25, మార్చి 2011, శుక్రవారం

పుట్టకముందు మమ్మల్ని చంపొద్దు.మమ్మల్ని బ్రతకనివ్వండి.

సృష్టికి మూలం ఆదిశక్తి అంటారు. కాని ఆ ఆడపిల్లకే జన్మించే , జీవించే హక్కు లేకుండా పోతుంది. ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి.

ఆడపిల్ల పుట్టగానే అమ్మో! ఆడపిల్లా అని మూతి విరుస్తున్న పెద్దమనుష్యులు ఎందరో ఈ సమాజంలో ఉన్నారు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలుసుకుని మరీ ఊపిరి పోసుకోకముందే పిండాన్ని నాశనం చెస్తున్నారు. అలా వీలుకాకపోతే పుట్టిన తర్వాత చెత్తకుండీలోనో , మురికి కాలువలోనో పనికిరాని వస్తువులా పడేస్తున్నారు. రక్తపు మరకలు ఆరని, కళ్లు కూడ తెరవని ఆ పసికందు ఊరకుక్కలకు, పందులకు ఆహారమవుతుంది. ఈ భ్రూణ హత్యలలో ఎక్కువగా ఆడశిశువులే ఉన్నారు. ప్రాణం ఉన్న పసికందును నోటకరుచుకుని ఎత్తుకుపోతున్న కుక్కను తరిమికొట్టిన జనాలు కన్నతల్లిని నోటికొచ్చినట్టు తిడుతున్నారు. అసలు అది కన్నతల్లేనా? మదమెక్కి కడుపు తెచ్చుకుని కని ఇలా పారేసింది? ఈ పసిగుడ్డును అలా పారేయడానికి దానికి మనసెలా వచ్చింది? అని అంటారు కాని ఒక్కరైనా ఆ తల్లి ఏ పరిస్థితిలో తన పేగు పంచుకుని పుట్టిన బిడ్డను బ్రతికుండగానే ఎందుకు వదిలించుకుంది. అల్లారు ముద్దుగా తన పొత్తిళ్లలో పెంచాల్సిన చిట్టితల్లిని నిర్దాక్షిణ్యంగా చెత్తకుండీ దగ్గర వదిలేసింది. అలా వదిలేసేటప్పుడు ఆ తల్లి ఒక్క క్షణమైనా తల్లడిల్లకుందా? ఇది ఎవరు ఆలోచిస్తారు?
ఆ బిడ్డను కని చెత్తకుండీ పాల్జేసినందుకు ఆడదాన్ని ఆక్షేపిస్తారు కాని ఆ బిడ్డ జన్మకు కారణమైన మగవాడు ఎక్కడ? అతని గురించి ఎవరూ ఒక్క మాట మాట్లాడరు ఎందుకు? ఒకవేళ జరిగింది తప్పైతే దానిలో ఇద్దరికీ సమానమైన పాత్ర ఉంది. కాని ఫలితం, పర్యవసానం ఆడదే భరించాలి. పెళ్లి అయ్యాక బిడ్డని కంటే గొడవ ఉండదు. కాని పెళ్లి కాకముందు జరిగిన తప్పుకు బాధ్యత ఆడదానిదే. మగవాడు అమ్మాయిని వాడుకుని, తన కోరికను తీర్చుకుని హాయిగా వెళ్లిపోతాడు. దానిని తప్పు అని నిలదీసేవాళ్లు కూడా ఉండరు. పైగా మగవాడు .. ఏది చేసిన చెల్లుతుంది. ఆడదే జాగ్రత్తగా ఉండాలి అని నీతులు చెప్తుంది ఈ గౌరవనీయ సమాజం. ప్రేమలో ఓడిపోయి గర్భవతి ఐన అమ్మాయిని ఈ సమాజం ఆదరిస్తుందా? లేదు. దానికి కారణమైన మగావాడు మాత్రం దర్జాగా తిరుగుతుంటాడు. మరో పెళ్లి కూడా చేసుకుంటాడు. నష్టపోయేది అమ్మాయే కదా. ఇటువంటి విపత్కర పరిస్థితిలో తన బ్రతుకే అగమ్యగోచరంగా ఉంటే తన కడుపున పుట్టిన నేరానికి ఆ పసికందును అందునా ఆడపిల్లను ఎలా పెంచగలను అని వదిలేస్తుంది గుండె భారం చేసుకుని. అలా కాకుండా ఆ బిడ్డను పట్టుకుని ఒంటరిగా కూడా బ్రతకగలదా?. బ్రతకనివ్వదు ఈ సమాజం. చెడిపోయిన ఆడది అని ముద్ర వేస్తారు. ఆమెతో తిరిగిన మగవాడు మాత్రం చెడిపోలేదు. ఎంతమందితో తిరిగినా అతను పుణ్యపురుషుడే. అందుకే తరచూ మనకు ఎంతో మంది ఆడపిల్లలు ప్రాణమున్నా, లేకున్నా మురికి కాలువలో, చెత్తకుండీల్లో చీమలకు ఆహారంగా, కుక్కలకు విందుభోజనంగా కనిపిస్తారు. ఆ చిట్టితల్లికి అదృష్టముంటే ప్రాణం పోకముందే ఎవరికంటైనా పడుతుంది. ఇలా ఆడశిశువని తెలియగానే తల్లేకాదు, భర్తా, పెద్దవాళ్లు కూడా చెత్తకాగితంలా విసిరేస్తున్నారు.

ఆడపిల్లలను పుట్టిన తర్వాత వదిలించుకోవడమే కాదు , పుట్టకముండే ఆడపిల్లని తెలుసుకుని పుట్టకుండా చంపేస్తున్నారు. ఎందుకంటే ఆడపిల్లంటే అదో పెద్ద దింపుకోలేనిభారం. నెట్టిమీద బండలాంటిది. చదివించాలి, కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి. ఆ తర్వాత వరకట్న సమస్యలు. అదే మగవాడైతే గాలికి పెరుగుతాడు. ఏదో ఒక పని చేసి సంపాదిస్తాడు. వంశాన్ని ఉద్ధరిస్తాడు. జీవిత చరమాంకంలో తల్లితండ్రులను , ఆస్థిని చూసుకునేది వాడే. అందుకే మగపిల్లాదే కావాలి. కాని తనను కన్నది ఆడదే , ఆ ఆడపిల్ల జన్మకు కారణం తానే అని తెలిసినా తెలియనట్టు ఆడపిల్లను వద్దు అంటాడు సదరు మొగుడు. ఇంతకుముందు లింగ నిర్ధారణ పరీక్షలు యదేచ్చగా జరిగేవి. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలియగానే గర్భస్రావం చేయిస్తారు. అలా తన బిడ్డను చంపుకోవాల్సి వస్తున్నందుకు ఆ తల్లి ఎంత ఆక్రోశించిందో ఎవరికీ పట్టదు. జన్మనిచ్చే తల్లికి కూడా తను ఎప్పుడు, ఎవరికి జన్మనివ్వాలో కూడా నిర్ణయించుకునే అధికారం లేదు. నాకు ఆడపిల్ల పుట్టడానికి నువ్వే కారణం, చంపడానికి వీళ్లేదు అని అని భర్తను నిలదీసే ధైర్యం ఆ ఇల్లాలికి ఎప్పుడు వస్తుందో?

పుట్టి పెరిగి మరో ఇంటికి ఇల్లాలై వెళ్లినా కూడా ఆడపిల్లకు జీవితం క్షణక్షణం గండంగానే ఉంటుంది. ముఖ్యంగా వరకట్న బాధితులకు. ఈ సమస్య ఈ కాలంలో పట్టణవాసుల్లో, చదువుకున్నవారిలో లేకపోవచ్చు కాని పల్లెల్లో, చాలా కుటుంబాలలో జరుగుతుంది. ఇప్పటికీ పోరాడి అలసిన ఎందరో అమ్మాయిలు ఈ కట్నదాహానికి బలి అవుతున్నారు.

అందుకే సృష్టిలో జన్మనివ్వడం ఆడదానికే ఉన్న అద్భుతమైన వరం. కాని ఆడపిల్ల జీవితమే నిత్యాగ్నిహోత్రంలా మారుతుంది. పుట్టినప్పటి నుండి మట్టిలో కలిసిపోయేవరకు ప్రతి క్షణం గండమే. అన్నింటికి అణగిమణగి ఉండాలి. తప్పు చేసినా , చేయకున్నా బాధ్యత వహించాలి. అన్నింటికీ జవాబుదారీగా ఉండాలి. వీటన్నింటికి చావు మాత్రమే పరిష్కారం అవుతుంది.

పుట్టకముందు మమ్మల్ని చంపొద్దు. పుట్టాక చెత్తకుండీ పాలు చెయొద్దు. కట్నం కోసం మమ్మల్ని సమిధలా మార్చొద్దు. మమ్మల్ని బ్రతకనివ్వండి.

ఇటీవల ఎవరో చెత్తకుండీ దగ్గర ఆడపిల్లను పడేసారంట అని విని కోపంతో రగిలిపోయా.ఇంత దారుణమా? అని.. అది మనసులో దాచుకోలేక ఇలా.......

ఏది చెప్పినా విన్పించుకునే స్థితిని దాటిపోయాం.

హక్కులూ, ఆత్మగౌరవాలపై పెరుగుతున్న శ్రద్ధ మనుషులకు బాధ్యతలపై మృగ్యమవుతోంది. ఎక్కడ చూసినా హక్కుల కోసం పోరాటాలే.. వాటిని తప్పుపట్టలేం, కానీ మనం నిర్వర్తించవలసిన బాధ్యతల్లో చిన్న లోపాన్ని ఎవరు ప్రశ్నించినా తట్టుకోలేం! కూడుపెడుతున్న వృత్తి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉండదు.. ఆదాయంపై ధ్యాస తప్ప! మన పట్లా, మనం చేసే పని పట్లా, సమాజం పట్లా బాధ్యతని విస్మరిస్తూనే హక్కుల కోసం ఉద్యమిస్తుంటాం. మన ధర్మాన్ని గాలికొదిలేసి నిరంతరం మన క్షేమం పట్లే మమకారం పెంచుకోవడం ఎంత దౌర్భాగ్యస్థితో అర్థమయ్యేటంత సున్నితత్వం మనలో ఇంకా మిగిలి లేదు. చేసే పని పట్ల నిర్లక్ష్యం ఎంత ఉపేక్షించరానిదో అర్థం చేసుకునే పరిస్థితిలోనూ లేము. మన పొరబాట్ల పట్ల అపరాధభావం కూడా మచ్చుకైనా కన్పించకుండా పోతోంది. పరోక్షంగా మన మనఃసాక్షికే జవాబుదారీగా ఉండడం ఎప్పుడో మానేశాం. మన శరీరాలు మందమవుతున్నాయి, బుద్ధులు సంకుచితమవుతున్నాయి. వితండవాదం, తర్కంతో మూర్ఖంగా అన్నీ నెగ్గించుకునే రాక్షస ప్రవృతి మనల్ని స్వారీ చేస్తోంది. ఎవరు చెప్పినా, ఏది చెప్పినా విన్పించుకునే స్థితిని దాటిపోయాం. ఒకవేళ విన్పించుకునే హృదయం ఇంకా మిగిలి ఉన్నా ప్రతీ ఒక్కరూ హక్కులనూ దక్కించుకోమని ప్రబోధించేవారే.. బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించమని నిర్దేశించేవారేరీ? అందరూ మనలాంటి ప్రజల పక్షాన హక్కులకై పోరాడతారు.. హక్కులను సాధించుకోమని ప్రేరేపిస్తారు.. ఏదైనా తేడా వస్తే వ్యవస్థని దుమ్మెత్తిపోస్తారు. వ్యవస్థని పతనావస్థకు చేరుస్తున్నది చేతులారా మనకు మనం కాదా? హక్కుల గురించి పోరాడేవారు బాధ్యతలను ఎందుకు ఉద్భోధించరు? సరిగ్గా పనిచేయమంటే అసలుకే మోసం వస్తుందని.. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాల్సిన బాధ్యతని విస్మరించడం ఎంతవరకూ సబబు? అసలు ప్రతీ మనిషీ తాను చేయాల్సిన ధర్మాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తే వ్యవస్థలో లోపాలెందుకు ఉంటాయి?

బాధ్యతాయుతంగా నడుచుకోవడానికి కూడా మనకు ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. ఏ ప్రయోజనం లేనిదే చివరకు బ్రతకడం కూడా వృధా అనేటంత వ్యాపారాత్మక ధోరణిని అలవర్చుకున్నాం. దాంతో ఎక్కడా తృప్తి మిగలట్లేదు. బేరసారాలు తలకెక్కక ముందు సమర్థవంతంగా ఏదైనా పనిచేస్తే ఎంతో సంతృప్తిని మూటగట్టుకునే వాళ్లం. ఇప్పుడా సంతృప్తులు ఎక్కడా లేవు. మనం చేసే ఏ పనిలోనూ పరిపూర్ణత గోచరించదు.. అతుకుల బొంతలా ఏదో చేయాలి కాబట్టి చేయడం తప్ప! ఇలాంటి పలాయనవాదంతో జీవిస్తూ మళ్లీ మనకు సమాజంలో దక్కాల్సిన అన్ని హక్కులూ దక్కాలి. ఇదో గొప్ప జీవనశైలీ.. దీన్ని మళ్లీ పద్ధతిగా గడుపుకొస్తున్న జీవితంగా అందరికీ చెప్పుకుని మురిసిపోవడం! ఫలానాది దక్కాలని పోరాడి.. అంతకన్నా పెద్దది మనం చేయాల్సి ఉండీ కూడా నిమ్మళంగా దాటేసి జీవితంలో ఎంతో సాధించామని మురిసిపోవడం ఎంతగా పాతాళానికి దిగజారిపోయామో తేటతెల్లం చేస్తుంది. హక్కులను వదులుకోమని ఎవరూ చెప్పరు.. కానీ హక్కుల కన్నా మన బాధ్యతలు చాలా శక్తివంతమైనవనీ.. హక్కులు ఒకరిస్తే తీసుకునే భిక్షం వంటివనీ, బాధ్యతలు మనకు మనం మన వంతు చేసే దానాల వంటివనీ గ్రహించగలిగిన రోజున మనవంతు ఏమీ దానం చేయకుండా ఉండిపోతూ, మరోవైపు మొండి చేతుల్ని చాచి అడుక్కోవడానికి మనసొప్పదు.

ఇదేమి రాజ్యం? ఇదేమి పాలన?

సాక్ష్తాత్తు ప్రజలు ఎన్నుకున్న ఒక చట్టసభ సభ్యుడిని, ఆ చట్ట సభ ఆవరణలోనే కొట్టమని ప్రోత్సహించిన వారు కూడా చట్ట సభ సభ్యులే. ఆ ప్రోత్సహించిన వారే ఈ నాడు ఆ వాహన చోదకుడిని ప్రభుత్వం ఉదారంగా విడిచెయ్యమని కోరడం లో ఔచిత్యం ఏమిటి?

ఇదేమి రాజ్యం?
ఇదేమి పాలన?
ఇదేమి ప్రాంతీయవాద సమర్ధన?