22, మే 2011, ఆదివారం

ప్రీచర్లకు చేదు అనుభవమే ఎదురైంది

బైబిల్ లెక్కల ప్రకారం.. మే 21, 2011 (శనివారం)న ఈ ప్రపంచం అంతరించిపోతుందని అమెరికాలో డప్పుకొట్టి మరీ ప్రచారం చేసిన కొందరు ప్రీచర్లకు చేదు అనుభవమే ఎదురైంది. కాలిఫోర్నియాకు చెందిన క్రైస్తవ మత ప్రచార రేడియో అయిన "ఫ్యామిలీ రేడియో" అధ్యక్షుడు హరోల్డ్ క్యాంపింగ్ తెలిపిన దాని ప్రకారం.. మే 21, 2011న అమెరికాలో స్థానిక సమయం ప్రకారం, శనివారం సాయంత్రం సరిగ్గా ఆరు గంటలకు పెను భూకంపం సంభవించి ఈ ప్రపంచం అంతరించి పోతుందని విశ్లేషించి శనివారాన్ని ‘జడ్జిమెంట్ డే’ అని అభివర్ణిస్తూ భారీ ప్లకార్డులు, బ్యానర్లతో న్యూయార్క్ మొత్తం ప్రచారం సాగించారు. కానీ ఆయన చెప్పినట్లుగా ఏమీ జరగలేదు. అంతా ప్రశాంతంగానే ఉంది.

‘బైబిల్ ప్రకారం 4990 సంవత్సరంలో జలప్రళయం సంభవించినప్పుడు తాను ఈ భూగోళాన్ని ఏడు రోజుల్లో నాశనం చేస్తానని ప్రభువు చెప్పాడు. అలాగే ఏడురోజుల్లో ఆయన దాన్ని నాశనం చేస్తాడు’ అని హరోల్డ్ వాదించారు. ఇంకా ఏసు ప్రభువుకు ఒక్క ఒక రోజు వెయ్యి సంవత్సరాలతో సమానమని, దీని ప్రకారం.. అంటే 4990 సంవత్సరాలు, వెయ్యేళ్లకు ఒక రోజు చొప్పున 7001 సంవత్సరాలు మొత్తం కలిపితే 2011 సంవత్సరం. అలాగే అప్పటి క్యాలెండర్ ప్రకారం ప్రళయం సంభవించిన రెండో నెల 17వ రోజు, ఇప్పుడు మే 21, 2011వ తేదీ ఒకటే కావడాన్ని బట్టి చూస్తే ఆ ప్రళయం శనివారమే జరుగుతుందని హరోల్డ్ పేర్కొన్నారు.

గత 1994లో కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. 1994లో ఓ రోజు సరిగ్గా 6 గంటలకు భూమి అంతరించి పోతుందని, ఇది తొలుత న్యూజిలాండ్ నుంచి ప్రారంభమవుతుందని ప్రచారం జరిగింది. అయితే ఆ రోజు 6 గంటల సమయం వచ్చి వెళ్లపోయింది. భూకంపం కానీ దానికి సంబంధించిన ఆనవాళ్లు కానీ ఎక్కడా కనిపించలేదు. కేవలం మీడియా అటెన్షన్ తప్ప. కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారాలను అస్సలు నమ్మకండి. ప్రజలను రక్షించాల్సిన దేవుడే ప్రపంచాన్ని అంతం చేస్తాననడం ఎంత వరకూ సమర్థనీయమైనదో సదరు ప్రచారకులే తెలుసుకోవాలి. కాబట్టి ఏం జరిగినా అంత మన మంచికే అనుకుంటూ ప్రజలందరూ ముందుకు సాగిపోతూ, ఇలాంటి మూఢ నమ్మకాలకు ఇకనైనా ఫుల్‌స్టాప్ పెట్టక తప్పదు.

కామెంట్‌లు లేవు: