15, ఏప్రిల్ 2011, శుక్రవారం

జూనియర్ ఎన్టీఆర్‌కు ఎక్కువ మార్కులు పడ్డాయి.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి రాజకీయ వారసుడిగా సినీ హీరో, స్వర్గీయ ఎన్టీ రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్‌కే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు సాగుతోందని, నారా లోకేష్‌కూ జూనియర్ ఎన్టీఆర్‌కూ మధ్య పోటీ జరుగుతోందని, ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీలో సంక్షోభం నెలకొందని ప్రచారం జరిగిన నేపథ్యంలో దట్స్ తెలుగు ఓ ఆన్‌లైన్ పోల్ నిర్వహించింది. చంద్రబాబు రాజకీయ వారసుడు ఎవరు అనే ప్రశ్న వేసి జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్, బాలకృష్ణ, హరికృష్ణ పేర్లు ఇవ్వడం జరిగింది. వీరిలో చంద్రబాబు రాజకీయ వారసుడు ఎవరో చెప్పాలని దట్స్ తెలుగు పాఠకులను అడిగింది. ఈ పోల్ సర్వేలో విచిత్రమైన ఫలితాలు వచ్చాయి.


చంద్రబాబు రాజకీయ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్‌కు ఎక్కువ మార్కులు పడ్డాయి. చంద్రబాబు రాజకీయ వారసుడు ఎన్టీఆర్ అంటూ 51 శాతం మంది అభిప్రాయపడ్డారు. విచిత్రమేమిటంటే, నందమూరి బాలకృష్ణ మూడో స్థానంలో నిలిచారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ రెండో స్థానంలో నిలువడం గమనార్హం. చంద్రబాబు రాజకీయ వారసుడిగా నారా లోకేష్ పేరును సూచిస్తూ 28 శాతం మంది ఓటేశారు. బాలకృష్ణకు 17.2 శాతం ఓట్లు వచ్చాయి. నందమూరి హరికృష్ణ నాలుగో స్థానంలో నిలిచారు. ఆయనకు కేవలం 3.8 శాతం ఓట్లే వచ్చాయి.

అయితే, ఈ ఆన్‌లైన్ పోల్‌కు ఓ పరిమితి ఉందనే విషయాన్ని గ్రహించాలి. ఆన్‌లైన్ సౌకర్యం చాలా తక్కువ మందికి మాత్రమే అందుబాటులో ఉంది. నగర, పట్టణ ప్రజలకు, చదువుకున్నవారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంది. వైట్ కాలర్ ఉద్యోగస్థులకు, సంపన్నులకు, మధ్య తరగతి వారికి మాత్రమే ఆన్‌లైన్ సౌకర్యం ఉంది. గ్రామీణ ప్రజలకు, నిరక్షరాస్యులకు ఇది అందుబాటులో లేదు. అందువల్ల గ్రామీణ, నిరక్షరాస్యులైన ప్రజల మనోగతం ఈ పోల్‌లో ప్రతిబింబించలేదని చెప్పాల్సి ఉంటుంది

కామెంట్‌లు లేవు: