26, ఫిబ్రవరి 2011, శనివారం

ప్రతిరోజూ ఒక మంచిమాట

మన ప్రవర్తనే మనకు మిత్రులనుగానీ, శత్రువులనుగానీ సమకూరుస్తుంది.

లోకంలో ఎప్పుడూ ద్వేషాన్ని ద్వేషంతో ఎదుర్కోలేం. ప్రేమతో మాత్రమే ద్వేషాన్ని ఎదుర్కోగలం

ప్రతి పక్షికి కావల్సిన ఆహారాన్ని భగవంతుడు ఇస్తాడు. అంతేగాని దాని నోటికి ఆహారాన్ని అందివ్వడు.

రాంగోపాల్‌వర్మ చేతిలో కంప్లీట్‌గా క్లీన్‌బోల్డయిన రజనీకాంత్

రోజూ అందరినీ రకరకాల ప్రశ్నలతో కంఫ్యూజ్ చేసి కంగారుపెట్టే TV9 రజనీకాంత్ ఈరోజు రాంగోపాల్‌వర్మ చేతిలో కంప్లీట్‌గా క్లీన్‌బోల్డయ్యాడు. గంటసేపు జరిగిన ప్రోగ్రాంలో కనీసం ఒక్కసారి కూడా రాంగోపాల్‌వర్మకు సమానస్థాయిలో కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇవ్వలేకపొయ్యాడు. అనేక సందర్భాల్లో డిస్కషన్ ఎలా నడపాలో తెలియక వెర్రిమొహం వేశాడు. తనవాదనకు పనికొస్తారేమోనని ఇద్దరు మూవీ జర్నలిస్టులని పిలిస్తే వాల్లు ఇంకొంచెం కంఫ్యూషన్ క్రియేట్ చేశారు కానీ ఏవిధంగానూ రజనీకాంత్‌కు సహాయం కాలేకపొయ్యారు.

రోజూ అందరు పబ్లిక్ ఫిగర్లపైనా బురదచల్లి, మల్లీ వారొచ్చి తమపైన వచ్చిన వార్తలను ఖండిస్తే మరొకసారి అదికూడా చూపించి టీఆర్పీ పెంచుకోవడానికి చీప్‌ట్రిక్స్ ఆడే TV9 రాంగోపాల్‌వర్మతో ఎందుకు పెట్టుకున్నామురాబాబూ అనుకునేలా డిస్కషన్ నడిచింది. ఎలాగయినా సరే వర్మను వెధవను చేద్దామని అదే ప్రశ్నను మల్లీమల్లీ ఎపాటిలాగే అడిగిన రజనీకాంత్ ఈసారి మల్లీమల్లీ వెధవయ్యాడు.

రాంగోపాల్‌వర్మ పూర్తి డిస్కషన్‌లో ఒకే పాయింటుపైన ఉన్నాడు. తను తీసే సినిమాలు బాగులేవని విమర్శించొచు, కానీ వర్మ ప్రేక్షకులను వెధవలు అనుకుంటాడని ఆయన తరఫున వీరెలా చెబుతారనే దానికి రజనీకాంత్ దగ్గర సమాధానం లేదు. కాస్సేపు బురద జల్లుడు కార్యక్రమం, కాస్సేపు వర్మకు సలహాలిచ్చే కార్యక్రమం, కాస్సేపు ప్రేక్షకులను రక్షించబోయే కార్యక్రమం చేసి అన్నిట్లో ఫెయిల్ అయ్యాడు. ఇక ఏనాడూ సమాజానికి పనికొచ్చే ఒక్క స్పెషల్ రిపోర్టు చూపించక ఎప్పుడూ పనికిమాలిన డిబేట్‌లు పెట్టి ఒకరినొకరు తిట్టుకునేట్టు చెయ్యడం, లేకపోతే పబ్లిక్‌ఫిగర్లపై బురదజల్లడం చేసి టీఆర్పీ పెంచుకునే TV9 వర్మకు సామాజిక స్పృహ నేర్పే ప్రయత్నం చెయ్యబొయి బోర్లాపడ్డం గమ్మత్తుగా ఉంది. పనిలో పనిగా ఇందులో యండమూరి కూడా ఫూల్ అయ్యాడు.

తిరోగమన పథంలో మమత రైలు

రైల్వే బడ్జెట్‌ చరిత్రలో 2011 ఫిబ్రవరి 25 చిరస్థాయిగా నిలిచిపోతుంది. అయితే ఈవిధంగా నిలిచిపోవటానికి కారణం ఏదో సాధించినందువల్ల కాదు. ఏమీ సాధించలేకపోవటం వల్లనే. సాధారణంగా బడ్జెట్‌ అంటే గత సంవత్సరం పని తీరును పరిశీలించుకుని అసంపూర్ణంగా మిగిలిన లక్ష్యాలను, అందుకు కారణాలను మదింపు చేసుకోవటం, ఆ వెలుగులో వర్తమాన కర్తవ్యభారం స్వీకరించటం. మమతా బెనర్జీ ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్‌లో ఈ మూడింటిలో ఏదీ జరగలేదు. ఒకసారి మంత్రిగారి ఉపన్యాసం విన్న వారికి, చదివిన వారికి ఎవరికైనా ఈ బడ్జెట్‌ 2011-2012 సంవత్సరానికే లేక రానున్న దశాబ్ద కాలానికా, అర్థదశాబ్దానికా అన్న సందేహం కలుగుతుంది. ప్రతిపాదించిన కొత్త రైల్వే లైన్ల సర్వే మొదలు, లైను డబ్లింగ్‌ వరకూ, స్టేషన్‌ నిర్మాణాల మొదలు, సంబంధిత పరిశ్రమల నిర్మాణాల వరకూ 12వ పంచవర్ష ప్రణాళికలో చేపడతామని బడ్జెట్‌ ప్రసంగం చెప్తోంది. ఇంకా మనం 11వ పంచవర్ష ప్రణాళిక ముగింపు దశకు చేరుకోలేదు. ఇక 12వ ప్రణాళికా కాలంలో చేపట్టం అంటే సదరు ప్రాజెక్టులు కాగితాలకే పరిమితం కావటం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత ఆర్థిక వ్యవస్థ కంటే రైల్వేల ప్రగతి వేగవంతంగా ఉందని చెప్పిన మంత్రి దానికనుగుణంగా మిగిలిన పనులు చేపట్టకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
నిపుణుల అంచనా ప్రకారం ఆర్థిక వ్యవస్థ 9 శాతం వృద్ధి రేటుతో ముందుకెళ్తుంటే రవాణా రంగం ప్రత్యేకించి రైల్వే 11 శాతం వృద్ధిరేటు సాధించాలి. అప్పుడే విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలను తీర్చటానికి సాధ్యమవుతుంది. దీనికి భిన్నంగా గత రెండేళ్లుగా భారత రైల్వే విస్తరణ రైల్వేబోర్డు మాజీ సభ్యుల అంచనాల మేరకు కేవలం 5 శాతానికి పడిపోయింది. రైల్వేల ఆర్థికశక్తి సామర్ధ్యాలకు, మనుగడకు ఆపరేషన్‌ రేషియో కీలకం. వంద రూపాయాల ఆదాయం సాధించటానికి ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందో దాన్ని ఆపరేషన్‌ నిష్పత్తిగా నిర్ధారిస్తారు. నాలుగేళ్ల క్రితం వరకూ 76 శాతంగా ఉన్న ఈ నిష్పత్తి గత రెండు సంవత్సరాల్లో 95 శాతానికి పెరిగింది. వాస్తవిక అంచనాలు, నిధుల లభ్యత, ద్రవ్యోల్బణం వంటివి పరిగణలోకి తీసుకుంటే ఈ నిష్పత్తి 115చేరుతుంది. అంటే వంద రూపాయలు సంపాదించటానికి భారత రైల్వే 115 రూపాయలు ఖర్చుపెడుతోంది. దక్షిణ మధ్య రైల్వేలో వందరూపాయల సంపాదనకు 146 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంటే మొత్తంగా భారత రైల్వే సగటున 15 శాతం లోటులో నడుస్తోంది. బహుశా భారతరైల్వే చరిత్రలో ఇంత అథమ స్థాయిలో ఎన్నడూ లేని పరిస్థితిని నేడు రైల్వేలు చవిచూస్తున్నాయి.
మొత్తం ఆర్థిక వ్యవస్థకు ఎక్కిన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం మత్తు రైల్వే శాఖకూ ఎక్కింది. ఈ విధానం కింద 52 ప్రాజెక్టులు గత సంవత్సరం ప్రారంభించారు. వీటి ప్రగతి గురించి ఒక్కమాట కూడా బడ్జెట్‌ ప్రసంగంలో లేదు. కేవలం ఇవన్నీ ఈ సంవత్సరం పూర్తవుతాయి, సమగ్ర పరిశీలన దశలో ఉన్నాయి అన్న మాటలు తప్ప వీటి గురించి మరిన్ని వివరాలు కనిపించవు. రైల్వేల విస్తరణకు మూల నిధి ఖాతా, అభివృద్ధి నిధి ఖాతాలు కీలకం. ఈ రెండు ఖాతాల్లో నిధులు నామమాత్రపు దశకు చేరుకోవటంతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పథకాలకు కేటాయించాల్సిన మేర కూడా రైల్వే శాఖ వద్ద నిధులు లేవు. దాంతో ఈ పథకం కింద వచ్చిన ప్రతిపాదనలన్నింటినీ మూటకట్టి అటకెక్కించారు. మరో ముఖ్యమైన విషయం మిగులు నిధుల పద్దు. ఈ పద్దు నుండే తక్షణ వ్యయం సమకూర్చబడుతుంది. 2007-2008లో 25000 కోట్ల రూపాయలు ఉంటే 2010-2011 ఆర్థిక సంవత్సరానికి ఈ నిధులు 1328 కోట్లకు కుదించుకుపోయాయి. నూతన పథకాలు, ప్రాజెక్టులు చేపట్టకపోవటానికి ఇదీ మూల కారణం. ఈ విషయాన్ని దాచిఉంచటానికి రైల్వే శాఖ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. విస్తరణ విషయంలోనూ బడ్జెట్‌ సంతృప్తికరంగా లేదు. గత సంవత్సరం బడ్జెట్‌లో సంవత్సరానికి వెయ్యి కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం పూర్తిచేస్తామని లక్ష్యంగా పెట్టుకొంది. 2009లో ప్రకటించిన విజన్‌ 2020 పత్రం ప్రకారం 2020 నాటికి దేశంలో అదనంగా మరో 2,5000 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాలు నిర్మాణం జరగాలి. అంటే మరో ఎనిమిదేళ్లలో ఈ నిర్మాణాలు పూర్తి కావాలి. అయితే దీనికి సంబంధించి శక్తి సామర్ధ్యాలు, శ్రామికులు, నిధులు, స్థల సేకరణ, ప్రణాళికల తయారీ గురించి పల్లెత్తు మాట లేకుండానే బడ్జెట్‌ ప్రసంగం ముగిసింది. పైగా ఈ సంవత్సరానికి మరో 800 కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం కొత్తగా చేపడతామని డాబుసరిప్రకటనకు మాత్రం బడ్జెట్‌లో చోటు దక్కింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద ఈపాటికేవచ్చిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చకపోగా మరో ఏడు రంగాల్లో ఇటువంటి ప్రాజెక్టులు చేపట్టాలని బడ్జెట్‌ ప్రతిపాదిస్తోంది. మరో 190 రైల్వే లైన్లకు సంబంధించి సర్వే పూర్తి చేయటానికి 12వ పంచవర్ష ప్రణాళిక కాలాన్ని లక్ష్యంగా నిర్ధారించుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న భద్రాచలం కొవ్వూరు రైల్వే లైను సర్వే కూడా ఏకంగా పన్నెండవ ప్రణాళికా కాలానికి గెంటివేయబడింది. అంటే కేవలం సర్వేకే మరో ఐదేళ్లు పడితే, 2017 నాటికి పూర్తి అయ్యేట్లయితే కేవలం మిగిలిన మూడు సంవత్సరాల్లో నిర్మాణం ఎలా పూర్తవుతుందన్నది ఎవరికీ అంతుబట్టని బ్రహ్మ రహస్యంగానే మిగిలిపోయింది.
రైల్వేల విస్తరణకు కీలకమైన ఇంజనీరింగ్‌, కోచ్‌, వ్యాగన్‌ పరిశ్రమల నిర్మాణానికి ప్రభుత్వం ఎంచుకున్న కేంద్రాలు పరిశీలిస్తే రైల్వే శాఖ మానసిక స్థితి గురించి సందేహాలు రాకపోవు. జమ్ము కాశ్మీర్‌లో రైలు బ్రిడ్జిలు, మణిపూర్‌లో డీజిల్‌ ఇంజన్లు తయారు చేసి దేశమంతటా పంపిణీ చేస్తామన్న మంత్రి ప్రకటన వెనక భారతదేశ భౌగోళిక పరిస్థితులు, దానికున్న పరిమితులు గురించిన అవగాహన లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తరాఖండ్‌ కొన్ని సరిహద్దు ప్రాంతాలకు రోడ్డు నిర్మాణానికి కావల్సిన యంత్ర సామాగ్రిని తరలించాలంటే కనీసం ఆర్నెల్ల వ్యవధి అవసరం. అటువంటిది జమ్ము కాశ్మీర్‌లో తయారు చేసిన రైలు బ్రిడ్జి సామగ్రి దేశంలో మిగిలిన ప్రాంతాలకు చేరవేయటానికి ఎంత సమయం పడుతుంది ? అసలు జమ్ము కాశ్మీర్‌ నుండి దేశంలోని మిగిలిన ప్రాంతాలకు మధ్య ఉన్న రైల్వే నెట్‌వర్క్‌ ఎంత? అందులో వ్యాగన్‌లు తరలించగలిగిన నెట్‌వర్క్‌ ఎంత అన్నది పరిశీలిస్తే ఈ ప్రతిపాదనల హేతుబద్దతను ప్రశ్నించకుండా ఉండలేము. అదేవిధంగా మణిపూర్‌లో నిర్మించిన డీజిలు ఇంజన్లను కనీసం ఈశాన్యభారతంలోని ఏడు రాష్ట్రాలకు చేరవేయటానికే ఏళ్ల గడువు పడుతుంది. అటువంటిది మిగిలిన దేశానికి చేరవేయటానికి ఉన్న సాధనాల గురించి కూడా పరిశీలించకుండా ప్రాజెక్టు ప్రతిపాదనలు తయారు చేసిందీ ప్రభుత్వం. ఏతావాతా చెప్పాలంటే ఈ బడ్జెట్‌ అత్యంత అశ్రద్ధతో, అసమంజస ప్రతిపాదనలతో, వచ్చే సంవత్సరాల కోసం రూపొందించిన బడ్జెట్‌ తప్ప కనీసం రానున్న ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌ కాదు అన్నది స్పష్టంగా రూఢి అవుతోంది.

బడ్జెట్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం

"హల్లో ఆల్! టీవీ జీరో సమర్పిస్తున్న బడ్జెట్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. పదండి అసెంబ్లీ కెళ్ళి అక్కడున్న మా ప్రతినిధి భిక్షపతితో మాట్లాడుదాం. హల్లో భిక్షు! అసెంబ్లీలో ఏం జరుగుతోంది!"

"హల్లో...ఆ..హల్లో...."

"ఆ...హల్లొ! భిక్షు, నేను ఉల్లి వెంకట్, టీవీ జీరో స్టుడియో నుంచి...అసెంబ్లీలో ఏం జరుగుతోంది?"

"వెంకట్! రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు శ్రీ ఆనం రాంనారాయణ రెడ్డి గారు రాష్ట్ర బడ్జెట్ వివరాలను చదివేందుకు రాబోతున్నారు. ఎప్పుడూ గంభీరంగా, హుందాగా కనబడే రెడ్డిగారు ఈరోజు మరింత హుందాగా ఆఫీసు గదిలోకి అడుగుపెట్టడం మేము చూసాం. చాలా సాధారణమైన దుస్తులతో వచ్చారు."

"భిక్షు! సాధారణమైన దుస్తులు అన్నారు. అవేంటో మన ప్రేక్షకులకి వివరించగలరా?"

"వెంకట్! తెలుపు కలర్ సిల్కు చొక్కా, తెలుపు కలర్ రెమాండ్స్ ప్యాంటు, రెండు మూడు బంగారు ఉంగరాలు, ఒమేగా వాచు మొదలైనవి"

"థాంక్స్ భిక్షు! మీరు అసెంబ్లీలోకి వెళ్ళండి మేమూ మిమ్మల్ని ఫాలో అవుతాము"

**********

"వెంకట్! అసెంబ్లీలో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మన ఆర్థిక మంత్రి ఆనం రెడ్డి గారు తమ సిల్కు రెమాండ్స్ దుస్తుల్ని వదిలేసి తెల్ల కాటన్ పంచె, ఎర్ర చొక్కా, పసుపు తలపాగాతో భుజం మీద తంబూర మోసుకొని మైకు ముందుకు వచ్చారు. ఆయనకు ఎడంవైపు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, గులాబీ కలర్ పంచె మీద నలుపు చొక్కా వేసుకొని డప్పు పట్టుకొని నిలబడ్డారు. మరో వైపు గీతారెడ్దిగారు తామర మొగ్గలున్న కాషాయం కలర్ చీరలో డప్పు పట్టుకొని నిలబడున్నారు"

"అలాగా! అసలిదంతా దేనికి జరుగుతోంది భిక్షు?"

"ఆగండి వెంకట్! ఆనంగారేదో ఆడబోతున్నారు!"

ఆనం: "థా ఝంక తరికిట తరికిట థా"

నల్లారి & గీత: "ఆహా", "ఓహో"

ఆనం: "కనరా తింగరి తెలుగువాడా! అంకెల తీరులను!

నల్లారి & గీత: "తందాన తానా"

ఆనం: "ఒక్కటి పక్కన సున్నాలు పేర్చి, బడ్జెట్టు కూర్చేము"

నల్లారి & గీత: "తందాన తానా"

ఆనం: "కూర్చిన బడ్జెట్ కూర్చుని చెబితే బోరుగ ఉండేను"

నల్లారి & గీత: "తందాన తానా"

ఆనం: "బోరే కొడితే మీరంతా బలు గురకలు పెట్టేరు"

నల్లారి & గీత: "తందాన తానా"

ఆనం: "అందుకోసమే చిందులు వేస్తూ, వందలు వేల లక్షలు తెచ్చి, ఎలెక్షన్లలో వాగ్దానాలకు కలెక్షన్లతో కనెక్షనిచ్చి ఈ బడ్జెట్ తెచ్చాము"

నల్లారి & గీత: "తందానా...తందానా బల్ దేవ తందనానా"

ఆనం: "థా ఝంక తరికిట తరికిట థా...అయ్యలారా, అమ్మలారా! సోనియా మేడమ్ ఘనమైన ఆశీర్వాదాలతో, చచ్చి పరలోకములో ప్రజా సంక్షేమం చింతిస్తున్న వైయెస్సార్ ఆత్మ సాక్షిగా, మేము ప్రతిపాదిస్తున్నాము మరో లక్ష కోట్ల బడ్జెట్...ఈ బడ్జెట్ లోని అంశాలేవయ్యా అంటే... "

నల్లారి & గీత: "ఏవయ్యా!"

ఆనం: "బోధన ఫీజులు చెల్లించలేము"

నల్లారి & గీత: "లేము"

ఆనం: "చేనేత కార్మికులనాదుకోము"

నల్లారి & గీత: "కోము"

ఆనం: "బడుగు రైతుల బకాయిలన్నీ...."

నల్లారి & గీత: "అన్నీ..."

ఆనం: "మాఫీ చెయ్యలేము"

నల్లారి & గీత: "తందాన బల్ తానె తందన...తానె తందనానా"

**********

"వెంకట్! గట్టిగట్టివన్నీ గాలికి కొట్టుకుపోతే పుల్లిస్తరాకు గతేంటన్నట్టు ఆనంగారు, వారి వంతలు వంతులేసుకుని పాడుతున్నారు. ఈ "బుర్ర" క(వ్య)ధ ఇప్పట్లో ముగిసేట్టు లేదు. మన సాటిలైటు బిల్లు పెరక్కముందే ఈ ప్రసారాన్ని ఇంతటితో ముగిస్తే మేలు. జై హింద్!"