7, మే 2011, శనివారం

ఎవరికి ఓట్లు వేస్తారో

కడప, పులివెందుల ఉప ఎన్నికల బరిలో నిలిచిన మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ గెలుపు ఖాయమని ఐబి(ఇన్వెస్టిగేషన్ బ్యూరో) నిర్వహించిన సర్వేలో తేలినట్టు తెలుస్తోంది. కడప, పులివెందుల నియోజకవర్గంలోని పలువురు వ్యక్తులను ఐబి కలిసి వారు ఎవరికి ఓట్లు వేస్తారో కనుగొంది. అయితే సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది జగన్‌కే, విజయమ్మకే ఓటు వేస్తామని చెప్పారంట. అయితే జగన్ గెలుస్తాడని ఐబి నిర్వహించిన సర్వేకు సంబంధించిన సంక్షిప్త సందేశాలు(మెసేజ్‌) అలా అలా సెల్ ఫోన్‌లలో తిరగాడుతున్నాయంట.

కడప పార్లమెంటు పరిధిలో జగన్‌కు ఓటు వేస్తామని 54.45 శాతం మంది చెబితే, టిడిపికి ఓటు వేస్తామని 25 శాతం, కాంగ్రెసుకు ఓటు వేస్తామని 19.4 శాతం మంది చెప్పారంట. ఇక కడప పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ జగన్‌కే మెజార్టీ వస్తుందంట. ఏ నియోజవర్గంలోనూ కాంగ్రెసుగానీ, టిడిపిగానీ మెజార్టీ సాధించే పరిస్థితి లేదంట. ఇక పులివెందుల విషయానికి వస్తే విజయమ్మకు 56 శాతం, వైయస్ వివేకానందరెడ్డికి 25 శాతం, టిడిపికి 18 శాతం మంది ఓట్లు వేస్తారంట. జగన్ గెలుచినప్పటికీ విజయమ్మ ఓడిపోతుందనే వాదనలు వినిపించాయి. అయితే జగన్ కంటే విజయమ్మ 1.5 పర్సెంట్‌తో ముందుండటం విశేషం.

ఇక ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెసులో విలీనం చేయడంపై ఎక్కువ మంది అసంతృప్తి వ్యక్తం చేశారంట. అయితే ఐబి సర్వే చేసిన ప్రకారం ఫలితం ఉండదని కాంగ్రెసు, టిడిపి చెబుతోంది. ఆ సర్వే జగన్ రాజీనామా చేసిన ప్రత్యేక పరిస్థితిలో చేసిందని, అలాంటి సమయంలో సర్వే చేస్తే అలాగే ఉంటుందని కానీ ప్రస్తుత పరిస్థితులు జగన్‌కు వ్యతిరేకంగా ఉన్నాయని వారు చెబుతున్నారు. ఈ మధ్యనే అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే చేసిన నిరాహార దీక్ష ప్రభావం కూడా పడుతుందని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయంట. అయితే రాయలసీమ ప్రాంతంలో మిగతా ప్రాంతాల్లా కాకుండా అక్కడ పార్టీల కంటే వ్యక్తుల ప్రభావం ఎక్కువగా ఉండటం విశేషం. ఏదైమైనా ఐబి సర్వే జగన్ పార్టీలో ఉత్సాహాన్ని తీసుకు వచ్చింది.

కామెంట్‌లు లేవు: