6, ఏప్రిల్ 2011, బుధవారం

బాబా ని కుడా వదలని రాజకీయం???

కోట్లాది భక్త జనానికి ప్రశాంతతను ఇచ్చే భగవాన్ సత్యసాయి ఆధ్వర్యంలోని సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఆధిపత్య పోరులో కూరుకు పోయినట్టుగా తెలుస్తోంది. వందల కోట్ల రూపాయలతో ప్రజలకు నీటి వంటి పలు సౌకర్యాలను అందిస్తున్న సత్యసాయిని ట్రస్టు సభ్యులు తమ బంధీలో ఉంచినట్లుగా తెలుస్తోంది. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం కేంద్రంగా సత్యసాయిబాబా ఆధ్వర్యంలోని ట్రస్టు జిల్లా, రాష్ట్రం, దేశాన్ని దాటి విదేశాలలో కూడా సేవా కార్యక్రమాలు అందిస్తోంది. బాబా సేవలకు తోడ్పుటును అందించడానికి చాలామంది కోట్లాది రూపాయలు అందజేసి ట్రస్టుకు చేయూత నిస్తున్నారు.

దీంతో వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఈ ట్రస్టులో ఉన్నాయి. దీంతో బాబా పక్కన తమ స్వార్థానికి సేవా సామ్రాజ్యాన్ని ఉపయోగించుకోవాలని చూసే స్వార్థపరులు చేరినట్టుగా భక్తులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఓ అజ్ఞాత భక్తుడితో బాబా ఇటీవల ఆవేదనతో చెప్పినట్టుగా తెలుస్తోంది. ట్రస్టులోని కొందరు సభ్యులు తనను బంధీని చేసినట్లు బాబా ఆ భక్తుడి ముందు వాపోయినట్లుగా తెలుస్తోంది. తాను తలపెట్టిన సేవా యజ్ఞాన్ని సొంత కైంకర్యానికి ఉపయోగించుకుంటున్నారని ఆయన ఆవేదన చెందినట్లుగా తెలుస్తోంది.

సత్యసాయి ట్రస్టులో ఆధిపత్య పోరు ఎప్పటినుండో నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. బాబాను జాగ్రత్తగా చూసుకోవాల్సిన ట్రస్టు సభ్యులే ఆయన పట్ల నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బాబా ఆసుపత్రిలో చేరినప్పటినుండి జరుగుతున్న పరిణామాలు కూడా ఇందుకు అనుమానాలు కలిగిస్తున్నాయి. ట్రస్టు సభ్యులు కూడా బాబా ఆరోగ్యం పట్ల గోప్యత ప్రదర్శిస్తున్నట్లుగా భక్తులతో పాటు బాబా కుటుంబ సభ్యులు ఆనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యానికి ట్రస్టు సభ్యులే కారణమని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రెండు రోజులకు ఒకసారి భక్తులకు కనిపించి సందేశం ఇచ్చే బాబా గత నవంబర్‌లో ఆయన జన్మదిన ఉత్సవాల తర్వాత భక్తులకు కనిపించనే లేదంట. అంతేకాదు జన్మదిన సందర్భంగా భక్తులకు కనిపించి సందేశమిచ్చే బాబా ఇటీవలి జరిగిన జన్మదిన వేడుకల్లో మాత్రం భక్తులకు కనిపించడమే కానీ ఎలాంటి సందేశం ఇవ్వలేదంట.

దీంతో ఐదారు నెలలుగా బాబా ఆరోగ్యం సరిగా లేనప్పటికీ ట్రస్టు సభ్యులు బయటకు చెప్పటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. బాబా ఆరోగ్యం బాగా లేదని తెలిసి ప్రత్యేక వైద్య బృందం హెలికాప్టర్‌లో వచ్చినప్పటికీ ఓ ట్రస్టు సభ్యుడు రాహుకాలం పేరిట గంటపాటు వైద్యం అందించకుండా దూరం ఉంచడం భక్తుల్లో మరింత అనుమానం కలిగిస్తోంది. గత జన్మదిన వేడుకల తర్వాత బాబా ఆరోగ్యం క్రమంగా క్షీణించినట్లు పలువురు భావిస్తున్నారు. బాబా నెలలుగా అన్నం తినకుండా మానేసినా ట్రస్టు సభ్యులు అన్నం పెట్టలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. బాబా వద్దకు సన్నిహిత బంధువులెవరినీ ట్రస్టు సభ్యులు రానివ్వక పోవడంతో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మూడు రోజుల క్రితం మాత్రం బాబాకు వెంటలేషన్ కోసం సమ్మతి కావాలంటూ బంధువులను సంప్రదించారంట.

సత్యసాయి సెంట్రల్ ట్రస్టుకు భగవాన్ సత్యసాయిబాబు అధ్యక్షుడు కాగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చక్రవర్తి కార్యదర్శి. ఇందులో సభ్యులుగా సత్యసాయి సోదరుడి కుమారుడు రత్నాకర్, సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భగవతి తదితరులు ఈ ట్రస్టులో సభ్యులు. ట్రస్టు చెక్ పవర్‌తో పాటు వ్యవహారాలన్నీ బాబాతో పాటు కార్యదర్శి పేరుమీద నడుస్తాయంట. అయితే సత్యసాయి తమ్ముడి కుమారుడు రత్నాకర్‌కు కూడా ఇటీవల చెక్ పవర్ పేరిట బదలాయింపులు జరిగేందుకు ప్రయత్నాలు జరిగాయంట. అయితే దీనికి మిగిలిన సభ్యులు అడ్డు చెప్పడంతో వెనక్కి తగ్గారంట. దీంతో ట్రస్టులో ఆధిపత్య పోరు నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ట్రస్టులో తమిళనాడుకు చెందిన వారి హవా నడుస్తున్నట్టు కూడా తెలుస్తోంది.

కామెంట్‌లు లేవు: