17, ఫిబ్రవరి 2011, గురువారం

గవర్నరు గారూ, వాళ్ళ దౌర్జన్యాలు చూసారు కదా..!

గవర్నరు గారూ,
ఏనాడూ జరగని సంఘటనలు సభలోనూ బయటా జరిగాయి. ఒక శాసనసభ్యుడికే రక్షణ లేకుండా పోయింది. ప్రజాస్వామ్యమంటే నచ్చని కొందరి కారణంగా ఇవ్వాళ స్వేచ్ఛకు విఘాతం ఏర్పడింది. స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వెల్లడించే ఒక గౌరవనీయ సభ్యునికి, తద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అవమానం జరిగింది. ’మేము చెప్పినదే నిజం, మేము చెప్పేదే అందరూ వినాలి, అవతలి పక్షం మాటలను వినం, విననివ్వం, అసలు అవతలి వారిని మాట్టాడనివ్వం’ అనే ధోరణి గల నియంతల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది.

ఇవ్వాళ సభలోను, బయటా జరిగిన ఏ సంఘటన కూడా సభకు గౌరవాన్నివ్వదు. మనకు ప్రజాస్వామ్యమున్నదనే స్పృహనూ కలిగించదు.

1. సభలో గవర్నరు ప్రసంగం చేస్తూండగా నిరసనలు తెలపడం మామూలే. గవర్నరు దగ్గర్నుంచి ప్రసంగం కాగితాలు లాగేసుకోడం కూడా విన్నాం. గవర్నరు మైకును ఇలా గతంలో కూడా లాగేసుకున్నారేమో తెలవదు. అయితే గవర్నరు మాట్టాడుతూండగా వెనక్కి నక్కినక్కి వెళ్ళి ఆయన కుర్చీ లాగిపడెయ్యడం, ఆయన మీదకు దాడికి పోవడం ఎక్కడైనా చూసారా? సభలోనే, గవర్నరుకే ఇట్టా జరిగిందంటే.. ఇక బయట పరిస్థితి ఎట్టా ఉండబోతోంది?
2. ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇందుకేనా మనల్ని ప్రజలు ఎన్నుకున్నది? అంటూ ఆవేదన చెందిన జయప్రకాశ్ నారాయణ పై చేసిన దాడి చూసారు కదా? సభ ఆవరణలోనే, ఒక శాసనసభ్యుడిపై, మరొక సభ్యుడి అనుచరుడే, ఈ దాడికి పాలబడ్డాడు! వాళ్ళ దుశ్చర్యలను నిరసిస్తే వాళ్ళు చేసిన నిర్వాకం ఇది. బైట పరిస్థితి ఎలా ఉండబోతోంది?
3. ’కొట్టుండిరా ఆణ్ణి’ అని రెచ్చగొట్టి అనుచరుల చేత కొట్టించిన నాయకుణ్ణి, రెచ్చగొడుతూండగా టీవీల్లో చూసాం. ఇలాంటి నాయకుల నుండి ప్రజాస్వామ్యానికి రక్షణ లేదు, శాసనసభ్యుడికి దిక్కు లేదు.., మరి మామూలు జనం గతేంటి?
4. సంఘటనను టీవీల్లో చూసాక కూడా, చర్చల్లో పాల్గొని అడ్డగోలుగా వాదిస్తున్నారు తెరాస నాయకులు. ఒకాయన, ’అబ్బే అసలు కొట్టనే లేదు’ అంటూ పచ్చి అబద్ధం చెప్పాడు. ఆ కొట్టేవాడి వెనకే ఉన్నా డితగాడు. సరే, వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పుకున్నా చెప్పుకోనీండి, విచారణలో నిజాలు ఎలాగూ తేలతాయి. అయితే కొందరు తెరాస నాయకులు మరీ భయంకరమైన వాదన వినిపిస్తున్నారు.. జేపీ తన ఇష్టం వచ్చినప్పుడు మాట్టాడి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టాడు, తెలంగాణ ప్రజల మనోభావాలను అవమానపరచాడు, అందుచేతే దాడి చేసారు అంటూ దుర్మార్గంగా మాట్టాడుతున్నారు. విషయాన్ని దారి మళ్ళిస్తున్నారు. వీళ్ళు తప్పుడు పనులు చేస్తూంటే జేపీ వాళ్ళ తప్పులు ఎత్తి చూపించాడు. దుష్టుడికి వాడి దౌష్ట్యాన్ని విమర్సిస్తే నచ్చదు, ఎదురు తిరిగి వాదిస్తాడు. కానీ తమను విమర్శిస్తే తెలంగాణ ప్రజలను విమర్శించినట్టే అంటూ ఈ దౌర్జన్యకారులు చెబుతున్నారు. ప్రజల నోళ్ళు నొక్కేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో మీ ప్రభుత్వం శాంతి భద్రతలను నియంత్రించడంలో కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. ప్రభుత్వపు పనితీరు చూస్తూంటే ఆ శక్తి ఈ ప్రభుత్వానికి ఉందనే నమ్మకం కలగడం లేదు. ప్రజలకు ఆ నమ్మకం కలిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణమే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మీరు ముఖ్యమంత్రిని ఆదేశించాల్సి ఉందని విజ్ఞప్తి.

తూలుతున్న ఉద్యమం

తాగుబోతు నాయకత్వంలో
దహనాలు చేయడం
ప్రజా ప్రతినిధులను కొట్టడం
పైసలివ్వకుండా ప్రయాణాలు చేయడం
రోజుకో ఎలక్షన్ పెట్టుకోవడం
ఇంటిల్లిపాది పాదుకలు మొయ్యడం
కిరోసిన్ ఆత్మహత్యలు
పరీక్షలు ఎగ్గోట్టడాలతో
ఉద్యమం తూలుతోంది.

ప్రతిరోజూ ఒక మంచిమాట

కోపం మరో వ్యక్తికి హానికలిగించేందుకు ముందే నీకు హాని కలుగజేస్తుంది.

ప్రారంభంలో ప్రతీకారం తృప్తిగా ,తియ్యగా ఉంటుంది. ముందుకెళ్ళినకొద్దీ అది ఎదురుదెబ్బ కొడుతూ, వగరెక్కి విషతుల్యమవుతుంది.


పిల్లలకు తల్లిదండ్రులిచ్చే అతిపెద్ద బహుమానామేమిటంటే వారిద్దరూ అన్యోన్యంగా ఉండడమే.