10, ఏప్రిల్ 2011, ఆదివారం

భారతదేశంలోని ఇతర అన్నా హజారేలను ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్న ఉదయిస్తోంది.

అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన అన్నా హజారేపై ఎనలేని క్రేజ్‌ను ప్రదర్శించిన మీడియా భారతదేశంలోని ఇతర అన్నా హజారేలను ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్న ఉదయిస్తోంది. హజారే ప్రయత్నాన్ని గానీ ఆయన విశ్వసనీయతను గానీ ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కానీ, ప్రజల కోసం ఉద్యమాలు చేస్తున్న ఇతరులను కూడా అదే స్థాయిలో పట్టించుకుంటే ఇంకా మంచిది. పదేళ్లుగా పచ్చి మంచినీళ్లు, ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తున్న 38 ఏళ్ల ఐరన్ లేడీ ఇరోమ్ షర్మిళను మీడియా గుర్తించడం లేదు. గురువారంనాటికి ఆమె దీక్ష సరిగ్గా పదేళ్లకు చేరుకుంది.

సైన్యానికి మితిమీరిన అధికారాలను కట్టబెడుతూ జారీ చేసిన ఉగ్రవాద వ్యతిరేక చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆమె మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో దీక్ష చేస్తున్నారు. సరిగ్గా 2000 నవంబర్ 4వ తేదీన ఆమె తన చివరి భోజనం చేశారు. ఇంపాల్‌లోని బస్సు స్టాండు వద్ద పారామిలటరీ సిబ్బంది పది మంది పౌరులను హతమార్చిన సంఘటనతో ఆమె నిరాహార దీక్షను ప్రారంభించారు. ఆమె కవయిత్రి కూడా. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న ఆమె దీక్షను కొనసాగిస్తానని చెప్పినట్లు ఆమె సోదరుడు ఇరోమ్ సింఘాజిత్ చెప్పారు

బాలకృష్ణ ఎవరి వైపు ఉంటారనే ప్రశ్న ఉదయిస్తోంది

పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, నందమూరి కుటుంబ సభ్యులకు మధ్య జరుగుతున్న పోరులో స్వర్గీయ ఎన్టీ రామారావు కుమారుడు, సినీ హీరో బాలకృష్ణ ఎవరి వైపు ఉంటారనే ప్రశ్న ఉదయిస్తోంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా నందమూరి కుటుంబ సభ్యులు సమరానికి సమాయత్తమయ్యారని వస్తున్న వార్తలపై ఆవేదన వ్యక్తం చేస్తూ బాలకృష్ణ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన ఏ విషయాన్నీ స్పష్టం చేయడం లేదు. మీడియాలో వస్తున్న వార్తలు ఆవేదన కలిగిస్తున్నాయని, తనను వివాదంలోకి లాగవద్దని ఆయన అన్నారు. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పోరును ఆయన ఖండించలేదు. చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తానని కూడా ఆయన స్పష్టం చేయలేదు. తాను తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎవరి చేతుల్లో ఉన్నా తాను పార్టీ కోసం పనిచేస్తానని మాత్రమే ఆయన సూచన చేశారు.


చంద్రబాబుపై పోరుకు బాలకృష్ణ సోదరుడు హరికృష్ణ పూర్తి స్థాయిలో సిద్ధమైనట్లే కనిపిస్తున్నారు. ఈ స్థితిలో బాలకృష్ణ తన సోదరుడి వైపు ఉంటారా, తన బావ వైపు ఉంటారా అనేది తేలడం లేదు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌కు బాలయ్య తన కూతురు బ్రాహ్మణిని ఇచ్చి వివాహం చేశారు. దీంతో చంద్రబాబుకు దగ్గరగా ఉండాల్సిన అనివార్యతలో పడ్డారు. లోకేష్‌ను తన రాజకీయ వారసుడిగా తీర్చిదిద్దుతున్నారనే సమాచారం నేపథ్యంలో హరికృష్ణ తిరుగుబాటుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబును స్వర్గీయ ఎన్టీ రామారావు అల్లుడిగా, తమ ఆడపడుచు భర్తగా నందమూరి కుటుంబ సభ్యులు అంగీకరించడానికి అవకాశం ఉంటుంది. కానీ లోకేష్‌ను బాలకృష్ణ మినహా మిగతా కుటుంబ సభ్యులు అంగీకరించే అవకాశం లేదు. అందువల్ల తిరుగుబాటుకు నందమూరి కుటుంబ సభ్యులు సమాయత్తమవుతున్నట్లు, కేంద్ర మంత్రి పురంధేశ్వరి వారికి సహాయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పార్టీని నందమూరి కుటుంబ సభ్యులు తమ చేతుల్లోకి తీసుకోవడానికి, చంద్రబాబు పట్టు వదలకుండా నిలబడడానికి చేసే ప్రయత్నాల్లో బాలకృష్ణ మౌన ప్రేక్షకుడిగానే ఉండిపోతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన సోదరి భర్తగానే కాకుండా, తన కూతురునిచ్చిన వియ్యంకుడిగా చంద్రబాబును వ్యతిరేకించడం బాలకృష్ణకు ఇబ్బందిగా ఉండవచ్చు. పార్టీని నందమూరి కుటుంబ సభ్యులు, అంటే హరికృష్ణ తన చేతుల్లోకి తీసుకుంటే బాలకృష్ణ తర్వాత్తర్వాత మద్దతు ఇచ్చే అవకాశాలుంటాయని అంటున్నారు. చాలా కాలంగా తెలుగుదేశం పార్టీలో ఓ వర్గం బాలకృష్ణకు పార్టీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ పెడుతూ వస్తోంది. హరికృష్ణకు, చంద్రబాబుకు మధ్య జరిగే పోరులో మధ్యస్థంగా పార్టీ పగ్గాలు బాలకృష్ణ చేతికి రావచ్చునా అనేది కూడా ప్రధానమైందే.

చంద్రబాబును ఎదుర్కునే దమ్ము నందమూరి హరికృష్ణకు ఉందా?

పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఎదుర్కునే దమ్ము, బలం రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణకు ఉందా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో చంద్రబాబు అపర చాణుక్యడిగా పేరు పొందారు. పావులు కదపడంలో చంద్రబాబును మించినవారు లేరని అంటారు. ఇప్పటికే హరికృష్ణ ఓసారి చంద్రబాబు దెబ్బను రుచి చూశారు. ఎన్టీ రామారావును పదవీచ్యుతుడ్ని చేసిన సమయంలో హరికృష్ణతో పాటు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు చంద్రబాబుకు మద్దతు తెలిపారు. అధికారం తన చేతుల్లోకి వచ్చిన తర్వాత చంద్రబాబు వారి స్థాయిని తగ్గిస్తూ వచ్చారు. దాంతో అసంతృప్తికి గురైన దగ్గుబాటి వెంకటేశ్వర రావు, హరికృష్ణ తెలుగుదేశం పార్టీ నుంచి తప్పుకుని అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ తర్వాత దాన్ని నడపలేక హరికృష్ణ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. దగ్గుబాటి వెంకటేశ్వర రావు బిజెపిలోకి, ఆ తర్వాత కాంగ్రెసులోకి వెళ్లారు.


ఇప్పుడు చంద్రబాబుపై నందమూరి హరికృష్ణ యుద్ధం ప్రకటించినప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. కేంద్ర మంత్రి, ఆయన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు గానీ, పురంధేశ్వరిపై ఎర్రంనాయుడు చేసిన విమర్శలు గానీ ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి. ఈ వాతావరణంలో నందమూరి కుటుంబంలో కూడా చిచ్చు రగిలినట్లు తెలుస్తోంది. సినీ హీరో, హరికృష్ణ సోదరుడు చంద్రబాబుకు మద్దతు తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. హరికృష్ణకు కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. దగ్గుబాటి పురంధేశ్వరి వెనక నుంచి కథ నడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ హరికృష్ణకు చంద్రబాబును ఎదుర్కునే బలాన్ని అందిస్తాయా అనేది సందేహమే.

కాగా, నారా లోకేష్‌ను తన రాజకీయ వారసుడిగా చంద్రబాబు నిలబెట్టడానికి సమాయత్తం అవుతుండడం వల్లనే హరికృష్ణ తిరుగుబాటు ప్రకటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో బాలకృష్ణ తన అల్లుడు నారా లోకేష్‌కు మద్దతుగా నిలిచినా ఆశ్చర్యం లేదు. అయితే, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు పట్ల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న వర్గం ఒకటి ఉంది. తెలుగుదేశం పార్టీ పురావైభం సంతరించుకోవాలంటే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ముందుకు రావాలని ఆ వర్గం చాలా కాలంగా వాదిస్తోంది. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లకు పార్టీ పగ్గాలు అప్పగించాలని కొంత మంది నాయకులు వాదిస్తున్నారు. బాలకృష్ణను పార్టీ అధ్యక్షుడిగా, జూనియర్ ఎన్టీఆర్‌ను తెలుగు యువత సారథిగా నియమించాలని వారు వాదిస్తున్నారు.

హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ముందుకు వచ్చి, దగ్గుబాటి పురంధేశ్వరి వస్తే చంద్రబాబుకు కష్టాలు ఎదురు కావచ్చునని అంటున్నారు. దగ్గుబాటి పురంధేశ్వరికి తెలుగుదేశం పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించే దిశగా పరిణామాలను నడిపించాలనేది కొంత మంది అభిమతంగా తెలుస్తోంది. పురంధేశ్వరిని ఎన్టీ రామారావు రాజకీయ వారసురాలిగా చూస్తారని అంటున్నారు. తెలుగుదేశంలోని కుటుంబ పరిణామాలు ఎటు దారి తీస్తాయనేది వెల్లడి కావడానికి మరింత సమయం పడుతుదని చెప్పవచ్చు.

బాబాయ్ పై అబ్బాయీ అసంతృప్తి చెందినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది

తన బాబాయ్, సినీ హీరో బాలకృష్ణ విడుదల చేసిన పత్రికా ప్రకటనపై తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ కుమారుడు, హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మధ్య అంతర్గత పోరు సాగుతుందని వచ్చిన వార్తలపై బాలకృష్ణ తనను వివాదాల్లోకి లాగవద్దంటూ పత్రికా ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో మనం, మన వంశం అన్న బాలకృష్ణ ఇప్పుడు తనను వివాదాల్లోకి లాగవద్దని అనడం సరి కాదని జూనియర్ ఎన్టీఆర్ అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.


తనను వివాదాల్లోకి లాగవద్దని బాలకృష్ణ అనడం ఎంత వరకు సమంజసమని జూనియర్ ఎన్టీఆర్ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌పై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తెలుగుదేశం నాయకుడు వల్లభనేని వంశీ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు ఉమా మహేశ్వర రావుపై చేసిన విమర్శల నేపథ్యంలో చంద్రబాబు ఫోన్ చేస్తే తాను స్పందించలేదనే సమాచారాన్ని మీడియాకు వెల్లడించడంపై నారా లోకేష్‌ను ఆయన తప్పు పడుతున్నట్లు తెలుస్తోంది.

బాలకృష్ణ తాను ఒక్కరే ప్రకటన విడుదల చేయడం కాకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ తర్వాత మీడియాకు వెళ్తే బాగుండేదని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయపడినట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ అసంతృప్తి చెందినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది