12, మార్చి 2011, శనివారం

నేను తెలుగువాడినన్న అహంకారం పటాపంచలైతే నిద్రెలా పడుతుంది?

ట్యాంక్ బండ్ మీద ఎక్కువగా సీమాంధ్రకు చెందిన వ్యక్తుల విగ్రహాలను మాత్రమే ప్రతిష్టించారని, తెలంగాణలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తుల విగ్రహాలు తక్కువగా ఉన్నాయని తెలంగాణావాదులు చాలా కాలంగా వాదిస్తూ వస్తున్నారు. విగ్రహాలను ధ్వంసం చేస్తామని కూడా హెచ్చరికలు చేస్తూ వచ్చారు. ఈ హెచ్చరికల మేరకు ట్యాంక్ బండ్‌పై ఉన్న వ్యక్తుల విగ్రహాలను ధ్వంసం చేశారని భావించాల్సి ఉంటుంది. అయితే, ఒక పథకం ప్రకారం జరిగినట్లు స్పష్టంగా తెలిసిపోతోంది. ఉదయం పూట పోలీసులు, మీడియా ప్రతినిధులతో మాత్రమే నిండిపోయిన ట్యాంక్ బండ్ మధ్యాహ్నం తర్వాత తెలంగాణవాదులతో అట్టుడికిపోయింది. గుంపులు గుంపులుగా వచ్చిన తెలంగాణ వాదుల దాటికి పోలీసులు బిత్తరపోయారు. వారిని కట్టడి చేయడం పోలీసుల వల్ల కాలేదు. తీవ్ర ఉద్రిక్తత మధ్య తెలంగాణవాదులు విగ్రహాలను ధ్వంసం చేశారు.

ధ్వంసమైన విగ్రహాలను చూస్తే ఏరికోరి విధ్వంసానికి దిగినట్లు కనిపిస్తోంది. సీమాంధ్ర ప్రాంతంలో గణుతికెక్కిన అన్నమయ్య, ఎర్రాప్రగడ, శ్రీకృష్ణ దేవరాయలు, సిద్ధేంద్ర యోగి, పల్నాటి బ్రహ్మనాయుడు ,ముట్నూరి కృష్ణారావు, కందుకూరి వీరేశలింగం, త్రిపురనేని రామస్వామి చౌదరి, ఆర్థర్ కాటన్, బళ్లారి రాఘవ, గురజాడ అప్పారావు, రఘుపతి వెంకయ్య విగ్రహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తెలంగాణకు చెందిన సురవరం ప్రతాప రెడ్డి, రామదాసు, మగ్దూం మొహియుద్దీన్ విగ్రహాల జోలికి ఆందోళనకారులు వెళ్లలేదు. సీఆర్ రెడ్డి విగ్రహాన్ని ఎందుకు వదిలేశారో తెలియదు గానీ నన్నయను తొలి తెలుగు కావ్యాన్ని సృష్టించిన కవి కావడం వల్ల వదిలేసి ఉంటారు. పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఆయన జాతీయ జెండాను రూపొందించిన మహా వ్యక్తి కావడం వల్ల ముట్టుకుని ఉండరు. శ్రీశ్రీ విప్లవ కవి కావడం వల్ల, గుర్రం జాషువా దళిత కవి కావడం వల్ల వదిలేసి ఉండవచ్చు. అయితే, తిక్కన, క్షేత్రయ్య, అల్లూరి సీతారామా రాజు విగ్రహాలను ఎందుకు వదిలేశారనేది హేతువుకు అందడం లేదు. అయితే, విగ్రహాల ధ్వంసంలో తెలంగాణవాదులు స్పష్టమైన హేతువును అనసరించి ఉంటారని భావిస్తున్నారు

నిన్న రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. ఒక్కసారిగా నేను తెలుగువాడినన్న అహంకారం పటాపంచలైతే నిద్రెలా పడుతుంది?“ఆఁ! ఇందులో ఏముంది? విగ్రహాలే కదా! మళ్ళీ తయారుచేసుకోవచ్చులే” అని తాపీగా వినిపిస్తున్న సమాధాన స్వరాలు పుండు మీద కారం చల్లినట్లున్నాయి.ధ్వంశం కాబడిన ప్రతీ విగ్రహం గురించి పుటలు పుటలుగా వ్రాయవచ్చును. కానీ శ్రీకృష్ణదేవరాయలు, అన్నమయల విగ్రహాల ధ్వంశం ఎంతకీ మింగుడు పడటంలేదు. అసలు ఉద్యమానికి వీళ్ళకి ఏమన్నా సంబందం ఉందా?

పక్కనే కొండ మీద ఉన్న బిర్లా మందిర్ బహుశః తదుపరి లక్ష్యం కాబోలు. ఎంతైనా వేంకటేశ్వరస్వామి రాయలసీమ దేవుడు కదా? కొండ క్రింద ఆయన భక్తులలో తలమానికమైన అన్నమయ్యకే దిక్కు లేదు. తిరుమల క్షేత్రంతో దగ్గిర సంబంధం ఉన్న గొప్ప చారిత్రిక చక్రవర్తి అయిన కృష్ణదేవరాయల విగ్రహానికే విలువలేదు. అటువంటప్పుడు, రాయలసీమలో వేలసిన వేంకటేశ్వరస్వామి వారికి మాత్రం విలువేముంది; ఇక్కడ అస్థిత్వం ఎలా అనుమతించబడుతుంది?

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

వి'గ్రహాల' విద్వంసం!
జాతి రత్నాలు అంటున్నావ్, ఎవడి జాతి..
బొమ్మలు తగలబడితేనే నీకు చరిత్ర, సంస్కృతీ గురుతోచ్చిందా..
అసలు నీకు 'ఆత్మ' ' గౌరవం' అంటే అర్థాలు తెలుసా..
కూలిన నీ చరిత్ర కారులని అడిగి తెలుసుకో బ్రదర్
తెలుగు జాతి తగల బడింది అని కుల్లుతున్నావ్
తెలంగాణా జాతి మాటేప్పుడైనా వినపడిందా

వారు గొప్ప వారు కావొచ్చు..
కాని నా తల్లి గుండె మీద
నిప్పులై మండుతున్నారు
ఎపుడైనా నీ ఎసి కార్లల్ల తిరుగుతుంటే
కనపడిందా మా గోస

హుస్సేన్ సాగర్ నిండా నా తల్లి కంటి నీరే కదా..
భాషని, యాసని హేళన చేసి చూసే నీకు
ఎక్కడిదిరా హక్కు
జాతి గురించి ఊసెత్తడానికి

అందమైన హైదరాబాద్ ను తయారు చేసిన
నా రాజుల చరిత్ర ఏది?
ప్రపంచ పటంల నా జాతి ని నిలబెట్టిన
నా నిజాం పరిమళాలు కలుషితం చేసి
మా కొమరం భీమ్ ధైర్యానికి , వీర చరిత్రకు మసి పూసి,
అయిలవ్వను , యాదగిరిని , బందగిని బొందపెట్టి
ఏ చరిత్ర గురించి మాట్లాడుతున్నావ్..