10, ఏప్రిల్ 2011, ఆదివారం

భారతదేశంలోని ఇతర అన్నా హజారేలను ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్న ఉదయిస్తోంది.

అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన అన్నా హజారేపై ఎనలేని క్రేజ్‌ను ప్రదర్శించిన మీడియా భారతదేశంలోని ఇతర అన్నా హజారేలను ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్న ఉదయిస్తోంది. హజారే ప్రయత్నాన్ని గానీ ఆయన విశ్వసనీయతను గానీ ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కానీ, ప్రజల కోసం ఉద్యమాలు చేస్తున్న ఇతరులను కూడా అదే స్థాయిలో పట్టించుకుంటే ఇంకా మంచిది. పదేళ్లుగా పచ్చి మంచినీళ్లు, ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తున్న 38 ఏళ్ల ఐరన్ లేడీ ఇరోమ్ షర్మిళను మీడియా గుర్తించడం లేదు. గురువారంనాటికి ఆమె దీక్ష సరిగ్గా పదేళ్లకు చేరుకుంది.

సైన్యానికి మితిమీరిన అధికారాలను కట్టబెడుతూ జారీ చేసిన ఉగ్రవాద వ్యతిరేక చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆమె మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో దీక్ష చేస్తున్నారు. సరిగ్గా 2000 నవంబర్ 4వ తేదీన ఆమె తన చివరి భోజనం చేశారు. ఇంపాల్‌లోని బస్సు స్టాండు వద్ద పారామిలటరీ సిబ్బంది పది మంది పౌరులను హతమార్చిన సంఘటనతో ఆమె నిరాహార దీక్షను ప్రారంభించారు. ఆమె కవయిత్రి కూడా. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న ఆమె దీక్షను కొనసాగిస్తానని చెప్పినట్లు ఆమె సోదరుడు ఇరోమ్ సింఘాజిత్ చెప్పారు

కామెంట్‌లు లేవు: