27, ఏప్రిల్ 2011, బుధవారం

బాబా పార్థివ శరీరాన్ని బాబా ప్రసంగించే కుల్వంత్ హాలులోనే సమాధి చేయాలని నిర్ణయించారు.

ఈనెల 24వ తేదీన నిర్యాణం చెందిన భగవాన్ శ్రీ సత్యసాయి అంతిమ సంస్కారాలకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, బాబా కుటుంబ సభ్యులు ఏర్పాట్లు ప్రారంభించారు. కోట్లాది మందికి తన ప్రసంగం ద్వారా ఆధ్యాత్మిక ప్రసంగాలతో ఉత్తేరజపరిచిన చోటే సమాధికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ద్రాక్షారామం నుంచి వేద పండితులు ప్రత్యేక విమానంలో రకరకాల పుష్పాలు, పుణ్య నదీజలాలు, పవిత్రమట్టితో పుట్టపర్తికి వస్తున్నారు.
ఇదిలావుండగా, అంతిమ సంస్కారాల నిర్వహణపై సత్యసాయి ట్రస్టు కీలక భేటీ నిర్వహించింది. మంగళవారం 11.30 గంటల నుంచి 12.30 గంటల వరకు గంటపాటు ఈ భేటీ జరిగింది. బుధవారం నిర్వహించే అంతిమ సంస్కారం ఎలా చేపట్టాలి, వేదపండితులను ఎక్కడి నుంచి పిలిపించాలి, ఎలాంటి పూజలు నిర్వహించాలి, ఖననంలో ఎలాంటి నిబంధనలు పాటించాలి అన్న అంశాలపై చర్చించారు.

బాబా పార్థివ శరీరాన్ని బాబా ప్రసంగించే కుల్వంత్ హాలులోనే సమాధి చేయాలని నిర్ణయించారు. చివరి దర్శనానికి వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మంత్రులు గీతారెడ్డి, రఘువీరారెడ్డి ట్రస్టు సభ్యులతో కలిసి చర్చించిన పిమ్మట మీడియాకు వివరాలు వెల్లడించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా దాక్షారామం నుంచి ప్రముఖ వేద పండితులను బాబా అంతిమ సంస్కారానికి పిలిపించాలని నిర్ణయించారు. సన్యాసం, బ్రహ్మచర్యం, సర్వమత సమానత్వాన్ని పాటించిన సత్యసాయికి ఏ తరహా అంతిమ సంస్కారాలు నిర్వహించాలో వేద పండితులతో ట్రస్టు వర్గాలు చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నాయి. ఈ క్రియను నిర్వహించడానికి మూడు పద్దతులు ఉన్నట్లు కూడా వేద పండితులు సూచించినట్లుగా సమాచారం.

సాయిబాబా జీవితంలో ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినప్పటికీ ఆయన చేస్తున్న సేవలను మాత్రం ఎవరూ వేలెత్తి చూపించలేక పోయారు.

కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 1926 నవంబర్‌లో 23న జన్మించారు. ఆయన అసలు పేరు సత్యనారాయణ రాజు. బాబా జన్మించింది గోవర్ధనపల్లిలో అదే ఇప్పుడు పుట్టపర్తిగా మారింది. భక్తులకు షిరిడి సాయిబాబా అవతార పురుషుడిగా తనను తాను చెప్పుకున్నారు. షిరిడీ సాయిబాబా మరణించిన తర్వాత ఎనిమిదేళ్లకు బాబా జన్మించారు. సాయిబాబా జీవితంలో ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినప్పటికీ ఆయన చేస్తున్న సేవలను మాత్రం ఎవరూ వేలెత్తి చూపించలేక పోయారు. బాబా గోల్డు రింగ్స్, విబూది సృష్టించి భక్తులకు కానుకలుగా ఇచ్చేవారు.


కోట్లాది భక్తులకు ఆయన ఆధ్యాత్మిక గురువు. ఆయన కులాలకు, మతాలకు అతీతంగా నిలిచారు. ఆయన భక్తులలో హిందువులతో పాటు ముస్లింలు, క్రిస్టియన్లు కూడా చాలామంది ఉన్నారు. సత్యసాయి బాబా తల్లిదండ్రులు ఈశ్వరమ్మ, పెద్దవెంకమ రాజు రత్నాకరమ్. బాబాకు నలుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. బాబా చిన్న వయసులోనే చాలా అద్బుతాలు చేశాడని చెబుతారు. చిన్న వయసులోనే బాబా అపర మేధావి, సేవాభావం గల వ్యక్తిగా ముద్ర పడ్డారు. అపర మేథావి అయిన బాబాకు నాట్యంలో, సంగీతంలో, రచనలలో మంచి పట్టు ఉంది. బాబా స్వయంగా పాటలు, పద్యాలు రాసి భక్తులను వినిపించాడు.

1940వ సంవత్సరం మార్చి 8వ తేదిన తన సోదరుడు శేషమ రాజుతో కలిసి ఉరవకొండలో ఉన్న సమయంలో బాబాను ఓ తేలు కుట్టిందంట. ఆ సమయంలో బాబా తన స్పృహను కోల్పోయారంట. తేలు కుట్టిన కొద్ది రోజులకు బాబా బిహేవియర్‌లో మార్పు వచ్చింది. తనకు తాను నవ్వుకోవడం, ఏడ్వటం, అప్పటికప్పుడే నిశ్శబ్దంగా మారి పోవడం చేసేవారు. ఆ సమయంలో ఇతను తనకు ఇంతకుముందు ఏ మాత్రం పరిజ్ఞానం లేని సంస్కృతంలో పాటలు పాడేవారు. బాబా పరిస్థితి చూసి వైద్యులు హిస్టేరియా అని నమ్మేవారు. దీంతో చేసేది లేక బాబా తల్లిదండ్రులు బాబాను పుట్టపర్తికి తీసుకు వచ్చారు. వారు బాబాను అనేకమంది వైద్యుల వద్దకు, ఆధ్యాత్మిక గురువుల వద్దకు తీసుకు వెళ్లారు.

మే 23 1940లో బాబా చేసిన ఓ చర్య వల్ల బాబా తండ్రి బాబాను ఓ అద్వితీయ మహోన్నతుడుగా భావించాడు. బాబా తండ్రి ఓ కర్ర తీసుకొని నీవెవరు అని అడిగాడు. అప్పుడు బాబా తాను షిరిడీ సాయిబాబా ప్రతిరూపాన్ని అని చెప్పాడు. ఆ తర్వాత బాబా తనకు ఎవరితోనూ సంబంధం లేదని చెప్పారు. తాను షిర్డీ సాయికి ప్రతిరూపం అని చెప్పడం, తనకు ఎవరితోనూ సంబంధాలు లేవని చెప్పడంతో ఆయనకు భక్తులు తయారవడం ప్రారంభం అయింది. పద్నాలుగేళ్లకే బాబా ఆధ్యాత్మిక మార్గం పట్టారు. ఆ తర్వాత సత్యసాయి మద్రాసుకు, దక్షిణ భారతంలో పర్యటనలు ప్రారంభించారు. దీంతో తొందరగానే ఆయనకు భారీ సంఖ్యలో భక్తులు తయారయ్యారు.

1944వ సంవత్సరంలో భక్తులు బాబా స్వగ్రామం పుట్టపర్తిలో ఓ మందిరాన్ని నిర్మించారు. ఆ తర్వాత 1948లో ప్రారంభం అయిన ప్రశాంతి నిలయం 1950కి పూర్తయింది. 1957వ సంవత్సర కాలంలో బాబా ఉత్తర భారత దేశ దేవాలయాల సందర్శనకు వెళ్లారు. 1954లోనే బాబా చిన్న పాటి గ్రీన్ హాస్పిటల్‌ను పుట్టపర్తిలో నిర్మించారు. 1963లో బాబాకు నాలుగుసార్లు గుండెనొప్పి వచ్చింది. ఆ సమయంలో బాబా తాను మరణించాకు కర్ణాటకలో ప్రేమసాయి అవతారం ఎత్తుతానని చెప్పారు.

ఆ తర్వాత 1968 జూన్ 29న బాబా మొదటిసారి విదేశాలకు వెళ్లారు. ఉగండా, నైరోబీ తదితర దేశాలకు వెళ్లారు. ఆయా దేశాలకు వెళ్లిన బాబా తాను ఏ మతపరంగా రాలేదని ప్రేమను పంచడానికే వచ్చానని చెప్పారు. తనవైపు ఎవరినీ తిప్పుకోవడానికి, ప్రలోభ పెట్టడానికి రాలేదని, కేవలం ప్రేమ పంచి, ఎవరిపై వారికి నమ్మకం కలిగించడానికే వచ్చానని ఆయా దేశాలలో చెప్పేవారు.

మన రాష్ట్రం రాజధానిలో ప్రసిద్ధి పొందిన శివం మందిరాన్ని 1973లో ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే 1981 జనవరి 19న చెన్నైలో సుందరం మందిరాన్ని ప్రారంభించారు. 1995లో రాయలసీమ ప్రాంతంలో బాబా నీటి ప్రాజెక్టు పనులు చేపట్టారు. 2001లో పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించారు. బాబా 2005వ సంవత్సరం నుండి వీల్ చైర్‌కే పరిమితం అయ్యారు. తాను దేహం కలవాడిని కాదని, దేహిని అని చెప్పారు. తాను నిర్మాణం చెందినప్పటికీ మళ్లీ పుడతానని పలు సందర్భాలలో చెప్పారు. అయితే భక్తుల ప్రార్థనలే తనకు ప్రాణం అని కూడా చెప్పారు. ప్రతి దేహం గిట్టక తప్పదని చెప్పారు.

బాబా తన భజనల సీడీలను చాలా విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది భక్తులను, వేల సేవాకేంద్రాలు, ప్రజలకు నీటి సౌకర్యం కల్పించిన శ్రీ భగవాన్ సత్యసాయి బాబతాను స్థాపించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే గత నెల 28న మంచాన పడ్డారు. 28 రోజుల అనంతరం బాబా ఆదివారం ఏప్రిల్ 24న ఉదయం 7.40 నిమిషాలకు నిర్యాణం చెంది బాబా భక్తులలో విషాదం నింపారు

కర్ణాటక స్ఫూర్తిగా అనంతపురం జిల్లానుండి పార్టీ బలోపేతం మాత్రం చేయాలని భావిస్తోంది.

కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ సత్యసాయిబాబా మరణాన్ని భారతీయ జనతా పార్టీ సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో, దేశంలోనే కాకుండా సత్యసాయికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. రాష్ట్రంలో ఏమాత్రం ప్రభావం చూపించలేని బిజెపి ఎప్పటి నుండో రాష్ట్రంలో ఓ వెలుగు వెలగాలనే ఆశతో ఉంది. అయితే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేతికి పగ్గాలు వచ్చిన తర్వాత బిజెపి బలోపేతానికి బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి రెండంకెల అసెంబ్లీ సీట్లను గెలవాలనే ఉద్దేశ్యంతో ఆయన ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగానే కిషన్‌రెడ్డి అధ్యక్షుడు అయ్యాక జిల్లాల పర్యటనకు వెళుతూ ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తున్నారు. పుట్టపర్తిలో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో బిజెపి రాష్ట్రంలో పట్టు సాధించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.


సత్యసాయి సేవలు, ఆధ్యాత్మికత ద్వారా పుట్టపర్తి ప్రపంచ వ్యాప్తమైందని, అలాంటి పుట్టపర్తి ఉన్న జిల్లాను సత్యసాయి జిల్లాగా పేరు మార్చాలనే డిమాండును ప్రభుత్వం ముందు ఉంచాలని బిజెపి రాష్ట్ర స్థాయి నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులను ఆకర్షించవచ్చునని బిజెపి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సత్యసాయి మతాలకతీతంగా ఆధ్యాత్మికతను నెలకొల్పారు. కాబట్టి సత్యసాయి జిల్లాకోసం డిమాండు తీసుకు వస్తే అందరూ తమకు మద్దతు పలికే అవకాశం ఉందని వారు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాహార్తిని తీర్చిన ప్రదాతగా సాయిని అందరూ ప్రశంసిస్తారు. ఇప్పుడ అక్కడకు వచ్చే లక్షలాది భక్తుల దృష్టిని బిజెపి వైపు మరల్చేందుకు పార్టీ శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

సాయి మరణంతో వెనుక పడ్డ పుట్టపర్తి నుండి రాష్ట్రంలో తమ ప్రస్తానం ప్రారంభించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. బాబా పార్థివ శరీరాన్ని దర్శించుకోవడానికి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, మాజీ ఉప ప్రధాని అద్వానీలు వచ్చారు, వస్తున్నారు. ఇక రాష్ట్రం అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయలతో పాటు పలువురు నేతలు పుట్టపర్తిలో బస చేయనున్నారు. దక్షిణాదిన కర్ణాటకలో మొదటిసారి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కర్ణాటక స్ఫూర్తిగా రాష్ట్రంలో కూడా ఆ దిశగా పయనించేందుకు బిజెపి ఉత్సాహ పడుతోంది. బిజెపి ఉత్సాహానికి మరో కారణం కూడా ఉంది. అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రానికి అనంతపురం జిల్లా అనుకొని ఉంటుంది. దీంతో మొదట జిల్లాలో పాగా వేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

కర్ణాటక మంత్రి గాలి జనార్థన్ రెడ్డికి అనంతపురంలో గనుల వ్యాపారం కూడా ఉంది. ఇక గాలి జనార్థన్ రెడ్డికి మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలు ఉన్న కారణంగా జగన్‌ను పార్టీలోకి తీసుకు వచ్చి బలోపేతం కావాలని భావిస్తోంది. అయితే జగన్ వచ్చినా రాకున్నా కర్ణాటక స్ఫూర్తిగా అనంతపురం జిల్లానుండి పార్టీ బలోపేతం మాత్రం చేయాలని భావిస్తోంది.

1971వ కాలానికి చెందిన రోల్స్ రాయిస్ శాలూన్ కారు తొలి యజమాని మరెవరో కాదు సాక్షాత్తు సత్య సాయి బాబానే.

ఆధ్యాత్మిక గురువు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా అద్భుతాలకు ఈ సంఘటన ఓ నిలువెత్తు నిదర్శనం.


చూడటానికి అదో పాత కారే కావచ్చు, కానీ ఆ కారు యజమాని మాత్రం ప్రత్యకమైన వారు. 1971వ కాలానికి చెందిన రోల్స్ రాయిస్ శాలూన్ కారు రిజిస్ట్రేన్ నంబర్ కూడా విశిష్టమైనదే - ‘DNA 8888’. ఈ కారు తొలి యజమాని మరెవరో కాదు సాక్షాత్తు సత్య సాయి బాబానే. బాబా సర్గస్తులైన తర్వాత అతనితో తమకు ఉన్న అనుంబంధాలను, అనుభవాలను కోట్లాది మంది అభిమానులు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలోని బాంద్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి సత్య సాయి బాబాతో తనకున్న అనుబంధాన్ని వివరించారు.

నెమలి వర్ణంలో ఉండే ఈ రాయల్ కారు బాంద్రాకు చెందిన ఇర్ఫాన్ మొఘల్ గ్యారేజ్‌లో కొలువుదీరి ఉంది. టొయోటా టెక్ (ఓ హై-ప్రొఫైల్ కార్ మెకానిక్) యజమాని అయిన ఇర్ఫాన్ ఈ సందర్భంగా ఓ ఆంగ్ల వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ఈ కారు తొలి యజమాని సత్య సాయి బాబా, 1972లో బాబా ఈ కారును కౌలాలంపూర్ నుంచి తెప్పించారు. ఈ కారును ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ జిల్లా, ప్రశాంతి నిలయానిక చెందిన అతని స్కూల్ పేరు "శ్రీ సత్య సాయి ఇన్సిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్"తో రిజిస్టర్ అయ్యింది. తర్వాతి కాలంలో ఆ కారును ఢిల్లీకు చెందిన ఓ వ్యాపారవేత్త వివేక్ బర్మన్‌కు 1984లో అమ్మేశారు. ఆ తర్వాత 1996లో మా నాన్నగారు అమన్ మొఘల్ ఈ కారును కొనుగోలు చేశారు. అప్పటి నుండి అది మాతోనే ఉంది" అని చెప్పారు.

ఇంకా.. "ఈ కారును మేం కొనేటప్పుడు వాళ్లు చెప్పిన ధరకు కొనేందుకు అంగీకరించలేదు. కానీ ఈ కారు తొలి యజమాని సత్య సాయి బాబా అని తెలియడంతో తర్వాత ఆయన అంగీకరించారు. కొన్ని సంవత్సరాలుగా ఆయన సత్య సాయి బాబాకు భక్తుడు" అని ఇర్ఫాన్ చెప్పారు. మొట్టమొదటిసారి ఈ కారును తెచ్చినపుడు దీని రిజిస్ట్రేషన్ నంబర్ వేరుగా ఉన్నది. "ఈ కారు మొదటి నంబర్ ADA 9, కానీ తర్వాత ఈ కారు సత్య సాయి ఇన్సిట్యూట్‌ నుంచి న్యూఢిల్లీకి వెళ్లిన తర్వాత ‘DNA 8888’గా మారిపోయింది.

అయితే.. ఈ కారు గురించి చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇది మా వ్యాపారానికి ఎంతో కలిసి వచ్చింది. దీని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మా వ్యాపారం అంచెలంచెలు ఎదిగింది. బాబా రోజూ కూర్చుని తిరిగే ఈ రోల్స్ రాయిస్ శాలూన్ యజమానిగా ఉండటం నాకెంతో గర్వంగా ఉంది" అని ఆయన తన అనుభవాన్ని పంచుకున్నారు. బాబా జ్ఞాపకంగా ఈ కారు ఎప్పటికీ తమతోనే ఉంటుందని ఇర్ఫాన్ చెప్పారు. బాబా మృతి పట్ల ఇర్ఫాన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రేమ సాయిగా జన్మిస్తారని భక్తులు నమ్ముతున్నారు.

సత్య సాయిబాబాను షిర్డీ సాయిబాబా వారసుడిగా షిర్డీ సంస్థాన్ అంగీకరిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. తాను షిర్డీ సాయిబాబా వారసుడినని సత్య సాయి బాబు చెప్పుకున్నారు. సత్య సాయి బాబా భక్తులు కూడా అలాగే భావిస్తారు. కానీ షిర్డీ సంస్థాన్ ఆలోచన మరో విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సత్య సాయిబాబాను షిర్డీ సాయి బాబా వారసుడిగా అంగీకరించేందుకు షిర్డీ సంస్థాన్ సిద్ధంగా లేనట్లు అర్థమవుతూనే ఉన్నది.


నిజానికి, షిర్డీ సాయిబాబా అశేష భక్త జనానికి ఆకర్షణగా నిలిచింది. షిర్డీ సాయి బోధనలు విశేష ప్రచారం పొందాయి. సత్య సాయిబాబాకు కూడా భక్తజన సందోహానికి తక్కువేమీ లేదు. ప్రపంచ వ్యాప్తంగా సత్యసాయి బాబా విశేష జనాదరణ పొందారు. అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చి దిద్దారు. పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టారు.

సత్య సాయి ఎంతగా జనాదరణ పొందినప్పటికీ, భక్తులు ఆశిస్తున్నప్పటికీ షిర్డీ సంస్థాన్ సత్య సాయి బాబాను షిర్డీ సాయిబాబా వారసుడిగా ప్రకటించేందుకు సిద్ధంగా లేదు. రెండు ఆధ్యాత్మిక కేంద్రాలను అనుసంధానం చేసే ఆలోచన కూడా ఆ సంస్థాన్‌కు ఉన్నట్లు లేదు. జీవించి ఉన్న కాలంలో సత్య సాయిబాబా షిర్డీకి వెళ్లిన దాఖలాలు కూడా లేవంటారు. పైగా, షిర్డీ సంస్థాన్ షిర్డీ సాయిబాబాకు వారసులు ఎవరూ లేరంటూ బోర్డు కూడా పెట్టుకుంది.

తనకు మూడు జన్మలున్నాయని, మొదటి జన్మ షిర్డీ సాయిబాబా కాగా రెండో జన్మ సత్య సాయి బాబా అని సత్య సాయి బాబు చెప్పుకున్నారు. మూడో జన్మలో ప్రేమ సాయిగా కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో పుడుతానని ఆయన చెప్పారు. మాండ్యా జిల్లాలోని గుణవర్తి లేదా గుణపర్తిలో సత్య సాయి బాబా ప్రేమ సాయిగా జన్మిస్తారని భక్తులు నమ్ముతున్నారు.