7, ఏప్రిల్ 2011, గురువారం

ఆమె తెలుగు సినీరంగానికే పరిమితమయ్యారు.

ప్రముఖ సినీ నటి సుజాత బుధవారం చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆమె మృతి చెందినట్లు సమాచారం. ఆమె 300కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు, మలయాళం, తమిళం సినిమాల్లో ఆమె నటించారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, శోభన్ బాబు, రంగనాథ్, కమలహాసన్, రజనీకాంత్ వంటి అగ్ర హీరోల సరసన ఆమె హీరోయిన్‌గా నటించారు. ఆమె 1967లో తబస్విని సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆమె తొలి తెలుగు సినిమా దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన గోరింటాకు. గోరింటాకు, సంధ్య, సుజాత వంటి సినిమాలు హిట్ కావడంతో ఆమె తెలుగు సినీరంగానికే పరిమితమయ్యారు.


నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఆమె ఎంచుకున్నారు. గుప్పెడు మనసు, ఏడంతస్థుల మేడ, సర్కస్ రాముడు, గురుశిష్యులు, బంగారు కానుక, శ్రీరామదాసు, ప్రేమతరంగాలు, సూత్రధారులు, పుసుపు పారాణి వంటి పలు హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. తెలుగుకు సంబంధించిన మహిళగా ఆమె గుర్తింపు పొందారు. సుజాత 1952 డిసెంబర్ 10వ తేదీన శ్రీలంకలో పుట్టారు.

తండ్రి ఉద్యోగ రీత్యా శ్రీలంకలో ఉండడంతో ఆమె 8వ తరగతి వరకు శ్రీలంకలోనే చదివింది. ఆ తర్వాత తండ్రితో పాటు కేరళకు వచ్చేశారు. దాంతో చదువు సాగలేదు. అన్న ప్రోత్సాహంతో పలు నాటకాల్లో నటించారు. ఆ నటనానుభవంతోనే ఆమెకు సినిమాల్లో అవకాశం వచ్చింది. 1997లో ఆమెకు సహాయనటిగా నంది అవార్డు లభించింది. తెలుగులో ఆమె తల్లి పాత్రలు కూడా వేశారు. ఆమె కలైమామణి బిరుదు కూడా అందుకున్నారు. ఆమె చెన్నైలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. సుజాత ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత కూడా ఆమె సినిమాల్లో నటించారు.

కామెంట్‌లు లేవు: