30, మార్చి 2011, బుధవారం

దాయాదుల మధ్య పోరుకు సమయం ఆసన్నమైంది.

దాయాదుల మధ్య పోరుకు సమయం ఆసన్నమైంది. బుధవారం భారత్, పాకిస్తాన్ మధ్య జరగనున్న క్రికెట్ పోరుకు మొహాలీ స్టేడియం వేదిక కానుంది. ఆ ఆటను చూడటానికి భారత ప్రధాని మన్మోహన్ సింగ్, పాకిస్తాన్ ప్రధాని గిలానీతో పాటు పలువురు వివిఐపిలు సిద్ధంగా ఉన్నారు. ఇరు జట్లు అద్భుత పటిమ కనబరుస్తూ సెమీ ఫైనల్‌కు వచ్చి కప్పు కోసం పోరుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ ఆటలో భారత్‌తో పాటు పాక్ జట్టుపై కూడా ఒత్తిడి పని చేస్తుంది. సొంత గడ్డపై ఆడటం, ప్రధాని, సోనియా వంటి హేమాహేమీలు మ్యాచ్ చూడటం తదితర అంశాలు భారత్‌ను ఒత్తిడికి గురి చేస్తే, ఫిక్సింగ్ హెచ్చరికలు పాక్‌ను తప్పకుండా ఒత్తిడికి గురి చేసే అంశం. ఇప్పటి వరకు వారిపై ఒత్తిడి లేకున్నప్పటికీ ఈ అంశం మాత్రం వారిని అన్నింటికంటే ఎక్కువ ఒత్తిడిలోకి నెట్టివేసే అంశం

ఈ దశలో భారత్ శారీరక కసరత్తుతో పాటు మానసిక కసరత్తును కూడా చేస్తోంది. భారత కెప్టెన్ ధోని తన సహచరులకు ఒత్తిడికి గురి కావద్దని సూచనలు చేస్తున్నారు. మ్యాచ్‌ను కూడా ఎక్కువగా ఊహించుకోవద్దని ధోనీ సూచనలు ఇచ్చారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తన బ్యాట్ బరువు కూడా పెంచుతున్నట్లుగా తెలుస్తోంది. బరువైన బ్యాట్‌తో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడానికి సచిన్ సిద్ధమయ్యారు. గ్రూప్ దశలో భారత్ ఒక మ్యాచ్‌లో ఓడిపోయి మరో మ్యాచ్‌ను డ్రా చేసుకొని సెమీస్‌లోకి ప్రవేశించినప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొన్నది. అయితే ధీటైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో మాత్రం ఆడిన మ్యాచ్‌లో భారత క్రికెటర్లు అందరూ సమష్టిగా రాణించి విజయం సాధించారు.
ఆసీస్‌పై సమిష్టి విజయం, యువరాజ్ సింగ్ ఫాంలోకి రావడం భారత్‌కు కలిసి వచ్చే అంశాలు. అయితే బౌలింగ్‌లో ఆసీస్ మ్యాచ్‌లో తప్ప మొదటి నుండి జహీర్ తప్ప మిగిలిన ఫేసర్లు ఎవరూ అతనికి తోడ్పాటును ఇవ్వడం లేదు. గ్రూపు దశలో దక్షిణాఫ్రికాతో ఓటమి చెందిన భారత్ ఓ దశలో అందరి అంచనాలలోనుండి తొలగిపోయిన పరిస్థితి ఏర్పడినప్పటికీ ఆసీస్‌పై గెలుపుతో అవే అంచనాలు భారీగా పెంచుకుంది. బ్యాటింగ్ ఆర్డర్ భారత్‌కు బలంగానే ఉన్నప్పటికీ ఒక్క వికెట్ కోల్పోతే క్యూలైన్ కట్టడమే భారత్‌ను భయపెడుతున్న అంశం. ఆసీస్ మ్యాచ్ మాత్రం అందుకు మినహాయింపు. ఇదే మనకు ఊరట. ఆసీస్‌పై చెలరేగుతాడనుకున్న భజ్జీ ఇంత వరకు ప్రపంచ కప్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన చూపించలేదు.

తన భుజ బలంతో పాటు బుర్రతో బౌలింగ్ చేసే ఉమర్ గుల్ భారత క్రికెర్లను కట్టు చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే పాక్ కెప్టెన్ అఫ్రిదీ సచిన్‌ను సెంచరీల సెంచరీలు చేయకుండా అడ్డుకుంటామని చెప్పి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అప్పుడు సచిన్ వర్సెస్ అక్తర్ పోరు, ఇప్పుడు సచిన్ వర్సెస్ ఉమర్ గుల్ మధ్య సాగనుంది. సచిన్‌ను బోల్తా కొట్టించడంలో అక్తర్ ఫెయిల్ అయినప్పటికీ గుల్ మాత్రం పూర్తి నమ్మకంతో ఉన్నాడు. గ్రూపు దశలో పాక్ మొదట హ్యాట్రిక్ విజయాలతో దూసుకు పోయింది. అయితే ఆ తర్వాత అతిచిన్న జట్లతో చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలిచింది.

పాక్‌పై అనిశ్చిత జట్టు అనే ముద్ర కూడా ఉంది. సెమీ ఫైనల్లో వెస్టిండీస్‌ను బోల్తా కొట్టించినప్పటికీ వెస్టిండీస్‌పై ఎవరికీ అంచనాలు లేవు. అసలు వెస్టిండీస్ గ్రూపు దాటుతుందా అనే పరిస్థితిలో నుండి బయట పడి బంగ్లాదేశ్‌తో సమానంగా పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్ రెట్ కారణంగా క్వార్టర్‌కు చేరుకుంది. ఆలాంటి జట్టుపై పాక్ గెలవదని ఎవరూ అనుకోరు. అయితే క్వార్టర్‌నుండి సెమీస్‌కు ఈజీగా వచ్చిన పాక్ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన, బలమైన భారత జట్టుతో తలపడి గెలవాలని భావిస్తోంది.

కామెంట్‌లు లేవు: