్య చీలుతాయా అనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. వైయస్ జగన్ చీలిక వర్గం కాంగ్రెసుకు అనుకూలంగా మారే అవకాశాలున్నాయి. పులివెందుల ఓటర్లు మాత్రం వైయస్ విజయమ్మ, వైయస్ వివేకానంద రెడ్డిలో ఎవరిని ఎంపిక చేసుకోవాలనే డైలమాలో పడ్డారు. వీరిద్దరి మధ్యనే పులివెందులలో ప్రధానమైన పోటీ ఉండే అవకాశాలున్నాయి. పులివెందులలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బిటెక్ రవిని స్థానికంగా కొంత మంది పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో బిటెక్ రవి పోటీలో ఉంటారా, లేదా అనేది కూడా అనుమానంగానే ఉంది. కడప లోకసభ స్థానంలో మాత్రం వైయస్సార్ అభిమానులు జగన్ వైపు ఉండే అవకాశాలున్నాయి