4, ఏప్రిల్ 2011, సోమవారం

కృష్ణా జిల్లా లో మళ్లి రాజుకున్న వర్గపోరు

చిరంజీవి తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి నిర్ణయం తీసుకోవడంతో కృష్ణా జిల్లా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కృష్ణా జిల్లాలోని ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు కాంగ్రెసులోకి వస్తుండడం మాత్రమే కాకుండా తన చిరకాల ప్రత్యర్థి వంగవీటి రాధాకృష్ణ కూడా కాంగ్రెసు నాయకుడు అవుతుండడంతో దేవినేని నెహ్రూకు మింగుడు పడడం లేదు. తన ప్రాబల్యం తగ్గిపోయే వాతావరణం ఏర్పడింది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి నిర్ణయం జరగక ముందు ప్రస్తుత వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు వైయస్ జగన్‌తో వెళ్లే ఆలోచన కూడా ఆయన చేశారు. గతం లో వంగవీటి రాధాకృష్ణ కూడా జగన్ పార్టీ లో చేరే యత్నాలు చేస్తే చిరంజీవి ఆపారు.
చాలా కాలంగా దేవినేని నెహ్రూ తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు సమాచారం. దేవినేని ఉమా మహేశ్వర రావు దీనికి సహకరిస్తున్నారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి వెంట కాంగ్రెసులోకి వచ్చే వంగవీటి రాధాకృష్ణను ఎదుర్కోవడానికి, వంశీని దెబ్బ తీయడానికి తెలుగుదేశం పార్టీని ఎంచుకోవడమే మంచిదనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
దేవినేని నెహ్రూ తెలుగుదేశం పార్టీలోకి వస్తే తమ ప్రాబల్యం తగ్గడం ఖాయమని వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి నాయకులు భావిస్తున్నారు. అంతేకాకుండా, వంశీకి, నెహ్రూకు క్షణం పడదు. వారిద్దరు ప్రత్యర్థులుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో దేవినేని నెహ్రూ తెలుగుదేశం ప్రవేశాన్ని అడ్డుకోవడానికి వారు దేవినేని ఉమా మహేశ్వర రావుపై తీవ్ర విమర్శలు చేస్తూ వంశీ పార్టీ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమం లో వల్లభనేని వంశీ జగన్ పార్టీ లో చేరుతారనే పుకార్లు వచ్చాయి. పరిటాల రవి అనుచరుడిగా పేరు గాంచిన వంశీ అలా చేయడు.

కామెంట్‌లు లేవు: