20, ఏప్రిల్ 2011, బుధవారం

కడప లోకసభకు, పులివెందుల శాసనసభకు జరుగుతున్న ఉప ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తప్పదా? ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వస్తుందని, ఈ ఉప ఎన్నికలు మార్పునకు నాంది అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప అభ్యర్థి వైయస్ జగన్ తన ఎన్నికల ప్రచారం పదే పదే చెబుతున్నారు. ఆ మార్పు కాంగ్రెసును కూలదోసి తాను అధికారంలోకి రావడానికి అనువైందనేది ఆయన చెప్పకున్నా అర్థం చేసుకోవచ్చు. వైయస్సార్ సువర్ణ పాలనకు తన రాజకీయాలు పాదులు వేస్తాయని ఆయన అంటున్నారు. అయితే, కడప ఉప ఎన్నికల ఫలితాలకు అంత చేవ ఉందా అనేది ప్రశ్న.


నిజానికి కడప, పులివెందుల ఉప ఎన్నికలు వైయస్ జగన్‌కు మాత్రమే జీవన్మరణ సమస్య. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిస్తే జగన్ రాజకీయాలు ఊపందుకునే అవకాశాలు ఉంటాయి. ఓడిపోతే మాత్రం జగన్ రాజకీయాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. ఈ విషయం వైయస్ జగన్‌కు తెలుసు. ఈ ఎన్నికల్లో కాంగ్రెసు ఓడిపోతే మరింత మంది శాసనసభ్యులు తన వెంట వస్తారని జగన్ భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి అవసరమైనంత బలం తనకు సమకూరుతుందని జగన్ భావిస్తూ ఉండవచ్చు. బహుశా పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి అందుకే రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు తప్పవని మంగళవారంనాడు వ్యాఖ్యానించి ఉంటారు.

కానీ, ఉప ఎన్నికల తర్వాత జగన్‌కు అంత సీన్ ఉంటుందా అనేది అనుమానమే. ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల తెలుగుదేశం పార్టీకి గానీ కాంగ్రెసు పార్టీకి గానీ జరిగే నష్టం ఏమీ లేదు. గెలిస్తే మాత్రం జాక్‌పాట్ కొట్టినట్లే. అయితే, గెలిచే అవకాశాలు తక్కువేనని అంటున్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు రెండవ స్థానం కోసమే పోటీ పడవచ్చు. రెండో స్థానం సాధించే పార్టీలు కాస్తా ఆనందించడానికి, మూడో స్థానం లభిస్తే కాస్తా కుండిపోవడానికి మాత్రమే ఈ రెండు పార్టీలకు ఉప ఎన్నికలు ఉపయోగపడుతాయి. కాంగ్రెసు మూడో స్థానంలో ఉంటే మాత్రం నష్టపోయే ప్రమాదం ఉంది. తెలుగుదేశం పార్టీపై కూడా అటువంటి ప్రభావమే పడుతుంది. ఏమైనా, ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలను మార్చే సీన్ జగన్‌కు లేదని చెబుతున్నారు.

కామెంట్‌లు లేవు: